Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వలసయుగం తర్వాత వినిపించిన అతి బలమైన స్త్రీవాద స్వరం కమలాదాస్ సురయ్య. ఆమె మాతభాష మలయాళం. ఇంగ్లీషులో కూడా ఆమె విస్తతంగా రాశారు. మలయాళ పాఠకులకు ఆమె మాధవీ కుట్టీ. ఇంగ్లీషు పాఠకులకు కమలా దాస్. ఇస్లాం స్వీకరించిన తర్వాత సురయ్యా అని పేరు మార్చుకున్నారు. ఆధునిక భారత ఆంగ్ల కవిత్వానికి ఆమె మారుపేరుగా పేరు పొందింది. నిర్భీతి, నిస్సంకోచం ఆమె కవిత్వానికి మారుపేర్లు.
'సమ్ వన్ ఎల్స్ సాంగ్' పేరుతో ఆమె 1965లో రాసిన కవితలో బహుశా ఆమె తన గురించి, తన ముందున్న జీవితం గురించి చెప్పుకుందా అనిపిస్తుంది.
''నేను లక్షలాది ప్రజలు
అందరూ ఒకేసారి మాట్లాడుతుంటారు
రణగొణధ్వనుల స్వరాలు
ఊరి బావి వద్ద ఆడవారిలా..''
నిజమే. ఆమె అనేక జీవితాలు జీవించిన కవయిత్రి. ఆమె కవిత్వం అమె అంతరాంతరాల విస్ఫోటనమా అనిపి స్తుంది. ఆమె పుట్టింది కవులు, రచయితల కుటుంబంలో. 1934 మార్చి 31న ఆమె పుట్టింది. తల్లి పేరు బాలమణి అమ్మ. ఆ కాలంలో ఆమె గొప్ప కవయిత్రి. 25 కవితా సంపుటులు ఆమె రాసారు. ఆమె మేనమామ నలపత్ నారాయణ మీనన్ కూడా కవి, అనువాదకుడు. అలాంటి కుటుంబంలో పుట్టిన కమల చాలా కాలం కలకత్తాలో కూడా ఉన్నారు. ఆమె తండ్రి అక్కడ పనిచేసేవారు. కేరళలోని పున్నయుర్కులం వారి స్వగ్రామం.
ఆమె చాలా చిన్న వయసులోనే రాయడం ప్రారంభిం చింది. 15 సంవత్సరాల వయసులో తన కన్నా చాలా పెద్దవా డయిన దగ్గరి బంధువుతో ఆమెకు వివాహమైంది. ఆరేళ్ళ వయసులోనే రాతప్రతిగా ఒక పత్రిక ప్రారంభించింది. అందులో ఆమె విషాద కవితలు రాసేది. పాత ఆటబొమ్మలు, విరిగి పోయిన ఆటబొమ్మలు, తలలు పోయిన ఆటబొమ్మలు అలా తలల్లే కుండా శాశ్వతంగా ఉండిపో యాయి... ఇలా ఉండేవి అప్పట్లో ఆమె రాసిన కవితలు. ఆమె సోదరుడు ఆ కవితలకు బొమ్మలు వేసి పెట్టేవాడు. కాస్త పెద్దయిన తర్వాత తన సోదరుడితో కలిసి పిల్లల ధియేటరు కూడా ఆమె ప్రారంభించింది. కాళిదాసు శాకుంతలంతో పాటు అనేక నాటకాలు ఆ ధియేటర్లో ఆ పిల్లలు వేసేవారు. తమ ఇంటిలోనే స్టేజి నిర్మించి నాటకం ప్రదర్శించేవారు. ఊరి వాళ్ళు వచ్చి చూసేవారు. ఆమె జీవితాన్ని పరిశీలిస్తే ఎల్లప్పుడు తనను తాను పునర్నిర్మించుకోవాలనే ఒక తపన కనిపిస్తుంది.
ఆమె కవిత్వాన్ని పరిశీలిస్తే, వైవాహిక జీవితంలోని సంక్లిష్టతలను బట్టబయలు చేసిన కవిత్వం. బాల్యం, లైంగిక జీవితం, ప్రేమ, కామం ఇవన్నీ ఆమె రచనల్లో ఉన్నాయి. 1976లో ఆమె రాసిన 'మై స్టోరీ' పెద్ద సంచలనమయ్యింది. చాలా తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి. చాలా మంది విభేదించారు. కాలక్రమేణా ఆమె రచనల్లోని వాస్తవాన్ని, ఆమె రచనాశైలిలోని సౌందర్యాన్ని గుర్తించారు. భారతదేశంలో సెక్సు గురించి నిస్సంకోచంగా మాట్లాడిన మొదటి మొదటి మహిళ ఆమె. అంతేకాదు, వివాహం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన మొదటి మహిళ కూడా ఆమెయే. వైవాహిక జీవితం, సంప్రదాయాలు, కట్టుబాట్ల గురించిన పట్టింపులు చాలా గట్టిగా ఉన్న కాలంలోనే ఆమె ఇవన్నీ మాట్లాడింది. 'మై స్టోరీ'పై చాలా విమర్శలు వచ్చాయి. అశ్లీలంగా ఉందని అన్నారు. ఇలాంటి రచనలు వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తాయని చాలా మంది మండిపడ్డారు.
