Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి తన అస్తిత్వాన్ని బాల్యంలో శోధిస్తుంటాడు. అస్తిత్వ శోధనలో ఎంత దూరమైనా ప్రయాణిస్తాడు కోడూరి విజయకుమార్. జీవితంలో, బాల్యంలో పరుచుకున్న అనేక అనేక సంఘటనలను కవిత్వం చేయ గలడు. తాజా కవితా సంపుటి 'రేగుపండ్ల చెట్టు'లో చేసాడు కూడా. ఎన్నో సున్నిత భావాలను, బాల్యంనుండి ఎన్నో చిత్రాలు మనసులో దాచుకున్న బంగారు జ్ఞాపకాలు పొరలు పొరలుగా దాగి వుంటాయి. ఈ చిత్రాలే పదచిత్రాలైనాయి.అయితే వ్యక్తీకరణ లో మనతో ఎదురుగా కూర్చుని మాటల మంత్రాలను వేస్తాడు కోడూరి విజయకుమార్. ఆ మంత్రాలశైలి మనలను కదలనివ్వదు...
జీవితాన్ని కవిత్వాన్ని వేరుగా చూడలేనితనం అతనికి ఆ కవిత్వాన్ని ఇచ్చింది. ఇది నిజమేనా?...
వస్తువులన్నీ నీవి నావి, ఊరు అమ్మ, ఇల్లు బడి, స్నేహితులు వీరులు, విప్లవాలు బంధాలు, అవ్వ సుద్దులు అన్నీ అన్నీ పచ్చని చిగురుటాకులై అల్లుకుంటవి.
'రేగు పండ్ల చెట్టు'లో - ''పెను దుఃఖాన్ని మూటలుగా కట్టుకుని /పదిహేనేళ్ళప్పుడు కుటుంబంతో ఆ వీధిని విడిచిన రోజున/చిన్నప్పటి నుండీ నన్నల్లు కున్న/ ఆ రేగుపండ్ల చెట్టు కొమ్మలు/ అట్లా నాతో పాటు వుండిపోయాయి/...ఊరును వదిలినప్పుడు వెంట దెచ్చుకున్న జ్ఞాపకాల ను కవితాత్మకం చేసిన తీరు ఇది.
''చెట్టు కింద పట్టుకున్న మేకపాల రుచిలాగ/
తీపి వగరుల రేగుపండ్ల రుచిలాగ....''/
''నింగిలోని పతంగుల కోసం నేల మీద పతంగు లమైన రోజులు.../
జ్ఞాపకాలు పక్షుల్లా నాతలపైన ఎగిరి సందడి చేస్తాయి.''/
ఆనాటి బాల్యం చుట్టూ హత్తుకొని వున్న జ్ఞాపకాలు బొంగరంలా గిర్రున తిరిగిన కాలం, ఇప్పటి పిల్లలకు లేని బంగారు బాల్యాన్ని మన కండ్లకు అతికించిన కవిత ఇది.ఎక్కడ పోగుట్టుకున్నావో అక్కడే వెతుకులాట కవి మార్గం.
తనను శోధించుకునే ప్రయత్నానికి తాత్విక రూపమే 'రూపాంతరం'...కవిత్వం పుట్టుక ఎలా వుంటుంది? కవిత్వం తప్ప ఏదీ కళ్లలో కనిపించ నప్పుడు, కళ్ళలో వెలుగులా ఉంటుందో అదే కవిత్వం. కవులని భ్రమిస్తూ, నినాదాలనే కవిత్వంగా భావిస్తూ, ఆ మత్తులో తూగిపోతున్నవారు దయచేసి ఈ కవితను చదవండి. కాదు మీ అనుభూతిలోకి తర్జుమా చేసుకోండి.
''వీధి చివర మలుపు తిరుగుతూ
చిరునవ్వు విసిరిన
ఆనాటి ఆ సీతాకోకని / నీ అరచేతుల్లోకి
అపురూపంగా చేర్చిన నెచ్చెలి ఇదే కదా''... ఈ జ్ఞాపకాన్ని పొందని యవ్వనం ఉండదు.ఆమె అందమైన జ్ఞాపకాల్ని, కవిత్వపు నెచ్చెలి చేసిన కవిత్వపు ప్రేమికుడు. అలాగే దుఃఖంలోను నిన్ను ఓదార్చే స్నేహితుడే కవిత్వం అంటాడు.
''ఏ అమాయక అదివాసీలు ఎక్కడ ఖాళీ చేయాలో
ఎవరేది మాట్లాడగూడదో
ఆదేశాలు జారీ అయినప్పుడు
మూర్ఖంగా గొంతు పెగిల్చి
స్వేచ్ఛా గీతాన్నాలపిస్తావు.''
ఎక్కడ స్పందించాలో తెలిసినవాడే కవి. కవి యొక్క కర్తవ్యం కూడా ఇదే. కవిత్వాన్ని ప్రేమించడం ఇదేనా? కాదు మోహించడం, జీవితంలో అణువణువునా నింపుకోవడం అంటారేమో.
