Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఆనందం', 'బ్రహ్మానందం', 'పరమానందం' లాంటివి ఆనందంలో శ్రేణులు. 'పరమానందం' బహుశా సుపర్లేటివ్ డిగ్రీ కావచ్చు! 'రాక్షసానందం' ఈ వరసలోది కాదు. పోనీ రాక్షసులకుండేది రాక్షసానందమా!? ఏమో! కావచ్చేమో! దీన్ని తిరగేసి చెప్పుకుంటే తేలిగ్గా అర్థమవుతుంది. ఈ 'పర్టిక్యులర్' ఆనందం పొందేవారు మాత్రం నిజంగా రాక్షసులే! (అంటే హిందూ పురాణాలు రాక్షసీకరించిన వారి గురించి కాదు సుమా!) పైగా ఈ రాక్షసానందం పాలకులకుంటే! ప్రజల బతుకులు చట్టుబండలు కాక ఏమవుతుంది? ఇలాంటి పాలకులు ఇక్ష్వాకుల కాలంలో ఉండి ఉంటే అది పురాణ కాలక్షేపం అయ్యుండేది. గుప్తుల కాలంలో ఉన్నారంటే చరిత్ర పాఠ్యాంశమయ్యేది. వర్తమాన పాలకులకుండటమే మన ప్రారబ్దం.
మోడీ సర్కార్ తాజా నిర్ణయాన్ని వేడివేడిగా పరిశీలిద్దాం. మొన్ననే సెప్టెంబర్ మాసాన్ని పౌష్టికాహార మాసంగా ప్రభుత్వం ప్రకటించింది. 'తల్లుల దినం' 'తండ్రుల దినం' (తెలుగులో అసహ్యంగా ఉందనుకుంటే మదర్స్ డే, ఫాదర్స్ డే) వంటివి 'దినాలే' ఉంటే పౌష్టికాహారాన్ని నెలంతా ప్రభుత్వమే అందిస్తుందేమో అనుకుంటే తప్పులో కాలేసినట్టే! బాదం, పిస్తా పప్పులు పెట్టకపోయినా కనీసం జనానికి కోడిగుడ్డు అయినా అందిస్తే ప్రజల బాగోగులను ఈ ప్రభుత్వం పట్టించుకునేందుకే 'మాసం' ప్రకటించారనుకునేవాళ్ళం. అప్పుడు పౌల్ట్రీ పరిశ్రమ ఎంత అభివృద్ధి అయ్యేది? ఎన్ని లక్షలు, కోట్ల మందికి ఉపాధి దొరికి ఉండేది?!
ఈ ప్రభుత్వానిది 'రాక్షసానందం' ఎందుకంటే కోవిడ్ కాలంలో దేశంలో నిష్టదరిద్రులు మరింత పెరిగారు. 2019 డిసెంబర్ నాటికే దేశంలో నిరుద్యోగం గత 45ఏండ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. 2017-18 నాటికే గ్రామీణ ప్రజల తలసరి నిజ వినియోగ ఖర్చు (పర్ క్యాపిట రియల్ కన్జంప్షన్ ఎక్స్పెండించర్) 1972-73 నాటి కంటే తగ్గింది. ఆనాడు ఒపేక్ దేశాల (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియమ్ ఎక్స్పోర్ట్ కంట్రీస్) ఆయిల్ దెబ్బ ప్రధాన కారణం. నేడు అటువంటి బాహ్యకారణాలు లేవు. విస్తృత ప్రజానీకం పేదరికం పెరిగిపోవడానికి కారణం 2016 చివర్లో నోట్లరద్దు, 2017 జూలై 1న జీఎస్టీ ప్రకటనలే కీలకం. చిన్న పరిశ్రమలు ఆనాటి దెబ్బల నుంచి ఇంకా కోలుకోలేదు. అంటే, మానవ కల్పిత, ఇంకా నిర్దిష్టంగా చెప్పుకోవాలంటే ఎన్డీఏ ప్రభుత్వ కల్పిత చర్య దీనికి కారణం. దెబ్బమీద దెబ్బ కరోనా దెబ్బ పడింది.
