Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ విద్యారంగాన్ని అతలాకుతలం చేసింది. దీంతో ఆన్లైన్ విద్యపై చర్చ జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు ఒకటి నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు విద్యాసంస్థల్లో డిజిటల్ క్లాసుల నిర్వహణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఆమేరకు మార్గదర్శకాలూ జారీచేసింది. కాగా వరంగల్ నిట్ విద్యావెబినార్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ 'ఆన్లైన్ విద్యనే విద్యార్థులకు లైఫ్లైన్' అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అశాస్త్రీయ ఆలోచన. అసంబద్ధ వాదన. ఇది విద్యార్థులను పేద, ధనిక వర్గాలుగా విభజిస్తుంది. పేదలే కాదు మధ్యతరగతి ప్రజలూ ఈ వ్యవస్థను అందుకోలేరు. ఎగువ మధ్యతరగతి మినహా మిగతా వాళ్లూ నష్టపోతారు. గవర్నర్ మాటలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఉన్నతవర్గాలకు వంతపాడటానికే ఉపయోగపడతాయి. అట్టడుగు తరగతులకు ఇంకా ఈ విద్య అందరికీ అందుబాటులోకి రాలేదనే సంగతిని గుర్తించాలి. దేశంలో 80 శాతం ఇంజినీరింగ్ విద్యార్థులకు ల్యాప్టాప్లు, ఈ-పాడ్లూ లేవంటే నమ్మశక్యంకాదు. స్మార్ట్ఫోన్లతో ప్రయోజనాలు స్వల్పం. పీజీ, డిగ్రీ విద్యార్థులకు అవి ఉన్నా, ఇంటర్మీడియట్, టెన్త్, ఇతర కిందిస్థాయి విద్యార్థులకు వాటిపై అవగాహన అంతంతే. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల గురించీ ఎక్కువగా తెలియదు. రిక్షా, అడ్డాకూలీల దగ్గర కమ్యూనికేషన్ కోసం రూ. వెయ్యి ఫోన్లుంటాయి. వారి కుటుంబాలతోపాటు ఇతరులకు సమాచారం ఇచ్చి, పుచ్చుకోవడానికి వాటిని వాడతారు. తమ పిల్లలకు స్మార్ట్ఫోన్లు కొనిచ్చే ఆర్థిక స్థోమత వీరికుండదు. ఒకవేళ సెల్ఫోన్లు ఉన్నా నాణ్యమైన ఇంటర్నెట్ సౌకర్యం ఎక్కడా లేదు. ఇటు ప్రభుత్వంతోపాటు ప్రయివేటులోనూ ఇదే పరిస్థితి. దేశంలో 4జీ నడుస్తున్నది. ఆన్లైన్ క్లాసులు పూర్తిస్థాయి రూపం సంతరించుకునేసరికి 5జీ కూడా వచ్చేస్తుంది. ప్యాకేజీల పేర ఆర్థిక దోపిడీ చేయడం మినహా వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా డేటానూ ఇవ్వట్లేదు. పల్లెల్లో ఇప్పుడు 2జీ నెట్వర్క్ సైతం సరిగ్గా రావట్లేదు. ప్రస్తుతం డిజిటల్ విద్యకు దేశంలో అనుకూలమైన పరిస్థితుల్లేవు. కొద్దిమంది ప్రయోజనాల కోసం పాలకపక్షాలు ఇష్టారాజ్యంగా విధానాల రూపకల్పన చేయడం ఎంతమాత్రం తగదు. సాంకేతికత అందరికీ అందుబాటులోకి వచ్చిందని చెప్పడమే తప్పు. సమస్త సమాజానికి సాంకేతిక ఫలాలు అందే అవకాశాలు ఇంకా పెరగలేదు. జాతీయ విద్యాపరిశోధన, శిక్షణా మండలి (ఎన్సీఈఆర్టీ) ప్రకారం దేశంలోని విద్యార్థులందరికీ ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు లేవు. 28 శాతం గ్రామీణ ప్రాంతాల్లో కరెంటే లేదు. 36 శాతం మందికి అసలు పుస్తకాలు అంటేనే తెలియని అయోమయ పరిస్థితి. దాదాపు సగం మందికి పాఠ్యపుస్తకాలు సైతం అందుబాటులో ఉండని దుస్థితి. ఇంటర్నెట్లో ఈ-పుస్తకాలు ఉంటాయన్న అవగాహనే లేని స్థితి. గత జూన్లో తెలంగాణ రాష్ట్ర ఐక్యఉపాధ్యాయ సంఘం (టీఎస్యూటీఎఫ్) ప్రత్యేకంగా సర్వేని నిర్వహించింది. కరోనా ఉన్నా జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలలు తెరవాలని 93.40శాతం మంది తల్లిదండ్రులు కోరుకున్నట్టు అందులో తేలింది. దీనికి కారణం ఆన్లైన్ తరగతుల కోసం అవసరమైన ఎలక్ట్రానిక్ ఉపకరణాలను కొనలేని నిస్సహాయస్థితే కారణం. అలాగే విద్యారంగంలో అనుసరిస్తున్న తప్పుడు విధానాలు కూడా. ఈ సర్వేలో కేవలం 6.60 శాతం మంది మాత్రమే ఆన్లైన్ విద్యకు ఓటేశారు. రాష్ట్రవ్యాప్తంగా 30,458 మంది ప్రభుత్వ పాఠశాల, 8201 ప్రయివేటు స్కూళ్ల విద్యార్థులను ఆ సంఘం సర్వే చేసింది. ఇందులో 8,911 కుటుంబాలకు స్మార్ట్ఫోన్లే లేకపోవడం ఆశ్చర్యపరిచేదే. 11 వేలకు ఒకటి ఉండగా, 1665కు రెండున్నాయి. 923కు మాత్రమే రెండు కంటే ఎక్కువున్నాయి. 1495 కుటుంబాలకు ఇంటర్నెట్ సౌకర్యమే లేదు. 7,978 కుటుంబాలకు ఇప్పటికీ నెట్ ఉపయోగించుకునే అవకాశమే కరువైంది. 15,400 స్కూళ్లకు అసలే నెట్ లేకపోగా, 3555 పాఠశాలల్లో ఉన్నా , వినియోగం నామమాత్రమే. ఇదిలావుంటే సర్కార్ ఇచ్చిన ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం ఆన్లైన్ తరగతులు టీశాట్, దూరదర్శన్ ద్వారా నిర్వహించాల్సి ఉంది. టీవీలు సైతం లేని పిల్లలు 30శాతం మంది ఉన్నట్టు ఆ సర్వే వెల్లడించింది. సందట్లో సడేమియాలా యాప్ల ద్వారా విద్యా వ్యాపారం చేస్తున్న కార్పొరేట్, ప్రయివేట్ సంస్థలు ప్రస్తుత గడ్డు పరిస్థితులను అడ్డంపెట్టుకుని ఆన్లైన్ క్లాసుల పేర 40 నుంచి 60శాతం మేర అదనపు ఫీజులను విద్యార్థుల ముక్కు పిండి మరీ వసూలు చేస్తుండటం క్షమించరానిది. ఈ తరహా విధానంపై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం సైతం దాఖలైంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, విద్యాశాఖకు గానీ ఈ విషయాలపై ఎలాంటి ప్రత్యేక విధానమంటూ లేకపోవడం ఆందోళన కలిగించేదే. కాగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా పథకం సైతం గ్రామీణ ప్రాంతాలకు సాంకేతికతను విస్తరింపజేయడంలో విఫలమవడం గమనార్హం.