Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరుంధతీ రాజకీయాల్లోకి రాలేదు. ఆ సినిమాలో దుష్టశక్తి పశుపతీ రాలేదు. మరి ఎవరు ఎవర్ని పట్టుకున్నారు? ఎందుకు పట్టుకున్నారు? ఎందుకు వదలట్లేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తవ్వుకుంటూ పోతే మనం చంద్రబాబు నాయుడు పట్టుకున్న ప్రపంచబ్యాంకు దగ్గరికీ.. సారీ!.. ప్రపంచబ్యాంకు పట్టుకున్న చంద్రబాబునాయుడు దగ్గరికి చేరతాం. ఎవరు ఎవర్ని పట్టుకున్నారనే మీమాంస ఎలా ఉన్నా బండలయింది ప్రజల బతుకులే! చంద్రబాబు, వైఎస్, కేసీఆర్ లాంటి పాలకుల్ని వెతికి వల్లో వేసుకుని ప్రపంచ బ్యాంకు ప్రజల బతుకుల్ని బుగ్గి చేస్తూంటుంది. ఆయా దేశాల్లో, ఇప్పుడు మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో వ్యవస్థీకృత సర్దుబాటు పేర విద్యుత్, తాగునీరు మొదలైన వాటిని ప్రయివేటీకరించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగాయి. మోడీ లాంటి పాలకుడు దొరికన తర్వాత హౌల్సేల్ ప్రయివేటీకరణ జరుగుతోంది.
1997, 98లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ రీస్ట్రక్చరింగ్ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టార్ రిఫార్మ్స్ ప్రాజెక్టులు మన పాలకులు చెప్పినట్టు రాష్ట్రాభివృద్ధి జరకపోగా, ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కష్టాభివృద్ధి మాత్రం తప్పడం లేదు. మన రాష్ట్రాన్ని మన ప్రజల్ని పట్టుకుని వదలని ఆ దుష్టశక్తి ప్రపంచ బ్యాంకే! రూపాలు మార్చుకుంది. సారం మాత్రం అదే! తన పాదయాత్రలో వైఎస్ చంద్రబాబుపై నిప్పులు చెరిగినా, తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ చంద్రబాబు, వైఎస్లను తూర్పారపట్టినా అది వ్యక్తుల గురించే. దాంతో బాబు వదిలేసిన ప్రపంచ బ్యాంకు చెప్పుల్లో కాళ్ళు పెట్టడం వీరికి తేలికైంది. పాలకుల పేర్లు వేరైనా, వారి జెండాలు మారినా విధానాలు మారనంతకాలం ప్రపంచ బ్యాంకుకు ఏ ఇబ్బందీ లేదు.
30పేజీల జీఓ నెం.5 వచ్చే వరకు దాని మొదటి పేజీలోనే ''గత ప్రభుత్వం రెండు దశల సంస్కరణలు పూర్తి చేసిందని, మూడవ దశకోసం (సదరు) జీఓ 5'' ఇస్తున్నామని రాసేవరకు చాలా మందికి వైఎస్ ప్రపంచ బ్యాంకు ముఖం కనపడలేదు. తెలంగాణ ఉద్యమ కాలంలో టీడీపీ, కాంగ్రెస్లపై కత్తులూ, కటార్లూ పట్టుకుని 'డాన్ క్విక్సాట్లా' కేసీఆర్ శిగమొచ్చి ఊగితే జనమూ ఊగిపోయారు. కేరింతలు కొట్టారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయకుండా ఆర్టిజాన్ల పేరుతో 'లూప్లైన్'లోకి నెట్టేయడం చూసిన తర్వాత, అన్ని డిపార్ట్మెంట్లలో రెగ్యులైజేషన్ అనే ఊసేలేకుండా గొడ్డు చాకిరీ చేస్తున్న రెండు లక్షల మందికి పైగా కాంట్రాక్టు కార్మికులను చూసిన తర్వాత గాని కేసీఆర్కు ప్రపంచ బ్యాంకుతో ఉన్న చుట్టరికం కనపడట్లేదు మన రాష్ట్ర ప్రజానీకానికి. ప్రపంచబ్యాంకు ప్రాయోజిత కార్యక్రమం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తుందని, ఆ ఊబిలో నుంచి బయటపడటం అసాధ్యమని చంద్రబాబు కాలం నుంచీ వామపక్షాలు, అనేక మంది మేధావులూ హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా పాలకుల తీరు మారలేదు. దారీ మారలేదు. నేటికి మన రాష్ట్ర అప్పు రూ.2.30లక్షల కోట్లు. కొత్తగా వెనకబడిన ప్రాంతాల్లో రోడ్లు, మంచినీరు మొదలైన వాటి అభివృద్ధి కోసం రూ.620 కోట్లు, నాగార్జునసాగర్ కాల్వల నవీకరణ కోసం రూ.2300కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి మన రాష్ట్రం అప్పు తెచ్చుకుంది. ఇంకో రెండు లక్షల కోట్ల రూపాయలు కావాలని దస్తీ పరిచి వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వరంగ పరిశ్రమలను మూసివేయడమో ప్రయివేటీకరించడమో చేయాలనేది 1998లో చంద్రబాబుకు ప్రపంచ బ్యాంకు పెట్టిన షరతు. మొత్తం సహకారరంగంలో స్పిన్నింగ్ మిల్లులు, చక్కెర మిల్లులను ఆయన కాలంలోనే మూసివేశారు. నిజాం సుగర్ ఫ్యాక్టరీ మూసివేతకు గురైంది. ఆల్విన్, రిపబ్లిక్ ఫోర్జ్, ఏపీఎస్ఎస్ఐడీసీ, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలైన పాతిక సంస్థలు బాబు, వైఎస్ కాలంలోనే మూతబడ్డాయి. విద్యుత్రంగాన్ని ముక్కలు చేసి ప్రయివేటీకరించే ముహూర్తాలు పెడితే ప్రజలు పోరాడి నిలువరించుకున్నారు. ఆర్టీసీ, సింగరేణిల మరణశాసనం రాస్తే ఆ రెండు రంగాల కార్మికులు పోరాడి ఆపుకున్నారు. కేసీఆర్ జమానాలో అద్దె బస్సుల పెంపు, ఆర్టీసీ బస్సుల తగ్గింపు, ఆర్టీసీ విస్తరణ ఆపేయడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఆర్టీసీని 'పాడె'మీదికి ఎక్కించే ప్రయత్నంలో ఉన్నారు.
అందుకే రాష్ట్రాన్ని పట్టిన ప్రపంచ బ్యాంకు పీడ విరగడకావాలి. ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కార్ గుండుసూది నుంచి రాకెట్ల వరకు సర్వం ప్రయివేటుపరం చేస్తున్నది. సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేసే ''మహామహులే'' సర్వత్రా కనపడుతున్నారు. గతంలో బెంగాల్, కేరళ, త్రిపురల్లో వామపక్ష ప్రభుత్వాలు కష్టజీవులకు కొండంత అండగా నిలబడేవి. ఎర్రజెండాలు బలహీనపడితే 'కలదు, కలండన్నెడి వాడు కలడోలేడో'' అని గజేంద్రమోక్షంలో ఏనుగులాగా ఆకాశం వైపు చూస్తూ ఏడిస్తే లాభం ఉండదు. శ్రీశ్రీ చెప్పిన ''పతితులు, భ్రష్టులు, బాధాసర్ప దష్టులు బతుకు కాలి, పనికి మాలి, శనిదేవత రథచక్రపు టిరుసులలో పడి నలిగిన వారు'' ఒక్కటై తిరగబడటమే దీనికి మార్గం.