Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక రచనపై రాసే విమర్శావ్యాసం ఆ సదరు రచయిత ఉనికిని తెలియజేస్తుంది. ఆ రచనను చదవాలనే కోరికను కలగజేస్తుంది. సాహిత్యావగాహనను పెంచడమే విమర్శ ఉద్దేశ్యం. విమర్శకులు ఎక్కువగా ప్రాచుర్యం పొందిన రచనలనే విశ్లేషిస్తూ ఉంటారు. ప్రసిద్ధికి రాని రచనలను కూడా విశ్లేషించి తగిన గుర్తింపునివ్వడం విమర్శకుల బాధ్యత.
విశ్వజనీన భావం అనేది అమాంతంగా ఊడిపడేది కాదు. ప్రాదేశిక జ్ఞానం, ప్రాంతీయాభిమానం నిండుగా కలిగిఉన్నప్పుడు మనసు మెల్లగా ప్రపంచం వైపు మళ్ళుతుంది. తన ప్రాంతంపై అభిమానం, తన సామాజిక నేపథ్యం బాగా తెలిసినవారే అక్కడి సాహిత్యకారులపై మరింత స్పష్టమైన అభిప్రాయాల్ని వెలిబుచ్చగలుగుతారు. ఒక కవి తాలూకు వ్యక్తిగత జీవిత విశేషాలు తెలిసినప్పుడు, ఆ కవి కవిత్వంపై మరింత చక్కని విశ్లేషణ చేయగలిగే అవకాశం ఉంటుంది. అయితే విమర్శలో కవి కాకుండా కవిత మాత్రమే ముఖ్యమన్న ప్రాథమిక సూత్రం మరువరానిది.
ఈ రెండు లక్షణాలను పుణికిపుచ్చుకొని తన విమర్శావ్యాసాలను ఒక సంపుటిగా చేసి 'కుందెన'తో మన ముందుకొస్తున్నాడు సాగర్ల సత్తయ్య.
సాహిత్యచరిత్రను భద్రపరచుకోవడంలో మనమెప్పుడూ అలసత్వంతోనే ఉన్నామని చెప్పుకోవాలి. ఆ క్రమంలో ఎంతో విలువైన సాహిత్యాన్ని కొల్పోయాం. సాహిత్యకారుల విశేషాలను కోల్పోయాం. అంతేకాకుండా వివిధ కారణాలవల్ల ఎందరో సాహిత్యకారులు వెలుగులోకి రాకుండానే కనుమరుగయ్యారు. విస్మృతికి లోనయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక ఎందరో పండితులు, పరిశోధకులు, కవులు, రచయితలు ఆ లోటును భర్తీ చేయడానికి కృషి చేస్తున్నారు. ఇంకా మరెంతో జరగాలి. ఆ కృషీవలుల వరసలోకి సాగర్ల సత్తయ్యని చేర్చవచ్చు. తెలంగాణపై అందునా తన ప్రాంతంపై విపరీతమైన అభిమానమున్న సత్తయ్య తన సమీప ప్రాంతంలోని సాహిత్యకారులపైనే దృష్టిపెట్టి వారి రచనలను లోకానికి ఎరుకపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలోని భాగమే ఈ 'కుందెన' వ్యాససంపుటి.
34 సాహిత్యవ్యాసాల సంపుటిది. కవిత్వం, కథ, చరిత్ర, జీవితచరిత్ర, బాలసాహిత్యం, నవల, తత్వాలు మొదలగు విభిన్న ప్రక్రియలపై వచ్చిన పుస్తకాలపై లేదా ఆయా సాహిత్యకారులపై రాసిన విమర్శావ్యాసాలు ఇందులో ఉన్నాయి. అయితే ఈ సంపుటిలో అగ్రస్థానాన్ని అలంకరించింది మాత్రం కవిత్వం మీద రాసిన వ్యాసాలే. ముందే అనుకున్నట్లు ప్రసిద్ధిలోకి రాని సాహిత్యకారులు, వారి సాహిత్యం మీద రాసిన వ్యాసాలు ఎక్కువ. విమర్శకుడికి కేవలం విమర్శనాత్మక దృక్పథం ఉంటే సరిపోదు. పరిశోధనా దృక్పథమూ అవసరం. ఈ రెంటికి తోడు తనదైన తాత్విక దృక్పథమూ ఉండాలి. వీటన్నిటిలో ఈ విమర్శకుడు కృతకృత్యుడయ్యాడనే చెప్పాలి. తనకున్న వనరుల పరిమితికి లోబడి వీలైనంత సమాచారాన్ని రాబట్టి, విశ్లేషించి పఠితకు అందంగా అందజేశాడు.
