Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు చెల్లించలేమని కేంద్రం చెప్పడం నమ్మకద్రోహం. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అసాధారణమైనవి! మూడంటే మూడే గంటల నోటీసుతో దేశ వ్యాప్తంగా పరిశ్రమలు మూత పడతాయని, వాణిజ్య కార్యక్రమాలు నిలిచిపోతాయని, ఢిల్లీ నుంచి గల్లీ వరకు కిళ్లీ కొట్లు కూడా తెరుచుకోవని, విమానాలు, రైళ్లు, బస్సులు, ట్యాక్సీలు, ఆటోలతో పాటు చివరకు మనుష్యుల నడక కూడా ఆగిపోతుందని, పట్టపగలు కూడా రోడ్ల మీద జన సంచారం కనపడదని, ఒకటి రెండు రోజులు కాదు... నెలల తరబడి ఈ పరిస్థితి కొనసాగుతుందని ఎవరైనా ఊహించగలరా? ఇంతకు ముందెన్నడూ ఎరగని పరిస్థితులివి. సామాన్యులతో పాటు, సర్కారులనూ కష్టాల కడలిలోకి నెట్టేసిన ఈ దుస్థితికి కారణం ఎవరు? కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చాలా సులభంగా దేవుడిపైకి నెట్టేశారు. 'దేవుడు చేసిన పని' అనేశారు. నిజమేనా? చప్పట్లు కొట్టండి, దీపాలు వెలిగించండి, పూలు చల్లండంటూ ఆర్భాటం చేసిన వారి బాధ్యతేమీ లేదా? అయినా, ప్రస్తుత దుస్థితికి కరోనా ఒక్కటే కారణమా? దేశం లోకి కరోనా ప్రవేశించిక ముందే ఆర్థిక స్థితి అధ్వాన్నంగా మారిన విషయం వాస్తవమే కదా! అలా మార్చినవారెవ్వరు? ఈ చప్పట్లు కొట్టమన్న వాళ్లే కదా! ఆ సంగతి పక్కన బెడదాం! కష్టాల్లో ఉన్నప్పుడే కదా ఆదుకోవాల్సింది! కేంద్రమంటూ ఒకటున్నది ఆ పని చేయడానికే కదా! మీ కష్టాలతో, కన్నీళ్లతో సంబంధం లేదు! మీ ఆదాయ వనరులను మాత్రం మేం ఎత్తుకెళతాం! మీ తిప్పలు మీరు పడండనడం ఎక్కడి న్యాయం?
అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన ఈ జీఎస్టీపై ఎన్నో భయాందోళనలు వ్యక్తమైనాయి. సుదీర్ఘ చర్చలు సాగాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల కాళ్లా వేళ్లా పడింది. నచ్చచెప్పింది. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ బలపరిచింది. ఆ తరువాత ఆ ప్రతిపక్ష బీజేపీ పార్టీయే అధికారంలోకి వచ్చింది. కష్టమొస్తే కొండంత అండగా ఉంటానని చెప్పింది. అయినా భయం భయంగానే రాష్ట్ర ప్రభుత్వాలు తమ తలలను కేంద్రం చేతిలో పెట్టాయి. ఇప్పుడు కష్టమొచ్చింది... జీఎస్టీ కాస్తా రాష్ట్రాల పాలిటి గుదిబండ టాక్స్గా మారింది. జీఎస్టీతో రాష్ట్రాల వనరులను ఎత్తుకెళ్లిన కేంద్రం కార్పొరేట్ల కొమ్ముకాసింది. కరోనా విరుచుకుపడిన తరువాత ఆర్భాటంగా ప్రకటించిన 21లక్షల కోట్ల ప్యాకేజి మొత్తం కార్పొరేట్లకు పెట్టిన ఫలహారమే కదా! అంతకు ముందు, ఆ తరువాత కూడా కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన భరోసాను విస్మరించింది. పైగా అప్పులు చేసుకోండని ఉచిత సలహానా! దివాళా అంచుల్లో ఉంటే అప్పులెవరు ఇస్తారు? ఇచ్చినా పెరిగే రుణ భారాన్ని తగ్గించడం ఎలా? అందుకే, ఆ అప్పేదో మీరే చేసి రాష్ట్రాలకు నిధులు ఇవ్వండన్న కేరళ లెఫ్ట్ఫ్రంట్ సర్కారు డిమాండుకు సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ఎందుకంటే జీఎస్టీ కేవలం కేరళ రాష్ట్రానికి మాత్రమే కాదు, రాజ్యాంగం పేర్కొన్న సమాఖ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టుగా మారనున్నది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల హక్కులనూ ఆదాయాలనూ హరించబోతున్నది. ఈ నేథ్యంలో కేరళబాటలో మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా కేంద్రాన్ని నిలదీయడానికి, రాజ్యాంగ బద్ద హక్కుగా తమకు రావాల్సిన నిధులును రాబట్టుకోవడానికి సిద్ధమవుతున్నాయంటూ వస్తున్న వార్తలు స్వాగతించదగినవి. అసలు సంఘ్ పరివార్ తత్వమే ఏకాత్మత. వారి కనుసన్నలలోనే బీజేపీ ప్రభుత్వ ప్రయాణం సాగుతున్నది. ఈ దేశపు బహుళత్వాన్ని నాశనం చేసి, ఒకే దేశం, ఒకే జాతి, ఒకే మతం, ఒకే పాలన, ఒకే పన్ను, ఒకే ఎన్నికలు, ఒకే పార్టీ అనే కేంద్రీకరణ వైపు ప్రయనించడం, ఈ దేశ మార్కెట్ను గుండుగుత్తగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు కట్టబెట్టడం, దేశంలో భూస్వామ్య బ్రాహ్మణీయ మనువాదాన్ని స్థిరపరచడం దాని లక్ష్యాలు. రాజ్యాంగం చెపుతున్న ఫెడరల్ స్వభావాన్ని రద్దు చేసి యూనిటరీ ఏకస్వామ్యాన్ని పాదుకొల్పాలన్నది బీజేపీ ఎత్తుగడ. అందులో భాగంగా వచ్చిపడిందే ఈ జీఎస్టీ. అన్ని రంగాలతో పాటు ఈ జీఎస్టీ ద్వారా ఆర్థికరంగంలోనూ గుత్తాధిపత్యానికి తెగబడుతున్న కేంద్రాన్ని ఇప్పటికైనా ఎదిరించకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఆధారపడే కీలుబొమ్మ ప్రభుత్వాలుగానే మిగులుతాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాల రోజువారీ ఖర్చులకే నిధులు అరకొరగా ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో హక్కుగా రావాల్సిన వాటిని డిమాండ్ చేయడానికి బదులుగా బతిమిలాడితే ప్రయోజనాలు నెరవేరుతాయనుకోవడం భ్రమ! రాష్ట్రాలన్నీ కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా హక్కులను సాధించుకోవడంతో పాటు, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి చర్యలు తీసుకోవడమే ఈ గడ్డు స్థితి నుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుతుంది.