Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్యం సుభిక్షంగా ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారు. రాజ్యం ఇబ్బందులు పడుతుంటే ప్రజలూ బాధపడతారు. కానీ, రాజ్యమే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటే... రచయితలు తమ మెదళ్ళకు పదును పెడతారు. కలాలను ఝళిపిస్తారు. జనం నెత్తిన మోపే అనేక ఇక్కట్లపై కథలు రాస్తారు. కవితలు సంధిస్తారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ఏ కథకుడైనా, కవియైనా రాజ్యంలో చెలరేగుతున్న అలజడిపై పాలకులను ప్రశ్నిస్తారు. జనవరి 30న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదే జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ల వలన ప్రజల్లో తలెత్తుతున్న అశాంతిని తమ కవితల ద్వారా అద్దం పట్టారు కవులంతా.
తెలంగాణ సాహితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 'ప్రజాస్వామిక హక్కులకై కవితాగానం' పేరుతో నిర్వహించిన కవి సమ్మేళనంలో అనేకమంది కవులు సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లను ఖండించారు. తెలంగాణ సాహితి ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన జరిగిన సభను సాహిత్య అకాడమీ అధ్యక్షులు నందిని సిధారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్ళించేందుకే కేంద్ర ప్రభుత్వం సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లను తీసుకొచ్చిందని అన్నారు. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ల పేరుతో మతపరమైన పౌరసత్వం ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. ఇటువంటి సమయాల్లో కవులకు ఎక్కువ సంఖ్యలో కవితావస్తువులు లభ్యమవుతాయని అన్నారు. కవులు ఎల్లప్పుడూ తమ కర్తవ్య నిర్వహణలో బాధ్యతగా వుండాలని గుర్తు చేశారు. కవులు విచక్షణతో ప్రజలకు మంచి చేసే కవిత్వాన్నే అందించాలని సూచించారు. సమకాలీన సమస్యలపై స్పందించడంలో తెలంగాణ సాహితి ఎప్పుడూ ముందుంటుందని అభినందించారు. ఈ దేశ మూలవాసులమైన మనమంతా కొత్తగా పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. అనంతరం ఆనందాచారి మాట్లాడుతూ ఈ చట్టాల పేరుతో ప్రజలను విడదీసే కుట్రలను వివరించారు.
కవయిత్రి జ్వలిత 'రాజపత్రమే సాక్ష్యం' శీర్షికన రాసిన కవిత చదివి వినిపించారు. 'వురు ద పీపుల్/ భారత ప్రజలమైన మేము/ మాకు మేము సమర్పించుకున్న/ రాజపత్రం సాక్ష్యం రాజ్యాంగ హక్కుల అక్షయపాత్ర చేయాలనుకోకు దాన్ని విచ్ఛిన్నం' అంటూ గళమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ప్రస్తుత సమకాలీన అంశాలను కవితలో ప్రస్తావిస్తూ, ఓటును ఆయుధం అంటూ అధికార పీఠాన్ని అడ్డుగా పెట్టుకుని అందరి హక్కులను కాలరాయడంపై కన్నెర్రజేసారు. ప్రముఖ కవి, విమర్శకులు లక్ష్మీ నరసయ్య 'తాతల్ని లేపండి' కవితలో... ''ఎప్పుడో చచ్చిపోయిన తాతలను/ నేనిప్పుడు బతికించాలి/ అర్జెంటుగా మా తాతకు/ నేను మనవడినని నిరూపించుకోవాలి/ .... మా తాత ఇప్పుడు మట్టిని పెళ్ళగించుకునైనా లేవాలి/ నన్ను ఈ దేశపు పౌరుడిగా నిలిపే తాతను/ కనీసం ఒక్కరోజుకోసమైనా వెనక్కు తేవాలి'' అంటూ మూలాలను నిరూపించుకునేందుకు స్మశానాల్లోకి పోతూ పడాల్సిన అగచాట్లను వివరించారు.
కవయిత్రి కొండేపూడి నిర్మల తనదైన శైలిలో రాసిన కవితను వినిపించారు. 'చెల్లు చీటీ' కవితలో... ''రండి బాబూ రండి/ చీటీలు సిద్ధంగా ఉన్నాయి/ చిలకలు పలుకు మర్చిపోయాయి/ ఓటరు చీటీ, ఆధార్ చీటీ, పాన్ చీటీ, వీసా చీటీ, వాహన సర్వీసు చీటీ/మీరు ఏది అడిగితే అది తీసి యిస్తాం/ ఎందులో చూసినా మా మొహమే ఉంటుంది/ చీటీలు మేం తీస్తాం జోస్యం మీరు చెప్పండి'' అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి 'వేదాల దాకా వెనక్కి' కవితలో ''నిన్న అమ్మగా మిగిలి పోయిన అరటి గెల పండ్లెన్ని మెత్తబడ్డాయో/ తడుముకుని మిడికే నేను/ ఇక గుర్తింపు పత్రమేదీ దాచుకోనందుకు వలపోయాలి.... /ఒక దేశం ఒక ఎన్నిక/రాజ్యాంగం కురుసభలో భర్తలోడిన ద్రౌపది'' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
శిలాలోలిత 'నేను ఇక్కడి భూమిని' కవితలో ''ఈ భూమ్మీద మనుషులు జీవిస్తున్నారు/ పశు పక్ష్యాదులు, చెట్టూ చేమా/ కలగలిసిన ఓ పండుగ... ఇన్ని ప్రశ్నల మధ్య అనుమానాల మధ్య/ఒకే ఒక్క జవాబు-/ నేను మనిషిని/ నేను ఆకాశాన్ని/ నేను ఇక్కడ గలగల పారుతున్న సెలయేరును/నా ఉనికి ఇదే!/ నేనే ఈ భూమిని, ఇక్కడి భూమిని'' అని స్పష్టం చేశారు.
చింతపట్ల సుదర్శన్ 'ఆకలి ఆకలి' కవితలో ''అబ్బా చంపేస్తున్నది ఆకలి/ రాళ్ళల్లో దొర్లుకుంటూ వచ్చాను/ప్రాణాలరచేత పట్టుకుని వచ్చాను.... /మతమేది నీది/ పలికే ఓపికలేదు నాకు/ ఒక్కటే చెప్తాను/ మానవజాతి నాది/ మీలాగే ఉన్నాను చూడండి/ మనిషిని నేను' అంటూ ముగించారు.
డాక్టర్ సంధ్య 'ఐకమత్యమే మా బలం' కవితలో ''నేను అద్దంలో చూసుకుంటూ/ బాల్యం గుర్తు చేసుకుంటే/అంతా మిథ్యే/యుగయుగాల చరిత్రను/ తరతరాల దాస్యాలను/వెలుగు చూపి ఛేదించేను రాజ్యాంగం' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
డా|| దిలావర్ 'డెత్ సెంటెన్స్' కవితలో ''ప్రపంచం విస్తరించి విస్తరించి/ హఠాత్తుగా ఉలిక్కిపడి/ కుదుపుతో ఆగిపోయింది... డెత్ వారెంటులేంది తండ్రీ!/ నీ వాలకం చూడబోతే/ తీసి వేత చిట్టా విప్పినట్టు/ లాగు విప్పి/ సున్తీను కూడా/ చూపించమనేట్టున్నావు సామీ'' అంటూ ప్రశ్నించారు.
గొట్టిపర్తి యాదగిరి రావు 'ఈ దేశం' కవితలో ''ఈ దేశంలో పౌరులకు/ బాధ్యతలతోపాటు/ హక్కులు కూడా చాలా వున్నై/ అయినా/ సామాన్య పౌరుడికి/ అంతా అంధకారమే... స్విస్ బ్యాంకుల్లో మూలుగుతోంది/ ఈ గణాంకాలను తీయండి/ విస్మయపోకండి/ ఆ సంపాదనతో భారతావనికి /బడ్జెట్లను అందించవచ్చు'' అంటూ హితవు పలికారు.
డా|| జరీనా బేగం ''నిన్నటి వరకు 'ఓ బురఖా'/ ప్రగతికి అడ్డు తెర అనుకున్న వారు/ ఈ రోజు షాహీన్ బాగ్ బురఖాలకు/ హడలెత్తుతూ బెంబేలు పోతున్నారు... ఐదు వందల తరాలు మారినా ఈ స్ఫూర్తి ఎవరూ/ కొనలేనిది, ఎవరూ చెరపలేనిది'' అని ఉద్యమ స్ఫూర్తి నింపారు.
'సరిహద్దుల కాపలాలలో/అసహనపు కంచెలు మొలుస్తున్నాయి/ హృదయాలకు కొలతలు పెట్టి/ ముఖాలపై మతాలు చుట్టి/ లెక్కల గూళ్ళలోకి మనుషుల తరలింపుతో/ నా జెండా ఇప్పుడు/ జాబితాలా వేలాడుతోంది' అని ఆవేదనా భరితమైన 'కాలాన్ని వెనక్కి తిప్పలేను' అనే కవితను ఆనందాచారి వినిపించారు.
'ఈ బంధాలన్నీ తెంచుకోవలసిందేనా!' అనే కవితలో పొత్తూరి సుబ్బారావు ''చిన్నప్పుడు నన్నెత్తుకొని తిప్పిన/ కాసిం భయ్యాని మరచిపోవలిసిందేనా... రాక్షసక్రీడనాడించి/ మంచి రోజులొస్తాయంటే/ రగిలిన హృదయాలు చల్లబడతాయా!' అంటూ మనుషుల మధ్య బంధాలను గుర్తుచేసుకున్నారు.
ఎం.డి.ఖాజామైనొద్దీన్ 'మనిషిని పౌరుడుగా నిలబెట్టాలి' కవితలో ''ఇపుడు జనన ధ్రువపత్రాలపై/ మతం సంగీతం వినిపించాలా?... వేల గొంతుల అస్తిత్వాలు ఎగసిపడ్తూనే ఉంటాయి' అని హెచ్చరించారు.
డా|| షాజహానా 'ఆజాది' కవితలో ''నేనెప్పుడూ అనుకోలేదు/ యుద్ధ మైదానంలో అడుగు పెడతానని...చెట్టుకు పూవు పూసినంత సహజంగా/ యుద్ధ మైదానంలో/ నినాదమై పూస్తావని/ నేనెప్పుడూ అనుకోనేలేదు' అంటూ ముస్లిం మహిళలకు అంకితమిచ్చారు.
'నేనిక్కడే నెత్తుటి బొట్ల/ ముగ్గేసుకున్నాను... నేనిప్పుడే డిఎన్ఏ పరీక్షకు సిద్దపడుతాను/ గాలికి కొట్టుకొచ్చిన తాలు గింజెవ్వరో/ ఇక్కడే నిలబడిన గట్టి గింజెవ్వరో తెలిసిపోతుంది/ మై ఇస్ దేశ్ కా మూల్నివాసి హూ..!' అంటూ 'ఇస్ దేశ్ కా మూల్నివాసి' కవితలో కెపి లక్ష్మీ నరసింహ గొంతెత్తాడు.
కపిల రాంకుమార్ 'బస్తీమే సవాల్' కవితలో ''గాడ్సేను కొలిచే జాతర చేసే నాయాళ్ళ భరతం పట్టాలి/ విప్లవ కర్షకులౌతాం/ చేతలుడిగిన వాళ్ళం కాము/ చేవ చూపి పౌరసత్వాన్ని కాపాడుకుంటాం/ బస్తీమే సవాల్' అంటూ సవాలు విసిరారు.
డి.కృష్ణయ్య 'మిడుతల దండు' కవితలో 'పీడితుల స్వరాలు కాగుతున్న కాగడాలుగా/ ఉబికి వస్తున్న కోట్ల కంఠాలలో/ ధ్వనిస్తున్నవి స్వరాలుగా.../ జ్వలించాలి అవని నిండా /ప్రజ్వరిల్లాలి జ్వాలాపాతమై..!'' అని ఉత్సాహాన్ని నింపారు.