కాని, అంతర్జాతీయ విమర్శకులు ఆమె రచనాశైలిని ప్రశంసించడం కూడా అదే సమయంలో జరిగింది. ఆమె 'మై స్టోరీ' రాయడానికి కారణం స్వయంగా ఆమె జీవితమే. ఆమె బాల్యం స్థిరమైన జీవితం లేదు. ఇటు కేరళ, అటు కలకత్తాల మధ్య రెండు ముక్కలైంది. తర్వాత వివాహం కూడా ఒక విషాదంగానే గడిచింది. ఒక మహిళగా బతకడమనే బరువు చాలా దుర్భరమయ్యింది. ఒప్పుకోలు ప్రకటన వంటి రచనలో ఆమె తన లైంగిక జీవితాన్ని కూడా రాసుకుంది. తన భర్తకున్న అనాసక్తి గురించి రాసింది. ప్రేమ కోసం ఆమె తపన గురించి రాసుకుంది.
ఇవన్నీ ఆమె కవిత్వంలో మనకు కనిపిస్తాయి. ''లుకింగ్ గ్లాస్'' అనే కవితలో ఆమె శరీరాన్ని అర్పించడం గురించి రాసుకుంది.
''అతనికి కానుకగా అన్నీ ఇచ్చేరు
నిన్ను స్త్రీగా చేసినవన్నీ కానుకగా ఇచ్చేరు,
పొడవాటి కురుల సువాసన
రొమ్ముల మధ్య చమట కస్తూరీ
రుతుస్రావ రక్తపు వెచ్చని కుదుపు
నీకు సంబంధించిన అన్ని
స్త్రీత్వపు ఆకళ్ళు..''
ఆమె భర్త బ్యాంకు ఉద్యోగి. భర్తతో కలిసి బాంబే వెళ్ళింది. ఒక భార్యగా ఆమె విషయంలో భర్తకు అసంతప్తి ఒకవైపు, మరోవైపు తనకు ఎంతో ఇష్టమైన రచనను కొనసాగించే తాపత్రయం. ఇవన్నీ చిన్నవయసులోనే భరించింది. ఆమె కుటుంబం, సమాజం ఆమెకు స్త్రీ కర్తవ్యాల గురించి చెప్పేది. భార్యగా, తల్లిగా ఆమె బాధ్యతలను గుర్తు చేసేవారు. అప్పటి జీవితం గురించి ఆమె ఇలా రాసుకుంది.
''ఒక మహిళ తానేమిటో రుజువు చేసుకునే ముందు తాను మంచి భార్యగా రుజువు చేసుకోవాలి. మంచి తల్లిగా రుజువు చేసుకోవాలి. అంటే అనేక సంవత్సరాల పాటు వేచి ఉండాలి. నాకు సహనం లేదు. అందుకే నేను చాలా చిన్నప్పుడే రాయడం ప్రారంభించాను. నిజానికి నా అదష్టం బాగుంది. కుటుంబ ఆదాయం నేను కూడా కాస్త పెంచుతున్నానని నా భర్త మెచ్చుకున్నాడు. కాబట్టి రాత్రులు రాసుకునే అనుమతి ఇచ్చాడు. ఇంటి పనులు అన్నీ చేసిన తర్వాత, పిల్లలకు అన్నాలు పెట్టిన తర్వాత, ఆయనకు అన్నం వడ్డించిన తర్వాత, వంటగది శుభ్రం చేసిన తర్వాత, నేను తెల్లారే వరకు కూర్చుని రాసుకోవచ్చు. ఇలా రాయడం వల్ల నా ఆరోగ్యం దెబ్బతింది.''
వివాహం తర్వాత ఒక వస్తువుగా మాత్రమే మారి పోయి, ఇంటికి ఖైదీలైపోయిన అనేకమంది మహిళలకు ఆమె తన గొంతునిచ్చే కవిత్వం రాసింది. తన కవితల ద్వారా మహిళలుకూడా పురుషుల్లాగే మనుషులేనని, వారికి కోరికలుంటాయని, బాధలు, అనుభూతులు ఉంటాయని ప్రకటించింది. ఆమె రచనల్లో రుతుస్రావ వర్ణన, ప్యూబర్టీ, ప్రేమ, కామం, లెస్బియన్ సంబంధాలు, బాల్యవివాహాలు, అక్రమ సంబంధాల గురించి వర్ణనలు చాలా ఎక్కువ.
ఆమె రాసిన కవిత ''ఎ విడోస్ లేమెంట్'' లో పురుషాధిక్య సమాజంలో మహిళ ఒంటరితనం గురించి రాసింది. ఎందుకంటే ఇక్కడ ఒక స్త్రీకి స్థానమే లేదు.
