Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్లమెంటు సమావేశాలు ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. మహమ్మారి ముట్టడిలో ప్రపంచమంతా అతలాకుతలమవుతున్న కాలంలో... ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక రోజువారీ కరోనా కేసులు దేశంలో నమోదవుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగుతుండటం విశేషం. విపత్తు విజృంభణ ఏ స్థాయిలో ఉన్నా మన రాజ్యాంగ నియమాల ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ సమావేశాలు అనివార్యం. ఆ మేరకు కట్టుదిట్టమైన చర్యల మధ్య ఈ సమావేశాలు జరుపుతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఎంపీలందరికీ ముందుగానే కరోనా టెస్టులు నిర్వహించడం, రెండు సభల సెషన్లు ఒకేసారి కాకుండా సెషన్కూ సెషన్కూ మధ్య తగినంత సమయం తీసుకోవడం వంటి చర్యలతో పాటు, కోవిడ్ ప్రమాణాలకు లోబడి అనేక జాగ్రత్తలతో ఈ సమావేశాల నిర్వాహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. కానీ ఏ ప్రజాస్వామ్య సూత్రాలకు లోబడి ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారో, ఆ ప్రజాస్వామ్య విలువలకే విఘాతం కలిగిస్తున్నది. ఇది అభ్యంతరకరం, అప్రజాస్వామికం!
సాధారణంగా ఏ చట్టసభలైనా నాలుగు ప్రధానమైన పార్లమెంటరీ నియమాలకు లోబడి జరుగుతాయి. మొదటిది అఫీషియల్ బిజినెస్. ఇది ప్రధానంగా ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించినది. ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు, విధానపరమైన ప్రకటనలు, వివరణలు మొదలైనవి ఇందులో ఉంటాయి. రెండవది ప్రయివేటు మెంబర్ బిజినెస్. అంటే ఏ చట్టసభ సభ్యుడైనా వ్యక్తిగతంగా ఎలాంటి బిల్లునైనా ప్రవేశపెట్టవచ్చు. దీనిపై చర్చ జరిగి సభ ఆమోదం పొందితే ఆ బిల్లులు కూడా చట్టంగా మారవచ్చు. మూడవది ప్రశ్నోత్తరాల సమయం. సభ్యులు ప్రజాసమస్యలపై తాము లేవనెత్తదలచుకున్న ప్రశ్నలను పదిహేను రోజుల ముందుగానే సభాపతికి పంపి వాటికి ప్రభుత్వం నుంచి సమాధానాలు పొందవచ్చు. ఇక చివరిది జీరో అవర్. దేశంలో అప్పటికప్పుడు సంభవించే సంఘటనలు, సమస్యలతో పాటు ప్రజాప్రాధాన్యత కలిగిన ఏ అంశాన్నైనా సభలో ప్రస్తావించే అవకాశం కల్పిస్తుంది. వీటికి పదిహేను రోజుల ముందే ప్రశ్నలు రూపొందించి పంపడం వీలుకాదు గనుక ఈ నియమం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ప్రజావాణిని ప్రతిబింబించే ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేసి, ప్రయివేటు మెంబర్ బిజినెస్ను నిలిపివేసి, జీరో అవర్ను కేవలం అరగంటకు కుదించి, ప్రభుత్వ వ్యవహారాలకు మాత్రమే అవకాశం కల్పిస్తూ ఈ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రజాస్వామ్యానికి చోటెక్కడ..!?
ఇదే విపరీతమనుకుంటే దీనికి కరోనాను సాకుగా చూపడం మరీ విచిత్రంగా ఉంది! ప్రభుత్వ వ్యవహారాలకు అడ్డుకాని కరోనా ప్రజా వ్యవహారాల చర్చకు మాత్రమే ఆటంకమవుతుందా..? పైగా ప్రశ్నోత్తరాలకు అవకాశమిస్తే ఈ కోవిడ్ సమయంలో సభను వీక్షించే సందర్శకుల సంఖ్య పెరుగుతుందన్న కేంద్రమంత్రుల వ్యాఖ్యలు మరీ విడ్డూరంగా ఉన్నాయి. ఈ వింత వాదనలకు తోడు సమయం సరిపోదనే మరో వాదన ముందుకు తెస్తున్నారు. నిజంగానే సమయం తక్కువగా ఉందా అంటే అదీ లేదు. గత పార్లమెంటు పనిగంటలతో పోల్చుకుంటే ఏమీ తగ్గలేదు. ఒక వేళ తక్కువ అనుకుంటే పెంచుకోవచ్చు కూడా. కుదరదు అనుకుంటే మరే అంశంలోనైనా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. కానీ ఇవేవీ చేయకుండా ప్రశ్నోత్తరాలను, ప్రయివేటు మెంబర్ బిజినెస్ను రద్దు చేసి, జీరో అవర్ను నామమాత్రం చేసి, కేవలం ప్రభుత్వం చేయదలచుకున్నది మాత్రమే చేయాలనుకుంటే అది ప్రజాస్వామ్యం గొంతునొక్కడమే.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రశ్నోత్తరాల సమయం ప్రాణవాయువు వంటిది. అందుకే ఏ సభలోనైనా ఫస్ట్ అవర్ క్వశ్చన్ అవరే ఉంటుంది. కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వాయిదా వేసినా తరువాత సెషన్స్లో తప్పని సరిగా చేపట్టాల్సిందే. ఇది ప్రతిపక్షాల ప్రశ్నించే హక్కునే కాదు, ప్రభుత్వాల జవాబుదారీతనాన్నీ ప్రతిబింబిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రశ్నోత్తరాలను రద్దు చేయడమంటే ప్రజల తరపున ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించే ప్రజాప్రతినిధుల హక్కును కాలరాయడమే కాదు, వారిని ఎన్నుకున్న ప్రజలనూ అవమానించడమే. అత్యవసర ప్రజా సమస్యలను సభ దృష్టికి తెచ్చే అవకాశం కూడా లేకుండా జీరో అవర్నూ కుదించేసారు. మరి పార్లమెంటు ఉన్నది ఎందుకు? ప్రజా సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై చర్చించడానికా? లేక కేవలం ప్రభుత్వ నిర్ణయాలు ప్రకటించడానికా? అంటే పార్లమెంటును ఓ చట్టసభగా గాక ఓ నోటీసు బోర్డులా మార్చదలచుకున్నారా? లేక వైరస్ నియంత్రణలో, ఆర్థిక - ఉపాధి రంగాలలో ఘోర వైఫల్యాలకు సమాధానమివ్వడానికి జంకుతున్నారా?
ఇప్పటికే దేశాభివృద్ధికి నాయకత్వ పాత్ర పోషించడం మాని కార్పొరేట్లకు మార్కెట్ను అభివృద్ధి చేసే సహాయక పాత్రలో తరిస్తోంది ప్రభుత్వం. ఈ విషయంలో ప్రతిపక్షం, మిత్రపక్షం అన్న తేడా లేకుండా ఏపక్షాన్నీ విశ్వాసంలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పాలకపక్షం తీరుకు ఇదో పరాకాష్ట! ప్రతిపక్షాల గొంతులనే కాదు, ప్రజాస్వామిక విలువలను సైతం లెక్కచేయని ఈ ధిక్కార వైఖరికి ప్రజాపక్షం మాత్రమే తగిన పాఠం చెప్పగలదు. కాబట్టి ఇప్పుడు మేల్కోవాల్సింది పౌర సమాజమే...