Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రచయిత మానసిక వేదనలు సమాజం లో వున్న అసమానతలతో సంఘర్షించి నప్పుడు పుట్టుకొచ్చిన ఉల్కా పాతమే అయోధ్యారెడ్డి గారి ఈ ''అక్కన్న పేట రైల్వే స్టేషన్'' కథల సంపుటి.
కాలంతో ప్రయాణం... అంటే కను పాపల నిండా కలల్ని నింపుకొని ఓడ ప్రయాణం లాంటిది. మనిషి జీవితం. సంఘర్షణా పూరిత మైన పాత్రికేయరంగం, జీవితం రచయితకు గొప్ప బలాన్ని ఇచ్చింది.
మానవ సంబంధాలు, విలువలతో మనిషి నిత్య ప్రవాహంలో జీవితం కొనసాగు తుంది. ఈ విలువలతో పెన వేసుకున్న మాలిక అయోధ్యారెడ్డి గారి ''అక్కన్నపేట రైల్వే స్టేషన్''.
వేళ్ళూనుకున్న దొరతనం, భూస్వామ్య వ్యవస్థ నశించినా ఇంకా ఆ పెత్తందారితనం రూపం మార్చుకుని మనుషులను పట్టి పీడిస్తూనే వుంది. తెలంగాణ పోరుగడ్డగా అభివర్ణిస్తాం. తెలంగాణలో నిజాం వ్యతిరేక ఉద్యమం, భూస్వామ్య వ్యవస్థ వ్యతిరేక పోరాటం, తెలంగాణ తన అస్తిత్వాన్ని చాటి చెప్పే తెలంగాణ తొలి, మలి ఉద్యమాలు పూర్తిగా 60ఏళ్ల నుండి ఉద్యమాలతో ఊపిరి తీసుకున్న గడ్డ ఇది. పోరుకు భయపడ లేదు, ఓటమిని గూర్చి ఆలోచన లేదు, అట్లాంటి గడ్డ మీద నుండి ఉద్భవించిన కథలేఇవి.
సామాజికంగా వచ్చే మార్పులను గమనిస్తూ,ఆ మార్పు లలో లోటు పాట్లను ఎత్తిచూపగలిగేవాడు రచయిత. నిష్పక్ష పాతంగా తన బాధ్యతను నెరవేర్చేవాడు రచయిత. దానికి ఎన్నుకున్న ఆయుధమే సాహిత్యం. మోడ్రన్ సాహిత్యం అనగానే కల్పితాలు, అద్భుతాలు, వాస్తవానికి దూరంగా, కాల్పనికతకు దగ్గరగా వుంటుంది. కాని ఈ కథలు తెలంగాణ వాస్తవిక జీవన యానంలో మిళితమైనవి. సామాజికంగా అనేక కోణాల్లో పరిశీలనాత్మకంగా సాగిన కథలు ఇవి.
''అక్కన్నపేట రైల్వే స్టేషన్''కు వెళ్తే అక్కడ ప్రతి మనిషి వెనక ఒక్కొక్క కథ ఉంటుంది. ఆత్మ శ్రయంలో సాగినకథ ''చావువాసన'' వీరయ్య పాత్ర... పాత్ర అనరాదు. వీరయ్యతో ఆధునిక సమాజంలో నేటి తల్లిదండ్రుల దీనమైన పరిస్థితిని సమాజం గుండెల్లోకి పాతాలగరిగె వేసినట్లు చిత్రించారు. చిత్రణ అనడం కంటే మనలను ఆ కథలో ''నేను'' పాత్రను చేసాడు. ప్రతికోణం నేటి సమాజానికి అద్దం పడుతుంది. కథ అనడం కంటే సమాజం కనపడుతుంది. రండి ఒకసారి అయోధ్యారెడ్డి గారి అక్కన్న పేటకు పోదాం. కష్టం అనే పదానికి నిర్వచనం తెలియని వయసు. ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన కష్టం ఏందో. ఆ పరిస్థితి నుండి అమ్మలేని వెంకటేశానికి మత్యువు చివరి అంచులకు వెళ్ళినప్పుడు దొరికిన అమ్మ కథను చదవాల్సిందే. అక్కన్న రైల్వే స్టేషన్ అనంగానే మనం చిన్నప్పుడు రైల్వే స్టేషన్లో రైళ్లు పట్టాలు మారిన తీరుకు ఆశ్చర్య పోయే పిల్లలు, పట్టాల మీన రేకు తీరు పలచగా అయిన పది పైసలకు దారం గట్టి చక్రందిప్పుడు, ఎన్ని జ్ఞాపకాలను పదిల పరుచుకుందో ఈ రైల్వే స్టేషన్ అనిపిస్తుంది.
'వానతో తన సర్వస్వం పోగొట్టుకున్నట్టు ఆకాశం నీలంగా దీనంగా చూస్తుంది'. ఇట్లాంటి భావ చిత్రాలతో కథల మధ్య మధ్యలో, మనకు రచయితలో దాగి ఉన్న కవి కండ్లముందుకు వస్తాడు. కథలలో పాత్రలకు ఎంతోభావుకత నిండి ఉంటుంది.
''పేగుముడి'' కథ ఎత్తుగడలోనే ఒక భావ చిత్రంతో కథను మొదలు పెట్టారు. కొలకలూరి ఇనాక్ గారి కథానికలో ఒక కప్ప రోడ్డు మీదచితికి చిత్తడై వుంటుంది. వానలో కథనంతటినీ ఒక చిత్రంతో పాటు మనకు ముందుగా అందించడం. ''పేగుముడి'' మనసు పొరలలో దాగివున్న ఆనందం, భయం, చేసిన తప్పులు కొన్ని స్వప్నాల రూపంలోకి మారిపోతాయి. కొన్ని మనలను వెంటాడుతాయి. వేదనాగీతాన్ని ఆలపిస్తాయి, ఆనందతాండవం చేస్తాయి. పేగుముడి కథలో సావిత్రి కడుపులో పాప భూమిపై వుండాల్సిన ప్రాణం దేవలోకంలో వుండి, ఆ తరువాత అమ్మను చూడాలనుకోవడం, భ్రూణహత్యకు గురి అయిందని తెలుసు కొని అమ్మను ప్రశ్నించడం.. ఆ ప్రశ్నలు మొత్తం మనకు సూటి గా గుచ్చుకుంటాయి. చదువులేక, భర్త ఆదరణ లేక ఆమె తన మూడవ బిడ్డను చంపలేక ఆమె తీసుకున్న నిర్ణయం పాఠకుడిని ఉలిక్కిపడేలా చేస్తుంది. సావిత్రి లాంటి స్త్రీలు ప్రతి క్షణం ఎదురవుతూనే వుంటారు. ''ఆమెలోని నది'' ఈ కథ మన ఊర్లె చిన్నప్పుడు నీకే జరిగిందా అనిపిస్తుంది చినబాబు పాత్రలో మన లను మనం ఆవిష్కరించుకొనేలా సాగుతుంది. ''ఆమెలోని నది'' టైటిల్ కూడా కథలాగే సన్నగా ప్రవహిస్తూ అందంగాను అనేక కష్టాలను దాచుకుంటూ ప్రవహించే ఆమె జీవితం నదియే మరి.
''ఏన్ అనాధరైజ్డ్ లవ్ స్టోరీ'' ప్రేమ పేరుతో మోసపోయే ఆడపిల్లలకు కారణాలు అంతస్తు కావచ్చు. కులం, మతం, ఆకర్షణ ఏమైనా కావచ్చు. ఇట్లాంటి అమాయకమైన పల్లె పిల్ల అరవింద చిన్నప్పటి నుండి కలిసి ఆడిపాడినా చివరికి పెళ్లి అనే విషయానికి వచ్చేసరికి కులం అనేపిచ్చి ఎంత ప్రాధాన్యత ను సంతరించుకుంటుందో చూపిన కథ. మనిషి ఎంత చదువు కున్నా, కులతత్వంలో మార్పురాని మనుషుల గురించి ఎత్తి చూపిన కథ ఇది.
''నీడను పట్టుకున్నవాడు'' ఈ కథ వాస్తవానికి, కల్పనకు మధ్యగా ఒక సన్నటి తెరలాంటిది.ఈ తెరను ఆధారంగా చేసు కుని ఊహకే వదిలిన ఈ కథ భిన్నమైనది. కథ వెనుక మనమూ పరిగెడుతూ ఎక్కడా ఆగకుండాసాగిపోతుంది రాఘవ ఆత్మకథ.
''పాముల నడుమ చీమ'' శీర్షికను పెట్టడంలో ప్రత్యేకత రచయితది.ఒకనాటి తెలంగాణను ప్రతిబింబంచే కథ ఇది. పల్లె... ఆ పల్లెకు బాలీరు గారడీకి వచ్చే విధానం, అతను బండిని నడిపేవిధానం, అక్కడి నుండి పల్లెకు చేరుకోవడం అక్కడ వాతావరణంలోకి ఆ పల్లెకు మనలను తిస్కపోయి, రావిచెట్టు కింద నిలబెడుతుంది. రచయిత కథనం. గారడీ కోసం ఊర్లె ఒకప్పుడు ఎంతగా ఎదురు చూసేవారు, ఎంతగా ఆదరించేవారు.. కాని ఆ గారడీ ఎనక ఎంత వెత దాగివుందో చూపించాడు రచయిత. అన్మంతరావు దొరతనానికి కాలం తీరిపోయినా, ఆ పెత్తందారీ రక్తం ఇంకా బాలేరును ఎంతగా హింసిస్తుందో.గుండెకోసుకుంట పోయిన తీరును ఆ కథనంను చివరివరకు రచయిత అట్లే నడిపిస్తడు.
ప్రజలు దొరకు వ్యతిరేకంగా వున్నా దొర ఏది చెప్తే అదే నమ్మే అమాయకపు జనం వున్నంతకాలం అన్మంతరావు లాంటి దొరలు పుట్టుకొస్తనే ఉంటారు.అయోధ్య రెడ్డి గారి కధలన్నీ సమాజంలోని అట్టడుగున దాగిన వెతలను,జీవితాలను ప్రతిబింబిస్తాయి. లంచం ద్వారా వచ్చే డబ్బుతో భార్య కోరికలు తీర్చాలనుకొని భంగపడే భర్తలు, కూతురిని గొప్పింటికి పంపించాలనే ఆశలో వాళ్ళ బ్రతుకులను అడవి పాలు చెసే తండ్రులు, ప్రేమ పేరుతో ఆడ పిల్లలను లోబరుచుకొని మోసం చేసే యువకులు,తాగుబొతు తండ్రి పెట్టే బాధలు పడలేక ఆత్మహత్యకు ప్రయ త్నించే తల్లిలేని వెంకటేశులు, వద్దా ప్యంలో అనాధలయ్యే కొడుకు లున్న వీరయ్యలు, వెట్టిలోనే పుట్టి వెట్టిలోనే శవాలయ్యే కొమురయ్యలు ఇలా సమాజంలోని విభిన్న ఘర్షణల మధ్య నలిగే సజీవ పాత్రలను ఈ కథా పుస్తకం ద్వారా మన ముందు ఉంచారు అయోధ్యారెడ్డి గారు.
- సీహెచ్. ఉషారాణి, 9441228142