Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''గుండె కింది తడి'' నుండి ''అంతర్వాహిని'' దాకా పదకొండు కవితా సంకలనాలను వెలువరించిన నేటి మేటి కవి, కాళోజీ అవార్డు గ్రహీత శ్రీ కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారు నేడు ''హరిత స్వప్నం'' అంటూ మన ముందుకు వస్తున్నారు. పచ్చదనం అంటే కేవలం ప్రకతిలో మాత్రమే కాదు, ప్రతి మనిషి జీవితంలో ఉండాలని ఆశిస్తున్నారు.
వీరు ఏ కళంకం అంటని స్వచ్ఛమైన పచ్చని లోకాన్ని కలగంటున్నారు. ముఖ్యంగా మనిషి ఓ చెట్టయితే తప్పా కల నిజం కాదని విన్నవిస్తున్నారు. అందుకే ''చెట్టయిపోండి'' అంటూ మొదటి కవిత ద్వారానే వారు కలగంటున్న లోకాన్ని మన కళ్ళ ముందు ఉంచారు. సమాజానికి ఆదర్శం చెట్టేనని ఉద్బోధిస్తున్నారు. హరిత స్వప్నానికి మకుటంగా నిలిచే కవిత ఇది అని చెప్పక తప్పదు.
నిటారుగా నిలబడ్డ చెట్టు
ఎవని పాదాలకు సలాం చెప్పదు!
కాయలు కాసిన చెట్టు
ఎవరెన్ని రాళ్లు విసిరినా
ద్వేషం ప్రకటించదు!
దుమ్మెత్తి పోసుకుంటున్న నేతలారా
ఎదలో ఒక చెట్టును నాటుకోండి!
ఎవరికైనా ఆదర్శం ఒక్క చెట్టేనని చెప్తున్నారు.
సమాజాన్ని కష్టాల పాలు చేస్తున్న ఏ విషయమైనా తన కలం ద్వారా ఎండగడుతారు. వర్తమాన సంఘటనల్లో ఏ విషయమైనా ఖచ్చితత్వం పాటిస్తూ వాస్తవాన్ని మనముందు ఉంచుతున్నారు.
ఒకవైపు నీళ్లు, మరోవైపు పచ్చదనం మధ్యలో సమాజ స్థితిగతులతో కవిత్వపు నడక సాగిస్తారు.
సూక్ష్మ పరిశీలన దష్టితో, వాస్తవాన్ని సూటిగా చెబుతూనే, సున్నితమైన కవిత్వంగా మలుస్తారు.
కవిత్వపు నడక ఒక ఎద స్పందనలా వినిపి స్తుంది. ముఖ్యంగా తెలంగాణ, నీళ్లు, ప్రకతి, సమాజం, రాజకీయం, వాస్తవ సంఘటనలు కనిపిస్తాయి.
మొదట తెలంగాణ విషయానికి వస్తే ప్రజలు తమ రాష్ట్ర కలను ఎలా సాకారం చేసుకున్నారో చెప్తారు.
''ఎవరికి వారుగా మనం
పాయలు పాయలుగా ప్రవహిస్తుంటే
ఏకం చేసిన ఉద్యమ స్ఫూర్తి''తో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తీరును ''ఉద్యమ స్పర్శ'' అనే కవితలో తెలియజేస్తారు.
తెలంగాణ సాధన తర్వాత మన నీళ్లు మనవైపు ఎలా మలుపు తిరిగి మన చెరువులు నిండాయో చెబుతూ...
''ఆత్మగౌరవ పతాకమెగిరేసాక కదా
నదులు వెనక్కి మళ్లి
చెరువులను కుంటలను కౌగిలించు కుంటున్నది''
''మండు వేసవిలో
అలుగెత్తుతున్న వందేళ్ల గణపసముద్రం
బిడ్డను చంకలో పెట్టుకొని దేశమంతా తిరిగాం'' అంటూనే...
''నావేమీ నీటి రాతలు కావు
నీళ్ళే బంగారు తెలంగాణకు బాటలు వేసేది అంటారు.
ఇకపై కరువొక జ్ఞాప కంగా మిగిలిపోతుందం టారు'' అంతకంటే కావల సింది ఏముంది!
''విడిపోతే అంతా చీకటిమయమే అన్నవాళ్ళు ఈ వెలుగును ఏ కంటితో చూస్తారు?'' అంటూ విడిపోవడం ఇష్టంలేని వాళ్ళను ప్రశ్నిస్తారు.
ఇక వర్తమాన సంఘటనలు, సమస్యలను, రాజకీయ సంబంధ విషయాలను చూస్తే...
