అంతర్జాతీయం :
ప్రధాని నరేంద్రమోడీ రష్యా పర్యటన
భారత ప్రధాని నరేంద్ర మోడీ 2019 సెప్టెంబర్ 4, 5 తేదీల్లో రష్యాలో పర్యటించారు. రష్యా తూర్పు తీరంలోని అత్యంత సుదూర ప్రాంతానికి వెళ్లిన తొలి భారత ప్రధాని మోడీ. ద్వైపాక్షిక సమావేశాల కోసం మోదీ రష్యాకు వెళ్లడం ఇది మూడోసారి. వ్లాడివోస్టోక్ నగరంలో జరిగిన 'భారత్-రష్యా 20వ వార్షిక సదస్సు'లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాలు రక్షణ, అంతరిక్షం, నౌకాయానం, ఇంధనం, సహజ వాయువు, పెట్రోలియం, వాణిజ్యంతో సహా 15 రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సెప్టెంబర్ 5న వ్లాదివొస్తోక్లో జరిగిన 5వ తూర్పు ఆర్థిక వేదిక (ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరం-ఈఈఎఫ్) సర్వసభ్య సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. రష్యాకు ఒక బిలియన్ డాలర్ల (రూ.7,000 కోట్లు) రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూత
జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే(95) అనారోగ్యం కారణంగా 2019 సెప్టెంబరు 6న సింగపూర్లో మృతి చెందారు. ఆఫ్రికాలో అత్యంత శక్తిమంతమైన నేతల్లో ఒకరుగా పేరుగాంచిన ముగాబే సుదీర్ఘకాలం పాటు జింబాబ్వే అధ్యక్షుడిగా పని చేశారు. 2017 నవంబరులో సైనిక తిరుగుబాటు కారణంగా పదవి నుంచి తప్పుకున్నారు. 1980కి ముందు రోడీషియా పేరిట బ్రిటన్కు వలస రాజ్యంగా జింబాబ్వే ఉండేది. అప్పటి ప్రధాని అయాన్ స్మిత్ మైనారిటీ పాలనకు వ్యతిరేకంగా 1960ల నుంచి ముగాబే గెరిల్లా విముక్తి పోరాటాన్ని నిర్వహించారు. జింబాబ్వేకి స్వాతంత్య్రం వచ్చాక కొంతకాలం ప్రధానిగా పని చేశారు. 1987 నుంచి 2017 వరకు అధ్యక్షుడిగా వ్యవహరించారు.
అమెరికా రోదసి విభాగం ప్రారంభం
అమెరికా తన సైన్యంలో రోదసి విభాగాన్ని (స్పేస్ కమాండ్) ఏర్పాటు చేసింది. వైట్హౌస్లో 2019 ఆగస్టు 29న జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీన్ని ప్రారంభించారు. అమెరికా రోదసి విభాగం పేరు 11వ యూనిఫైడ్ కంబాటెంట్ కమాండ్ ఆఫ్ ద అమెరికన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. దీని కమాండర్ జనరల్ జాన్ డబ్ల్యూ రేమండ్. ఇందులో సుమారు 287 మంది సిబ్బంది ఉంటారు. అంతరిక్ష యుద్ధానికి సంబంధిం చిన బాధ్యతలను ఇంత వరకు అమెరికా వ్యూహాత్మక కమాండ్ చూసేది. ఇకపై ఈ విభాగం చూస్తుంది.
