Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరి కోసమో పన్నిన వలలో మరెవరో పడటం విషాదం. సామాజిక మాధ్యమాల చెరలాటలో నిజం దిక్కుతోచక నిశ్చేష్ట అయి నిలిచి ఉంటే అబద్ధాలే సత్యాలుగా ఊరేగుతున్న పాడు కాలమిది. అబద్ధానికి అందమైన వేషం వేసి నిజమే అన్నంతగా భ్రమింపజేసే చాణక్యం ముందు నిజాలు నివ్వెరపోతున్నాయి. ఉన్నచోటనే ఉండి పోతున్నాయి. పోలీసులు, రాజకీయ నాయకులు, పాలకులు కొన్నిసార్లు పథకం ప్రకారం అసత్యాలకు అంతులేని ప్రాధాన్యం ఇస్తారు. నిజాల్ని పాతర వేయడానికి అబద్ధాలకు టక్కరిమాటల పూతలు పూస్తారు. తెలియనివారు నిజాలనుకుని అసత్యాల్ని నమ్మేవారిగా మిగిలి పోతారు. అసలు నిజం తెలిసే సరికి అబద్ధం తన పని తాను ఏం చక్కా పూర్తి చేసుకుంటుంది.
కరోనా కల్లోలపు కాలంలోనూ నేతలు, అధినేతలు, అధికారులు, మీడియా బేహారులు అందరూ అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారు. కరోనా గురించి నిజాలు చెప్పి నిబ్బరంగా నిలబడే స్థయిర్యం ఇచ్చే ధోరణి అధికారంలో ఉన్నవారికి లేదు. ఫలితంగా భయంతో, భీతితో కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీకి ఎరలుగా మారే వారు అనేకులు. లేదంటే కనీస వైద్యం అందక తనువు చాలించేవారు ఎందరో. 'అందరికీ ఆరోగ్యం' అన్న కలని సాకారం చేసే నిబద్ధత, నిర్ణయాత్మక ధోరణి పాలకులకు లేదు. కనీసం భయపడక్కర్లేదని ధైర్యం చెప్పే సోయి కూడా లేని నేతలు మంత్రులుగా చెలామణవటం ప్రజలపాలిటి శాపం.
వ్యవసాయ రంగం, ఆర్థిక రంగం సంస్కరణల పేరిట అంతా ప్రయివేటుమయం చేసే కుట్రలు చెలరేగిపోతున్న సంక్షుభిత సందర్భంలో ఆర్థికవ్యవస్థ పయనం మీద నిజాలుచెప్పే చేవ కనిపించడం లేదు. ఆత్మనిర్భర భారతమంటూ పేదల్ని మరింత పేదలుగా, దిక్కులేనివాళ్ళుగా చేసే వాణిజ్య కుట్రలని యధేచ్ఛగా అనుమతిస్తున్నారు. రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసి, ఆ రాజ్యాంగానికే తూట్లు పొడిచే ధోరణితో చెలరేగిపోవడం దుర్మార్గం. తమ దుర్మార్గాలని కప్పిపుచ్చుకోడానికి ప్రశ్నించిన వారిని రాజద్రోహులంటున్నారు. ప్రశ్నించే చైతన్యం ప్రోది చేసేవారిని కటకటాల పాల్జేస్తున్నారు.
నిజాలు పలికేవారిని గందరగోళపరిచేందుకు అబద్ధాలని అందమైన నిజాలుగా ప్రచారం చేయడం కౌటిల్యం. విజ్ఞులనుకున్నవారు సైతం ఈ కౌటిల్యపు వలలో చిక్కుకుపోవడం సామాజిక మాధ్యమాల విశృంఖలత దుష్ఫలితం. అబద్ధమేదో, నిజమేదో తెలుసుకోకుండానే అబద్ధాల వలలో పడిపోయి నిజాల పక్కన నిలబడే వారిని శంకించడం దురవస్థ. ఎవరు లొంగిపోతున్నారో, ఎవరు నిలబడి కలబడుతున్నారో తెలుసుకోకుండానే ప్రజల పక్కన నిలబడిన వారిని శంకించడం విరోధాభాస.
