Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలం గడుస్తున్న కొద్దీ కొంతమంది ప్రజల మనసుల్లో నుండి చెరిగి పోతుంటారు. కానీ పుచ్చలపల్లి సుందరయ్య వ్యక్తిత్వం మాత్రం ఎన్నటికీ జగజ్జేయ మానంగా వెలుగులీనుతూనే ఉంటుంది. తెలుగు నేల మీద చాలా మంది ప్రముఖ రాజకీయ నాయకులున్నారు. కానీ సుందరయ్య వారందరిలో గొప్ప వ్యక్తి. కమ్యూనిస్టు నాయకుడు అయినప్పటికీ రాజకీయాలతో నిమిత్తం లేకుండా అన్ని సెక్షన్ల ప్రజలు ఆయనను గౌరవిస్తారు.
ఒక వ్యక్తి గొప్పదనాన్ని ఆయన బతికున్న సంవత్సరాలతో గానీ, ఆయన అధిరోహించిన ఉన్నత పదవులతో గానీ లేక ఆయన పోగుచేసుకున్న ధనరాసులతోగానీ కొలవలేం. గొప్పదనానికి కొలబద్ద ఆ వ్యక్తి సమాజంలో మంచి మార్పు కోసం ఎంతగా దోహదం చేశాడు, ఆయన కృషి నుంచి భవిష్యత్ తరాలు ఆదర్శంగా తీసుకోవలసిన అంశాలేమైనా వున్నాయా అన్నవి మాత్రమే. సుందరయ్య తన జీవితం మొత్తాన్ని ప్రజా ప్రయోజనాల కోసం, సమాజం, కమ్యూనిస్టు ఉద్యమం కోసం అంకితం చేశారు. ఆయన జీవితంలోని అనేక అంశాలు నేటికీ అనుసరించదగ్గవి ఉన్నాయి. అందులోని కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను.
సుందరయ్య పోరాట జీవితం 1930లో తన గ్రామంలో నెలకొన్న భూస్వామ్య అణచివేతపై తిరుగుబాటుతో ప్రారంభమైంది. ఆయన భూస్వామ్య దురాచారాలు, సంప్రదాయాలను తీవ్రంగా అసహ్యిం చుకునేవారు. దళితులు, ఇతర బలహీనవర్గాల పక్షాన నిలబడి సమానత్వం కోసం పోరాడారు. ఆ క్రమంలోనే ఆయన తన పేరులో కులాన్ని సూచించే 'రెడ్డి' పదాన్ని తొలగించారు. తన గ్రామంలో అన్ని కులాల సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉమ్మడి బావినుండి నీళ్లు తోడుకోడానికి దళితులకు హక్కు ఉండాలని పోరాడారు. దళితుల కోసం ఒక కిరాణా షాపు నడిపారు. కులాంతర వివాహాలు నిర్వహించారు. ఆయన ఎల్ల వేళలా మహిళల సమాన హక్కుల కోసం నిలబడ్డారు.
ఆ తరంలో అంతగా కృషి చేసినప్పటికీ నేటికీ మన సమాజంలో భూస్వామ్య వ్యవస్థ అవశేషాలు మిగిలి ఉన్నాయి. దీనికి కారణం మన స్వాతంత్య్ర పోరాటంలోని బలహీనతలు, స్వాతంత్య్రానంతర పాలక వర్గాల రాజీ ధోరణి. బ్రిటిష్ వారు తమ ''విభజించు పాలించు'' విధానం కోసం కుల మతాలను ఉపయోగించుకున్నట్టే, నేటి నయా- ఉదారవాద పాలకులు కూడా కులం, మతం, తెగ, ప్రాంతం మొదలైన అస్థిత్వాలను తమ దోపిడీని పెంపొందించుకునేందుకూ, తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఉపయోగించు కుంటున్నారు. మిగిలి ఉన్న భూస్వామ్య వ్యవస్థ అవశేషాలపై నిరంతరం పోరాడకుండా మనం అస్థిత్వ రాజకీయాల విచ్ఛిన్న ధోరణులను నివారించలేము. కమ్యూనిస్టు ఉద్యమం గనుక భూస్వామ్య వ్యవస్థ అవశేషాలతో రాజీ పడితే ప్రజా ఉద్యమం ముందుకు వెళ్లకపోవడమే కాదు, బాగా బలహీన పడిపోతుంది. కుల పీడన, మతతత్వం, పురుషాధిక్యత మొదలైన భూస్వామ్య అవశేషాలకు వ్యతిరేకంగా పోరాడకుండా ఒక వ్యక్తి కమ్యూనిస్టు కాలేడు. అందువల్లనే ఆనాడు కామ్రేడ్ సుందరయ్య భూస్వామ్య పద్ధతుల పట్ల చూపిన ఏహ్యభావం, వాటికి వ్యతిరేకంగా ఆయన చేసిన స్ఫూర్తివంతమైన, నిబద్ధతతో కూడిన పోరాటం నేడు కూడా చేయాల్సిన అవసరం ఉంది.
ప్రజల కోసం సుందరయ్య అవిశ్రాంత పోరాటం చేశారు. కమ్యూనిస్టు ఉద్యమ నాయకత్వంలో జరిగిన ముఖ్యమైన పోరాటాలన్నిటిలోనూ ఆయన ముందు పీఠిన ఉన్నారు. వాటిలో రెండు పోరాటాల గురించి నేను చెబుతాను. మొదటిది, వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. స్వాతంత్య్రోద్యమంలో ఇది అత్యంత మహత్తరమైన పోరాటం. 10 వేల మంది గ్రామీణ మిలీషియా సభ్యులు, 2000 మంది రెగ్యులర్ గెరిల్లాలు మొదట నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా, తరువాత 50 వేల మంది కేంద్ర ప్రభుత్వ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడారు. 1946 నుండి 1951 వరకు జరిగిన ఈ వీరోచిత పోరాటంలో 4000 మంది కామ్రేడ్స్ అమరులైనారు. 10 వేల మంది కార్యకర్తలు జైలు శిక్షలు అనుభవించారు. 50 వేల మంది ప్రజలు పోలీసు క్యాంపుల్లో నిర్బంధించబడ్డారు. ఈ అసాధారణ త్యాగాలు వృధా కాలేదు. వీటి ఫలితంగా నిజాం ప్రభుత్వం గద్దె దిగింది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైంది. రైతాంగానికి 10లక్షల ఎకరాల భూమి పంచబడింది. వెట్టి చాకిరీ, బేదఖళ్లు రద్దు చేయబడ్డాయి. దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం పోరాటాలకు ఇది ఊతమిచ్చింది. ఈ వీరోచిన పోరాట సంప్రదాయం వల్లనే నేటికీ మన పార్టీ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ప్రజా పునాదిని కలిగి ఉంది. ఈ పోరాటం వల్లనే 1952 ఎన్నికల్లో ప్రోగ్రెస్సివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ బ్యానర్పై పోటీ చేసిన కమ్యూనిస్టులకు హైదరాబాద్ స్టేట్కు చెందిన తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 100 స్థానాలకు గాను 45 స్థానాలు గెలుచుకున్నారు. తెలంగాణ కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శిగా ఉన్న సుందరయ్య తీవ్రమైన అణచివేత, రజాకార్ల, కేంద్ర సైన్యాల హత్యాకాండ మధ్య నాలుగేండ్ల పాటు ఈ వీరోచిత పోరాటాన్ని నడిపించారు. అందువల్లనే తెలంగాణలోని దాదాపు అన్ని గ్రామాల్లో ప్రజలు సుందరయ్యను తమ స్వంత కుటుంబంలోని సభ్యునిలా ప్రేమించారు. ఈ మహత్తర ప్రజా పోరాట అనుభవాలు, గుణపాఠాలను సుందరయ్య 1972లో 'తెలంగాణ ప్రజా పోరాటం, గుణపాఠాలు' అన్న పేరుతో గ్రంథస్తం చేశారు.
నేను చెప్పదలచుకున్న రెండవ పోరాటం 1934లో సుందరయ్య మార్గదర్శకత్వంలో కోస్తా ఆంధ్రాలో జరిగిన వీరోచిత రైతాంగ రక్షణ యాత్ర. పార్టీ కార్యదర్శిగా సుందరయ్య ఈ పోరాటంలో కూడా కీలకపాత్ర నిర్వహించారు. ఇచ్ఛాపురం నుంచి మద్రాసు వరకు 10 మాసాల పాటు సాగిన ఈ యాత్రలో వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ యాత్ర మొత్తం 525 గ్రామాల మీదుగా 2,433 కిలో మీటర్ల దూరం నడిచింది. రీ-సెటిల్మెంట్ విధానానికి వ్యతిరేకంగా ప్రజలను ఈ యాత్ర పెద్దఎత్తున కదిలించింది. ఈ సందర్భంగా వారు 500 బహిరంగ సభల్లో నాలుగున్నర లక్షల మంది ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రైతాంగ సమస్యలపై వారు మద్రాసు శాసన సభలో ఒక వినతిపత్రం సమర్పించారు. రైతాంగంలో మన పునాది పెంచుకోవడంలో ఈ కార్యక్రమం ఎంతగానో తొడ్పడింది. అఖిల భారత కిసాన్ సభ ఏర్పాటులో కూడా ఇది కీలక పాత్ర నిర్వహించింది.
సుందరయ్య అనగానే మనకు ఒక పోరాట యోధుడు గుర్తుకొస్తాడు. అయితే ఆయన గొప్ప పార్లమెంటేరియన్ కూడా. 1952లో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. మూడేండ్ల పాటు ప్రతిపక్ష నాయకుడుగా పనిచేశారు. 1955లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయిన తరువాత ఆయన 1967 వరకు అంటే 12 ఏండ్ల పాటు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. ఆ తరువాత 1978 నుండి 1983 వరకు రాష్ట్ర శాసన సభలో ఉన్నారు.
సైకిల్ వెనుక ఫైల్స్ కట్టుకుని, పార్లమెంటుకు వచ్చి, సైకిల్ను స్టాండ్లో పెట్టి, సభలోకి నడుచుకుంటూ వెళ్లి, సమయానికి తన స్థానంలో కూర్చుని, పత్రాలను తదేక దీక్షతో చదివి సభా కార్యక్రమాల్లో పాల్గొనే సుందరయ్య ఆ రోజుల్లో పార్లమెంటులో విశేషంగా కనిపించేవారు. రాష్ట్ర శాసన సభలో ఉన్నప్పుడు కూడా ఆయన అసెంబ్లీకే కాదు, ముఖ్యమంత్రి నివాసానికి కూడా సైకిల్ మీద వెళ్లి పని చేయించుకునే వారు. ఆ దృశ్యం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేది.
పార్లమెంటరీ రంగంలో సుందరయ్య తన 20 ఏండ్ల అనుభవంలో భారత విప్లవోద్యమంలో పార్లమెంటరీ కార్యకలాపాల పాత్ర, పరిమితులను గురించి అర్థం చేసుకున్నారు. కమ్యూనిస్టు పార్లమెంటేరియన్ ఎలా ఉండాలన్న దానికి సుందరయ్య ఆదర్శవంతమైన నమూనాగా నిలిచారు. ప్రజా ప్రతినిధి ఒక సాధారణ జీవితాన్ని ఎలా గడపాలో ఆయన ఆచరించి చూపించారు. కమ్యూనిస్టు పార్లమెంటేరియన్ వ్యాఖ్యానాలు చేసే ముందు ఎలా కూలంకషంగా అధ్యయనం చేయాలి, విమర్శ తీవ్రంగా ఉన్నప్పటికీ ఎలా బాధ్యతాయుతంగా ఉండాలి, ప్రత్యామ్నాయ, నిర్మాణాత్మక సూచనలు ఎలా చేయాలి, బయట జరుగుతున్న ప్రజా పోరాటాలను సభలోపల ఎలా ప్రతిబింబించాలి అన్న విషయాలను ఆయన ఆచరించి చూపించారు. పార్లమెంటరీ భ్రమలకు ఎలా లోను కాకూడదన్న దానికి ఆయన ఒక ఉదాహరణగా నిలిచారు. ఈ రోజున కమ్యూనిస్టు పార్టీల నుంచి కూడా కొందరు ప్రజా ప్రతినిధులు బూర్జువా పార్లమెంటరీ వ్యవస్థ ప్రలోభాలకు లోనవుతున్న సందర్భంలో సుందరయ్య పార్లమెంటరీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకు పోవడంలో ప్రజా పోరాటాలు ఎంత ముఖ్యమో సాంఘిక సేవా కార్యక్రమాలు కూడా అంతే ముఖ్యమని సుందరయ్య నమ్మారు. అటువంటి కొన్ని కార్యక్రమాల గురించి నేను ప్రస్తావిస్తాను. పేద ప్రజలకు కమ్యూనిస్టులు ఆరోగ్య సంరక్షణ అందించాలని సుందరయ్య పదే పదే చెబుతుండేవారు. యువకునిగా ఉండగా ఆయన ప్రాథమిక చికిత్స పద్ధతులపై శిక్షణ పొందారు. తన గ్రామంలో ప్రాథమిక వైద్యాన్ని అందించారు. ఆయనతన సోదరుడు రామచంద్రా రెడ్డి చేత 1953లో ప్రజా వైద్యశాల ఏర్పాటు చేయించారు. సుందరయ్య మరణించే వరకు దానికి మార్గదర్శనం చేశారు. ఇప్పుడు పార్టీ ట్రస్టు చేత ఆ ఆస్పత్రి ఒక ఆదర్శవంతమైన ప్రజా వైద్యశాలగా నడుస్తోంది. 250 పడకలున్న ఈ ఆస్పత్రిలో 40 మంది డాక్టర్లు, 250 మంది సిబ్బంది పేద, మధ్యతరగతి ప్రజలకు గొప్ప సేవ చేస్తున్నారు. ఒక్క ఏడాదిలో ఇక్కడ రెండున్నర లక్షల మంది ఔట్ పేషెంట్ సేవలు పొందుతున్నారు. అనేక సంవత్సరాలుగా ఈ వైద్యశాలలో శిక్షణ పొందిన 250 మందికి పైగా వైద్యులు తెలుగు నేలలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆస్పత్రులు నెలకొల్పి ప్రజలకు వైద్య సేవలు అందించడమే కాకుండా అనేక విధాలా ప్రజా ఉద్యమాలకు తోడ్పడుతున్నారు.
1971లో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినప్పుడు ధరల అదుపు కోసం ఆందోళన చేయడమే కాకుండా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకూ, ప్రజలకు కొంత వెసులుబాటు కల్పించేందుకు కమ్యూనిస్టు పార్టీ కిలో బియ్యం రూపాయికే అమ్మే షాపులు నడిపింది. సుందరయ్య శాసన సభ్యునిగా గెలుపొందిన గన్నవరం ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు 39 గ్రామాల్లో ఈ చౌక దుకాణాలను మూడు మాసాల పాటు నిర్వహించారు. తరువాత రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో దీన్ని అనుసరించారు. కార్యకర్తలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి మిల్లులో బియ్యం ఆడించిన తరువాత పేదలకు అమ్మేవారు. అన్ని ఖర్చులు పోగా కూడా బియ్యాన్ని కిలో ఒక రూపాయికి అమ్మడం సాధ్యమేనని వారు నిరూపించారు. ఈ కార్యక్రమం నల్లబజారు నిర్వహించే వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది.
ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయన ఎల్లప్పుడూ ముందుండేవారు. 1977లో కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతంలో వచ్చిన తీవ్రమైన ఉప్పెనకు 10,000 మంది చనిపోయారు. దాదాపు 100 గ్రామాలు పూర్తిగా తుడిచి పెట్టుకు పోయాయి. ఎక్కడ చూసినా మనుషుల శవాలు, జంతు కళేబరాలు పడి ఉన్నాయి. మన కార్యకర్తలు 30 రోజుల పాటు రాత్రీ పగలు కష్టపడి పనిచేసి శవాలను తొలగించడం దగ్గర నుంచి బతికి ఉన్న వారికి వైద్య సేవలు అందించడం వరకు అన్ని రకాల సేవలు అందించారు. కార్యకర్తలను సమీకరించడంలోనూ, సహాయ సామాగ్రి సేకరించి బాధిత కుటుంబాలకు అందించడంలోనూ మా పార్టీ ఎనలేని కృషి చేసింది. సుందరయ్య వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాలను పర్యవేక్షించారు.
ముఖ్యంగా చెప్పదలచిందేమంటే సుందరయ్య వీటిని కేవలం సేవా దృక్పథంతో చేసిన కార్యకలాపాలు గానే చూడలేదు. పాలకవర్గాల విధానాలకు వ్యతిరేకంగా ప్రజల చైతన్యాన్ని పెంపొందించే మార్గాలు ఇవి. ఈ కార్యకలాపాలను అప్రాముఖ్యమైనవిగా చూడటం విప్లవోద్యమంలో తప్పుడు ధోరణి అని ఆయన భావించేవారు.
మన పార్టీ రాజకీయంగా విడిపోయినప్పుడు ప్రజలతో మన సంబంధాలను ఎలా సజీవంగా ఉంచుకోవాలో సుందరయ్య నుంచి మనం చాలా తెలుసుకోవచ్చు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా మన పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఒంటరి పాటయింది. కమ్యూనిస్టులు ద్రోహులు అనే తప్పుడు ప్రచారం విపరీతంగా జరిగింది. ఆ రోజుల్లో బహిరంగ సభలు పెట్టడం కూడా కష్టమైపోయేది. అటువంటి పరిస్థితుల్లో పార్టీ చేసిన ప్రత్యేకమైన కృషి వల్ల మనల్ని ప్రజల నుంచి వేరుచేయడానికి పాలక వర్గాలు చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టడంలో విజయం సాధించగలిగాం. ఈ సందర్భంగా జరిగిన కార్యకలాపాల్లో ముఖ్యమైనది 6 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి నీరందించే బందరు కాల్వలో పూడిక తీయడం. 1944 మే లో 4000 మంది కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు 20 రోజుల పాటు యుద్ధ ప్రాతిపదికపై పని చేసి పూడిక తీశారు. సుందరయ్య స్వయంగా మట్టి తట్టలు మోశారు. సుందరయ్య తన సైకిల్ను ఆనుకుని నిలబడి పనులను పర్యవేక్షిస్తున్న ఫోటో నేటికీ ఆ మహత్తర కృషికి ఒక ప్రతీకగా ఉంది. కమ్యూనిస్టులు మాత్రమే ఇటువంటి పనులు చేయగలరు అంటూ ప్రజలు ఆ మహత్తర కృషిని కొనియాడారు.
అననుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు అనేక మంది గందరగోళంలో పడిపోయి విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు కూడా పార్టీనీ, ప్రజా ఉద్యమాన్ని కాపాడటంలో సుందరయ్య ఎంతో ధైర్యంగా, విశ్వాసంతో ముందుండే వారు. దీనికి సంబంధించి నేను రెండు సందర్భాలను ప్రస్తావిస్తాను. తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణచి వేయడానికి భారత సైన్యం తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించినప్పుడు కొందరు విశ్వాసం కోల్పోయి ఉద్యమం నుంచి చల్లగా జారుకున్నారు. కానీ సుందరయ్య సాయుధ దళాలతో ఉండి ఉద్యమాన్ని క్రమంగా ఉపసంహరింప జేయడంలో గొప్పపాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో పార్టీ, కార్యకర్తల భద్రత కోసం ఆయన ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. సాయుధ పోరాటాన్ని విరమించుకున్న తరువాత సుందరయ్య రహస్య జీవనం గడుపుతూనే అమర వీరుల కుటుంబాలను కలిసి ఓదార్చారు. ఉపసంహరణ తరువాత రహస్యంగా జీవించే కార్యకర్తలపై కేసులు ఎత్తి వేయించడానికీ, జైళ్లలో ఉన్న వారిని విడిపించడానికీ లేక అమరవీరుల కుటుంబాలను ఆదుకోడానికీ పదేండ్ల పాటు ఆయన తీసుకున్న శ్రద్ధ ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం.
1955లో ఆంధ్ర ప్రాంతంలో ఎన్నికల ఓటమి తరువాత పార్టీలో తీవ్రమైన నిరాశ ఏర్పడింది. 1952లో పార్టీ 21 శాతం ఓట్లతో 41 స్థానాలు గెలుచుకోగా, 1955లో మాత్రం 31 శాతం ఓట్లు వచ్చినా 15 స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది. పార్టీలోని ఒక సెక్షన్ ఓట్ల శాతం పెరుగుదల ప్రాముఖ్యతను గుర్తించకుండా నిరాశకు గురయింది. అప్పుల్లో కూరుకుపోయిన పార్టీ పూర్తికాలం కార్యకర్తలను కొనసాగించగలిగే స్థితిలో కూడా లేకుండా పోయింది. ప్రధాన నాయకత్వం పూర్తిగా నిరాశకు లోనై, ఈ పరిస్థితిని ఎదుర్కోలేక పార్టీ పూర్తికాలం పనిని వదిలిపెట్టి, జీవించడం కోసం ఇతర పనులు వెతుక్కోవలసిందిగా కార్యకర్తలకు పిలుపునిచ్చింది. సుందరయ్య ఈ ధోరణిని పూర్తిగా వ్యతిరేకించారు. నిధులు వసూలు చేసి కార్యకర్తలు బతకడానికి ఏర్పాట్లు చేయడం ద్వారా ఆ కష్ట కాలంలో వారికి విశ్వాసం కల్పించారు.
సుందరయ్య ఒక అసాధారణ ఆర్గనైజర్ అన్న విషయం అందరికీ తెలుసు. ఆయన ఉద్యమ తొలి నాళ్లలోనే ఆయనకున్న ఆర్గనైజింగ్ నైపుణ్యం వెల్లడయింది. 20 ఏండ్ల ప్రాయంలో ఆయన మొత్తం ఆంధ్ర ప్రారతం అంతా పర్యటించి అనేక కమ్యూనిస్టు శాఖలు, గ్రూపులు ఏర్పాటు చేశారు. 1935లో ఆయన 22 ఏండ్ల ప్రాయంలో కేరళ రాష్ట్రం మొత్తం పర్యటించి, స్వాతంత్య్రోద్యమంలోని ముఖ్యమైన నాయకులతో చర్చలు జరిపి అక్కడ కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తికి మార్గం వేశారు. అందువల్లనే ఆయన దక్షిణ దేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతగా పేరుగాంచారు. ఇటువంటి పాత్ర నిర్వహించారు గనుకనే ఆయనను 1934లోనే పార్టీ కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు. ఆ బాధ్యతలో ఆయన చనిపోయేవరకు ఉన్నారు. 1942లో ఆయన పొలిట్బ్యూరో సభ్యులైనారు. 1932లో తన గ్రామంలో తొలి వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించడం ద్వారా ఆయన దాని వ్యవస్థాపకుడైనారు. 1936లో అఖిల భారత కిసాన్ సభ స్థాపించడంలో సుందరయ్య ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన ఏఐకేఎస్ వ్యవస్థాపక సభ్యులు, దాని సహాయ కార్యదర్శి. 1955లో న్యూఢిల్లీలో పార్టీ అఖిల భారత కేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. సిపిఐ(ఎం) ఏర్పాటులో ఆయన అగ్రభాగాన ఉన్నారు. 1964 తరువాత అనేక ఒడిదుడుకుల మధ్య పార్టీని ముందుకు తీసుకుపోవడంలో సుందరయ్య పార్టీ ప్రధాన కార్యదర్శిగా తన నిర్మాణ దక్షతను ఉపయోగించారు.