అత్యంత నివాసయోగ్య నగరం వియన్నా
'ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్' యూనిట్ విడుదల చేసిన అత్యంత నివాసయోగ్య నగరాల సూచి (2019)లో ఆస్ట్రియా రాజధాని వియన్నా వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచింది. దాదాపు ఏడు సంవత్సరాల పాటు తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరాన్ని వెనక్కి నెట్టి 2018లో అగ్రస్థానానికి చేరిన వియన్నా ఆ స్థానాన్ని మళ్లీ పదిలం చేసుకొంది. సిడ్నీ, ఒసాకా తరువాతి రెండు స్థానాలో నిలిచాయి. మొత్తం 140 నగరాల్లో సర్వేను నిర్వహించారు. జీవన ప్రమాణ స్థాయి, నేరాల నమోదు, ప్రయాణ, మౌలిక వసతులు, విద్య, వైద్యంతో పాటు రాజకీయ, ఆర్థిక స్థిరత్వం లాంటి అంశాల ఆధారంగా ఈ సర్వేను చేపట్టారు. తొలిసారి పర్యావరణ పరిస్థితుల్ని కూడా పరిగణనలోకి తీసు కున్నారు. నిత్యం బాంబుల మోతతో దద్దరిల్లే సిరియా రాజధాని డమస్కస్ చివరి స్థానంలో నిలిచింది. ట్రిపోలి, ఢాకా, కరాచీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యంత నివాసయోగ్య సూచీలో తొలి 100 నగరాల్లో భారత్కు చెందినవి ఒక్కటి కూడా లేదు.
నోయిడాలో 14వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్
14వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ను 2019 సెప్టెంబర్ 2న ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, యూఎన్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరి ఇబ్రహీం థియావ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా 2020, 2021 సం||లకు గాను COP అధ్యక్ష బాధ్యతలను చైనా నుంచి భారత్ స్వీకరించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ COP అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
జాతీయం:
దేశ జనాభా 128.85 కోట్లు
దేశ జనాభా 128.85 కోట్లకు చేరింది. ఏడాది వ్యవధిలో మన జనాభా 1.45 కోట్లు పెరిగింది. దేశవ్యాప్తంగా జనన, మరణాల నమోదు ఆధారంగా జాతీయ జనాభా లెక్కల శాఖ తాజాగా 2017కి సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా 22. 26 కోట్ల జనాభాతో మొదటి స్థానంలో ఉంది. 6.56 లక్షల జనాభాతో సిక్కిం చివరి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 5.23 కోట్ల జనాభాతో 10వ స్థానంలో, తెలంగాణ 8.69 కోట్ల జనాభాతో 12వ స్థానంలో నిలిచాయి. తెలంగాణలో జిల్లాల వారీగా చూస్తే జనన, మరణాల్లో హైదరా బాద్ రెవెన్యూ జిల్లాకే అగ్రస్థానం దక్కింది.
వైద్య ఆరోగ్య సేవల సిబ్బంది, వైద్య సంస్థల హింస, ఆస్తుల నష్ట నిషేధం ముసాయిదా
వైద్య సిబ్బంది, ఆసుపత్రులపై దాడుల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టానికి శ్రీకారం చుట్టింది. వైద్యులు, సిబ్బందిపై దాడిచేసినా, ఆసుపత్రుల ఆస్తులకు నష్టం కలిగించినా గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్ష, రూ.10 లక్షల వరకూ జరిమానా విధించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు 'వైద్య ఆరోగ్య సేవల సిబ్బంది, వైద్య సంస్థల (హింస, ఆస్తుల నష్ట నిషేధం) బిల్లు' పేరుతో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ముసాయిదాను రూపొందించింది. దీనిపై ప్రజలు 30 రోజుల్లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది.
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం
దేశవ్యాప్తంగా 2019 సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తమ ఉపాధ్యాయులకు న్యూఢిల్లీలో పురస్కారాలను ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కష్ణా జిల్లా నిడమా నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు సురేష్కుమార్, తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల జడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల అధ్యాపకురాలు బెండి ఆశారాణి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందుకున్నారు.
ఎన్నారైలకూ ఆధార్
మూడు నెలల్లో భారతీయ పాస్పోర్టు కలిగిన ఎన్నారైలకూ ఆధార్ కార్డులు జారీ చేసే వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తెలిపింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన విధంగా ఆరునెలల కాలం వేచి ఉండాల్సిన అవసరం లేకుండానే ఎన్నారైలకు ఆధార్ కార్డులు జారీ చేస్తామని సంస్థ సీఈవో అజరు భూషణ్ పాండే తెలిపారు.
ఉపాధి అవకాశాలు దివ్యాంగుల హక్కు: సుప్రీం
దివ్యాంగులకు ఉపాధి అవకాశాలను హక్కులాగా కల్పించాలని, సానుభూతి ప్రాతిపదికన కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. సివిల్ జడ్జి నియామకం విషయంలో నీతూహర్ష్ అనే దష్టిలోపం ఉన్న వ్యక్తి దాఖలు చేసుకున్న కేసులో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
మూకదాడులపై బిల్లుకు బెంగాల్ ఆమోదం
మూకదాడులు, హత్యలు, నేర పూరిత సంఘటనలు నియం త్రించే 'ప్రివెన్షన్ ఆఫ్ లించింగ్-2019' బిల్లుకు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ 2019 ఆగస్టు 30న ఆమోదం తెలిపింది. మూకదాడులు నియంత్రించి సామన్యులకు రక్షణ కల్పించడం, అటువంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ బిల్లు తీసుకొచ్చారు. మూకదాడులకు పాల్పడే వారిపై 3 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలు పడేలా బిల్లులో పొందుపరిచారు. మూకదాడులు సామాజిక దుశ్చర్యలను ప్రేరేపిస్తున్నాయని, కలిసికట్టుగా వీటికి వ్యతిరేకంగా పోరాడాలని బిల్లుపై చర్చలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
ఆరోగ్యం ప్రాథమిక హక్కుగా చేర్చాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు
ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుల కిందికి చేర్చాలని 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 2022 ఆగస్టు 15 నాటికి 75 ఏళ్లు పూర్తయ్యే సందర్భంగా దానిని ప్రకటించాలని, ఆరోగ్య అంశాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చడం ద్వారా కేంద్రం సైతం కొంత బాధ్యత పంచు కోవచ్చని పేర్కొంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయాలని సూచించింది.
ప్రాంతీయం :
టీఎస్ఆర్టీసీకి క్యూసీఎఫ్ఐ పురస్కారం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కు క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా (క్యూసీఎఫ్ఐ) పురస్కారం లభించింది. హైదరాబాద్లో 2019 ఆగస్టు 29న నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ పురస్కా రాన్ని ప్రదానం చేశారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు యాదగిరి, టీవీరావులు పురస్కారాన్ని అందుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకుగాను టీఎస్ఆర్టీసీకి ఈ అవార్డు దక్కింది.
70వ అంతర్జాతీయ నీటిపారుదల, పారిశుధ్య సదస్సులో 'మిషన్ కాకతీయ' ప్రదర్శన
ఇండోనేషియా రాజధాని బాలిలో 2019 సెప్టెంబర్ 4న ప్రారంభమైన 70వ అంతర్జాతీయ నీటిపారుదల, పారిశుధ్య సదస్సులో 'మిషన్ కాకతీయ' పథకం అమలు తీరును ప్రదర్శించారు. రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి శ్రీధర్రావు దేశ్పాండే, చీఫ్ ఇంజినీర్లు శంకర్, నరసింహ, హమీద్ఖాన్, ఈఈ నాగభూషణ్రావు తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు ఇస్తున్న ప్రాధాన్యం, మిషన్ కాకతీయ ద్వారా చిన్ననీటి వనరుల పునరుద్ధరణకు చేపట్టిన కార్యక్రమాలు, విజయవంతమైన తీరును దశ్య రూపంలో సదస్సులో ప్రదర్శించారు. ఈ సదస్సును ఇండోనేషియా మంత్రి బాసుకి ప్రారంభించగా.. వేర్వేరు దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
హెచ్సీయూకు ఎమినెన్స్ హోదా
హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీతో పాటు 5 ప్రభుత్వ విద్యాసంస్థలకు ఎమినెన్స్ (ఐవోఈ) హోదా కల్పిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ హోదా దక్కిన మిగతా విద్యా సంస్థల్లో మద్రాస్ ఐఐటీ, ఖరగ్పూర్ ఐఐటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ వర్సిటీలు న్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2019 ఆగస్టులో చేసిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మానవ వనరుల అభివద్ధి మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. దీంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చే ఐదేళ్లలో కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్లు నిధులు అందనున్నాయి. ఎమినెన్స్ హోదా కల్పించిన ప్రభుత్వ విద్యాసంస్థలైతే ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల వరకు సాయం అందజేస్తుంది. అదే ప్రైవేట్ సంస్థలకైతే ప్రభుత్వ నిధులు అందవు కానీ, మరింత స్వతంత్ర ప్రతిపత్తితో పాటు ప్రత్యేక కేటగిరీ డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభిస్తుంది.
వార్తల్లో వ్యక్తులు :
5 రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామకం
తెలంగాణ, హిమాచల్ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2019 సెప్టెంబర్ 1న రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ నియమితులయ్యారు. రాష్ట్ర గవర్నర్గా సుదీర్ఘ కాలం పనిచేసిన నరసింహన్ స్థానంలో తమిళిసై సౌందరరాజన్కు బాధ్యతలు అప్పగించారు. తమిళిసై సౌందరరాజన్ తెలంగాణకు తొలి మహిళా గవర్నర్. తెలంగాణకు బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయను హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా నియమించారు. హిమాచల్ గవర్నర్గా ఉన్న కల్రాజ్ మిశ్ర రాజస్థాన్కు బదిలీ అయ్యారు. విద్యా సాగర్రావు స్థానంలో భగత్సింగ్ కోషియారి నియమితులయ్యారు. కేరళ గవర్నర్గా ఆరిఫ్ మహ్మద్ఖాన్ నియమితులయ్యారు. కు అవకాశం దక్కింది. ఈ మేరకు 2019 సెప్టెంబర్ 1న రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
ఫెడరల్ జడ్జిగా భారత సంతతి మహిళ
ఫెడరల్ కోర్టు జడ్జిగా భారత సంతతి మహిళ షిరీన్ మ్యాథ్యూస్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. ఆమెను కాలిఫోర్నియాలోని సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆర్టికల్-3 జడ్జిగా నియమించాలని ప్రతిపాదించారు.
పాకిస్థాన్లో పోలీస్ అధికారిగా తొలి హిందూ యువతి
పాకిస్థాన్లో ఓ హిందూ యువతి పోలీస్ ఉద్యోగం సాధించింది. సింధ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన పుష్ఫా కొల్హి అనే యువతి ఏఎస్సైగా ఎంపికైంది. దీంతో పాకిస్థాన్లో ఏఎస్సైగా నియమితులైన తొలి హిందూ యువతిగా ఆమె చోటు దక్కించుకుంది. పాకిస్థాన్లో హిందువులు అతిపెద్ద మైనార్టీ కమ్యూనిటీ. అధికారిక లెక్కల ప్రకారం పాకిస్థాన్లో మొత్తం 75లక్షల మంది హిందువులు ఉండగా.. అనధికారికంగా ఆ సంఖ్య 90లక్షల వరకు ఉందని అంచనా.
NMDC డైరెక్టర్గా సుమిత్ దేవ్
ప్రభుత్వరంగ ఖనిజాల సంస్థ అయిన ఎన్ఎమ్డీసీ లిమిటెడ్ డైరెక్టర్ (పర్సనల్)గా సుమిత్దేవ్ బాధ్యతలు చేపట్టారు. ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్న ఆయన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL)లో మేనేజ్ మెంట్ ట్రైనీగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారం భించారు. స్టీలు రంగంలో దాదాపు పాతికేళ్లు పనిచేశారు. ఎన్ఎండీసీ లో ఇటీవల వరకూ పర్సనల్, రాజభాషా, పరపాలనా పరమైన వ్యవహారాలు పర్యవేక్షించారు. తాజాగా డైరెక్టర్(పర్సనల్) గా నియమితులయ్యారు.
ప్రపంచ ఎన్నికల సంస్థల సంఘం అధ్యక్షుడిగా సునీల్ అరోడా
ప్రపంచ ఎన్నికల సంస్థల సంఘం(AWEB) అధ్యక్షుడిగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా 2019 సెప్టెంబర్ 3న నియమితులయ్యారు
74 ఏళ్ల వయసులో తల్లయిన మహిళ
ప్రపంచ వైద్య రంగంలోనే 2019 సెప్టెంబర్ 5న ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరులో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. 74 ఏళ్ల వయసున్న మంగాయమ్మ కవలలకు జన్మనిచ్చారు. మంగాయమ్మ ఐవీఎఫ్ విధానంలో గర్భం దాల్చింది. యరమాటి సీతారామరాజారావు, మంగా యమ్మ దంపతులది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నెలవర్తిపాడు.
సాయిపూజితకు 'నాసా' సందర్శన అవకాశం
హైదరాబాద్ ఎస్ఆర్నగర్లోని భాష్యం ఐఐటీ ఫౌండేషన్ అకాడమీలో 9వ తరగతి చదువుతున్న కారు మెకానిక్ కుమార్తె సాయిపూజిత అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసాను సందర్శిం చనుంది. చెన్నైలోని 'గో ఫర్ గురు' అనే సంస్థ నిర్వహించిన 'ఇంటర్నేషనల్ స్పేస్ సైన్స్ కాంటెస్ట్-2019'లో పాల్గొని ప్రతిభ కనబరిచింది. దేశవ్యాప్తంగా ఉచితంగా నాసా యాత్రకు ఎంపికైన ముగ్గురు విద్యార్థుల్లో ఈమె ఒకరు. 2019 అక్టోబర్ 1న అమెరికా బయల్దేరి వెళ్లనుంది. అక్కడి శాస్త్రవేత్తలను కలిసి వ్యోమగాముల పనితీరు తెలుసుకుంటుంది. సాయిపూజిత తండ్రి రామకష్ణ ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకు చెందిన కారు మెకానిక్.
మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూత
మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి(75) 2019 సెప్టెంబర్ 2న హైదరాబాద్లో మృతి చెందారు. ముత్యంరెడ్డి స్వస్థలం సిద్దిపేట జిల్లా తొగుట. 1969లో తొగుట సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముత్యంరెడ్డి మంత్రి స్థాయికి ఎదిగారు. వ్యవసాయంపై మక్కువ కలిగిన ఆయన రైతు, ప్రజాసమస్యలపై పోరాటంలో విలక్షణ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1989, 94, 99లలో వరుసగా మూడుసార్లు టీడీపీ నుంచి దొమ్మాట ఎమ్మెల్యేగా గెలు పొందారు. 2009లో కాంగ్రెస్ తరుపున దుబ్బాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2002 నుంచి 2004 వరకు ఉమ్మడి ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు.
అవార్డులు :
ఎంపీ మార్గాని భరత్కు భారత్ గౌరవ్ అవార్డు
ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్(వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ)కు భారత్ గౌరవ్ పురస్కారం లభించింది. న్యూఢిల్లీలో 2019 ఆగస్టు 29న జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చేతుల మీదుగా భరత్ అవార్డు అందుకున్నారు. మొదటిసారి ఎంపీగా ఎన్నికైన భరత్ లోక్సభలో వివిధ అంశాలపై తన ప్రసంగంతో అందరి దష్టిని ఆకర్షిస్తూ, నియోజకవర్గ సమస్యలు, రాష్ట్ర సమస్యలపై గళం విప్పుతున్న తీరుకు గుర్తింపుగా భారత్ గౌరవ్ ఫౌండేషన్ ఈ పురస్కారంతో సత్కరించింది.
ప్రధానికి 'గ్లోబల్ గోల్ కీపర్' అవార్డు
ప్రధాని నరేంద్రమోడీ 'గ్లోబల్ గోల్ కీపర్' అవార్డుకు ఎంపిక య్యారు. పారిశుధ్య పరిస్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్ర మానికి గుర్తింపుగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ఆయన సతీమణి మెలిండాల పేరుతో ఏర్పాటైన ట్రస్ట్ బెల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఈ అవార్డును అందజేయ నుంది. 2019 సెప్టెంబర్ 24న బ్లూమ్బర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరమ్ వేదికగా జరగనున్న కార్యక్రమంలో మోడీ అవార్డు అందుకోనున్నారు.
ఇక్రిశాట్ డెరైక్టర్కు జయశంకర్ పురస్కారం
ఇక్రిశాట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ డెరైక్టర్ రాజీవ్ కె.వర్షిణికి ప్రొఫెసర్ జయశంకర్ లైఫ్టైమ్ పురస్కారం లభించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 5వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 2019 సెప్టెంబర్ 3న హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చేతుల మీదుగా వర్షిణి ఈ అవార్డును అందుకున్నారు.
