Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నిజం' ఒక ప్రత్యేకమైన కవి. వారికి ఈ వ్యవస్థ మీద కోపం ఎక్కువే ఉంది. ఈ సమాజం మీద సానుభూతితో కూడిన అసహనం ఉంది. నడుస్తున్న 'చరిత్ర'ను వారు నిశితమైన దృష్టితోనే చూస్తున్నారు. సున్నితమైన వ్యంగ్యాన్ని ఆశ్రయించి కూడా వారు తమ భావాలను ప్రకటించగలరు. డాక్టర్ జనన మరణాల ప్రవేశ నిష్క్రమణ ద్వారాలకు దగ్గరగా ఉన్నట్లే, పాత్రికేయుడు ప్రపంచ పరిణామాల తొలి వార్తలకు చేరువలో వుంటాడు. ఇవి తనకు కూడా వర్తిస్తాయని పాత్రికే యునికి తెలుసు. సుమారు అర్ధ శతాబ్దంగా పత్రికా రంగంలో వుంటున్న జి. శ్రీరామమూర్తి 'నిజం' కలం పేరుతో దాదాపు అప్పటి నుంచీ కవిత్వం రాస్తున్నారు. చాలా ఆలస్యంగా రెండేళ్లనాడు 'నివురు' అన్న కవితా సంపుటి వేసి తమ ఉనికిని చాటుకున్నారు. ఇప్పుడు 'నాలుగో పాదం' కవితా సంపుటి వేసి తమ విశిష్టమైన వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నారు. వృత్తిని ప్రేమించిన వారు కావటం వల్ల డెబ్బయి దాటిన వయసులో కూడా పైలాపచ్చీసు చైతన్యంతో పాత్రికేయులుగా కొనసాగు తున్నారు. పని చేసిన పత్రికల్లో ఉన్నత స్థానాలలో వుంటూ సేవలందిస్తూ వస్తున్నారు. వృత్తి ప్రభావం కూడా వారి కవిత్వం మీద లేకపోలేదు. పాత్రికేయుడు అతిసామాన్య పాఠకుడికి నిబద్ధుడు. తాను రాసేదంతా అందరికీ సుస్పష్టంగా అర్థం కావాలి. కవి అయిన వాడిని కవిత్వంలో అలంకారాలు, వర్ణనలు, ప్రతీకలు వంటి ఎన్నో అంశాలు ఊరిస్తుంటాయి. వార్తల్లో పెట్టలేని వీటిని తమ కవిత్వంలో పెట్టి తృప్టి పొందటానికి నిజం' వంటి కవులకు అవకాశం వుంది. నిజం' కవితా వస్తువు పూర్తిగా సమకాలికం. వస్తువును విమర్శనాత్మకంగా చూడటం వారి నైజం. కథనం ప్రత్యేకంగా వుండాలను కుంటారేమో కొంత అస్పష్టత కూడా వుంటుంది. చిన్న పాదాలు, నవ పద సృష్టి, అది వరకు లేని పదబంధాలు కనిపిస్తాయి.
తన సాటి మనిషి నిత్య చైతన్యవంతుడై వుండాలని కవి వాంఛ అట్లా వుండక మందమతులుగా ప్రవర్తిం చటాన్ని ఇష్టపడక పోవటం కాదు, అసహ్యించు కుంటారు. అదే అనేకాకి' (పే.9) కవిత. ఏకాకి' అన్న మాటకు ఉపసర్గ చేర్చి పున:సృజన చేసి పది మందిలో ఒంటరివాడన్న భావాన్ని సాధించారు.
కాడి మోతకు అలవాటుపడి
కొరడాకు తలవంచుతారు
నాయకుడి కోసం
అర్రులు చాస్తారు'
ప్రజలు జంతువు స్థాయికి దిగజారటాన్ని, తామే చొరవతో నాయకత్వ స్థానాన్ని అందుకోక ఎవరో వస్తారని' ఎదురు చూడటాన్ని ఒప్పుకోరు.
బెదురు గాలి' (పే.13) కవిత చూడండి. కారులో న్యూజ్ పేపరు'ను చదవాలనుకుంటున్న గాలి
న్యూజ్ పేపర్
పైట చెంగును
పట్టి గుంజుతోంది'
అక్షరాల చనుబాలు
తనివారా తాగాలని
శీర్షికలను ముద్దాడి
కబుర్ల కమనీయతను
ఆస్వాదించాలని'
అనుకున్నది. కాని దానికి ఎదురైంది మాత్రం
మూక దాడుల్లో
హతులైన వారి ఎగసిన
నులివెచ్చని రక్తం'
అంతే, గాలి' ఆ బీభత్సాన్ని భరించలేక మూర్ఛ పోయింది.
