Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్తమాన కవిత్వంలోని ముఖ్య లక్షణాల్లో ఒకటి-శబ్ద చిత్రణ ద్వారా దృశ్యావిష్కారాన్ని సాధించటం. భావ వ్యక్తీకరణలో వినూత్న ప్రయోగాలు వస్తున్నాయి. కవిత్వ వస్తు గ్రహణంలో పరిశీలనాశక్తీ, భావ స్వీకరణంలో మూసకు భిన్నమైన అంశాలపట్ల ఆసక్తీ ఈనాటి కవుల్లో అధికంగానే కనిపిస్తున్నాయి. సమాజంలోని అస్తవ్యస్తత, అరాచకత్వం, అయోమయత్వం, వ్యవస్థాగతమైన ఉపేక్ష, అసమానత, అన్యాయం-వీటి సకల పార్శ్వాల్నీ కవిత్వపరం చేస్తున్నారు కవులు. సామాజిక సంక్షోభంలో కూరుకుపోయి 'మనిషి' చేస్తున్న ఆక్రందనల్నీ- నవీన అభివ్యక్తితో పారదర్శకం చేస్తున్నారు. ఇలా సమాజం-మనిషి వ్యాఖ్యానాల్లో విస్మయకరమైన దృశ్యీకరణం కనిపిస్తోంది. ఆ దృశ్యీకరణం ద్వారా సాధారణంగా కవిత్వంలో రసస్పురణ సోపానాలైన అనుభవం, ఆనందం, అనుభూతులకు పైనున్న 'అనిర్వచనీయత'ని చదువరులకు అందిస్తున్నారు. ఇప్పటికవిత్వంలో కనిపిస్తున్న ఈ గుణ విశేషాల స్థూల పరామర్శ-ఈ వ్యాస ముఖ్యోద్దేశం.
'వీడొక వరాహమిహురుడు / భూమికొక పద్ధతీ ఒద్దికా నేర్పుతాడు / బహుశా సూర్యుణ్ణీ, చంద్రుణ్ణీ ముట్టెతో ఆకాశానికి విసిరింది ఇతడేనేమో' (శివారెడ్డి) అనగానే, చదువరి మేధ-అవతారాల గురించిన తన తెలివిడిని పునశ్చరణ చేసుకుంటుంది. అది ఆలోచనని సముద్రం లోతుల్లోకి తోసేస్తుంది. సిమెంటు చేసినట్టున్న, చిట్టెంకట్టిన నేలను, తుంగ అల్లుకున్న నేలను వరాహం- తుంగ దుంపలకోసం-ఎలా కుళ్లగిస్తుందో చెబుతాడు కవి. ప్రతీకా త్మకమైన చిత్రణ! 'సచివాలయం / వెయ్యికాళ్ల జర్రి / కాళ్లన్నీ కదుల్తాయి/ నడక సాగదు' (ఎన్.గోపి) ఆక్టోపస్ లక్షణం- అధికార యంత్రాంగం రెడ్ టేపిజమ్' కళ్లముందు కదులు తుంది. అలాగే, 'వృద్ధాశ్రమంలో/మంచాలు పాతవే / వచ్చిపోయే వాళ్లు మారతారు' అంటారు ఎన్.గోపియే. స్పష్టంగా దృశ్యం కనిపిస్తున్నది.
'స్వీటు డబ్బా తెరిచేటప్పుడు / ఎవరో వచ్చి చెప్పారు / మీ తమ్ముడు యాక్సిడెంట్లో చనిపోయాడని / వాళ్లిటువచ్చారు / అతడటు వెళ్లిపోయాడు (ఆశారాజు) గుండె బిగుస్తుంది. సన్నివేశం, సంఘటనా ఏకతాటిపైకి వచ్చి వెన్ను చరుస్తాయి. చదువరి నోటమాట రాదు తనలోతను కుములుతూ ఉంటాడు. ఇదీ అనిర్వచనీయత.
'ఎక్కడో/ చనిపోయిన శవాల్ని/ పరగడుపునే మా యింటికి మోసుకొస్తుంది' (జనార్దన మహర్షి) అనగానే ఆ వార్తాపత్రిక చూపే హత్యలూ, ఆత్మహత్యలూ, సమాజంలోని బహిరంతర సంక్షుబ్ధ వికృతత్వం - శబ్దంలో నిశ్శబ్దమై మొహాన్న చన్నీళ్లని చల్లుతుంది.
'ఏమి కొలతలో ఏమి లెక్కలో/ ఇన్ని వడ్లు పోసుకుని/ ఈత యిత్తంత బెల్లం ముక్క రాల్చాడు/ అంగటాయన / నువ్వేడవకే తల్లీ అంటూ/ పిల్లనోట్లో శనత విత్తంత బెల్లం రాల్చి/ నువ్వు గింజంత తల్లి వేసుకుంది' (అడిగోపుల వెంకటరత్నమ్) 'రామా యణం పూర్తి కాలేదు' అని కవిత పేరు. సాధారణమైన మాటల కూర్పులో అసాధారణ మైన దృశ్య ప్రకటన, దానిలో ఆవిష్కరించిన ఆర్ద్రత. గుండె పలకమీద మేకు పెట్టి గీరినట్ల వుతుంది. అంతా తెలిసి, ఏమీ తెలియని వైరాగ్యం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇదీ అనిర్వచనీయత లక్షణం.