డాక్టర్ హేమలతకు ఛేంజ్ మేకర్ అవార్డు
జాతీయ పోషకాహార సంస్థ డెరైక్టర్ డాక్టర్ హేమలత ఛేంజ్ మేకర్ అవార్డును దక్కించుకున్నారు. సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించిన ఈ అవార్డును తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా శిశు పోషణ విషయంలో విశేషకషి చేసినందుకు గుర్తింపుగా హేమలత అందుకున్నారు. సేవ్ ది చిల్డ్రన్ ఏర్పాటై వందేళ్లు పూర్తయిన సందర్భంగా 2019 సెప్టెంబర్ 4న హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.
ఆర్థికాంశాలు :
10 ప్రభుత్వరంగ బ్యాంకులను నాలుగింటిగా విలీనం
10 ప్రభుత్వరంగ బ్యాంకులను నాలుగింటిగా విలీనం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019 ఆగస్టు 30న ప్రకటించారు. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు చేరనుంది. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దడంలో భాగంగా ఈ విలీనం చోటు చేసుకుంటోంది. 2018లో దేనా బ్యాంక్, విజయా బ్యాంక్లను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయడంతో అది మూడో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుగా అవతరించింది. ఎస్బీఐలో 5 అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకుల్ని గతంలోనే విలీనం చేశారు. గత ఆర్థిక సంవత్సరం బ్యాంకు మోసాలు 74 శాతం పెరిగాయని ఆర్బీఐ తన వార్షిక నివేదికలో ప్రకటించిన మరుసటి రోజే 10 బ్యాంకులను విలీనం చేసి 4 దిగ్గజ బ్యాంకులను తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే మిగులుతాయి.
ఐడీబీఐ బ్యాంకుకు రూ.9,300 కోట్ల నిధులు
ఐడీబీఐ బ్యాంకు మూలధన స్థాయిని పెంచేందుకు, లాభాల్లోకి మళ్లించేందుకు రూ. 9,300 కోట్ల మేర నిధులు సమకూర్చనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ 2019 సెప్టెంబర్ 3న వెల్లడించారు. ఇందులో సుమారు 51 శాతం నిధులను (రూ. 4,743 కోట్లు) ఎల్ఐసీ సమకూర్చనుండగా, మిగతా 49 శాతం (రూ. 4,557 కోట్లు) కేంద్రం వన్-టైమ్ ప్రాతిపదికన అందించనుంది. మొండిబాకీలతో కుదేలైన ఐడీబీఐ బ్యాంకులో ఎల్ఐసీ గత ఆగస్టులో తన వాటాలను 51 శాతానికి పెంచుకున్న సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి మూలధనం అందిన రోజునే అదే మొత్తంలో ఐడీబీఐ బ్యాంకు రీక్యాపిటజైషన్ బాండ్లు కొనుగోలు చేయనుంది.
సైన్స్&టెక్నాలజీ :
2050 నాటికి అరటి పంట అదశ్యమయ్యే ప్రమాదం
2050 నాటికి భారత్తో పాటు మరికొన్ని దేశాల్లో అరటి పంట పూర్తిగా అదశ్యమయ్యే ప్రమాదం ఉందని బ్రిటన్ లోని ఎక్స్టర్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. వాతావరణ మార్పులు భారతలో అరటి ఉత్పత్తి క్షీణతకు దారి తీయవచ్చని వారు అధ్య యనంలో గుర్తించారు. ప్రపంచానికి 86 శాతం అరటిని అందిస్తున్న 27 దేశాల్లో వారు ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా అధికంగా అరటి సాగు చేస్తున్న భారత్, బ్రెజిల్తో పాటు మరో 8 దేశాల్లో వాతావరణ మార్పుల కారణంగా ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని పరిశోధకులు తెలిపారు. ఇదే స్థాయిలో కొనసాగితే మరో 30 ఏళ్లలో అరటిపంట పూర్తిగా మాయమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఆంగ్ల పదాల ఉచ్ఛరణకు ఇఫ్లూ యాప్
ఆంగ్ల పదాల ఉచ్ఛరణపై ఉచితంగా పాఠాలు చెప్పేందుకు హైదరాబాద్లోని ఇంగ్లీష్, ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) 'ఇంగ్లీష్ ప్రొ' పేరిట మొబైల్ యాప్ను రూపొందించింది. ఇందులో 4 మాడ్యూళ్లు, 20 పాఠాలు ఉన్నాయి. పదంపై క్లిక్ చేయగానే ఉచ్చారణ స్పష్టంగా వినిపించేలా తయారు చేశారు.