మొదటి నుంచి ఒక పద్ధతిలో ఈ సన్నివేశాన్ని నిర్మించుకుంటూ వచ్చారు 'నిజం'. ఇక్కడ పాఠకుడికి ప్రతీకగా వున్న గాలి ఈ సమాజానికి ప్రాణ వాయువు. అతడికి నడుస్తున్న చరిత్ర'ను వినిపించే దినపత్రిక తల్లిలాంటిది. ఇది అరుదైన ప్రతీక. ఎవరూ దినపత్రిను తల్లిగా వర్ణించి, అక్షరాలను చనుబాలుగా రూపకం చేసి ఉండరు. దాదాపు 50 సంవత్సరాలుగా దిన పత్రికల్లో పని చేసిన నిజం వంటివాళ్ళు తల్లిగా సంభావించి రుణం తీర్చుకుంటున్నారు. ఈ సన్నివేశంలో కవిత రాజకీయ మైన మలుపును తీసుకున్నది. మతపరమైన వైషమ్యంతో మూక దాడులకు పాల్పడడంతో ప్రజలు నిలువునా చీలిపోయే పరిస్థితి వచ్చిందన్నది కవి భావం.
'భావాగ్ని' (పే.16) స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు సంబంధించిన కవిత. బంధితులుగా వున్న వాళ్ళు ప్రజా వ్యతిరేకులు కారు. వాళ్ళు వ్యవస్థను పురోగమన పథంలో నడపగలరు.
ముళ్ళ కంచెలకు మృదుత్వాన్ని అద్దగలిగే పూలు
పంజరాలకు పలుకులు నేర్పే చిలుకలు
పాములను పరిమళింప చేయగల మొగలి పొదలు
విత్తనాలకు కాయటం పూయటం నేర్పిన నేల'
ఇట్లా వ్యవస్థ పాశవికంగా మారినప్పుడు దాన్ని ప్రేమాభిమానాలతో తనవైపు తిప్పుకునే శక్తి బంధితులకు వుంది. అయితే, ఈ మార్గం పని చేయకపోతే జైళ్ళూ తిరగబడతాయి' అంటూ విప్లవ మార్గాన్ని ధ్వన్యాత్మకంగా సూచిస్తున్నారు.
చిలుక పలుకులు' అన్న పదబంధాన్ని చిలుక ములుకులు' (పే 27) గా కాయిన్ చేసి రాసిన కవితలో చిలుక అనుకరణ మాత్రమే తెలిసిన మెదడు లేని జీవికి ప్రతీక. అతడు తనను పొగిడే మాటలను నేర్పి, వాటిని ఆ చిలుక పునరుక్తం చేస్తుంటే ఉబ్బి పోతాడు. తాను బయటకు వెళ్ళిన తర్వాత ఇంటి వాళ్ళు తనను తిట్టే తిట్లను కూడా అది నేర్చుకొని వాటిని తనకు వినిపించ సాగింది. దీన్ని సహించలేక పంజరంతో పాటే చిలుకను అమ్మేశాడు! అతడు పొగడ్తల పంజరంలో బతుకుతున్నాడు. నిజానికి అతడున్నది తెగడ్తల లోకంలో. మంచి చెడులను తెలుసుకునే వివేకం లేనిది చిలుకకు కాదు, అతనికి.
భగల్స్' (పే.14) కవితలో మూడు దృశ్యాల లేదా సందర్భాల కథనం సాగింది. మొదటిది ప్రజల మధ్య సమాచార లోపం ఏర్పడింది. అందుకు సాంకేతిక కారణాలు వుండవచ్చు. సిగల్స్ను బాగు చేసే వ్యవస్థ నిర్వీర్యమయింది. రెండవది ఓట్లను కాజేసి' అధికారం చేజిక్కించుకున్న తర్వాత పాలకులు పాలితులను పట్టించుకోవటం లేదు. అంటే, ప్రజాపక్షంగా పాలన జరగటం లేదు. పాలకులకు, పాలితులకు మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి. మూడవది ఆర్ద్ర హృదయాల యువతీ యువకుల మధ్య ప్రేమాను రాగాలు చిగురించి అలాగే వుండిపోతున్నాయి. అసహజ మైన అపార్థాలు ఇందుకు కారణం. మొత్తం మీద సమాజంలో సమస్య నెలకొని వుంది. ప్రజల మధ్య సంబంధాలు భగ' మవుతున్నాయి. ఇదే ఈ కవితా వస్తువు. సిగల్' అన్న మాట మనకు తెలిసిందే. దానికి వ్యతిరేకమైన భావాన్ని భగ' శబ్దం సహాయంతో సునాయాసంగా సృష్టించుకోవటం నిజం' ప్రత్యేకత.