''ఇన్ని కాలాలు గడిచాయి/ నవరంగ్ టాకీసు పడిపోయింది/ స్నేహితురాలు వెళ్లిపోయింది. గులాబీ మాత్రం వాడిపోలేదు'' (రాజా హైదరాబాదీ). ఒక గతం-రెండు దుర్భర జ్ఞాప కాలు! ఛిద్రమైన నగర జీవితం, విషాదమైన మనిషి జీవితం! ఈ రెండింటి వెనుకనున్న సమాజం హౌరు చెవుల్ని దిబ్బెట వేయిస్తుంది. పురాజ్ఞాపకాలు నరాల్ని మెలిపెడుతూనే ఉంటాయి.
'గింజల వేటలో అలసిన 'వాడ' కోడీ / హామీ పత్రంపై సంతకం చేసినట్లు మూడు సార్లూ కూసేది / నిద్రమత్తు వదలకముందే / చిరుగులచీర కుచ్చెళ్లను బొడ్లో దోపి / చీకట్లను చిమ్మి వెలుతురుల్ని ఒళ్లంతా చుట్టుకొనేది' (విల్సన్రావు) 'ఇక అక్కడ్నించి మొదలు' - 'అమ్మజెండా'! ఇక్కట్ల ఝంఝని తట్టుకుని, దుర్మార్గపు ఆలోచనలకూ, ప్రవర్తనలకూ ఎదురొడ్డి ఆకాశమంత ధైర్యపు విస్తృతి ఎలా పరచిందో దృశ్యమానం చేస్తాడు, ఆ జెండాకు సెల్యూట్ చేయిస్తాడు - కవి.
'చెరువు గురించి మాట్లాడటమంటే, మా అమ్మ గురించి మాట్లాడటమే!' (బిక్కి కృష్ణ). 'నాకు మా ఊరంటే మా డాబాయే' (శశికాంత్ శాతకర్ణి).
'నిన్న ఇక్కడ / నేలలేదు / ఇవాళ మొలకెత్తిన విత్తనం నేలని తెచ్చింది' (మధునాపంతుల).
'ఒక కొండ, ఒక నది, ఒక చెట్టు / ఎప్పుడో వెళ్లిపోయిన జీవజాతులకు ఇచ్చే ఆతిథ్యం' (నిఖిలేశ్వర్). పర్యావరణంపై మనిషి చేస్తున్న దాడి పర్యవసాన ప్రతిఫలనాలు కనిపిస్తున్నాయి.
'గదినిండా పచ్చి నెత్తుటి వాసన / వెల్లకిలా శవం / హంతకుడే హత్యను నిర్ధారించబోతున్నాడు (కరీముల్లా). సామాజిక వివక్షా పరిణామాన్నీ; దాని వక్రీకరణ స్థితినీ దృశ్యమానం చేస్తున్నాడు కవి. చెప్పకయే చెబుతున్న నిరసన, తిరస్కారం అక్షరీకరణం చెందాయి.
'కన్నీటిబొట్లు కొన్ని చిదిమితే చిట్లిపోవు / వాటిలో చరిత్రలు, యుద్ధాలు, మానవా కాంక్షలు, మహాఘర్షణలు / శిలీభూతమై వుంటాయి' (ప్రసాదమూర్తి).
'జెండాలు రగిలిపోతున్నాయి / ఎజెండాలు మారి పోతున్నాయి. ఎవరి చితిని వారు పేర్చుకోండి' (రాచపాళెం). 'ఏది లేదో దానికే మూల్యం / దోసిలి నదిలో / గుప్పెడు ఇసుక / దిగంతాల అంచున ఊరిస్తుంది ' (దేవదానం రాజు).
-ఇలాంటివన్నీ సమాజంలో, సమాజంతో సంఘర్షిస్తున్న మనిషిలో నెలకొన్న అశాంతి ప్రతిఫలనాలు. కవుల అనుభవాల వాస్తవికతతో మిశ్రితమై చైతన్య కవిత్వ రసరేఖలైనాయి.
'కంచెలే చేలను కబళిస్తున్న దేశాన/ ఈ నీలసంక్షుభిత వాతావరణంలో/ జాతి చైతన్య మెట్లా మేల్కొంటుందో చూద్దామని/ ఆ వాక్యం ఇంకా చేతులు కట్టుకుని నిలబడే ఉంది' (పాపినేని శివశంకర్). వివేకానందుని మూర్తికీ, స్ఫూర్తికీ, జాతికి ఆయన సందేశించిన 'ఉత్తిష్ఠ!' సూక్తికీ సంవేదనాత్మక శబ్ద చిత్రణ ఇది.
