Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చివరికి భజన బృందం వీరావేశం కాంగ్రెస్ వారి టీకప్పులో ముసురుకున్న 'తుఫాను' వాయిదా పడేలా చేసింది. జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం, అంటే సుమారు ఐదున్నర దశాబ్దాల నుంచి వంశపారంపర్యపాలనకు అలవాటు పడ్డ వంది మాగధులు మరోసారి ''గాంధీ కుటుంబానికి'' (వాస్తవంలో నెహ్రూ కుటుంబానికి) తమ రాజభక్తి ప్రకటించుకుని సీడబ్ల్యూసీ సమావేశం అయిందనపించు కున్నారు. దేశ విదేశాల్లో వైద్యం చేయించుకుంటూ బండిలాగుతున్న సోనియమ్మే కొనసాగాలనే నిర్ణయంతో సమావేశం ముగిసింది. సాధారణంగా ఏ బూర్జువా పార్టీలో ప్రజాస్వామ్యం ఉండదు. ఎన్నికలు ఒక తంతులాగా నడుస్తాయి. కాంగ్రెస్లోనూ చాలాకాలం నుంచి ఏ స్థాయిలోనూ ఎన్నికల్లేవు. అన్నీ సీల్డ్ కవర్ రాజకీయాలే! సిద్దాంతం ఏనాడో ఆవిరైపోగా ముఖస్తుతి, వ్యక్తి పూజ మిగిలాయి. దాంతో విధేయత పార్టీకి కాదు, కుటుంబానికన్న సిద్ధాంతం ప్రబలిపోయింది. కాంగ్రెస్ భావ దారిద్య్రానికిది పరాకాష్ట. ఇదొక పరిణామ క్రమం.
కాంగ్రెస్ 'నావ' మునిగిపోతే ఎట్లా? అని కొందరు వాపోతున్నారు. నాయకత్వ సంక్షోభాన్ని త్వరలో పరిష్కారం చేసుకుని బీజేపీని మోటుకునే శక్తి సంపాదించుకోవాలని మరికొందరు అభిలషిస్తున్నారు. ఇక్కడ సమస్య నాయకులదీ కాదు, నాయకత్వ సంక్షోభమూ లేదు. సమస్యంతా విధానాలది. కాంగ్రెస్, స్వాతంత్య్రానంతరం అవలంబించిన కొన్ని విధానాలు ప్రజలకు బాగా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ పరిశ్రమల్లో ఉపాధి, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి జరిగింది. రైల్వేల విస్తరణతో అనేక ప్రాంతాల ప్రజల వ్యాపార వాణిజ్యాలకి ఉపయోగం కలిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున విస్తరించింది. అట్టడుగు ప్రజానీకం, దళితులు, గిరిజనులు, వెనుకపడిన కులాలవారికి రిజర్వేషన్లు అమలు జరిగి ఉపాధి దొరికింది. ఈ విధానాన్ని కొనసాగించాలా? లేదా? అనే చర్చకు కాంగ్రెస్ సమాధానం ఏమిటి? ఈ విషయంలో కాంగ్రెస్ విధానం ఏమిటి? 1991-96 మధ్య ప్రారంభించి 2004-2014 మధ్య ఉధృతంగా కొనసాగిన విధానాలను కాంగ్రెస్ ఎన్నడైనా ఆత్మవిమర్శ చేసుకుంటుందా? అవి సరైనవనుకుంటుందా? జాతీయోద్యమ నాయకురాలు కాంగ్రెస్. భిన్న మతాలు, జాతులు, కులాలు ఉన్న మనదేశంలో ఆ భిన్నత్వాన్ని గౌరవించడం జాతీయోద్యమం ఉగ్గుపాలతో నేర్పింది. గాంధీ, నెహ్రూలు అత్యంత ప్రాధాన్యత నిచ్చింది లౌకికతత్వానికి. 