''ఇది ఎల్లప్పుడు
మరొకరి ప్రపంచమే, నాది కాదు
నా మొగుడు, నా కొడుకులదే అసలు పాత్ర
నేను, ఒక భార్యను, తల్లిని
వారి కన్నుల గాజు ఫలకాలపై పైకెదుగుతుంటాను''
ఆమె రాసిన ''యాన్ ఇంట్రోడక్షన్'' అనే కవితలో స్త్రీ పురుష పాత్రల పరిధుల్లో జీవించడం పట్ల తన విసుగున ప్రకటించింది. ఈ పరిధి నుంచి బయటపడే తన కోరికను ప్రకటించింది.
''..... ఆ తర్వాత నేను ఒక షర్టు తొడుక్కున్నాను. .... జుట్టు కత్తిరించుకున్నాను...
చీరలు తొడుక్కో... అమ్మాయిలా ఉండు.. భార్యలా ఉండు.. వాళ్ళరిచారు.
ఎంబ్రాయిడరీ నేర్చుకో, వంట చేరు, నౌకర్లతో పోట్లాడు''
ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆమె కాలమిస్టు అవతారం ఎత్తవలసి వచ్చింది. ఎందుకంటే, కవిత్వం కన్నా కాలమ్ రాయడంలో ఎక్కువ డబ్బు ముడుతుంది. కొంతకాలం కవిత్వం వెనక్కు వెళ్ళింది. మలయాళనాడు వారపత్రికకు క్రమం తప్పకుండా రాసేది. ఆమె స్త్రీత్వం గురించి తన అనుభవాలను వర్ణించింది. ఎలాంటి దోషభావం లేని నిజాయితితో మాట్లాడింది.
ఆధునిక భారత సాహిత్యంలో అత్యుత్తమమైన రచనలు ఆమె కలం నుంచి వచ్చాయి. ఆమె రాసిన నవల ''అల్భాబెట్స్ ఆఫ్ లస్ట్'' (1977), కవిత్వ సంపుటి 'సమ్మర్ ఇన్ కలకత్తా' (1973), ఇంకా అనేక గొప్ప రచనలు. అప్పటి వరకు పాఠకులకు తెలియని స్త్రీ లైంగికతను ఆమె పరిచయం చేసింది. ఆమె సాహిత్య కషికి అనేక అవార్డులు వచ్చాయి. 1963లో ఆసియన్ పోయట్రీ ప్రైజ్, 1969లో కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, 1985లో జాతీయ సాహిత్య అకాడమీ అవార్డులే కాదు, 1984లో నోబుల్ బహుమతికి కూడా ఆమె పేరు ప్రతిపాదించబడింది. ఫ్రెంచ్, జర్మన్ తదితర విదేశీ భాషల్లోకి కూడా ఆమె రచనలు అనువాదమయ్యాయి.
ఆమె జీవితంలో చేసిన ప్రతి పని వివాదాస్పదమే. ఆమె కవిత్వం నుంచి చిత్రలేఖనానికి మారింది. నగచిత్రాలు గీసింది. ఈ చిత్రాలు మరో వివాదానికి కారణమయ్యాయి. తొంభయ్యవ దశకంలో ఆమె ఇస్లాం స్వీకరించడం మరో వివాదమయ్యింది. ఇస్లాం స్వీకరించి ఆమె సురయ్యాగా పేరు మార్చుకుంది.
1967లోనే ఆమె 'ది డిసెండెంట్స్' అనే కవిత్వ సంపుటి ప్రచురించింది. 1973లో 'ఓల్డ్ ప్లే హౌస్' అనే కవిత్వ సంపుటి ప్రచురించింది. వివాహంలో విషాదాన్ని ఆమె నిస్సంకోచంగా రాసింది.
''నేను
ప్రేమ కోరాను
ఇంకేం అడగాలో నాకు తెలియదు
అతను, పదహారేళ్ళ పడుచును పడగ్గదిలోకి తీసుకెళ్ళాడు
తలుపు మూసాడు
అతను నన్ను కొట్టలేదు
కాని నా విషణ్ణ స్త్రీ శరీరం చావుదెబ్బ తిన్నది''
ఆమె కాలం కన్నా చాలా ముందు కాలానికి చెందిన రచనలు ఆమె రాసింది. నిస్సంకోచంగా స్త్రీ లైంగికత్వం గురించి రాసింది. జమైకా, సింగపూర్, లండన్ ఇలా అనేక చోట్ల ఆమె తన కవిత్వం వినిపించింది.
1984లో ఆమె రాజకీయాల్లోకి కూడా వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. ఆ తర్వాత ఇస్లాం స్వీకరించింది. ఆమె ఎన్నడూ స్త్రీవాద ఉద్యమాల్లో లేదు. తన్ను తాను స్త్రీవాదిగా కూడా చెప్పుకోలేదు. కాని ఆమె కవిత్వం స్త్రీవాద కవిత్వమే. ఆమె స్త్రీవాదియే. ఆమె వ్యవస్థపై నిరంతరం పోరాడింది. తాను అనుకున్నది చేయడానికి ఎవరు అడ్డుకున్నా ఒప్పుకోలేదు. 2009లో ఆమె 75 సంవత్సరాల వయసులో, తన కవిత్వాన్ని మనకిచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది.