Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమాజంలో స్త్రీల పరిస్థితులు ఎంత భయంకరంగా వున్నాయో తెలిసిన విషయమే. సమస్యలు ఆనాడూ ఉన్నాయి, నేడూ వున్నాయి. కాని కాలాన్ని బట్టి అనేక జుగుప్సాకరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ సమస్యలపై పూర్తి స్పృహతో, అవగాహనతో మారుతున్న కాలం, మారుతున్న సమస్యలకు ఆవేశభరితమైన కవిత్వపు ప్రవాహం ఈ 'అలల అంతరంగం'.
వ్యవస్థలో పాతుకుపోయిన మనువాదాన్ని నిరసిస్తూ సాగిన కవిత్వం ఇది. కుల, మత పరమైన దాడులను హత్యలను వ్యతిరేకించారు కవయిత్రి విజయ బండారు.
ఎన్నో శతాబ్దాలుగా అలవాటుపడిన అణిచివేతల వ్యక్తీకరణ ఈ కవిత్వం.
అణువణువునా సహనం అలవాటైన గృహిణివి నీవు అనే భావాలను అమ్మమ్మ, అమ్మలనుండీ పుణికిపుచ్చుకున్న స్త్రీత్వం ఇది. గడపలకు లోపల, దర్వాజాల వెనక అలవాటుగా మారిపోయిన స్త్రీలం కదా మరి. ఈ నాటి స్త్రీలకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా బతికి సాధించాలనే స్థైర్యాన్ని ఇచ్చే కవిత. అతి చిన్న కారణాలకు ప్రాణం తీసుకోవడమే పరిష్కార మనునుకునే స్త్రీలకు వెన్నుతట్టి, కష్టమంటే క్షణిక ఆవేశంలో ప్రాణం తీసుకోవడం కాదు. తరతరాల నుండి ఎదుర్కొంటున్న సమస్యలకు ఇప్పుడు పరిష్కార శోధన అవసరం అని చెప్పే కవితలు అనేకం వున్నాయి.
'ఎదురీత' కవితలో రోజూ పురుషాధిక్యాన్ని భరిస్తూ చెప్పిన కవిత ముగింపులో
''ఆకాశం ఒంటరిగా/ మేఘాలను పులుముకుంటూ/ ఆగిపోని ప్రయాణంతో/ అలుపెరగక సాగిపోతున్నది../ నాకు మరణించాలని లేదు../ నిన్నెదిరించి బ్రతకాలని వుంది''
కష్టమంటే క్షణికావేశంలో ప్రాణం తీసుకోవడం కానేకాదు. పరిస్థితులకు ఎదురు నిలవాలనే వుంది అంటూ ఒక ధైర్యపు చిరుదీపం వెలిగించే కవిత ఇది. 'మీ ఇష్టం మీదే' లో ఒక బలమైన స్త్రీవాద గొంతుకను వినిపించింది కవయిత్రి.
క్షణం క్షణం ఒక స్త్రీ 'అతని' కోసం ఏవిధంగా తనను తాను ఉలిపోట్లతో చెక్కుకుంటూ, అతనికి నచ్చిన శిల్పంలా మలుచుకుంటుందో చివరకు మార్చుకుని, మార్పుకు అలవాటు పడినట్లు నటించి, విసిగిపోయిన స్త్రీల మనోగతం ఈ కవిత.
''మీరు ఆశయాలను/ అణచివేసినప్పుడు/ అవకాశాలను వదులుకున్నాం.../ మీరు అనంతమై/ ఆక్రమించుకున్నప్పుడు/ రెక్కలు లేని పక్షులమయ్యాం... అంటూనే మార్పును కోరుకుంటూ
''మేమిప్పుడే/ శతాబ్దాల సంకెళ్ళను విరిచి/ గమనాలను గ్రహిస్తున్నాం''..
''జారిపోయిన కాలాన్ని/ బండబారిన మొండిగోడల్ని/ శిథిలమైన జ్ఞాపకాల్ని/ నిరంకుశంగా నరికేస్తున్నాం..''
