Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని సమస్యలకి మనిషి పరిష్కారం చూపితే మరికొన్నిటికి కాలం చూపుతుంది. ప్రతి విషయం కాలంతోనే ముడిపడి వుంది. అందుకే 'కాల గీతం'లో తాను చెప్పాలి అనుకున్న భావాలని చక్కగా వ్యక్తీకరించడానికి ప్రయత్నించారు కృష్ణ కౌండిన్య తండు. 'కాల గీతం' కవితా సంపుటిలో చాలా కవితలు సామాజికతని స్పృశించడం గమనించాలి. కాలం మనిషి జీవితాల్ని ఎలా ప్రభావితం చేసి చేస్తుందో చెప్పారు. ''ఆనంద జలధిలో ఓలలాడించేసి/ దు:ఖాల కుంపట్ల రగిలించుకుంటావు''. నిజమే సంతోషాన్ని అనుభవించేంతలోపే దు:ఖాన్ని వెంట తెచ్చి పడేస్తుంది కాలం (కాలగీతం). చాలామంది కాకిని అపశకునంగా భావిస్తారు గాని, కాకి మనకి ఎన్నో నేర్పిస్తుంది. కాకి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా వున్నాయి. వేదాంతం, జ్ఞాన బోధ చేసే కాకిని మించిన సద్గురువు ఎవ్వరు..? ''నీవన్నవి ఏవి కూడా నీవి 'కావు కావు' యంచు చక్కని పరమార్ధం బోధించగా వినలేరు''... కాకి నలుపు మనసు తెలుపు మర్మంన్తాతెలుపు (కాకి).. ప్రజల భవిషత్తును నిర్ణయించేది ప్రభుత్వాలయితే మంచి ప్రభుత్వాల మనుగడ 'ఓటు' మీదనే ఆధారపడుతుంది. అలాంటి ఓటుని సద్వినియోగం చేసుకోవాలంటారు.
కాళోజీ యాదిలో రాసిన కవిత ఆలోచింపచేసింది. ఆ గొప్ప వ్యక్తిని స్మరిస్తూ ''కులమతమ్ముల అడ్డుగోడలు కూల్చేసి విశ్వమానవునిగా ఎదిగాడు'' అవును కాళోజీ అందరివాడు (నిత్య చైతన్యం). గనుల్లో, కార్ఖానాలో, బేకరీలో పనిచేసే చిన్న పిల్లలని ఎంతో చూస్తుంటాం. బాల కార్మికుల దుస్థితిపై రాసిన 'మసిబారిన బాల్యం' తప్పకుండ చదివాల్సిన కవిత. ''పలకబలపం పట్టె చేతులు ఈనాడు, పారాపలుగు పట్టె పొట్టతిప్పలకై చూడు'' ....అవును ఈ దుస్థితి పోవాలి అంటే చదువు ఒక్కటే దారి చూపే మార్గం. ''ఎన్ని ఉన్నా చదువులేకపోతే యంత సున్నా/ ప్రతి ఒక్కరు బాలలను బడికి పంపుడన్న'' అని పిల్లలు చదువుకుంటేనే రేపటి భవిష్యత్తు బాగుంటుంది (మసిబారిన బాల్యం). రైతుల బాధ గురించి రాయకపోతే అసంపూర్ణమే. అందుకే కరువులో రైతు దుస్థితికి బాధపడతారు. ''రెక్కలిరిచి దుక్కి దున్ని, నీరు పోసి నారు పెంచి నాటు వేసిన పంటలన్నీ వాన లేక వాడి పోగా మతిభ్రమించిన రైతు జీవితం ఎంత కష్టం ఎంత కష్టం''. అవును రైతు వానని నమ్ముకొని సకాలంలో పంట పండక అవస్థలు పడుతున్నాడు (కరువు).
'కాలగీతం'లో అన్ని కవితలు ఆకట్టుకుంటాయి. ఈ సంపుటిలో మాత్రాఛందస్సులో గేయాలు, వచన కవితలు ఉన్నాయి. అలాగే కొన్ని నానీలు కూడా ఆలోచింపచేస్తాయి. కవి అనేవాడు తాను బతికిన కాలంలో జరిగిన సంఘటనలని చూస్తూ ఉండకూండా, ఎదిరించి ప్రజల్లో చైతన్యం నింపే దిశగా అడుగులు వేయాలి. ఆ విషయంలో కవి విజయం సాధించాడు. కళలు, అక్షరాలు ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడాలి. అప్పుడే వాటికి సార్ధకత. కృష్ణ కౌండిన్య కవిత్వం సామాజిక అంశాలపై చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేసింది.
- పుష్యమీ సాగర్,
9010350317