Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవులను, భావుకులను 'గీతాంజలి' ఎప్పటికప్పుడు ప్రతిస్పందింపజేస్తూనే ఉన్నది. అది సార్వజనీనకముగా భాసిల్లడం వలనే, ఎందరినో ఉత్తేజితులను చేస్తుంది. రంజింపచేస్తున్నది. స్పందించిన భావుకులు వారి వారి అనుభవసారము నుండి వారి పర భాండము నుండి అనువర్తితమవుతున్నది. ఒకరికి కొంగన జగ్గయ్య, మరొకరికి చలం, ఇంకొకరికి ఇంకొకరు నచ్చుతారు. ఇలా అనువాదము చేసిన వారిలో నాగరాజు రామస్వామి గారు గీతాంజలి పట్ల రసప్లావితుడై రవీంద్ర గీత గీతాంజలిని తమ పదానుభూతులలో అందించారు.
రవీంద్రుని గీతాంజలికి తొలి అనువాదం రవీంద్రునిదే అంటే బెంగాలి (వంగ) భాషలో నుండి ఆంగ్లములోనికి 1910లో వచ్చింది. అంటే దాని వయసు 110 సంవత్సరాలు. ఒక కావ్యము వంద సంవత్సరాల తదుపరి కూడా అది నిత్య నూతనంగా ఆవిష్కరించబడుతూ వస్తూనే ఉన్నది. పున:పున: ఆవిష్కృతమవుతున్న దంటే అందులోని భారతీయ భావుకాత్మత నిక్షిప్తమవడమే ననిపిస్తుండేదనేది తథ్యము. కవితా భావుకులను ఉత్తేజితులను చేస్తూ గీతాంజలి కొత్త రెక్కలను తొడుగుకుంటుంది.
2016లో నాగరాజు రామస్వామిగారు గీతాంజలిని 'రవీంద్రగీత'గా పాఠకులకు అందించారు. గీతాంజలికింత వరకు సుమారు 50, 60 అనువర్తితములు వచ్చినవి. ఈ అనువాదములు వేటికవే ప్రత్యేకత కలిగి ఉన్నవి. అంటే అనువాదకుని ముద్రను స్ఫూర్తిని పొదవుకుని వచ్చినవి. రవీంద్రుని గీతాంజలిలోని 35వ ఖండిక మాత్రం శతాధిక అనువాదాలను పొందింది. ధనేకుల వెంకటేశ్వరరావు చేసిన 35వ ఖండిక గుంటూరు సాహిత్య సభలలో ప్రార్థనా గీతముగా పాడుకుంటున్నారు.
గీతాంజలి తొలి తెలుగు అనువాదము 1913 సం||లో ఆదిపూడి సోమనాధరావు గారిది. ఇది తేటగీతులలో ఉన్నది. అదలా ఉంచితే- నాగరాజుగారి అనువాదం / అనుసృజన సరళ సుందరంగా సాగింది. ఆయన అనువాదంలోని పద సంపద లాలిత్యంగా ఉంది. ఆ పద్యాల పోహళింపు సుకుమార మల్లెపూల సుమధుర పరిమళంతో మనసు హత్తుకుంటుంది. ఈ అనువాదము మన మాటల్లోనే తేలియాడుతూ మనస్సులను కౌగిలించుకుంటుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. మనము ఇది రవీంద్ర గీత అనుకోకుండా చూస్తే మూల కవితలా భాసిస్తుంది.
'నీ పదాలు నా గూటి దీపాలై రెక్క విప్పుతాయి
నీ శ్రావ్య గీతాలు
నా విరిసిన వాటికలో పూల పాటలై వికసిస్తాయి'
- పుట 42, గీతం 19
''చరమ తరుణం ఆసన్నమైనట్టున్నది
గాలిలో నీ మధుర సాన్నిధ్య లలిత సౌరభం వస్తున్నది''
- పుట 71, గీతం 46
సహృదయ కవితా భాసురం ఈ రవీంద్ర గీత.
- డా|| టి.శ్రీరంగస్వామి
9949857955