నిజాల్ని, అబద్ధాల్ని ఒకే గాటగలిపి నిజం రూపం తెలియకుండా ఏమార్చే కుతంత్రాలకు హద్దులు, సరిహద్దులుండవు. సుశాంత్ మరణం ఒక చిక్కుముడేం కాదు. మనిషి కదలికల్ని, ఆలోచనల్ని, మాటల్ని సైతం రికార్డు చేసే అత్యాధునిక సాంకేతిక నైపుణ్యం ఉండగా నేరం ఎవరిదో, నేరస్థులెవరో తెలియకపోదు. కానీ ఒక మరణం చుట్టూరా ఎన్నెన్ని రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు అల్లవచ్చునో ఇటీవలి మరణోదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. అధికారంలో ఉన్నవారు నిజం గొంతు నొక్కాలనుకుంటే తిమ్మినిబమ్మిని చేయగలరు. టెక్నాలజీని సైతం తమకు అనువుగా వాడుకోగలరు. అందుకని టెక్నాలజీ దానంతటది పారదర్శకం కాదు. దానికి కూడా వర్గ స్వభావం ఉంటుంది. డబ్బున్న మారాజులకు అనువుగా ఊడిగం చేస్తుంది. అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా ఆవిష్కరింప జేయడానికి టెక్నాలజీ తోడ్పడుతుంది. టెక్నాలజీ ఒక సాధనం మాత్రమే. దానిని ఎవరు ఎప్పుడు ఎలా వాడాలని అనుకుంటే అలాగే వాడుతారు. అంతిమంగా తమ ప్రయోజనాలకు నష్టం లేనంతవరకు మాత్రమే టెక్నాలజీ పారదర్శకతకు అనుమతించడం పాలకుల వ్యూహం.
నూరు అబద్ధాల నడుమ ఒక నిజం తనంతతానుగా కదలక మెదలక నిలబడి వుంటుంది. దానిని చూడగల ఓర్పు, విజ్ఞత, లోతైన దృష్టి కావాలి. కండ్లకు కనిపించేదంతా నిజం కాదు, టీవీల్లో చూపేదంతా నిజం కానే కాదు. కనిపించే నిజం వెనుక వున్న అబద్ధాల వ్యూహాన్ని చూడగలిగే వివేచనా నేత్రం ఉండాలి. దేశంలో ఎన్నెన్నో సమస్యలు, బాధలు ఉండగా మనకు సంబంధం లేని ఒకే సన్నివేశాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నారో అర్థం చేసుకోవాలి. టీవీ చానల్స్ అన్నీ రియాచక్రవర్తి చుట్టూరానే రోజుల తరబడి తిరుగాడుతున్నాయెందుకో ఆలోచించాలి. ఒక దృశ్యాన్ని పదేపదే చూపిస్తున్నారంటే ఇంకేవో చూపాల్సిన నిజాలకు పాతర వేస్తున్నారని అర్థం.
దేశభక్తి మంత్ర జపం కూడా ఇలాంటిదే. ఈ దేశానికి, ఇక్కడి ప్రజలకు తక్షణం వచ్చిన ప్రమాదం లేదు. అయినప్పటికీ ఏదో విపత్తు ముంచుకొస్తుందనే హంగామా ఎందుకు? ఆకలితో, ఉపాధి లేమితో అల్లాడే గొంతులు వినిపించకూడదనే. రేప్పొదున ఇంటికిరాయి కట్టాలనే బాధముందు సరిహద్దు తగదాలు దూదిపేలికలే. అంగుళం జాగా ఎవరో ఆక్రమించడం సంగతటుంచితే ఇంటిగలాయన రోడ్డు మీదకు గెంటితే ఆదుకునే వారు ఎవరూ కనిపించరు. అయినా దేశభక్తి కొంగజపం సకల మాధ్యమాలలో వినిపిస్తుంది. పూటకు గతిలేని, ఉండటానికి గూడు లేని, బతకటానికి ఆదరువు లేని కోట్ల మంది సామాన్యుల దీనాలాపన చూపడానికి, చెప్పడానికి ఏ మాధ్యమాలూ ముందుకు రావు. అబద్ధాలకు అలవాటు పడిన మాధ్యమాలు నిజాల్ని జీర్ణించుకోలేవు. అయినా నిజం నిప్పు లాంటిది. నివురు గప్పి ఉన్నంత మాత్రాన అది చల్లారిపోయినట్టు కాదు, మాసి బూడిదయిపోయినట్టూ కాదు. దానిని రాజేసే వాతావరణం కోసం, గాలి దుమారం కోసం తనకు తెలియకనే ఎదురు చూస్తుంటుంది. ఆ వాతావరణాన్ని ప్రోది చేయడం నిజం కోసం తపించేవారి అనివార్యమైన కర్తవ్యం.