కె.శాంతారావు 'తల్లి పొత్తిళ్ళు' కవితలో ''నా కాలాన్ని/ నియంతలు/ తన్నుకుపోతున్నారు/ గద్దల్లా... భయపెట్టే గద్దల రెక్కల చప్పుడే కాదు/ తోడు వస్తున్న అడుగుల సవ్వడి కూడా/ వింటున్నది కోడిపిల్ల/ పిల్లల్లో తల్లి పొత్తిళ్ళు మొలుస్తున్నాయని/ తెగ సంబరపడిపోతున్నది' అంటూ ఆవేదన చెందారు.
స్కై బాబా 'నీ మౌనం వారికి ఆయుధమే' కవితలో ''ఎలా ఉన్నావని ఒక ఫోనైనా చేసి/ అడుగుతావనుకున్న/ ఒకసారి కలుద్దామని చెప్పి/ అలాయిబలాయి ఇస్తావనుకున్న/ ఆనందమొచ్చినా దు:ఖమొచ్చినా నన్ను/ తలుచుకునే నువ్వు/ ఇవాళ ముఖం చాటేయడం/ తట్టుకోలేకున్నరా/ దోస్త్' అంటూ ఆవేదనా భరిత కవిత వినిపించారు.
కె.లక్ష్మణ్ గౌడ్ 'పౌరసత్వం సవరణా? రావణకాష్టం ఆరంభమా?' అనే కవితలో ''సవరణ సంక్షోభాల నివారణకు/ అది కారాదు ఉద్యమాలకు ఒక దీప స్తంభం'' అనే హెచ్చరికను జారీ చేశారు. తంగిరాల చక్రవర్తి 'అ..దృశ్యం!' కవితలో ''మా తాత స్వాతంత్య్రోద్యమంలో పోరాడాడు... రాజ్యం రాజేసిన నిప్పుల కొలిమిని ఐక్యంగా ఆర్పేస్తాం!!/ సెక్యులర్ భారతిని రక్షిస్తాం' అంటూ సానుకూల ధోరణితో ముగించారు.
గడీల సుధాకర్ 'నాదొకటే వాక్యం' కవితలో ''లౌకికవాదం, ప్రజాస్వామ్యం ఖూనీ/ అవుతున్న సాక్షిగా.../ ఇంకెన్నో అపసవ్య దోరణుల సాక్షిగా.../ నాదొకటే వాక్యం ఇప్పుడు' అనే ఆలోచనాత్మక కవితను వినిపించారు.
'కాపాడండి' అనే కవితలో ''మారండి మారండి/ కలం బట్టి గళం విప్పి/ జన గొంతుకై నిలవండి'' అంటూ అశోక్ దుర్గం; 'కాల గర్భంలో కలిసి పోతావ్' కవితలో ''మూడు తరాల/ లెక్కలడుగుతున్నావ్ /ఇక్కడే పుట్టి/ ఇక్కడే పెరుగుతున్న నన్ను/ ఈ దేశం నాదేనని/ నిరూపించుకోమంటున్నావ్'' అని సలీమా నిరసన వ్యక్తం చేశారు.
డా|| పసునూరి రవీందర్ 'మూర్ఖుడా... నువ్వెప్పుడైనా అడవుల/ ఆవలి ముఖాలను చూశావా?/ మైదానాల్లో... బతుకంతా వలసపక్షై బతికే/ దేహాలను ఎప్పుడైనా గమనించావా?/ ఇల్లే లేనివాడికి నీవిచ్చే సర్టిఫికెట్/ దేనికి పనికొస్తుంది' అంటూ తన కవితలో ప్రశ్నించారు.