అత్యధిక మంది ప్రజలకు రెండుపూటలా ఐదువేళ్ళూ నోట్లోకి పోవడమే కష్టంగా ఉంటే పౌష్టికాహారం గురించి పాలకులు మాట్లాడటం ప్రజల్ని అపహాస్యం చేయడం కాదా! నేడు పప్పుల ధరలు కిలో వంద, 120 రూపాయలకు పైనే ఉండగా, ఖాద్యతైలాలూ 130 రూపాలకు చేరాయి. చక్కెర కిలో 40, బెల్లం 70రూపాలయకు ఎగబాకిన తర్వాత ప్రజలు ఏం కొంటారు? ఏం తింటారు? ప్రత్యేకంగా కరోనా కాలంలో వ్యక్తిగతంగా స్టామినా పెంచుకోవాలని వైద్యశాస్త్రం ఘోషిస్తుంటే వచ్చే అరకొర సంపాదనతో పౌష్టికాహారం ఎలా తింటారని మోడీ సర్కార్ భావిస్తోంది? బళ్ళల్లో మధ్యాహ్న భోజనంలో నీళ్లపప్పు ఇండ్లలో దానికీ కరువైన కుటుంబాలవి! 2009 కంటే ముందు గ్రామాల్లో పట్టణాల్లో వరుసగా 2400 క్యాలరీల 2100 క్యాలరీల శక్తి వచ్చే ఆహారం తీసుకోగలిగే సామర్థ్యాన్ని బట్టి పేదరిక రేఖకు దిగువ, ఎగువ నున్న ప్రజలుగా విడగొట్టేవారు. 2009లో సురేష్ టెండూల్కర్ కమిటీ ఆహారం, ఇంధనం, విద్య, వైద్యం, ట్రాన్స్పోర్టులపై ఖర్చు చేయగల శక్తిని బట్టి గ్రామాల్లో రూ.27.2లు, పట్టణాల్లో రూ.33.3లు సంపాదించే వారిని దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టుగా పరిగణించింది. దీన్ని యూపీఏ కాలంలో (2014లో) డా|| సి. రంగరాజన్ కమిటీ రూ.33లు, రూ.47గా మార్చింది. ఆ తర్వాత మోడీ సర్కార్ నిటి ఆయోగ్ ఆనాటి వైస్ఛైర్మన్ అర్వింద్ పనగారియా నాయకత్వంలోని 14 మంది సభ్యుల బృందం దేశంలో 48.40కోట్ల మంది పేదరికంలో ఉన్నట్టు తేల్చింది. కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో దేశంలో నిష్టదరిద్రుల సంఖ్య పెరిగిందే తప్ప తగ్గలేదు. వీళ్ళంతా పౌష్టికాహారం తీసుకోగలుగు తారని భావించిన ప్రభుత్వాలది 'రాక్షసానందం'మే.
మోడీ సర్కార్ 2016లో నియమించిన సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సీఎన్ఎన్ఎస్) తన నివేదిక 2018లో ఇచ్చింది. దాన్లో చిన్న పిల్లల్లో ఎదుగుదల లేకపోవడం (స్టంటెడ్ గ్రోత్) 38.4శాతం ఉంది. సాధారణ ఆహార పదార్థాలను తీసుకోవడంలో లోపమే పోషక విలువలు పడిపోవడానికి కారణమని ఆ సర్వే తేల్చింది. పిల్లల్లో పోషక విలువలు సరిగా లేకపోవడానికి వారి తల్లుల ఆరోగ్యంతో పాటు తల్లుల విద్యాస్థాయికి, వారి కుటుంబ ఆదాయాలకు ఉన్న లింకును సర్వే ఎత్తిచూపింది. 6-23నెలల మధ్య వయసున్న బిడ్డల్లో కేవలం 9శాతం మంది మాత్రమే ఐరన్ ఉండే ఆహారాన్ని అందివ్వగలుగుతున్నారట. ఈ స్థితిలో దేశంలోని అత్యధిక మంది ప్రజలుంటే ''బాగా తినండి'' ''ఫిట్ ఇండియా'' వంటి నినాదాలు ఇస్తూ కూర్చున్న పాలకులకు 'రాక్షసానందం' ఉందంటే తప్పేమైనా ఉందా? 'మదేశంలో ప్రధాన సమస్య పేదరికం, న్యాయం అందకపోవడమే'' అని ప్రొ|| హెచ్పీఎస్ సచ్దేవ్ చెప్పింది పాలకుల చెవుల సోకేది ఎన్నడో!