'అతడి కల' వ్యక్తీకరణలో కొత్త కోణం ఇది. తెలంగాణ సాధించిన తరువాత సందర్భాన్ని చెప్పిన కవిత. తెలంగాణను సాధించడంలో ఎంత మంది బలిఅయినారో గుర్తు చేసిన సందర్భమిది. ఆ అమరవీరుల మరువలేని కవి. ప్రశ్నారూపంలో కవితను సాగించిన తీరు చదవాల్సిందే.
''ఈ ఉత్సవ కాంతులు మెరుపువై
వుండవలసిన వానివి
ఎక్కడికి వెళ్లి పోయినవ్?అని పలకరించాను.
నేను వెళ్లి వుండకపోతే ఈ ఉత్సవమెక్కడిది?
అతడి ప్రశ్న!''
ఈ ప్రశ్న ఎన్ని ప్రశ్నలకు సమాధానమైందో... వారి త్యాగమే లేకపోతే కాంతులెక్కడివి? నిజమే మరి వారి బలిదానంతో సాధించుకున్న బంగారు తెలంగాణ ఇది. అతడి కల నెరవేరాక చూసిన లోకం ఇది. తెలంగాణ కల ఇది. రైతన్నల మరణాలు లేని తెలంగాణ అప్పుడు కదా నా కల సాధికారిత లభిస్తుంది అంటూ నిష్క్రమించిన వీరుని దర్శనం జరుగుతుంది.
'నది చెప్పిన సంగతులు కొన్ని' కవితలో ''రెండు అరచేతులతో దోసిలి పట్టి /నన్ను దగ్గరగా తీసుకుని చూడండి''.
మనిషి నిత్యం ప్రయాణిస్తూనే వున్నాడు.వాడి ప్రయాణం కొనసాగేప్పుడు కొన్ని యుగాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కాని మనిషి ప్రయాణం ఆగలేదు. ఆ ప్రయాణాన్ని వీక్షించింది నదే. ఆ మనిషి అభివద్ధికి సాక్షీభూతం నది. తన వద్ధిలో ఎన్నో విధ్వంసాలను సష్టించాడు. మనుగడ పోరాటంకంటే విధ్వంసమే ఎక్కువగా జరిగింది.
ఇప్పటి ఈ ప్రపంచ పరిస్థితి కూడా మనిషి దురాశాపరుడు కావడంతో అది తిరగబడే పరిస్థితి కూడా సంభవించింది. మనిషి మనుగడను ప్రశ్నించింది.
మనిషి బతకడం వేరు, బతుకును ఆస్వాదించడం వేరు.మనకు ఊరు ఏం నేర్పింది అంటే బతకడం నేర్పింది. ''ఊరికి ఆ కలుపుగోలు తనం ఎవరు నేర్పించి వుంటారు''.. అంటూ తనతో పెనవేసుకున్న అను బంధాలను తడుముతుంటాడు. ''మా ఊరిని గురించి చెప్పడమంటే మా అమ్మానాన్నల గురించి చెప్పడమే'' అని 'వరంగల్ కు ఒక ప్రేమ లేఖ'లో అంటారు.
వీరి కవిత్వంలో ప్రత్యేకత ఏమిటంటే మొత్తం దశ్యాన్ని కండ్ల ముందుంచుతడు కవి. కథనంతో కూడిన శైలి. ఒక సాయంత్రం అమ్మతో ముచ్చట పెట్టినట్లుగా సాగుతుంది. ఆమె వెతలు తెరలు తెరలుగా చూపుతుంది. ఆ ముచ్చట్లు వినుకుంట వినుకుంట పెరగడం వల్లనే ఈ తత్వం అలవడుతుందేమో. ఆ ప్రేమలు, ఆ లేమితనాలు మనిషిలో మనిషితత్వాన్ని ఒక తీరుకు తెస్తాయేమో. ఈ అమ్మ ముచ్చట్లలలో పూర్తి జీవితాన్నే చూపిన కవిత. గుండెలో అమ్మ ప్రేమగా స్పశించిన అనుభూతి నింపిన కవిత.
కోడూరి విజయకుమార్ కవిత్వాన్ని చదువు తున్నప్పుడు నిన్ను నువ్వు చూసుకుంటున్న అనుభూతిలో కూరుకుపోయి, ఎక్కడో తేరుకొని మల్లమునక వేసినట్లుం టుంది. వాస్తవిక ప్రపంచానికి దూరంగా నిలబెట్టి కాల్పనిక అనుభూతికి లోను చేసే కవిత్వం కాదు. నువ్వు, నీ జీవితం చూడు అని లోకం మధ్య నిలబెడుతుంది. కండ్లముందు నీకోసం కష్టపడే నాన్న భారాన్ని కూడా బాధ్యత చేసుకున్న మనిషి తత్వం ఈ కవిత్వం.
- సీహెచ్. ఉషారాణి, 9441228142