Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర శాసనసభా సమావేశాలు ప్రారంభమయ్యాయి. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు సహజంగానే వాటిపై ఆశలు పెట్టుకుంటారు. అది వారి హక్కు కూడా. కరోనా కష్టకాలంలో ఉపాధిపోయి నోటికాడి ముద్దకు దూరం కావడం, వైద్యారోగ్యపరమైన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో సభ జరగడం మంచిదే. అవసరం కూడా. తమ బాధలను అందులో చర్చించి పరిష్కరిస్తారనే ప్రజల భావనా సరైందే. ఈ నెల ఏడున టీఆర్ఎస్ సర్కారు శాసనసభా సమావేశాలకు శ్రీకారం చుట్టింది. మొత్తం 17రోజుల పాటు నిర్వహణకు బీఏసీ నిర్ణయించింది. స్పీకర్, చైర్మెన్లు సమావేశాల షెడ్యూల్ను సైతం విడుదల చేశారు. వీటిని చూశాకే ఆశ్చర్యం వేసింది. ఆందోళనా కలిగింది. ప్రశ్నోత్తరాలను కేవలం ఆరు ప్రశ్నలకే కుదించడం, ఒక్కో ప్రశ్నకు సమయాన్ని నిర్దేశించడం సరికాదు. గతంలో దాదాపు రెండు గంటలుగా ఉన్న సమయాన్ని గంటకు, సుమారు 15 నుంచి 20 ప్రశ్నల నుంచి ఆరింటికే పరిమితం చేయడం ప్రజల హక్కులకు భంగం కలిగించడమే అవుతుంది. జీరో అవరూ గంట నుంచి అరగంటకు తగ్గించారు. దీంతో అసెంబ్లీ సమావేశాలపై అనుమానాలకు ఆస్కారం కలుగుతున్నది. ప్రశ్నోత్తరాలు ప్రజాసమస్యలు తెలుసుకోవడానికి ఒక మార్గమనే విషయాన్ని గులాబీ సర్కారు మరిచిపోతున్నది. అసలు అసెంబ్లీ అంటే ప్రజాసమస్యల పరిష్కారానికి వేదికగా గుర్తెరగాలి. మీడియా పాయింట్నూ ఎత్తేయడం విడ్డూరం. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ అయిన చట్టసభల్లో ప్రజాసమస్యలకు ప్రాధాన్యత లేకపోవడం గమనార్హం. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ అడుగుజాడల్లో నడుస్తున్న కేసీఆర్ ప్రభుత్వం, తొలుత ప్రశ్నోత్తరాలు, జీరో అవరునూ రద్దుచేసింది. తర్వాత మళ్లీ ఏమనుకున్నారో తెలియదుకానీ, ఆ రెండింటికి కోవిడ్ పేర పరిమితులు విధిస్తున్నది. తద్వారా ప్రజాసమస్యల పట్ల ఉన్న అలక్ష్యాన్ని బయటపెడుతున్నది. కొత్త చట్టాలు తేవడం, పాతవాటికి సవరణలు చేయడం, బిల్లులను పాస్ చేయడాన్ని ఎవరూ కాదనరు. కానీ, జనం కష్టాలను పట్టించుకోకుండా గాలికొదిలేయడం ఆందోళనకరం. బుధవారం శాసనసభలో కరోనాపై ప్రతిపక్షాలు మాట్లాడుతుండగా సీఎం అడ్డుకోవడాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? పూర్తిస్థాయిలో చర్చ జరిగితే గులాబీ సర్కారు వైఫల్యాలు బయటపడతాయనే కదా! ప్రపంచం, దేశం, రాష్ట్రం కరోనాతో క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, అసెంబ్లీలో దానిపై నాలుగు మాటలు మాట్లాడడానికి సర్కారుకు మనసు రాకపోవడం ఆవేదన కలిగించేదే. అసెంబ్లీ బిజినెస్ను నిర్వహించుకోవడానికి అడ్డురాని కరోనా, ప్రజాసమస్యలను ప్రస్తావించడానికి, చర్చించడానికి ఎలా