Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చదువంటే పుస్తకాలు తిప్పడం, అరుచుకుంటూ వల్లెవేయడం, తల ఆడిస్తూ ఉండటం కాదు.. అందమైన నక్షత్రాలు చూడటం. సొంతంగా తన భావనలు వ్యక్తపరచడం. పాఠాలను పాట పాడినంత సంతోషంగా నేర్చుకోవడం, మరొకరికి నేర్పించడం. అందుకే ''చదువది యెంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు, గణసంయుతు లెవ్వరు మెచ్చరెచ్చటన్...'' అన్నారు భాస్కరుడు! మనిషి యెంత చదువుకున్న రస గ్రహణ శక్తి లేకపోతే ఆ చదువు వ్యర్థం. బుద్ధిమంతులు అతని చదువును మెచ్చుకోరు. ఎందుకంటే మంచికూరను చాలా రుచిగా నలపాకంలాగా వండినా, ఆ కూరలో ఉప్పు లేకపోతే రుచి కలుగదు కదా..?
జాతి భవిష్యత్తు తరగతిలోనే రూపుదిద్దుకుంటుందని కొఠారి నాడే చెప్పారు. విద్యార్థులను దేశ పురోగతికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే గురుతర బాధ్యతా పాఠశాలల్లోనే పురుడు పోసుకుంటుందని భావించారు. కానీ కరోనా కాలంలో దేశ భవిష్యత్తు సహా రేపటిపౌరుల బంగారుమయ జీవితాలు నేడు ప్రశ్నార్థకంలో పడుతున్నాయి. ఈ కష్టకాలంలో ఏలికలు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు అప్పటివరకు ఉన్నటువంటి కాస్త విద్యాఫలాలనైనా అట్టడుగు పిల్లలకు అందకుండా చేస్తున్నాయి. డిజిటల్, వర్చువల్ తరగతుల పేరిట ఏదో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నామనే ఆతృత తప్ప అది ఎంతమందికి ఆచరణ సాధ్యమో కాదో తెలుసుకోకపోవడం శోచనీయం. ఆధునిక కాలంలోనూ లక్షలాది మంది నిరుపేద పిల్లలకు విద్య అందని ద్రాక్షగా మిగిలిపోయిన వైనం నేటికీ వెంటాడుతున్నది. అటువంటి తరుణంలో సాంకేతిక పరిజ్ఞానంతో విద్యావ్యవస్థను గాడిలో పెడతామనుకోవడం విడ్డూరం. డిజిటల్ సౌకర్యం ఎంతమందికి అందుబాటులో ఉందో లేదో గుర్తెర కుండా గుడ్డిగా ఆలోచనలు చేయడం ఈ సర్కారుకే చెల్లింది. ఎన్నో విషయాల్లో ఒంటెద్దుగా వ్యవహరించిన ఉదంతాలు ఈ సందర్భంగా గుర్తుకు వస్తున్నాయి. వర్తమానంలోనూ మారుమూల పల్లెలు, గిరిజనుల ప్రాంతాల్లో ఇంటింటికీ టీవీలు లేని కుటుంబాలెన్నో ఉన్నాయి. ఇంటికొక స్మార్ట్ ఫోన్ కూడా లేని విద్యార్థులెంతోమంది ఉన్నారు. ఉన్నా ఇంటర్నెట్ సౌకర్యాల్లేవనే విషయాలు పలు సర్వేల్లో పదేపదే వెల్లడయ్యాయి. ఈ పరిస్థితుల్లో సకలభోగాలున్న ఉన్నతవర్గాలకు చెందిన పిల్లలకు మినహా ఇటువంటి విద్యావిధానంతో పేద మధ్య తరగతి విద్యార్థుల సృజనాత్మకత ఇనుమడించదు. ప్రతిభాపాటవాలు బయటకు రాలేవు.
ఏకధాటిగా ప్రత్యక్ష క్లాసులు వింటేనే కొందరికి అనేకానేక సందేహాలు వస్తుంటాయి. అపుడు తరగతి గదిలో ఉపాధ్యాయుల ముందే వాటిని పరిష్కరించుకునే వెసులుబాటు దొరుకుతుంది. కానీ కరోనా ధాటికి డిజిటల్, ఆన్లైన్ విద్యావ్యవస్థను అమలుపరిస్తే ఇలాంటి సందేహాలు ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోగలమా అన్నది ప్రశ్నార్థకమే. శిక్షణ లేకుండా టీచర్లు ఆన్లైన్లో బోధిస్తే అది ఎంతవరకు తలకెక్కుతుందో కూడా అనుమానమే. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాల్లోని పిల్లలు సరిగ్గా పాఠాలు వింటున్నారో లేదో తల్లిదండ్రులకు తెలుసుకునే వీలుండదు. దశాబ్ద క్రితం ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్యే మూలకుపడ్డ విచిత్ర పరిస్థితి మన కండ్లముందున్నది. వాటి నిర్వాహణ లేక, బోధించే సిబ్బంది కరువై దుమ్ముబారిపోయిన దృశ్యాలు సాంకేతిక విద్య సాధ్యాసాధ్యాల్ని తేటపరుస్తున్నాయి. అందుబాటులోకి వచ్చిన విద్యనే ఆచరించలేక మల్లగుల్లాలు పడిన పాలకులిపుడు ఏకంగా డిజిటల్ వ్యవస్థను పాదుగొల్పే యోచనను సమాజం ఆమోదించడం లేదు. అసలు ఈ చదువులకు విద్యార్థులు మానసికంగా సిద్ధంగా ఉన్నారా? వాళ్ల ఆలోచనాశక్తి దీన్ని అందుకోగలదా? అన్నది బేరీజువేయకుండా కార్యాచరణకు పూనుకోవడం పట్ల భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని దేశాల్లో భౌతికదూరం పాటింపజేస్తూ విద్యార్థులకు తరగతి బోధనే మేలనే ఉద్దేశంతో పాఠశాలలు ప్రారంభించారు. ఇంకొన్ని దేశాల్లో ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థులను సంసిద్ధులను చేస్తున్నది. దేశంలో ఈ సాంకేతిక సదుపాయాల కల్పనలో పాలకులు శ్రద్ధచూపకపోతే డిజిటల్ బోధన ఏమాత్రమూ సాధ్యపడదు. ఇంటర్నెట్, సిగలింగ్ వ్యవస్థలు ఇప్పటికే కార్పొరేట్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న సందర్భంలో పేద, మధ్య తరగతి పిల్లలకు సర్కారు సహకారం అందకపోతే మరిన్ని డ్రాపౌట్లు పెరిగే అవకాశమూ లేకపోలేదు. ఉన్నత, సాంకేతిక విద్యలో కొంత ఆచరణ సాధ్యమైనా ప్రాథమిక స్థాయిలో డిజిటల్ చదువులు విద్యార్థుల వివేచనను వెలుగులోకి తీసుకురాలేవు. అందుకే తరగతి గది విద్యకు ఆన్లైన్ చదువులను ప్రత్యామ్నాయంగా చూడరాదు. తరగతి విద్యను ప్రత్యామ్నాయంగా ఎలా నడపాలో విద్యారంగ నిపుణులను, రాజకీయ పక్షాలను సంప్రదించి తగిన విధివిధానాలు రూపొందించాలి. చదువుకోవడం అనేది ఒకప్పుడు గౌరవప్రదమైన కార్యక్రమం మాత్రమే. కానీ నేడు అదొక ప్రాథమిక హక్కు. ఆ హక్కును కాపాడేవిధంగా వ్యవహరించగలిగితేనే విద్యాఫలాలు అందరి దరిచేరుతాయి.