జీవించటానికి, అందులో ఆత్మగౌరవంతో, మనిషి దనంతో జీవించటానికి ఎన్నో కావలసి రావచ్చు. వాటిల్లో ధైర్యం ప్రధానమైనది. అదే దారి' (పే.33) కవిత.
ఆవురావురుమనే
చావునోట్లో
మన్ను కొట్ట గలగడమే
మజా అంటాను'
అందరూ నడిచే దారితో ఇబ్బంది లేదు. నడవ వలసిన దారి మాత్రం సవాళ్ళతో కూడి వుంటుంది. సవాళ్ళకు భయపడకుండా ముందుకు సాగటానికి ముందు మనసులో ధైర్యమనే దారిని వేసుకోవాలి. అందుకే పూలబాట'లో ప్రత్యేకత ఏమీ లేదు. రంపపు దారిలో' పయనించటం ద్వారానే తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకునే అవకాశం ఉంటుందంటున్నారు.
ఇతర కవులకు వస్తువు కాజాలనివెన్నో ఈ కవికి కవితా వాహికలయ్యాయి. రాలిపోయిన పూల లాంటి భావాలెన్నో వుంటాయి. వాటిని ఏరుతుంటే దోసిళ్ళు రక్తసిక్తమవుతాయి. ఇట్లా సాకారం కాని భావాలతో గాయపడ్డ శరీరాల గుట్టల మూలంగా సజీవ శవ పేటిక దేశం' అంటున్నారు. ఇట్లా అనటంలో వేదన వుంది, వాస్తవం వుంది. ఇట్లాంటి బీభత్సాన్ని నిజం' వస్తువుగా ఎంచుకున్నారు. ఒక్కోసారి సామాజిక భావజాలాన్ని కలిగి వుండడం, వుండకపోవటం కూడా వస్తువవుతుంది.
నాలుగో పాదం' సంపుటిలోని కవితల్లో కొన్ని విశిష్టమైనవి, మరి కొన్ని కవి జీవత చక్రపు జాడల్లో కలిసి పయనించేవి వున్నాయి. అట్లాంటి వాటిలో లైఫ్ సైకిల్' అనే పేపర్ బారు వస్తువుగా వున్న కవిత ప్రత్యేకంగా పేర్కొనదగింది. ఇది ఒక రకంగా ఒకే నిచ్చెన మీద పై మెట్టు మీద వున్న వ్యక్తి కింది మెట్టు మీద వున్న వ్యక్తి మీద రాసింది. ఇంటింటికి పేపర్ వేసే టీనేజ్లో వున్న పిల్లవాడి జీవిత చక్రం వుందీ కవితలో
తోకూపుకుంటూ వెళ్ళే
పెంపుడు కుక్కలా
వేకువ అతడిని
అనుసరిస్తుంది'
వేకువ పెంపుడు కుక్క అయిందంటే, ఆ పిల్లవాడికి ఆ వృత్తి ఎంతగా అలవాటయిందో తెలుస్తున్నది. దాన్ని కవితాత్మకంగా చెప్తున్నారు నిజం'.
చంద్రునికి జోలపాడి
సూర్యుడిని
నిద్ర కళ్ళతోనే లేపి
జేబులో వేసుకొని
బయలు దేరుతాడు'
అనటంలో ప్రకృతి సాక్షిగా వస్తువు కవితాత్మకంగా స్థిరపడిపోయింది. సైకిల్ పెడల్ మీదనే తొలి పాదాలు', తొలి పాఠాలు కూడా పత్రిక కుటుంబ జీవితంలోని అవిభాజ్య అంశంగా మారటాన్ని కూడా చెప్తూ, ఆ పిల్లవాడి ఆహారపు అన్వేషణ' నిరంతరంగా సాగేదే తప్ప ఆగేది కాదు అని సూచిస్తున్నారు నిజం'.