సాగర మథనానికి 'సముద్రయాన్'
'గగన్యాన్' పేరుతో అంతరిక్షంలోకి వ్యోమగా ములను పంపి, విశ్వా న్వేషణ చేయాలను కుంటున్న భారత్.. సాగరగర్భంలోకి శాస్త్ర వేత్తలను పంపి అక్కడ పరిశోధనలు, మైనింగ్ చేపట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఒక ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేసింది. 'సముద్రయాన్' అనే ఈ ప్రాజెక్టు 2021-22లో సాకారం కానుంది. దీంతో ఈ సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ చేరనుంది.
అగిన చంద్రయాన్ -2 కమ్యూనికేషన్
చంద్రుడి దక్షిణ ద్రువం వైపు జూలై 22న మొదలైన చంద్రయాన్ 2 ప్రయాణం చంద్రునిపై అడుగుపెట్టే సమయంలో ఆగిపోయింది. అన్ని దశలను విజయవం తంగా పూర్తిచేసిన చంద్రయాన్ -2 చంద్రుడికి కేవలం 2.1కిలోమీటర్ల దూరంలోఉండగా ఇస్రోతో సంబంధాలు తెగిపోయాయి. మొదటి నుంచి చివరి 15 నిమిషాలు చాలా కీలకం అని ఇస్రో చెపుతూనే ఉంది. చంద్రుడి దక్షిణ ద్రువంలో ఉండే గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా ఇస్రో చంద్రయాన్-2ను ల్యాండింగ్ చేయాల నుకుంది.అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసినప్పటికీ చివరి నిమిషంలో ఇలా జరగడంతో ఇస్రో శాస్త్రవేత్తలను కొంత నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పటివరకు చేసింది తక్కువేమి కాదని ప్రధాని మోడీ ఇస్రో శాస్త్రవేత్తలకు దైర్యం చెప్పారు. ల్యాండర్ విక్రమ్ కూలిపోయి ఉండకపోవచ్చని ఇస్రో భావిస్తుంది. ల్యాండర్ విక్రవమ్ పంపిన సిగల్స్ను శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తున్నారు. దక్షిణ దృవంపై ల్యాండర్ విక్రం సురక్షితంగా దిగి ఉంటే ఆ ద్రువంపై అడుగిడిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించేది.
భారత వాయుసేనలోకి అపాచీ హెలికాప్టర్లు
ప్రపంచంలోనే అత్యంత ఆధునిక అపాచీ ఎహెచ్-64ఇ యుద్ధ హెలికాప్టర్లు భారత్ అమ్ముల పొదిలో చేరాయి. మొత్తం 8 హెలికాప్టర్లను పఠాన్ కోట వైమానిక దళానికి అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ 2019 సెప్టెంబర్ 3న అందించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా, ఎయిర్ మార్షల్ ఆర్ నంబియార్ హెలికాప్టర్లకు పూజలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం, బోయింగ్ సంస్థలతో 2015లో 22 హెలి కాప్టర్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. 2019, జూలైలో నాలుగు హెలికాప్టర్లు అప్పగించారు. ఆఖరి విడత మార్చి 2020 నాటికల్లా బోయింగ్ సంస్థ అందించాల్సి ఉంది. కాలం చెల్లిన ఎంఐ-35 హెలికాప్టర్ల స్థానంలో అపాచీ కొనుగోలు చేశారు.
