సమాచార హక్కు చట్టం
ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, ప్రజలే పాలితులు. ప్రజలకే ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. సమాచార హక్కు చట్టం పాలనలో పౌరులు భాగస్వామ్యాన్ని పెంచి, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని అందిస్తుంది.
నూతన ప్రజాస్వామ్య దేశాల్లో సమాచార హక్కు అనేది సామాన్యుడి చేతిలో వజ్రాయుధం. ప్రభుత్వ పాలన పారదర్శకంగా, జవాబుదారీతనంగా రూపొందడానికి, ప్రజలకు ప్రభుత్వ పని తీరు, విధానాలపై సమగ్రమైన అవగాహన కల్పించేందుకు సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుంది. తద్వారా ప్రభుత్వ పాలనలో అవినీతి అక్రమాలు తొలగి దేశం ప్రగతిపథం వైపు పయనిస్తుంది.
ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెంపొందించి పరి పాలనా వ్యవహారాల్లో గోప్యతను నివారించి ప్రభుత్వ పాలన విధానాలను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు పౌరు లకు కల్పించిన అద్భుతమైన అవకాశమే సమాచార హక్కు.
సామాచారాన్ని ఇవ్వడం ప్రభుత్వబాధ్యత అయితే దాన్ని పొందడం పౌరుల హక్కు. ఇది ప్రభుత్వ పాలనలో బాధ్యతాయుత విధానానికి అవకాశాన్ని కల్పిస్తుంది.
1. పాలనలో పౌరులు పాల్గొనగలరా?
2. ప్రభుత్వ పథకాల సమాచారాన్ని పౌరులు ఎలా పొందగలరు?
3.ప్రజలకు సమాచారాన్ని బహిర్గతం చేయవచ్చునా?
4. ప్రభుత్వం న్యాయబద్దంగా వ్యవహరిస్తుందా?
అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే సమాచార హక్కు చట్టం ఒక సువర్ణ అవకాశం. (జవాబు లాంటిది)
సమాచార హక్కు చట్టం-చరిత్ర :
ప్రపంచంలో మొట్టమొదటి సారిగా సమాచార హక్కు చట్టాన్ని అమలు పరిచిన దేశాలు స్కాండినేవియన్ దేశాలు.
- పారదర్శక ప్రభుత్వ పాలనే లక్ష్యంగా తొలిసారిగా 1776 సం||లో స్వీడన్ సమాచార హక్కు చట్టాన్ని రూపొందించి మిగిలిన దేశాలకు ఆదర్శంగా నిలిచింది.
- ఆ తరువాత 1951లో ఫిన్లాండ్, 1971లో నార్వే, డెన్మార్క్, 1966లో అమెరికా సమాచార హక్కును చట్టబద్దం చేశాయి.
భారతదేశంలో సమాచార హక్కు :
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత దేశం. ప్రభుత్వం ప్రజాప్రతినిధుల పని తీరుకు సంబంధిం చిన సమాచారాన్ని పౌరులకు తప్పనిసరిగా అందించాల్సిం దేనని 1976లో రాజ్నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సమాచార హక్కు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని పేర్కొంది.
భారత రాజ్యాంగంలోని సమాచార హక్కు గురించి ప్రత్యక్షంగా పేర్కొనలేదు. అయితే ప్రాథమిక హక్కులలోని ప్రకరణ 19(1ఎ)లో సమాచార హక్కు అంతర్గతంగా ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పులో వెల్లడైంది.
రామన్ మెగసెసె అవార్డుగ్రహీతలు సందీప్పాండే, అరుణారారు, అరవింద్ కేజ్రీవాల్, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడైన జయప్రకాష్ నారాయణ్ కృషి ఫలితంగా మన దేశంలో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించారు.
- అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2002లో సమాచార స్వాతంత్య్ర చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టంలోని లోపాలను సవరించి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని 2005 జూన్ 15న రాష్ట్రపతి, ఆమోదముద్ర పొంది 2005 అక్టోబరు 12 నుంచి జమ్మూకాశ్మీర్ మినహా దేశవ్యాప్తంగా అమలు చేసింది.
- జమ్మూకాశ్మీర్ రాష్ట్రం ప్రత్యేకంగా సొంత చట్టాన్ని 2004 లో రూపొందించుకుంది. దీనిని రద్దు చేసి 2009లో కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చింది.
- సమాచార హక్కు చట్టంలో 6 అధ్యాయాలు, 31 సెక్షన్లు ఉన్నాయి.
- పాలనతో పారదర్శకతను సాధించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం
ముఖ్యాంశాలు :
సమాచారహక్కు చట్టంలోని సెక్షన్ 2(జె) ప్రకారం ప్రభుత్వ పాలనకు సంబంధించిన 17 రకాల సమాచారాలను పౌరులు పొందవచ్చు. అవి..
1. రికార్డులు 2. పత్రాలు 3. సలహాలు 4. అభిప్రా యాలు 5. ఈ -మెయిల్స్ 6. నివేదికలు 7. మెమోలు 8. కాంట్రాక్టులు 9. ఆర్డర్లు 10. లాగ్ పుస్తకాలు 11. సర్క్యూలర్లు 12. పత్రిక ప్రకటనలు 13. రాత పుస్తకాలు 14. నమూనాలు 15. మోడల్స్ 16. ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న గణాంకాలు 17. అమల్లో ఉన్న చట్టాలు ప్రకారం ప్రభుత్వ అధికారికి అందుబాటులో ఉండే ప్రయివేటు సంస్థల వివరాలు
సమాచారం పొందే విధానం
ఈ చట్టం ప్రకారం ప్రత్యేకంగా ఏ వ్యక్తి కోరకపోయినా, ప్రతి సంస్థ స్వచ్చంధంగానే కొంత సమాచారాన్ని ప్రచురించాలి.
- ఇంగ్లీషులో కాని, హిందీలోకాని తెలుగులో కాని, రాజ్యాంగం గుర్తించిన వివిధ భాషల్లోకాని సమాచారాన్ని కోరవచ్చు.
- సమాచారాన్ని ఎందుకు అడుగుతున్నారో కారణాలను, తెలియజేయాల్సిన అవసరం లేదు. అలాగే సమాచారం అడిగే వ్యక్తి తన వ్యక్తిగత వివరాలను చెప్పనవసరం లేదు. అయితే సమాచారం ఏ చిరునామాకు పంపాలో తెలియజేయాల్సి ఉంటుంది.
- ప్రతి శాఖలోనూ ప్రభుత్వం నిర్దేశించిన పౌర సమాచార అధికారి నుంచి సమాచారం పొందవచ్చు.
- సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 5(1) ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజా సమాచార అధికారి / సహాయ ప్రజా సమాచార అధికారి ఉంటారు.
ెసమాచారం కోసం ఎవరిని సంప్రదించాలో తెలిపే బోర్డులను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలి. దీని ద్వారా పౌరులు సంబంధిత అధికారి నుంచి సమాచారాన్ని పొందవచ్చు.
నమూనా దరఖాస్తు - చెల్లించాల్సిన రుసుము :
- సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తుకు నిర్దిష్ట నమూనా అనేది లేదు.
- సమాచారం కోసం తెల్ల కాగితంపై విన్నపం అని రాసి ఇస్తే సరిపోతుంది.
- గ్రామ స్థాయి సంస్థలకు దరఖాస్తు రుసుము లేదు. (ఉచితం). మండల స్థాయిలో రూ.5, కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిలోరూ.10 చెల్లించాలి.
- జీఓ ఎం.ఎస్ నెం.740 ప్రకారం సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 7(3) ప్రకారం దరఖాస్తు రుసుమును నగదు లేదా ఇండియన్ పోస్టల్ ఆర్డర్ లేదా బ్యాంకు చెక్కు లేదా డీడీ లేదా చలానా రూపంలో చెల్లించవచ్చు.
- సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 6(2) ప్రకారం సమాచారాన్ని ఎందుకు కోరుతున్నారని దరఖాస్తు దారుడిని అడిగే అధికారం ప్రభుత్వ అధికారికి లేదు.
సమాచార హక్కు చట్టంలోని ముఖ్యాంశాలు :
సమాచార హక్కు ఒక ప్రాథమిక మానవ హక్కు.
- ప్రతి వ్యక్తికి ప్రభుత్వం నుంచి సమాచారం కోరే హక్కు ఉంటుంది.
- ప్రయివేటు సంస్థల నుంచి కూడా సమాచారాన్ని కోరవచ్చు.
- ప్రజలు కోరిన సమాచారాన్ని అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ప్రత్యేక కారణాల రీత్యా వెల్లడి చేయకూడని సమాచారాన్ని మినహాయించి మిగిలిన సమాచారాన్ని ప్రభుత్వం తప్పక అందుబాటులో ఉంచాలి.
- సమాచారాన్ని ప్రింట్ కాగితాల రూపంలో, కంప్యూటర్ ఫ్లాపీలు, వీడియో క్యాసెట్లు, లేదా ఇతర ఏ ఎలక్ట్రానిక్ సాధానాల రూపంలోనైనా అందించవచ్చు అని చట్టంలోని 2(ఎఫ్) నిబంధన తెలియజేస్తుంది.
30 రోజులు గడువు :
సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 7(1) ప్రకారం కోరిన సమాచారాన్ని సంబంధిత అధికారా 30 రోజుల వ్యవధిలోగా ఇవ్వాలి.
సాధారణ సమాచారం అయితే 30 రోజుల లోపల, జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం అయితే 48 గంటలలో ఇవ్వాలి. ఇందుకు నామమాత్రపు రుసుమును వసూలు చేస్తారు.
అప్పీలుకు అవకాశం :
నిర్దేశించిన గడువులోగా ఏ విషయాన్ని తెలియజేయక పోతే సమాచారం ఇవ్వడానికి తిరస్కరించి నట్లుగానే భావించాలి.
సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 19(1) ప్రకారం ప్రభుత్వ కార్యాలయ ఉన్నత అధికారి 30-45 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలి. అయినప్పటికీ సమాచారం ఇవ్వకపోతే ఈ చట్టంలోని సెక్షన్ 19(3) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషన్కు 90 రోజులు వ్యవధిలో అప్పీలు చేస్తే తదుపరి గడువును కమిషన్ నిర్ణయిస్తుంది.
సమాచారం ఇవ్వకపోతే పడే శిక్షలు
సమాచార హక్కు చట్టం నిబంధనల ప్రకారం ప్రజలకు సమాచారాన్ని అందించడంలో అధికారులు విఫలమైతే దరఖాస్తు తీసుకోవడానికి నిరాకరించినా, దరఖాస్తు రుసుము ఎక్కువ అడిగానా, అసంపూర్తి, తప్పుడు సమాచారం ఇచ్చినా, కోరిన సమాచారాన్ని ద్వంసం చేసినా, ఇవ్వడాన్ని అడ్డుకున్నా, ఈ చట్టం ప్రకారం నేరాలుగా పరిగ ణిస్తారు. వీటికి పాల్పడిన ప్రజా సమాచార అధికారికి సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 20(1) ప్రకారం రోజుకు రూ.250 చొప్పున గరిష్టంగా రూ.25,000 జరిమానా విధి స్తారు. తరుచుగా ఈ చట్టం ఉల్లంఘనకు పాల్పడే అధికారులకు సెక్షన్ 20(2) ప్రకారం కారాగార శిక్ష కూడా విధిస్తారు.
- సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 7(6) ప్రకారం 30 రోజులు వ్యవధి దాటితే సమాచారాన్ని ఉచితంగా అందించాలి.
మినహాయింపులు (ఈ చట్టం వర్తించని అంశాలు)
సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8, 24 ప్రకారం ఈ కింది అంశాలకు సంబంధించిన సమాచారాన్ని బహిరంగ పర్చమని కోరడానికి వీలులేదు.
1. భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే అంశాలు.
2. దేశ రక్షణకు సంబంధించిన గూడాచార సంస్థలు అందించే సమాచారం.
3. విదేశాలు, అంతర్జాతీయ సంస్థలతో భారతదేశం కుదుర్చుకునే ఒప్పందాలు
4. రాష్ట్రపతి పాలనలో కేంద్రమంత్రి మండలి ఇచ్చే సలహాలు
5 మంత్రి మండలికి సంబంధించిన పత్రాలు, కార్యదర్శులు, ఇతర అధికారుల రికార్డులు వంటివి.
6. రాష్ట్ర సహకార సంఘాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావు.
7.ఇంటలిజెన్స్ బ్యూరో, రెవెన్యూ ఇంటలిజెన్స్, పారా మిలటరీ, సైనిక వ్యవహారాలు మొదలగు వాటిపై సమాచారం కోరే హక్కు ఉండదు.
8. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం, దానికి సంబంధించిన సమాచారం కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది.
సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)(బి)ప్రకారం ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన విధులు, బాధ్యతలు, విధి నిర్వహణ పాటించే సూత్రాలు, జవాబుదారీ తనం, ఉద్యోగుల వివరాలు, వారి జీతభత్యాలు, బడ్జెట్ కేటా యింపు, రికార్డుల పట్టికల సమాచారాన్ని కార్యాలయాల్లో స్వచ్చందంగా వెల్లడించాలి.
- జీఓ ఎం.ఎస్ నెం. 454 ప్రకారం సమాచారాన్ని పొందేందుకు ఎ3/ఎ4 కాగితాన్ని రూ.2, ఫ్లాపీకి రూ.50, సీడీకి రూ.100, డీవీడీకి రూ. 200 చెల్లించాలి.
ె నిర్ణీత గడువులోగా సమాచారం లభించనపుడు సమాచార కమిషన్కు వెళ్లాల్సివస్తే ఆర్టీఐలోని సెక్షన్ 19(8) (బి) ప్రకారం పరిహారం పొందవచ్చు.
- ఆర్టీఐ సెక్షన్ 23 ప్రకారం కమిషన్ జారీ చేసిన ఆదేశాలపై దావాలు వేయరాదు. ఇతర విచారణలను ఏ న్యాయస్థానాలు చేపట్టరాదు.
- సెక్షన్ 26 ప్రకారం దీని ప్రయోజనాలను ప్రజలకు అందించి వారిలో అవగాహన కల్పించే బాధ్యత కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలదే.
- 21 ఆగస్టు 2013న భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టం ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ను ప్రారంభించింది. దీని ద్వారా పౌరులు 82 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సమాచారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Authorization