ఆయన ఆంధ్రప్రదేశ్ను తన కార్య స్థానంగా ఎంచుకున్న తరువాత 1978లో ఆయనను నేరుగా కలిసే అవకాశం నాకు లభించింది. ఈ కాలంలో పార్టీని తిరిగి పట్టాలు ఎక్కించడంలోనూ, ముందుకు తీసుకు పోవడంలోనూ సుందరయ్య నిర్మాణ దక్షత ఎంతగానో తోడ్పడింది. 1964 చీలిక, 1967 నగ్జలైట్ విచ్ఛిన్నం, 1969లో వచ్చిన ప్రత్యేక తెలంగాణ, 1973 ప్రత్యేకాంధ్ర ఉద్యమాల వల్ల పార్టీ ఈ రాష్ట్రంలో బలహీన పడింది. పార్టీకి శిక్షణ పొందిన, నిబద్ధత గల కార్యకర్తలు కరువయ్యారు. ఈ లోపాన్ని సరిదిద్దడం కోసం ఎమర్జెన్సీ ముగిసిన వెంటనే 1977లో సుందరయ్య, ఎమర్జెన్సీలో ధైర్యంగా పనిచేసిన 2,800 మంది కార్యకర్తలను ఎంపిక చేసి రాష్ట్రంలోని అయిదు ప్రాంతాల్లో రాజకీయ తరగతులు నిర్వహించారు. ఆ విధంగా ఆయన రాష్ట్రంలో పార్టీ పెరుగుదలకు తోడ్పాటు నందించారు. వ్యవసాయ కార్మిక రంగంలోని కార్యకర్తలకు ప్రత్యేకంగా 10 రోజుల పాటు రెండు ప్రాంతాల్లో రాజకీయ తరగతులు నిర్వహించారు.
గ్రామ, ఫ్యాక్టరీ స్థాయిలో పార్టీ శాఖా కార్యదర్శుల పనితీరును మెరుగు పరిచేందుకుగాను 1980లో విజయవాడలో వారికి ఏడు రోజులు చొప్పున మూడు రాజకీయ పాఠశాలలను నిర్వహించారు. రాష్ట్రంలో ట్రేడ్ యూనియన్ ఫ్రంట్లో బలహీనత పార్టీలో పెద్ద లోపంగా ఉందని భావించి ఆయన దీనిపై లోతైన అధ్యయనం చేసి ఈ బలహీనతను అధిగమించేందుకు ఒక ప్రణాళిక రూపొందించారు. ఆయన నివేదికపై 1981లో జరిగిన రాష్ట్ర ట్రేడ్ యూనియన్ మహాసభ చర్చించింది. ఈ నివేదిక అమలు పరిచే కృషిలో ఉన్న టియు కార్యకర్తలకు 10రోజుల పాఠశాల నిర్వహించారు. విద్యార్థి రంగంలోని కార్యకర్తలకు 10 రోజుల పాటు పాఠశాల నిర్వహించడం అనేది రాష్ట్రంలో ఒక ఆనవాయితీగా మారింది. సుందరయ్య ప్రారంభించిన ఈ ఒరవడిని నేటికీ రాష్ట్రంలో అనుసరించడం జరుగుతోంది.