జియో ఫైబర్ సేవలు ప్రారంభం
రిలయన్స్ జియో బ్రాడ్బాండ్ ఇంటర్నెట్లో కొత్త సంచలనానికి తెరతీసింది. 2019 సెప్టెంబర్ 5న జియో ఫైబర్ సేవలను దేశవ్యాప్తంగా 1,600 నగరాల్లో ప్రారంభించింది. కనీసం 100 ఎంబీపీఎస్(మెగాబైట్స్ పర్ సెకన్) స్పీడు నుంచి గరిష్టంగా 1 జీబీపీఎస్(గిగాబైట్స్ పర్ సెకన్) స్పీడు వరకూ వివిధ రకాల ప్లాన్లను అందు బాటులోకి తెచ్చింది. అన్లిమిటెడ్ బ్రాండ్బాండ్తో పాటు దేశంలో ఎక్కడికైనా ఉచిత వాయిస్ కాలింగ్, టీవీ ద్వారా వీడియోకాలింగ్/కాన్ఫరెన్స్ సదుపాయం వంటి అనేక సేవలను వినియోగదారులకు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
క్రీడాంశాలు :
టీ20లకు మిథాలీరాజ్ వీడ్కోలు
భారత మహిళల క్రికెట్ దిగ్గజం మిథాలీరాజ్ టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికింది. 2021 వన్డే ప్రపంచకప్పై పూర్తి స్థాయిలో దష్టి సారించడం కోసమే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటి స్తున్నట్లు 36 ఏళ్ల మిథాలీ తెలిపింది. 2018లో టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్తో సెమీస్కు మిథాలీని పక్కన పెట్టడం వివాదాస్పదమైంది. తన కెరీర్ను నాశనం చేయాలని కోచ్ రమేశ్ పొవార్ ప్రయ త్నించాడంటూ మిథాలీ ఆరోపించడం దుమారం రేపింది. పొవార్పై వేటు వేయడంతో వివాదం సద్దుమణిగింది.
15ఏళ్లకే భారత జట్టులో షెఫాలీ
15 ఏళ్ల షెఫాలీవర్మకు భారత మహిళల క్రికెట్ జట్టులో చోటు దక్కింది. దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై టీ20 సిరీస్లో తలపడే భారత జట్టులో చోటు సంపాదించింది. వెటరన్ స్టార్ మిథాలీరాజ్ టీ20లకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో ఆమె స్థానాన్ని సెలెక్టర్లు షెఫాలీతో భర్తీ చేశారు. షెఫాలీవర్మ స్వరాష్ట్రం హర్యానా.
మాజీ చెస్ ప్లేయర్ ఫరూఖ్ అలీ కన్నుమూత
మాజీ చెస్ ఆటగాడు ఫరూఖ్ అలీ 2019 ఆగస్టు 30న హైదరాబాద్లో మృతి చెందాడు. ఫరూఖ్ అలీ 1962 జాతీయ చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. ఫరూఖ్ అలీ 'ఖలీఫా' పేరుతో ప్రసిద్ధి చెందాడు.
సీఎస్ఐసీఈ జాతీయ క్రీడల క్యారమ్ ఛాంప్ ఆంధ్రప్రదేశ్- తెలంగాణ జట్టు
సీఎస్ఐసీఈ జాతీయ క్రీడల క్యారమ్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్- తెలంగాణ జట్లు సత్తాచాటాయి. 2019 ఆగస్టు 30న హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్సిటీ (ఆర్ఎఫ్సీ)లో ముగిసిన ఈ టోర్నీ అండర్-17 బాలికల టీమ్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్- తెలంగాణ విజేతగా నిలిచింది. బిహార్-జార్ఖండ్, పశ్చిమ బంగ వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. అండర్-14 బాలికల టీమ్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్- తెలంగాణ జట్టు రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. తమిళనాడు మొదటి స్థానంలో, మహారాష్ట్ర మూడో స్థానంలో నిలిచాయి.
జిన్సన్ జాన్సన్ జాతీయ రికార్డు
ఆసియా క్రీడల స్వర్ణ విజేత జిన్సన్ జాన్సన్ 1500మీ పరుగులో సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. 20 19 సెప్టెంబర్ 1న బెర్లిన్లో జరిగిన ఐఎస్టీ ఏఎఫ్ ఈవెంట్లో జిన్సన్ జాన్సన్ రజతం సాధించాడు. 3 నిమిషాల 35.24 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసిన జిన్సన్ జాన్సన్ తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు (3:37.62)ను బద్దలు కొట్టాడు.