Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ పుస్తకంలో సి.సి (చల్కూటి చంద్రశేఖర్రెడ్డి) తన గతాన్ని నెమరువేసుకున్నారు. ఇందులో వ్యాసాలు, పుస్తక సమీక్షలు, పాలమూరు పత్రిక కథనాలు, కవితలు వున్నాయి. సి.సి. 30 ఏళ్ళపాటు వివిధ పత్రికల్లో పాత్రికేయునిగా పనిచేశారు. రాజకీయాల్లో కొండపల్లి సీతారామయ్య, సాహిత్యంలో వల్లపురెడ్డి బుచ్చారెడ్డి, జర్నలిజంలో కె.ఎన్.వై. పతంజలి ఆయనను ప్రభావితం చేశారు. ఇందులోని వ్యాసాలు, వార్తా కథనాలు వాస్తవాలకు ప్రతిరూపాలు. సి.సి. పైకి శాంతమూర్తిగా కనిపించినా ఆయన వ్యాసాలు వాడిగా వుంటాయి. వివిధ అంశాలపై ఆయన వ్యాసాలు రాశారు. తన తమ్ముడిని అకారణంగా కొట్టిన అమీన్పై తిరగబడి అమీన్ పుల్లయ్య అనిపించుకున్న పుల్లయ్య, సాహితీవేత్త వల్లపురెడ్డి బుచ్చారెడ్డి, రోగులకు సేవ చేసే డాక్టర్ నరసింహమూర్తి వంటి వారే కాకుండా, అనంతపురం జిల్లాలోని కొర్రపాడు దళితుల వెట్టిచాకిరీ, డార్జిలింగ్లోని మనోహర దృశ్యాలు సి.సి వ్యాసాల్లో చోటు చేసుకున్నాయి. పుస్తక సమీక్షల్లో ఆయన తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేశారు. భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రముఖుడైన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య రాసిన 'విప్లవపథంలో నా పయనం' అనే పుస్తకం పార్టీ చరిత్రలో ఆయన జీవితం మిళితమైన మేలు కలయికగా అభివర్ణించారు. ప్రజాసహిత 200 సంచికను సమీక్షిస్తూ ఆ పత్రిక అణచివేతను, తిరుగుబాటు తత్వాన్ని అద్దం పట్టిందని అభిప్రాయపడ్డారు. ఎ.యం. అయోధ్యారెడ్డి ఆహార యాత్ర కథలు దోపిడీ విధానాలకు దర్పణమన్నారు. నేను నేనే కథల సంపుటిని సమీక్షిస్తూ వర్మపై రావిశాస్త్రి ప్రభావం వుందనీ, ఆయన కథల్లో వాస్తవికతతో పాటు నిజాయితీ వుందని అభిప్రాయపడ్డారు. సి.సి. రెండేళ్ళపాటు పాలమూరు పత్రికను నడిపారు. ఆ పత్రికలో ఆయన రాసిన వార్తాకథనాలు నెమరులో వున్నాయి. ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా నిర్భయంగా ఆయన వార్తా కథనాలు రాశారు. ప్రత్యేక తెలంగాణ వాదానికి తిలోదకాలిచ్చి మంత్రి పదవి కోసం వై.ఎస్. ముందు మోకరిల్లిన ఎమ్మెల్యే చిన్నారెడ్డి, ఎవరికీ దర్శనమివ్వని జైపాల్రెడ్డి, జర్నలిజంలో తన గురువు ప్రముఖ వ్యంగ్య రచయిత, సంపాదకుడు పతంజలిపై రాసిన వార్తాకథనాలున్నాయి.
నెమరు : కలెక్షన్ ఆఫ్ రీకలెక్షన్స్, రచయిత : సి.సి, వెల : 150/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు.
- తెలిదేవర భానుమూర్తి,
9959150491