ఎన్నో విషయాలలో కాంప్రమైజ్ నుండి అలవాటుగా చేసుకున్న స్త్రీ మనోగతాన్ని చిత్రించి, అట్లనే వుండలేని తనాన్ని కూడా చూపించిన కవిత ఇది.
''నూతన ముగింపు నుండి/ ప్రకటిస్తూ కదులుతున్నాం/ వస్తే కలిసి నడుస్తాం/ రాకున్నా నడిచే వెళ్తాం...'' అనే ముగింపుతో గొప్ప నూతన ప్రయాణాన్ని, గొప్ప మార్పును అద్భుతమైన ముగింపుతో ఇచ్చారు.
'అవును మేం దేశద్రోహులమే' లో కేవలం స్త్రీల సమస్యలే కాదు, నేటి కులం, మతం ఏవిధంగా సమాజాన్ని శాసిస్తుందో, మనుషులను వర్గీకరించిందో చెప్తూనే ప్రశ్నించిన గొంతుక ఈమెది.
'గెలుపెప్పుడూ నీదేకాదు' కవితలో సహజీవనాలు, ప్రేమల పేరుతో దాడికి ఎదురు తిరిగి జీవితాన్ని ధైర్యంగా బతకడానికి ప్రయత్నిస్తున్న ఆడపిల్లలకు 'గెలుపెప్పుడూ నీదేకాదు... నాది కూడా' అంటూ ధైర్యాన్నిచ్చే కవిత ఇది.
'మీడియా టారు' లో ''గుడియా/ గమ్మత్తుగా నవ్వుతోంది..'' అని ఎత్తుగడతో మొదలుపెట్టి ఒక బొమ్మకు మనసేంటి? బొమ్మలాంటి ఆమె అంగీకారంతో పనేంటి ఇవే కదా నేటి స్త్రీల వ్యథలు. బతికి ఉన్నాడో లేదో తెలియని భర్తకై ఎదురు చూడనివ్వకుండానే ఇంకొక వివాహం చెయ్యడం, ఆ రెండవ భర్త తలాక్! తలాక్! తలాక్! అని మూడు ముక్కలతో 'మనిషికి మానవత్వానికి తలాక్/ దగా పడటం/ దహించుకు పోవటం/ గుండె పగలటం/ మళ్లీ గాయపడటం...'' అంటారు.
తలాక్ అని చెప్పగానే తెగిపోయే బంధాన్ని గురించి, ఒక 'గుడియా'ను గురించి రాస్తూ ఆమె నవ్వులో ఒక బానిసకున్న అభద్రత వుంది అంటుంది. 'మగాడు' కవితలో పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీకి ఒక పరదా వేసి, దానికి ఆచారాలు, సంప్రదాయలు అనే పరదాలలో నిలబెట్టిన స్థితిగతులను ప్రశ్నించడంతో మొత్తం మూలం ఎక్కడ వుందో, ఎవరి చేతుల్లో స్త్రీ ఏవిధమైన అణచివేతకు గురవుతుందో ఆ ట్రాన్స్లో నిలబెట్టిన క్యారెక్టర్ని ఎండగట్టిన కవిత ఇది.
''రాజ్యం వాడికి/ మనుపగ్గాలను/ పితృస్వామ్య/ భావ జాలాన్ని/ తల్లి కడుపున/ జీవం పోసుకున్నప్పుడే/ ఇచ్చేసింది...'' అన్న కవితా పాదాలు బాగున్నాయి.
'అలల అంతరంగం' సంపుటిలో కేవలం స్త్రీల సమస్యలనే కాకుండా కులం, మతం, అంతర్జాతీయ సమస్యలు, పోరాటాలు, అన్నీ ఈమెకు కవితా వస్తువులు అయినవి. రచయిత్రి విజయ మూడు కవితా సంపుటులను ముద్రించారు. ఐదు పుస్తకాలకు సహ సంపాదకత్వం అందించారు.
- సిహెచ్. ఉషారాణి,
9441228142