ఆటంకమవుతున్నదో అధికారపార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ ప్రశ్నించాలి కూడా. అప్పుడే అది ప్రజా అసెంబ్లీ అవుతుంది. సమగ్ర చర్చ ద్వారా నిరుపేదలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైద్యం పేర నిరుపేదల రక్తాన్ని పీలుస్తున్న కార్పొరేట్, ప్రయివేటు ఆస్పత్రుల ఆర్థిక దోపిడీ, అరాచకాలపై కనీస చర్చకు అవకాశం లేకుండా పోవడం అన్యాయం. గర్భవతైన గ్రూప్-2 అధికారి శ్వేతారెడ్డి మరణం ఇందుకో మచ్చుతునక. రూ.29 లక్షల సొమ్ము కట్టించుకుని నెల రోజుల తర్వాత శవాన్ని అప్పగించిన వైనం బాధాకరం. ఎవరైనా గాంధీ అస్పత్రిలో చికిత్స చేయించుకోవాల్సిందే అన్న సీఎం, ఆతర్వాత ఆ మాటను మరిచి ఎవరైనా ప్రయివేటుకు వెళ్లాల్సిందేనన్న తరహా పరిస్థితులను సృష్టించారు. లాక్డౌన్ కాలంలో పేదలకు ఇచ్చిన స్వల్ప సాయాన్నీ బంద్ చేశారు. బియ్యం ఇస్తున్నా, జనం కష్టాలు తీరవనే సంగతినీ ప్రభుత్వాలు గమనించకపోవడం గమనార్హం. వలస కార్మికుల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. కేంద్రం నుంచి రావాల్సిన సాధారణ, జీఎస్టీ, ఐజీఎస్టీ నిధులు మొత్తం రూ.24 వేల కోట్లకు సంబంధించి చర్చ జరుగుతుందా? లేదా? అనేదీ అనుమానమే. ప్రజా సమస్యలపై దీర్ఘకాలిక చర్చలకు అవకాశం కల్పించడం ద్వారా పరిష్కారానికి కృషిచేయాల్సి బాధ్యత సర్కారుపైనే ఉంది. రాష్ట్రంలో అనేక సమస్యలపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు పోరాటాలు, ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. పంచాయతీ, మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీలు, మధ్యాహ్నా భోజనం వర్కర్లు, ఆశాలు, డాక్టర్లు, నర్సులు తమ సమస్యలపై ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో వినతులు ఇచ్చారు. ధర్నాలూ చేశారు. కోవిడ్ కాలంలో సాక్షాత్తు వైద్యా ఆరోగ్యశాఖలో జరుగుతున్న ఆందోళనలకు ప్రభుత్వ అలసత్వమే కారణం. చట్టాలను కుదించి కోడ్లు తేవడం వెనుక కార్మికుల ప్రయోజనాలను పణంగా పెట్టడమే. విఆర్వో, విఆర్ఏ వ్యవస్థలను రద్దుచేయడంలో ప్రభుత్వం నియంతృత్వాన్ని ప్రదర్శించింది. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, రెవెన్యూ అసోసియేషన్లను లేశమాత్రంగా కూడా విశ్వాసంలోకి తీసుకోలేదు. బ్యూరోక్రాట్లపై ఉన్న నమ్మకం ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన రాజకీయపార్టీలపై లేకపోవడం, వాటిని కావాలనే విస్మరించడం ఎంతమాత్రం సహించరానిది. ప్రయివేటు, కార్పొరేట్ ఎప్పుడైనా సొంత ప్రయోజనాలు, లాభాలకే ప్రాధాన్యతను ఇస్తాయనే సంగతిని కరోనా రుజువు చేసింది. కానీ, దాన్ని గుర్తించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సుతారమూ ఇష్టంలేనట్టుగా కనిపిస్తున్నది.