మొదటి వ్యాసమే తన గ్రామానికి చెందిన కవి రావిరాల బుచ్చయ్య గురించి రాశాడు. అతని కవిత్వాన్ని విశ్లేషిస్తూనే అతని జీవితగమనాన్ని సైతం లీలామాత్రంగా దర్శింపజేస్తాడు. దానివల్ల ఆ గ్రామ పరిసర ప్రాంతవాసులు లేదా ఆ జిల్లావాసులు వ్యాసంలో లీనమై తద్వారా కవి ప్రతిభని తెలుసుకుంటూ ఉత్తేజపూరితలవుతారు. ఈ పంథా చాలా వ్యాసాల్లో కొనసాగింది. ఈ సంపుటిలో విమర్శకుడు విమర్శ చేసిన ఎక్కువ మంది రచయితలు అంతగా ప్రాచుర్యంలో లేకపోవడంవల్ల, వాళ్ళకి ప్రాచుర్యం కల్పించే మంచికార్యంలో ఈ రకమైన విశ్లేషణా పద్ధతి చాలా బాగుంది.
ఈ వ్యాససంపుటిని తరచి చూస్తే సత్తయ్యకి కేవలం సాహిత్యావగాహన, సాహిత్యపరిశీలనతో పాటు పరిశోధన చేయాల్సిన అవసరం కూడా ఏర్పడిందనిపిస్తుంది. ఉదాహరణకు 'జానపదుల సాహితీపరిమళం మందెచ్చుల సాహిత్యం'. యాదవుల ఆశ్రితకులమైన మందెచ్చుల జీవనవిధానం, వారి (జానపద) సాహిత్యాన్ని కూలంకషంగా విశ్లేషించిన తీరు విజ్ఞానదాయకంగా ఉంది. ఇదే కోవకు చెందిన మరో వ్యాసం 'తెలంగాణ వైతాళికుడు షబ్నవీసు'. అది స్థాపించిన ఆ మహనీయుని సేవాతత్పరతను, గ్రంథాలయోద్యమ రూపంలో, పత్రికారూపంలో తెలుగుభాషావ్యాప్తికి, సంఘసంస్కరణకు కృషి చేసిన తీరును విశ్లేంచిన అరుదైన వ్యాసమిది.
కథాసంపుటులను, నవలని విశ్లేషిస్తున్నప్పుడు అవి పఠితలు ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చో, జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చో చెప్పిన విధానం బాగుంది. సత్తయ్య వృత్తిరీత్యా ఉపాధ్యాయుడవడం వల్లేమో బాలసాహిత్యకారులు, వారి రచనలని విశ్లేషిస్తున్నప్పుడు అరటిపండు ఒలిచి పెట్టిన చందంగా సాగింది.
'తెలంగాణ తొలితరం కథకుడు ఆవులపిచ్చయ్య' వ్యాసంలో ఆవుల పిచ్చయ్యని స్మరించడమే కాకుండా ఆయన కథలు అప్పటి తెలంగాణ జనజీవితాన్ని ఎలా ప్రతిఫలింపజేశాయో వివరంగా విశ్లేషించాడు సత్తయ్య.
ఒక అంశానికే కట్టుబడిఉన్న రచనలు కాకుండా వస్తువైవిధ్యం ఉన్న రచనలను తన విమర్శకు ఎంచుకోవడం సత్తయ్యలోని ప్రత్యేకత. తమ వ్యాసాల ద్వారా విస్మృత సాహిత్యకారులను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేయాలనుకునేవారికి సత్తయ్య 'కుందెన' ఒక దిక్సూచిలాంటిది.
- రాపోలు సీతారామరాజు