స్పాంటేనిటీ (సద్యోజనితం)ని సుందరయ్య వ్యతిరేకించేవారు. అది కమ్యూనిస్టులు వ్యక్తిగతంగా గానీ, లేక పార్టీ కమిటీలు గానీ స్పాంటేనిటీకి గురి కావడాన్ని అంగీకరించేవారు కాదు. నిర్ధిష్ట పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయడం దానికను గుణంగా పనిచేయడం ఆయన పని పద్ధతి. ఈ పని పద్ధతి గురించి పదేపదే నొక్కి చెప్పేవారు. ముఖ్యంగా కమిటీల్లో ఇటువంటి పని పద్ధతి ఉండాలనే వారు. వ్యక్తులు ఎంత నైపుణ్యం గలవారైనా కమ్యూనిస్టు ఉద్యమం వ్యక్తుల వల్ల ముందుకు పోతుందని సుందరయ్య ఏనాడూ నమ్మలేదు. పార్టీ మొత్తంగా చూసినప్పుడు 'అన్నిటికీ మించి గొప్ప ఆర్గనైజర్' అవుతుందని ఆయన అభిప్రాయం. కమిటీలు గనుక సమర్ధవంతమైన ఆర్గనైజర్లుగా పని చేస్తే వ్యక్తుల బలహీనతల నుంచి అదిగమించవచ్చు, ఉద్యమం ముందుకు పోతుంది.
ఉద్యమాలు, ఆందోళనల్లో పాల్గొనేవారికి రాజకీయ విద్య అందించడానికి సుందరయ్య ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమ ప్రారంభం లో 1937లో సుందరయ్య కొత్తపట్నంలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ తరపున నెల రోజుల రాజకీయ పాఠశాల నిర్వహించారు. మరుసటి సంవత్సరం మంతెనవారి పాలెంలో మరో నెల రోజుల పాఠశాల నిర్వహించారు. ఈ పాఠశాలలకు హాజరైన విద్యార్ధులు తరువాతి కాలంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు అయినారు. రాజకీయ పాఠశాలల ద్వారా శిక్షణ ఇవ్వాలని ఆయన సృష్టించిన వొరవడి రాష్ట్రంలో ఆయన మరణించే వరకు కొనసాగింది. ప్రస్తుతం ప్రజలు, ముఖ్యంగా విద్యార్ధులు, యువకులు రాజకీయ రహితంగా మారిపోతున్న తరుణంలో, సమాజంలోని విస్తృత ప్రజానీకంలోకి అస్థిత్వ రాజకీయాలు. మార్కెట్ మితవాదం లోతుగా చొచ్చుకు పోతున్న తరుణంలో మన కార్యకర్తలు, నాయకులు ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాజకీయ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం సుందరయ్య కాలంలో కన్నా ఇప్పుడు మరింత అవసరం.
ఆయన కార్యకర్తల పట్ల ప్రదర్శించే శ్రద్ధ, వాత్సల్యం గురించి అందరికీ తెలుసు. ఆయనను చూసి స్ఫూర్తి పొంది అనేక మంది కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చారు. కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం, ఎడ్యుకేట్ చేయడం విషయంలో ఆయన చాలా శ్రద్ధ తీసుకునే వారు. కార్యకర్తల ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులను గమనించి ఆయన తగిన సహాయం అందించే వారు. విప్లవోద్యమానికి కార్యకర్తలను అందించడంలో విద్యార్ధి రంగం ప్రాధాన్యత తెలిసిన ఆయన విద్యార్థి ఉద్యమాన్ని అభివృద్ధి చేయడం పట్ల చాలా శ్రద్ధ తీసుకునే వారు. ఆ రంగం నుంచి వచ్చే కార్యకర్తలను సాకేవారు. విద్యార్ధుల పట్ల సుందరయ్య చూపిన లాంటి శ్రద్ధ చూపడం ఇప్పుడు మరింత అవసరం. కొన్ని దేశాల్లో సోషలిజం కూలిపోయి, నయా-ఉదారవాదం తలెత్తిన తరువాత విద్యార్థి రంగం నుంచి కార్యకర్తలు రావడం బాగా తగ్గిపోయింది. ఈ ధోరణిని మార్చాలంటే మనం సుందరయ్య అడుగుజాడల్లో నడిచి విద్యార్ధుల నుంచి కార్యకర్తలను ఆకర్షించి, ఎడ్యుకేట్ చేసుకుని, అభివృద్ధి చేసుకోడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.