కవిని ప్రకృతి పట్ల వున్న ప్రేమానురాగాలు అడుగడుగునా వ్యక్తమవుతాయి. ఈ సంపుటిలో చాలా కవితల్లో చెట్లు, పక్షుల ప్రస్తావన వుంది. పహారా' (పే. 73) కవిత
చెట్లు మాట్లాడుకునే వేళ
హరిత సంభాషణ శాల'
అంటూ మొదలవుతుంది. చెట్లు మాట్లాడుకోవటం మాత్రమే కాదు. ఆ సంభాషణశాలకు హరిత' అంటూ సహజమైన రంగును విశేషంగా వేయటం కవి తాదాత్మ్యతను సూచిస్తున్నది. ఈ కవితలో చెట్లు మాట్లా డుకోవటం', పగటి గాయాలకు లేపనం రాసుకోవటం', తమను ఆశ్రయించుకొని బతికే పక్షులను వేటగాళ్ళ నుంచి కాపాడే పహారా'లో వుండటం వంటి మానవీకరణ భావనలు పచ్చగా కనిపిస్తాయి. అసమానమైన భావు కతను కూడా 'నిజం' ప్రదర్శిస్తారు. పక్షులను 'అడవి సరస్సున హంసలు' అనటం ఇట్లాంటిదే.
పూల కన్నీళ్ళు' (పే. 87) ఒక అద్భుతమైన కవిత. అడవి బిడ్డలైన ఆదివాసీల ముగ్ధస్నిగ్ధ మానవీయత, అడవితో మమేకమైన మానసిక జీవితం అక్షరాలయ్యాయీ కవితలో
వారి చిరునవ్వులు
మొక్కల పెదాల మీద
మొగ్గలవుతాయి'
అన్న ఎత్తుగడ చాలు, హరితవనానికి, ఆదివాసీకి మధ్య వున్న అవినాభావాన్ని చెప్పటానికి. అయినా వాణిజ్య పారిశ్రామిక వర్గాలు, ప్రభుత్వాలు కుడి యెడమల దగా' వ్యూహంతో వారి ఉసురు తీయటానికి పూనుకుంటున్నాయి. తమ ఉనికి పట్లయిన అడవులు, కొండలు అన్యాక్రాంతమైన తర్వాత
తల్లిలేని బిడ్డల ఆక్రందన విని
పొగిలి ఏడ్చే చెట్లు
పూల కన్నీళ్ళు
రాలుస్తున్నాయి
రైతు బాధ చూడలేక
గుండెలు బాదుకొని
నేల బీటలు వారుతుంది'
మనిషి పట్ల ప్రకృతి స్పందన మానవీయంగా వుంది. కవి మూలాలు, కవి యౌవన కాలపు నైసర్గికాలు ఇందుకు హేతువులు.
వికృతి' (పే.114) కవిత ప్రకృతి గానం కూడా. బతుకు పడవకు/ రూపమిస్తుంది' అన్నప్పుడు ప్రకృతి. జలవాయు హస్తాలతో/ నిలువునా ముంచుతుంది' అన్నప్పుడు వికృతి. ఒకే నాణెం బొమ్మాబొరుసులనే తాత్వికతను చెప్తూ
తనను జయిస్తున్న
మనిషితో అప్పుడప్పుడూ
క్రూర పరిహాసాలు'
అంటూ ముగింపు పలుకుతున్నారు. ఈ క్రూర పరిహాసం'లో కరోనా కూడా ఉండవచ్చు!
కవిగా సంయమనం పాటిస్తూ, సామాజిక విమర్శ కునిగా సత్యాగ్రహం ప్రకటిస్తూ, ఒక పౌరుడిగా ప్రజా స్వామ్యాన్ని విశ్వసిస్తారు 'నిజం'. అక్షరాల మూలాలు జీవితంలో వున్నంత కాలం నిజం' వంటి కవులు ప్రజల కోసం రాస్తారనటానకి ఈ సంపుటే సాక్ష్యం.
ప్రముఖ రచయిత తల్లావఝల శివాజి ఈ సంపుటికి వేసిన ముఖ చిత్రం చాలా విలువైనది. ప్రతి కవితకు వారు వేసిన చిత్రం ఆ కవిత చివరి పాదంగా చెప్పుకోవచ్చు.
- అమ్మంగి వేణుగోపాల్, 9441054637