Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ కవులలో అధిక భాగం వృత్తి కులాల నుంచే వచ్చారు. ముఖ్యంగా దళిత బహుజన వర్గాల నుంచి వచ్చిన వారే చాలా మంది ఉన్నారు. దేశ వ్యాప్తంగా చూస్తే అస్తిత్వవాద సాహిత్యోద్యమంలో వీరి భాగస్వామ్యమే అధికం. తెలంగాణ మలి దశ ఉద్యమ కాలంలోనూ వీరి పాత్ర ఎంతో ఉంది. తెలంగాణలోని కవుల్లో, రచయితల్లో ప్రధానంగా కనిపించే స్వభావం ప్రశ్నించడం. దీన్ని వీళ్లు కొత్తగా నేర్చుకున్నది కాదు. కొన్ని తరాల నుంచి జరుగుతున్న అన్యాయం, దోపిడి దౌర్జన్యాలే కారణం. ఇంకా చెప్పాలంటే ఇక్కడి మట్టి, ప్రజా ఉద్యమాలకు పుట్టినిల్లుకావడమే. ఈ నేపథ్యం నుండే ఎదిగి వచ్చిన కవి గోపగాని రవీందర్.
గత రెండు దశాబ్దాలకు పైగా సాహిత్యరంగంలో రాణిస్తున్నారు. వివిధ సాహితీ ప్రక్రియల్లో రచనలు చేస్తు ఆకట్టుకుంటున్నాడు. ఈయన ఇప్పటి దాకా మూడు కవితా సంపుటాలను అందించారు. ఒక ఎంఫిల్ పరిశోధన గ్రంథం, తెలంగాణ కథా రచయితల కథలపైన చేసిన విశ్లేషణ వ్యాసాల సమాహారమైన కథాంతరంగం పుస్తకాన్ని మనకందించారు. ఇప్పుడు 55 కవితలతో కూడిన నాలుగో కవితా సంపుటి 'దూరమెంతైన' ను వెలువరించారు. దూరమెంతైన పేరుతోనే ఈ కవికి కవిత్వమొక తపనగా, దినచర్యగా మారిందని చెప్పవచ్చు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎంతదూరమైనా సాగిపోవడమనే దృఢ సంకల్పమున్న కవిగా మనకు అర్థమవుతాడు.
ఈ కవితా సంపుటి ద్వారా రవీందర్ తాను పుట్టి పెరిగిన ఊరిపైన గల ప్రేమను తెలుసుకుంటాం. తనకు బతుకునిచ్చిన ఉట్నూరు మీదా కూడా అంతే అభిమానముందని గ్రహిస్తాం. ఈ కవిగారి అభిమానం, అనుబంధాలు, గతించిన వారిపై గల కృతజ్ఞతా భావాలు వంటి ఒక అపూర్వమైన స్థానీయతను వ్యక్తం చేసిన సంపుటి ఇది. అందుకని ఈ పుస్తకంలో దాదాపు ఎనిమిది కవితలు ట్రైబల్స్ మీద, కొన్ని స్మృతి కవితలు, ఉట్నూరు పరిసర ప్రాంతాల గూర్చి కొన్ని ఉన్నాయి. చదవాలని పేజీలు తిప్పుతుంటే తెలంగాణ రాష్ట్రావతరణ ఆనందం, అడవిని నిరంతరం కాపాడే ఆదివాసులు మనముం దుంటారు. వీళ్లంతా ఈ కవితల్లో కవితా వస్తువులుగా రూపుదిద్దుకున్నారు. పల్లె నుంచి రావటం, జీవిక కోసం ఉట్నూరులో పాతిక సంవత్సరాలుగా నివసించడం వలన, ప్రగాఢమైన విశ్వాసంతో కవిత్వం రాస్తున్నాడు. అందులో తెలుగు టీచర్గా విధులు నిర్వహిస్తునే కవితా సృజన చేస్తున్నాడు. ఎగుడు దిగుడు జీవితాన్ని, తెలుగు సాహిత్యాన్ని సునిశితంగా అధ్యయనం చేసినవాడు. అందుకని సామాజికం గాను, సాహిత్యపరంగాను మనకు ఈ కవి ప్రశ్నలాగే కనబడతాడు.
