Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది కోవిడ్-19 గురించి కాదు. మన సమాజంలో కోవిడ్ కంటే వేగంగా విస్తరిస్తున్న ఉన్మాదభావాల గురించి! ''టీకా అయినా కనుక్కోవాలి, హెర్డ్ ఇమ్యూనిటీ (మందరోగ నిరోధకత) అయినా రావాలి'' అని వైద్యశాస్త్ర వేత్తలు చెపుతున్న విషయం కోవిడ్ గురించే! కానీ ఉన్మాద వైరస్ ప్రపంచంలో, ఒక్కొక్క దేశంలో ఒక్కో రూపంలో విస్తరిస్తున్నది. అమెరికాతో సహా అనేక అభివృద్ధి చెందిన పశ్చిమదేశాల్లో శ్వేత జాతీయోన్మాద రూపం, మన ఆసియా దేశాల్లో మతోన్మాద రూపం తీసుకుంది. ఈ వైరస్కు 'హెర్డ్ ఇమ్యూనిటీ' రాకూడదు. ఈ వైరస్పై అవసరమైన క్రిమిసంహారకాలు స్ప్రే చేసి దాన్ని తుదముట్టించాలి.
ఈ సామాజిక రోగం ఒక్కోదేశంలో ఒక్కో కారణంతో అంకురించి విస్తరించింది. ఇంకా విస్తరిస్తోంది. 1865లో అమెరికాలో పుట్టిన కూ-క్లక్స్-క్లాన్ ప్రధానంగా శ్వేతజాతి దురహంకారానికి ఆజ్యంపోసే, పారా మిలటరీ సైన్యం ఉన్న సంస్థ. మనదేశంలో 1925లో పుట్టిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్ు (ఆర్ఎస్ఎస్) పారామిలటరీ సైన్యంతో హిందూ మతోన్మాదానికి ప్రధాన ప్రతినిధిగా ఉంది.
భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు కలసి ఏకోన్ముఖంగా పోరాడుతున్న సందర్భంలో 1925లో ఆర్ఎస్ఎస్ పుట్టింది. దాని లక్ష్యం బ్రిటిష్ కాదు. హిందువులను ఐక్యం చేసి ముస్లింలు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులపై పోరాడటం. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని పట్టాలు తప్పించడం ద్వారా భరత ఖండంలో ''సామ్రాజ్య రవి అస్తమించకుండా'' చూడటానికే ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం.
20వ శతాబ్దం మొదటి పాతికేండ్లు మన దేశంలో కల్లోల భరితమైనవి. అనుశీలన్, జుగాంతర్ సమితి వంటి టెర్రరిస్టు సంస్థలు ఆవిర్భవించాయి. 1913లో గదర్పార్టీ శాన్ఫ్రాన్సిస్కోలో ఏర్పడింది. కాంగ్రెస్ సహాయ నిరాకరణోద్యమానికి పిలుపు నివ్వడం, ఆపివేయడం రెండూ జరిగిపోయాయి. ప్రజలు స్వాతంత్రానికై ఉరకలెత్తుతున్నారు. సోవియట్ ప్రభావం అనేక మంది జాతీయోద్యమ నాయకులపై పడింది. 1919లో జలియన్ వాలాబాగ్ మరణకాండకు జనం క్రోధం కట్టలు తెంచుకుంటున్న వేళ అది. ప్రజల ఆవేశాన్ని దారి తప్పించగల శక్తుల కోసం బ్రిటిష్ సామ్రాజ్యం వెతుకులాడుతున్న దశలో ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది. సావర్కార్ గురువు బి.ఎస్ ముంజే 1931లో ఇటలీ వెళ్ళి ముసోలినీతో చర్చించి పారా మిలటరీ సైన్యం అభివృద్ధి చేసే పద్ధతులను నేర్చుకొచ్చాడు.
1925 నుంచీ చేస్తున్న ప్రయత్నం నేడు పక్వానికొచ్చినట్టు సంఫ్ుపరివార్ నేతలు భావిస్తున్నారు. 2014 నుంచి క్రమంగా ప్రభుత్వాంగాలన్నీ ఆర్ఎస్ఎస్ గుప్పెట్లోకి పోయాయి. నేడు రాజ్యాంగ సంస్థలన్నీ ఆ కోవలోకే చేరిపోయాయి. ఈ దశలో ఉన్మాద వైరస్ విస్తరణ గురించి మన ఆందోళన! ఎదిరించే తరీక గురించి, పాటించాల్సిన పద్ధతుల గురించే ఆవేదన.