కొన్ని సందర్భాల్లో ఏ విశ్లేషణకూ లొంగని సాంఘిక, ఆర్థిక పరిణామాల నీలినీడలు కవుల్ని ఆరాటపెడతాయి. లో అలజడి కలిగిస్తాయి. ఆ జ్వాల అక్షర సంచల నంగా కవిత్వమవుతుంది. 'కలుపు తీయడానికి పోయినప్పుడు/ కందిన నా వేళ్లు చూసి/ ఎట్టా బతుకుతావురా అని ఏడ్చేది మా అమ్మ.../ ఇప్పుడు ఇద్దరు పిల్లల తండ్రివై / ఇంత బతుకూ బతుకుతున్న/ నా సుతిమెత్తని అరచేతులు చూసి కూడా/ ఎట్లా బతుకుతావురా' అని ఏడుస్తుంది మా అమ్మ'' (దేవిప్రియ). తల్లి మనసు చేసే మల్లడిని వెల్లడి చేస్తున్న వాక్యంలో ఎంతటి ఆర్ద్రత! వ్యవస్థా వైఫల్యాల ధ్వని, వ్యక్తి నిస్సహాయతలో, నిట్టూర్పులో రాతికింది కప్ప అరుపులా వినిపిస్తోంది.
'మనిషిలో సుషుప్తమైన సర్వక్రూర మృగాలూ జాగృత మైన గ్రంథి/ ఇవాళ మనిషికి నవ గ్రంథులు కాదు / మరో కొత్త గ్రంథి చేరింది/ మానిసిని తిరగేసి సినిమాగా చేస్తున్న దశమ గ్రంథి / చిత్రగ్రంథి!' (సుధామ) కవిత అంతా శరీరంలోని గంధ గ్రంథులన్నీ ఎలా రీళ్లు రీళ్లుగా సెక్స్ హింసల రూప పరిణామం చెందుతున్నాయో చిత్రిస్తుంది.
ఇవన్నీ కూడా వేగంగా మారిపోతూవున్న మానవ విలువల వక్రీకరణలకీ, వక్రీభవనానికీ నిదర్శనాలుగా కవిత్వ పరమౌతున్నాయి. ఇంతటి అశాంతిమయ ఆవరణలో ఎక్కడన్నా ఒక చిరుదివ్వె ఉంటే ఎంత బాగుంటుంది. అది ఊహమాత్రమే కాదు, ఆశ. 'ప్రేమ వానై కురుస్తూ ప్రపంచపు సరిహద్దులను/ చెరిపేయడానికి/ పూనుకునే అతడిలా / అలా ఒకడు ఉన్నట్టుండి నడిచొస్తే/ ఎంత బావుండును!' అని భవిష్యదుజ్జ్వల గీతాన్ని పాడతారు - (పద్మావతి రాంభక్త). ఆ పిల్ల 'ఎన్నిసార్లు చూసినా/ ఏడుపురాని/ వయసురాని శాపంలా ఉండేది / ఇవాళ ఆశ్చర్యం / బాల్యాన్ని మొదటిసారి అనుభవిస్తున్న కేరింత/ ఆ పిల్ల బిగ్గరగా పట్టుకున్న పది రూపాయల నోటు/ పిల్లలకు వినపడేలా / గట్టిగా అంటున్నది / మా అయ్య/ పెరుగు కొనుక్కొమ్మన్నాడు!' (నందిని సిధారెడ్డి). పొట్టి పొట్టి వాక్యాలే. అవి వాచ్య శైలిలో బతుకు పొరని విప్పుతూ పోయిన మంచి పద్యం. చివరి విరుపు - ఒక సద్గతిలో దుర్గతికి చరుపు!
'సుభిక్షం పెదాల మీద/ సున్నా చుట్టిపోతున్నా / ఆధుని కంలోకి అడుగేయలేకపోవటం/ పురాస్మృతులు కల్పించే దౌర్భాగ్యం (కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి). 'యుద్ధం చేసేవాడికి కన్నీటి విలువ తెలిసినట్టు/ వలస పోయే వాడికి కన్నీటి విలువ తెలుస్తుంది. ఊరు విడిచేట ప్పుడు నేనో కన్నీటి మూటని' (సంగెనేని రవీంద్ర). 'తొలుస్తున్నావు కదరా / జ్ఞాపకాల బెరడును/ గతాలనుసి రాల్చుతూ/ పచ్చని జీవితకాండను/ ఆవిష్కరిస్తున్నావు'' (జి.వెంకటకృష్ణ). సుదీర్ఘమైన వాక్యాలతో స్మృజనాత్మక సంవేదనలు ఇలా అనిర్వచనీయతా ప్రవాహాలవుతాయి.
దృశ్యీకరణంలోని అనిర్వచనీయత-హృదయ సంబంధ మైనది. అదికూడా ఏ భాషకూ లొంగనిది. అది శబ్దం ఇస్తున్న అర్థం వెనక్కు నడిచి నిశ్వబ్దం / చేస్తున్న సంగీతాన్ని వినగలగటం! ఈ గుణ విశేషాన్ని చదువరులకు పంచుతున్న కవులందరూ అభినందనీయులే!
విహారి
98480 25600