సమాజంలో ఎక్కడ ఏమి జరుగుతుందో తన అంతర్ దృష్టితో పసిగట్టేవాడు కవి. దినదినం ప్రశ్నించడం మహానేరమవుతున్న సంద్భరంలో 'ప్రశ్నకు మరణం లేదు' కవితలో 'నోరును కుట్టినంత మాత్రాన/వాటి జననం ఆగదు/కలాల ఊపిరిని తీసినా/వాటి పరుగును ఆపవు' అంటూ ప్రశ్నను మొలవనివ్వని వ్యవస్థకు హెచ్చరిక చేస్తాడు. అణచివేత ఉన్నచోట ప్రశ్నలు పుట్టుకరావడం అనివార్యమంటాడు. జనం కోసం జీవితాలను త్యాగం చేసిన వాళ్లను, రాజ్యం హింసించే విధానాన్ని 'జనం కోసం జన్మ నెత్తిన వారిని/నోరారా పిలుచుకునే స్వేచ్ఛ ఉందా? అని, ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న అసహనాన్ని ప్రశ్నిస్తున్నాడు.
నేడు రాజకీయాలు పెట్టుబడిదారుల చేతిలో దండననే. రాజకీయాలంటే వ్యాపారుల చేతిలో కీలుబొమ్మలే. వర్తమాన రాజకీయ రంగం ప్రకృతిని ధ్వంసం చేయడమే. అధికార దాహం నుంచి, డబ్బు నుంచి నేడు ప్రకృతిని కూడా మిగల్చకుండా ధ్వంసం చేసే స్థాయికి చేరుకుందని, ఒక బాధ్యత గల కవిగా 'రాతి కొండల రూపులు మారుతున్నాయి/ నదుల ప్రవాహాలు తరుగుతున్నాయి/ అడవులు క్రమంగా హరించుకుపోతున్నాయి/ ఊళ్ళు వేగంగా విస్తరిస్తున్నాయి వాటిపైనే' అంటూ రోజురోజుకు తరిగిపోతున్న అడవి సంపద గూర్చి ఆవేదన చెందుతాడు.
ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తరువాత కొన్ని ఆశావహ మార్పులు సంభవించాయి. ముఖ్యంగా అనాథలై వయసు మీదపడిన వృద్ధాప్యం వెక్కిరిస్తున్న ఎంతోమందికి ఆసరా పెన్షన్ చీకట్లో వెలుగులా పని చేసిందని 'ముడుతలు పడిన ముఖంలోని బోసి నవ్వులు/ పరిమళభరితంగా విచ్చుకుంటాయి అక్కడ' అంటూనే 'తరిమికొట్టిన సంతాన మిప్పుడు కాళ్లు పట్టుకొని/ ఇంటికి తెచ్చుకుం టున్నారు సంబురంగా కొందరు' అని పెద్దల పట్ల చూపాల్సిన ఆదరాభి మానాలపై వచ్చిన మార్పే వారికి జీవనాధారమైందంటాడు కవి. ఇదొక్కటే కాదు ప్రాజెక్టులు, చెరువుల పునర్నిర్మాణం ఈ కవిని సంబురపరిచాయి. 'పూలను పేర్చే పాటలేంది' అన్నోళ్లే నేడు పురోగమిస్తున్న తెలంగాణను చూసి ముక్కున వేలేసుకుంటున్నారని గుర్తుచేస్తాడు.
నడుస్తున్న దేశచరిత్రను ఓ కంట కనిపెడ్తున్న వర్తమాన కవి గోపగాని. అందుకే ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వలన, సామాన్య ప్రజలకు కలిగే ఇబ్బందులను గూర్చి, కవిత్వంలో ప్రస్తావన చేస్తారు. అందులో భాగంగానే నోట్లరద్దు వలన కలిగిన పేద ప్రజల కష్టాలను 'సఫలమా? విఫలమా?' అంటూ అక్షరీకరణ చేశారు. బ్యాంకుల వద్ద క్యూలో నిలుచుంటే రోజుకు రెండు వేలు మాత్రమే ఇచ్చేవారు. మరి రాజకీయ నాయకుల, ధనిక వర్గాల దగ్గర వందల కోట్ల కొత్తనోట్లు ఎక్కడివని ప్రశ్నిస్తాడు. 'గంటల కొద్ది నిలబడితే రెండు వేల రూపాయాలే/ ఎక్కడ నిలబడని వాడికి వేల కోట్లు ఎక్కడివని' అంటూ ప్రజాగ్రహాన్ని తన గొంతులో వ్యక్తం చేస్తాడు.
ఆదివాసుల ఆచారవ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను దగ్గరి నుండి చూసినవాడు కాబట్టి దేని గురించి రాసినా చాలా ఆత్మీయంగా రాశారు. అందుకే ఈ కవితా సంపుటిని నిశితంగా పరిశీలిన చేస్తే గిరిజనుల జీవితమే అంతస్సారంగా కనబడుతుంది. ఆదివాసీల గురించి చెప్పిన ఈ కవితాపాదాలను చూడండి: ఎంత అద్భుతంగా ఉన్నాయో 'కొండల పాదాలను ముద్దాడుతున్న పల్లెలు/ఇళ్ళ కప్పులను ముద్దాడుతున్నాయి శిఖరాలు' అని అంటారు. దీనిలో ఎంత భావుకత ఉందో కదా. అదే విధంగా గిరిజనుల సంస్కృతి, జీవితాలను, ఉన్నంతలో ఆనందంగా జరుపుకుంటారనే అనే వాటిని చాలా కవితల్లో వ్వక్తం చేశారు.