ముందు ఒక విషయంలో మనకు స్పష్టతుండాలి. స్థూలంగా 1980 (1979లో మార్గరేట్ థాచర్ బ్రిటన్ ప్రధాని, 1981లో రోనాల్డ్ రీగన్ అమెరికా అధ్యక్షుడు) నుంచి ప్రపంచంలో ఉదారవాద విధానాలు జోరందుకున్నాయి. ''గవర్నమెంట్ హ్యాజ్ నో బిజినెస్ టు బి ఇన్ బిజినెస్'' అన్న మాట 2003లో చంద్రబాబు అన్నా, గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ అన్నా ఇది 1979నాటి మార్గరేట్ థాచర్ డైలాగే. నయా ఉదారవాదానికిది పునాది. ప్రపంచాన్ని ఆవహించింది. దాని కనుగుణంగానే మన దేశంలో 1991 నుంచి ఎవరు పాలకులుగా ఉన్నా, ఏ పార్టీ (కూటమి) అధికారంలోకొచ్చినా ప్రయివేటీకరణలు సాగుతున్నాయి. ప్రభుత్వం అన్ని రంగాల్లోనుంచి తప్పుకుంటోంది. విద్యా, వైద్యం సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. పెట్టుబడిదారీ విధానం ఎంత డొల్లో కోవిడ్-19 ప్రపంచానికి రుజువు చేసింది. మనదేశంలో గుజరాత్ నమూనా పెళుసుదనం నేడు అర్థమవుతూనే ఉందికదా!
వెరసి, నయా ఉదారవాదం ప్రజల ఏ దైనందిన సమస్యకూ పరిష్కారం చూపలేదని ప్రపంచానికి అర్థమవుతోంది. అమెరికాలో ''బ్లాక్లైవ్స్ మ్యాటర్'' ఉద్యమం వెనక నల్లవారిపై సాగుతున్న వివక్షతతో పాటు వారి పేదరికముంది. వారి అవిద్య ఉంది. వారి నిరుద్యోగ ముంది. వైద్య సౌకర్యాల లేమి ఉంది. అన్ని జాతుల ప్రజలకూ ఈ బాధలన్నీ విస్తరించడంతో తెలుపు, నలుపు, గోధుమరంగు ప్రజలంతా ఏకమై ఇటీవల వెల్లువెత్తారు. శిశుపాలుడి వందతిట్లు పూర్తికాలేదు మనదేశంలో. మన పాలకులపై ప్రజలు సుదర్శన చక్రం తియ్యడానికి, వెయ్యడానికి కొంత టైమ్ పట్టేలా ఉంది.
సరళీకృత ఆర్థిక విధానాలు ప్రజల జీవితాలను అస్థిరం పాలు చేసాయి. కొలువులుంటాయో, ఊడతాయో తెలియదు. వ్యాపారాలు ఏ రోజు దివాళా ఎత్తుతాయో తెలియదు. చివరికి ఆలుమగులు ఎంతకాలం కుదురుగా సంసారం చేస్తారో తెలియదు. అన్నిటికి అతీతశక్తులపై ఆధారపడే పాతరాతియుగపు లక్షణాలు కొత్తగా అలుముకుంటున్నాయి. దీనికి కావాలని పెంచే మత భావాలు, పండుగలు చేరాయి. పాతికేండ్ల క్రితం లేని దేవుళ్లు, పండుగలు నేడొచ్చాయి.
ఇంకేం? వైరస్ విస్తరణకు కావల్సిన భూమిక ఏర్పడింది. దీనికి ఆర్ఎస్ఎస్ అబద్ధాల ఫ్యాక్టరీ ఉండనే ఉంది. తాజా ఉదాహరణ ఒక్కటి సరిపోతుంది. రామాలయ నిర్మాణానికి సుప్రీం కోర్టే అనుమతించిందన్న దాన్ని పరిశీలిద్దాం. ''మసీదును ధ్వంసం చేసి అక్కడున్న ఇస్లామిక్ నిర్మాణాన్ని కూల్చడం భారత చట్టాలను ఉల్లంఘించడమే'' అని, ''చారిత్రికంగా జరిగిన తప్పులను నేడు చట్టాన్ని తమచేతుల్లోకి తీసుకుని సరిచేయరాదు'' అని సుప్రీంతీర్పులో పేర్కొంది. వీటిని కప్పిపుచ్చి సుప్రీంకోర్టు తమ వాదనలను అంగీకరించిందని చెప్పడం బీజేపీ తెంపరి తనమే. ఇక ''మథుర, కాశి'' అని నినాదాలివ్వడం 'వైరస్'ను పెంచేవే! ప్రమాదకరమైన ఈ వైరస్ యెడల జర హౌషియార్ రహౌ!