ప్రభువులు ప్రజలకు అన్ని విషయాల్లో, అవసరాల్లో ఉచితాలు అలవాటు చేయడం ఎలా ఉంటుందంటే
''ఉచితాలకు అలవాటుపడ్డ దేశం
లేదంటే రాదా కోపం
బానిసత్వానికి సరికొత్త రూపం!'' అంటూ ప్రజలను ఎలా బానిసలుగా, సోమరులుగా మార్చే కుట్ర చేస్తున్నారో చెబుతారు.
స్త్రీని ఆలయంలోకి రానివ్వకుండా చేయడమంటే, మన జీవితాల్లోకి రానివ్వకపోవడమే, మన జీవితాల్లో ఆమె లేని చోటు లేదు. అలాంటిది
''ఆమె ప్రవేశమే అంత మలినమైతే
ఈ దేశాన్ని దేనితో సంప్రోక్షణ చేస్తారు?'' అంటూ ప్రశ్నిస్తున్నారు.
విడగొట్టడానికి పుట్టినవి భక్తి, కులమతాలు. ప్రజల్లో నాగరికత, చదువు పెరిగినా కూడా అవి మళ్లీ మొదటికి తెస్తున్నాయి.
''ఆకలికి ఆకులా రాలినా
ఉలుకూ పలుకూలేని జనం
మతం పేరెత్తితే చాలు తెగ ఊగిపోతారు!'' అంతటి మూర?పు స్థితిలో ప్రజలు ఉంటున్నారని చెబుతున్నారు. కులమతాలేవి కూడు పెట్టవని తెలుసుకోలేక పోతున్నారు. అందుకే
''వివాదాల్లో పవిత్ర స్థలాలను లాగుదామా
మానవ సమాధులు విస్తరిస్తాయి'' అని హెచ్చ రిస్తున్నారు. నేటి నాయకులంతా ఎలా ఉన్నారంటే, అంతా దేశాన్ని శవాన్ని చేసి పేలాలేరుకునే బాపతే, కేవలం అధికార మార్పిడికే ఇంత హంగామా చేస్తారు. అందుకే...
''ఎవరో ఒకరు
చేత కాగడా పట్టంది
జెండాలు మార్చే చీకట్లు
ఈ దేశాన్ని వదిలి పెట్టవు! అంటారు. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని జెండాలు మార్చినా ప్రజల చీకట్లు మాత్రం తొలగిపోవని చెబుతున్నారు.
''నేల పచ్చగుంటేనే'' బతుకు పచ్చగుంటదని
వాన చినుకులు మన జీవితంలో ఎలాంటి మార్పులు, అనుభూతులను తీసుకువస్తాయో చెబుతారు
''ఒక్క వానచినుకు ఎంతపని చేసింది
మట్టికి మనిషికి చెట్టుకు పిట్టకు
అర్థించ కుండానే అన్నింటికీ
ఒక భరోసా గీతాన్ని రాసిచ్చింది'' అని కతజ్ఞతా భావాన్ని వెలిబుచ్చుతారు.
''అమ్మలేని ఇల్లు'' ఎంత శూన్యంగా ఉంటుందో వర్ణిస్తారు. అందుకే అమ్మలా ప్రేమించమంటారు. అలా అమ్మలా ఉంటే
''ఎదుటి వాళ్ళు తిన్నా
మన కడుపు నిండిపోతది'' అంటారు.
జీవితంలో విజేతలైనా స్నేహంలో ఎంత కమ్మదో చెబుతూ
''హౌదాలో తేడా ఎంతైనా ఉండనీ
పునాదుల్లో పచ్చిగా మిగిలిన ఆకలి గీతం'' వినిపిస్తూనే ఉంటుంది అంటారు. ఆ బంధమే చాలా ఏళ్ళకు కలిసినా, విడిపోకుండా స్నేహితులను నిలుపుతుంది.
ప్రకతి తన ధర్మాన్ని తాను పాటిస్తుంది. మనిషి మాత్రం అధర్మంగా జీవిస్తుంటాడు. అందుకే
''మనిషినే
మనిషిగా బతకమని
చట్టాలుండటం విషాదమే'' ఇంతకన్నా దురదష్టం ఇంకేం ఉంటుంది. అది మనిషి చేసుకున్నదే. ప్రతిఫలం అనుభవించక తప్పదు.
''తరువు లేని చోట'' కవితలో
ఎన్నడూ రాని ఆలోచనను రేకెత్తిస్తారు.
''మొక్కలు నాటడం
మన ఘనకార్యమేమీ కాదు
అది ఒట్టి ప్రాయశ్చిత్తమే'' ఇంతకన్నా ఇంకేముంటుంది చెప్పడానికి.
ఎవరి నడక వారిది, ఎవరి కష్టం వారిది, ఫలితం కూడా వాళ్లదే. అనుభవమే మనిషికి పునాదులు వేస్తుంది.
''పాదాలు నేలమీద ఉన్నంతవరకు
ఎవరి దయాదక్షిణ్యాలు అక్కర్లేదు
ఎన్నడో ఒకనాడు ఆకాశం పాదాక్రాంతమవుతది'' అనే ఆశయం ప్రతిఒక్కరిలో ఉండాలనే ''సత్యాసత్యాలను'' గుర్తు చేసారు
కవిత్వం కోసం ఆరాటపడే నేటి కవులకు ఒక చురక అంటిస్తారు ''జ్ఞాపకాలు'' అనే కవితలో...
''ఉడికీ ఉడకని వాక్యాలను
యావతో అచ్చుకు పంపుతున్నప్పుడల్లా
మహాకవి మాటల్తో కొరడా ఝుళిపిస్తాయి''
ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో అనుభవానికి వచ్చే ఉంటాయి వీరి కవితా పంక్తులు.
కవి అనేవాడు ఒక ''వెలుతురు పిట్ట'' లాంటి వాడని అతను...
మట్టిలో దాక్కున్నా విత్తే
గుండె తడిసిందా
కొత్త మొక్కయి మొలుస్తాడు
అలాగే...
నివురుకప్పిన నిప్పే
ఎక్కడ కాలినా
ఇక్కడ చైతన్యమై విరుస్తాడు! అంటూ కవికున్న గుణాన్ని ఆవిష్కరిస్తారు.
''కవిత్వం ఆటవిడుపు కాదు
సకల సంవేదనలకు పుటం పెట్టనిదే
అక్షర తపస్సు ఫలించదు'' అంటూ కవి తన ''కవన శీలత''ను మన ముందుంచుతారు.
అలాగే చిన్నపిల్లలపై, స్త్రీలపై జరిగిన అత్యాచారాలను, నోట్ల రద్దును, ప్రణరు హత్యను ఖండిస్తూ రాసిన కవితలు, మహానటి సావిత్రి, మహాకవి సినారె, మహాత్మా గాంధీ గురించి రాసిన కవితలు, కవిత్వం, పక్షులు, వాకిలి, మౌనం, ,బతుకమ్మ, పెత్తరమాసపై రాసిన కవితలు ఆలోచింప జేస్తాయి, అలరింపజేస్తాయి.
ముఖ్యంగా కోట్ల గారు నీటిని, మట్టిని, చెట్టును వదలని నిరంతర కవి.
ఇక శైలి విషయానికి వస్తే శైలిలో సరళత ఎప్పటికీ ఉంటుంది. రుబాయిలు, గజల్, ప్రపంచపదుల లక్షణాలు శైలిలో ప్రస్ఫుటమౌతాయి. ప్రతి కవితలో చివరగా ఏదో ఒక రూపంలో మెరుపును అందిస్తారు. ఒక ప్రకష్టమైన వాక్యంగా ముగింపు గొప్పగా ఉండేటట్లు రాస్తారు. అది వీరి ప్రత్యేకత.
పాలపిట్ట బుక్స్ ద్వారా ప్రచురితమైన ఈ పుస్తకానికి ముందుమాటగా ఆచార్య బన్న అయిలయ్య గారు రాస్తూ ''కోట్ల కవితా రచనను తపస్సుగా భావించారు. కనకనే సజనోత్సాహంతో నేటి వరకు సాహితీ వితర్థిపై నిలిచారు. నాటి నుండి నేటి వరకు వర్తమాన సమాజ వాస్తవికతే కోట్ల కవితా వస్తువు. అది విశ్వ వ్యాప్తమైన మానవీయతలాగా పరిధులు లేనిది'' అంటారు.
అలాగే ముందుమాటలో మరో కవి గుడిపాటి గారు చెబుతూ ''కవిత్వం రాయడం ద్వారా తనకు తెలిసీ తెలియకనే ఒక చారిత్రక పాత్రని పోషిస్తాడు కవి. వర్తమాన సమాజాన్ని, దాని సంక్లిష్టతల్ని, సంవేదనల్ని కవిత్వం చేస్తారు. తద్వారా కవిగానే కాక చరిత్రకారునిగా కీలకమైన పాత్రను పోషిస్తాడు. ముఖ్యంగా సమాజం పట్ల బాధ్యత, మనుషుల పట్ల అవ్యాజమైన ప్రేమ గల కవి ఈ కర్తవ్య నిర్వహణలో నిరంతరం మెలకువగా ఉంటాడు'' అని అంటారు.
వీరి ''హరిత స్వప్నం'' బాధ్యత గల ప్రతి ఒక్కరి స్వప్నం. అది నిజమవ్వాలనే ఆశయం కలిగిస్తుంది. వీరి కవిత్వాన్ని చదివితే సమాజంపట్ల అవగాహన, ఆలోచన మొదలౌతుంది.
- పుట్టి గిరిధర్
9491493170