'సంతలే మా మాల్స్' అనే కవితలో 'ఒక అవ్వ తన మనుమరాలి కోసం/ ఒక తల్లి తన బిడ్డ కోసం/ ఒక తండ్రి తన సంతానం కోసం/ చేతి సంచులను దినుసులతో నింపుకొని/ చిరునవ్వుతో ఇండ్ల ముఖం పడతారు' అనడంలో గిరిజనుల జీవితాల్లోని అరుదైన ఘట్టాలను కవిత్వీకరించారు. ఈ సంపుటికి తలమానికం లాంటి కవిత ఇది. ఇంకా 'భూమి కోసమే సమస్త మానవ పోరు/భూమిపుత్రుల రక్తం చిందిన ఇంద్రవెల్లి/ నాకాప్పటికీ దు:ఖభరితమే' అంటూ భూమి కోసం అమరులైన ఆదివాసుల నెత్తుటి త్యాగం తనకిప్పటికి విషాదభరితమే.
కవిత్వంలో కొత్తదనం, భావుకత లేకుంటే ఆ కవి ఎక్కువకాలం నిలువలేడు. నిలిచిన మంచి కవిగా మనగలగడం కష్టమే. రవీందర్ భావుకత కల కవి. అట్లని భావాన్ని మార్మికతతో కప్పేయడు. అలవోకగా మాట్లాడుతున్నట్టే ఉంటాయి ఇతని వాక్యాలు. వాన గురించి 'వాన' కవితలో 'బొట్టు బొట్టుగా కలిసి పిల్ల కా లువలై/ సందులను రొడ్లను ఏకం చేస్తు/ ముడుచుకున్న వాగులకు రెక్కల నిచ్చింది' అంటూ పాఠకున్ని ఒక సమ్మోహనస్థాయికి తీసుకెళ్తాడు. అట్లాగే 'సున్నితమంటూ దాటవేసే మాటలపై/నిప్పులు కురుస్తున్నాయి జడివానలా' అంటాడు. ఇంకొచోట 'అణగారిన జీవితాల్లోని గాథలా/అలజడులతో రోడ్లు ఊగుతున్నాయి' అనడంలో మనస్సులోని భావావేశాన్ని కల్లోల్లపరుస్తాయి.
తనకు జన్మనిచ్చిన తండ్రి గురించి గొప్ప కవితను రాసుకున్నారు. 'ఈ అందమైన ప్రపంచాన్ని / నీ కళ్ళతోనే చూశాను/తొలి అడుగును వేసింది/ నీ ఒడిలోనే' ఇంతకుమించి ఏది రాసిన తండ్రి గురించి తక్కవే. ఈ కవితా సంపుటిలో ఒక కవిగా, ఒక రచయితగా కనీస సంస్కారాన్ని చూపించుకున్నాడు. మహాశ్వేతాదేవి, సదాశివ, సినారె, గూడ అంజయ్య, కళాశ్రమం రవీంద్రశర్మ గురూజీ గార్ల మీద మంచి కవితలతో అక్షర నివాళులు అర్పించాడు.
ఇంకా ఈ సంపుటిలో ఆదిమ గిరిజనుల ఉద్యోగుల గురించి, రోజు చూస్తున్న జీవితానుభవాల గూర్చి, బడి పిల్లల గూర్చి రాసిన కవితలున్నాయి. ప్రస్తుత సమాజంలో అట్టడుగునుంచి, అంచెలంచెలుగా ఎదిగిన వారి జీవితాలను, వాటి తాలుకు గాయాలను చిత్రించడమే కవి కర్తవ్యం. దళిత బహుజనవాదంలో గిరిజనుల నుంచి ఉద్యమం మొదలుపెట్టాలని, ఈ సందర్భంగా కూడా అటువంటిదేనని గుర్తుచేస్తు 'సామూహికతనం చిక్కపడుతున్న/ ఉద్యమ ఋతురాగాల కాలమిది' అంటున్న తన సాహితీ ప్రస్థానాన్ని చూడవచ్చు. దూరమెంతైనా ఇదే బాటపై సాగిపోవడమే తన దృక్పథమని చాటుకున్న కవి గోపగాని రవీందర్. ఇట్లాంటి విభిన్నమైన ఇతివృత్తాలతో కూడిన 'దూరమెంతైన' కవితా సంపుటిని కవిత్వ ప్రేమికులు తప్పక చదవాలి.
- డాక్టర్ ఉదారి నారాయణ, 9441413666