2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్గాంధీ ప్రదక్షిణలు చేసినన్ని గుళ్ళకు మోడీ కూడా పోలేదు. విధానాలు ఆవిరైపోయాక ఇక మిగిలింది ఇవే. దీనికి తండ్రి అడుగుజాడలు రాహుల్కు శిరోధార్యాలైనాయి. 1986లో షాబాను కేసులో సుప్రీంకోర్టు తీర్పును ముస్లిం మతోన్మాదుల వత్తిడికి తలొగ్గి రాజీవ్గాంధీ పార్లమెంటులోనితన మోజారిటీతో రద్దు చేయించడం, దానికి విరుగుడుగా అయోధ్యలో రామాలయం తలుపులు తెరిపించడం హిందువులు, ముస్లింల ఓట్లు దండుకోవచ్చన్న ప్లాను కాంగ్రెసును ఎక్కడికి చేర్చిందో చూస్తూనే ఉన్నాం. 1989 ఎన్నికల క్యాంపెయిన్ రాజీవ్గాంధీ అయోధ్య నుంచే ప్రారంభించాడు. తాను అధికారంలోకొస్తే రామరాజ్యం తెస్తానన్నాడు. ఇవన్నీ లౌకికతత్వానికి నీళ్ళొదిలే అంశాలే. అందుకే మోడీ సర్కార్ను కనీసం లౌకికతత్వాన్ని కాపాడాలన్న అంశం మీద కూడా ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో నేడు కాంగ్రెస్ ఉంది.
సరళీకృత ఆర్థిక విధానాలు అవినీతి కవలపిల్లలు. బీజేపీ తన ప్రచారంలో కాంగ్రెస్ని ఎండగట్టిన ఏకైక అంశం అవినీతి. కాంగ్రెస్ అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని మోడీ చేసిన ప్రచారం ప్రజల మనసుల్లో స్థిరపడిపోయింది. వేలకోట్ల రూపాయల వెంటిలేటర్ల అవినీతి గుజరాత్లో జరిగితే కనీసం కాంగ్రెస్ ప్రశ్నించగలుగుతున్నదా? తాజాగా ఏ మణిపూర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు మారిజోనా వంటి మత్తు పదార్థాల వ్యాపారంలో ఉన్నాడని బీజేపీ గత ఎన్నికల్లో ప్రచారం చేసిందో ఆ వ్యక్తి తాజాగా రాంమాధవ్ సమక్షంలో బీజేపీలో చేరితే కాంగ్రెస్ నోరెందుకు విప్పలేకపోతోంది?
ప్రజల కోసం పనిచేసే స్వభావం గాని, నైజంగాని కాంగ్రెస్కు లేవు. ఇది లేకుండా మోడీ నాయకత్వంలోని బీజేపీసర్కార్ను ఎదిరించడం కాంగ్రెస్కు అసాధ్యం. దీన్ని అర్థం చేసుకోలేని కొందరు (నిజాయితీగానే) దేశంలో శూన్యం ఏర్పడిందని, దాన్ని కాంగ్రెస్తో పూడ్చాలని వ్యాఖ్యానిస్తున్నారు. శూన్యం ఉన్న మాట నిజమే అయినా అది శాస్వతం కాదు. వామపక్షాలు ప్రజల్ని సమీకరించడం ద్వారా, ప్రజా ఉద్యమాలను వేగవంతం చేయడం ద్వారా ప్రత్యామ్నాయాన్ని సృష్టించవచ్చు. 1977లో జనతా పార్టీ ఏర్పడేవరకు ఇందిరకు ప్రత్యామ్నాయం లేదనుకున్నారు. ''ప్రజాస్వామ్యం''నినాదం ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి ప్రత్యామ్నాయమైంది. నేడు మోడీ, అంతకు ముందు కాంగ్రెస్ విధానాలకు విధానపరంగానే ప్రత్యామ్నాయ సృష్టికి ప్రజల్ని కదిలించాలి.