మహమ్మద్ అబ్దుల్ రషీద్ ''ఎన్నిసార్లు చెప్పాలి/ నేను భారత్ మూలవాసినని/ ఆధారం చూపమంటావు/ అయితే/ వెయ్యేళ్ళ నా చరిత్రను చదువు' అని ప్రశ్నా సమాధానాలతో కూడిన 'నన్నడుగుతున్నావా?' కవితను వినిపించారు.
''ఊర్లో సోదెమ్మని అడగాలి/ మా తాతను ఒక్కసారి పిలవమని/ ఆయన పుట్టుపూర్వోత్తరాలు/ చెప్పమని అడగాలి'' అంటూ 'అప్పుడు చెప్పకుండా పోయారు' కవితలో అనంతోజు మోహన్కృష్ణ మూలాలను నిరూపించుకోవాల్సిన అగత్యం ఏర్పడిందని ఆవేదన చెందారు.
ఈ వ్యాస రచయిత 'మూలాలు' కవితలో ''ఏ తాత పాతాడో మా ఊరికి బొడ్రాయి/ పెట్టింది మా ముత్తాత ముత్తాతల్లో ఏ ముత్తాతో/ చెప్పటానికి ఏ తాతా బతికిలేడు/ అసలు తాతకూ అంతు చిక్కని ప్రశ్నే... కాని వాడెవరో/ కాని దేశమంటూ/ పిడకల వేట చేస్తే/ కాండ్రించి ఉమ్మాలి'' అంటూ ముందున్న కర్తవ్యాన్ని గుర్తుచేశారు.
ఇంకా కార్యక్రమంలో సీనియర్ కవులు యాకూబ్, నాళేశ్వరం శంకరం, చిత్తలూరి సత్యనారాయణ, స్ఫూర్తి, గజవెల్లి, చెన్న కేశవ, నాంపల్లి శ్రీనివాస్(పాట), ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, కందుకూరి శ్రీరాములు, చెమన్ సింగ్, భండారు విజయ, అరుణా క్వీన్, సి.హెచ్.ఉషారాణి, మనోహర్, ఆర్.రమేష్, శాంతి ప్రబోధ, యువకవి సయ్యద్ ముజాహిద్ అలీ తదితరులు సమకాలీనతకు అద్దం పట్టే కవితలు వినిపించి, ఎన్నార్సీల వ్యతిరేకతకు తమ మద్దతు తెలిపారు. మహెజబీన్ 'ప్రశ్న దేశద్రోహమైంది - నేనేం చేయను' అనే కవితను, జనజ్వాల 'నేను స్వచ్ఛమైన దేశభక్తుణ్ణి..!', కృష్ణవేణి 'కర్తవ్యం కావాలిపుడు', కవి నిర్గుణ్ 'నాన్నకు చావు తప్పదు' లాంటి భిన్నమైన శీర్షికలతో కూడిన కవితల ద్వారా తమ మద్దతు ప్రకటించారు.
గాయమొక్కటే. బాధను వ్యక్తీకరించిన తీరు వేరు. దీనిని ఆద్యంతం గమనించిన కవి, విమర్శకులు లక్ష్మీ నరసయ్య కవిత్వం తీరుతెన్నులను విశ్లేషించారు. 'సమానత్వ, సౌభ్రాతృత్వాలను దెబ్బతీస్తున్న విధానాన్ని కవులు ఎండగట్టారు. లేని సమస్యలను ఉన్నట్లుగా చిత్రీకరిస్తున్న ఫాసిస్టు తీరును కవులు చక్కగా వ్యక్తీకరించారు. యాభై ఏళ్ళ కాలంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగ సమస్య పెరిగింది. ఆర్థిక వ్యవస్థ పతనమైంది. ఈ సమస్యలను వదిలేసి, విదేశాల్లో ఉన్న పీడితులు, బాధితుల్ని ఆదుకుంటామంటున్నారు. విదేశీయుల్లో వున్న పీడితుల్లో కూడా ఫలానా మతస్థులనే ఆదుకుంటామని చెప్పడాన్ని కవులు ప్రశ్నించారు.
- నస్రీన్ ఖాన్ (9652432981),
తెలంగాణ సాహితి ఉపాధ్యక్షురాలు