Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ ప్రభుత్వానికైనా ప్రజా సంక్షేమం మొదటి ప్రాధాన్యతగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలుగుతుంది. కానీ అందుకు భిన్నమైన ప్రాధాన్యతలున్నప్పుడు ఆ ప్రభుత్వంలో ప్రజా శ్రేయస్సుకు ఆస్కారమే ఉండదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు దీనిని మరింత స్పష్టం చేస్తున్నది. కరోనా విజృంభణలో ప్రజలను వారి కర్మకు వదిలేసిన ప్రభుత్వం, దీనినొక అవకాశంగా తీసుకుని చేపడుతున్న చర్యలు వారి ప్రాధాన్యత లేమిటో చెప్పకనే చెపుతున్నాయి. ప్రజాజీవితంలో భౌతికదూరం అనివార్యమైన పరిస్థితులను, అనేక ఆంక్షల మధ్య ఏ విధమైన నిరసనలకూ అవకాశంలేని పరిస్థితులను అదునుగా చేసుకుని తన ప్రజావ్యతిరేక విధానాల అమలును తీవ్రతరం చేస్తోంది మోడీ ప్రభుత్వం. ప్రయివేటీకరణను వేగవంతం చేయడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఆంక్షలు ఎత్తివేయడం, పర్యావరణ నిబంధనలను పూర్తిగా సడలించడం, నూతన విద్యా విధానం పేరుతో విద్య కార్పొరేటీకరణకూ కాషాయీకరణకూ తెరలేపడం, కార్మిక చట్టాలను కాలరాయడం, రాష్ట్రాలకు ఆర్థిక సహాయాన్ని నిరాకరించడం, వ్యవసాయ ఆర్డినెన్సులు తీసుకురావడం, విద్యుత్ సంస్కరణలు చేపట్టడం.. ఇవన్నీ పరిశీలిస్తే ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలేమిటో సులువుగానే తెలిసిపోతుంది. కరోనా నివారణకు కనీస చర్యలు కూడా చేపట్టలేని ప్రభుత్వం.. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టడంలో ఎంత వేగంగా స్పందిస్తోందో తేలికగానే అర్థమవుతుంది. బహుశా బడాబాబుల సేవలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని ఎక్కువ చర్యలు చేపట్టిన ప్రభుత్వమేదీ గతంలో లేదేమో..!
దీనిని వీరు సమర్థించుకుంటున్న తీరు మరీ అన్యాయంగా ఉంది. ఈ కరోనా మహమ్మారి అన్ని రంగాలనూ ప్రభావితం చేస్తున్న తరుణంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికే ఈ చర్యలని సెలవిస్తున్నారు. అందుకే రూ.21లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలోనూ అధికభాగం కార్పొరేట్లకే ముట్టజెప్పారు. మన జీడీపీ పడిపోకుండా చూడాలన్నా, విదేశీ పెట్టుబడుల రావాలన్నా, ఈ కరోనా తగ్గిపోయే సమయానికి మనం తగిన మోతాదులో ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తే తప్ప అభివృద్ధిలో ముందుకు దూసుకుపోలేం అని కబుర్లు చెబుతున్నారు. అమెరికాలో ట్రంప్, బ్రిటన్లో బోరిస్ జాన్సన్లది కూడా ఇదే వాదన. ఇంతా చేసి వీరూ, వీరిని అనుసరించి మన ఏలినవారూ సాధించిందేమిటి? అమెరికా ఆర్థికవ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి 9.5శాతం పడిపోయింది. మన జీడీపీ ఏకంగా 23.9శాతానికి దిగజారింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంతటి భారీ పతనం ప్రపంచంలో మరే ఆర్థిక వ్యవస్థలోనూ లేదు. అంటే వీరి చర్యలు అటు ప్రజలను ఆదుకున్నదీ లేదు, ఇటు ఆర్థిక వ్యవస్థను కాపాడిందీ లేదు గానీ, కార్పొరేట్లకు మాత్రం ఏ కష్టమూ రాకుండా చూసాయని తేటతెల్లమవుతున్నది. కరోనా మీద పోరాడకుండా, కష్టజీవులను ఆదుకోకుండా, కార్పొరేట్లకు ఉద్దీపనలు ప్రకటిస్తే జీడీపీలో వృద్ధిరేటు సాధించవచ్చునన్న సూత్రం శుద్ధ తప్పు అని తేలిపోయింది.
సోషలిస్టు దేశాలైన చైనా, వియత్నాం, క్యూబా వంటి దేశాల అనుభవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రపంచంలో అందరికన్నా ముందు కరోనా దెబ్బ తగిలిన దేశం చైనా. వైరస్ ప్రారంభదినాలలో (జనవరి - మార్చి) చైనాలో నమోదయిన కేసులు 82,000. ఆ తరువాత ఇప్పటిదాకా నమోదయిన కేసులు కేవలం మూడువేలు. ఈ మొత్తం కలిసినా నేడు మన దేశంలో ఒక్క రోజులో నమోదవుతున్న కేసులన్ని కూడా లేవు. అంటే కరోనా కట్టడిలో చైనా ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఈ వైరస్ వెలుగు చూసిన వూహాన్ రాష్ట్రాన్ని దాటి ఇతర రాష్ట్రాలకు విస్తరించకుండా చేసింది. అదే కట్టుదిట్టమైన చర్యలతో తిరిగి తన ప్రజలను అచిరకాలంలోనే ఉత్పత్తిలో బాగస్వాముల్ని చేసింది. ఫలితంగా ఇంతటి విపత్కాలంలోనూ ఈ ఏడాది రెండో త్రైమాసానికి 3.2శాతం వృద్దిరేటును సాధించింది. క్యూబా, వియత్నాం వంటి ఇతర సోషలిస్టు దేశాలు కూడా ఈ విధానంలోనే ప్రగతిని సాధిస్తున్నాయి.
ఈ ఫలితాలు కండ్లముందు కనపడుతున్నా గుర్తించడానికి సిద్ధంగా లేరు అమెరికాలో ట్రంప్. ఆ ట్రంప్నే అనుసరిస్తున్నారు ఇండియాలో మోడీ. ఫలితంగా మూడు దశల లాక్డౌన్లు, నాలుగుదశల అన్లాక్ల తర్వాత కరోనా కేసుల్లోనూ అమెరికానే అనుసరిస్తూ ప్రపంచంలో రెండవ స్థానానికి చేరుకుంది దేశం. ఇక ఆర్థికవృద్ధిలో అమెరికానే మించిన పతానాన్ని సాధించింది. అటు పెట్టుబడిదారీ దేశాల అనుభవాలూ ఇటు సోషలిస్టు దేశాల అనుభవాలూ రెండూ చెబుతున్న సత్యం ఒక్కటే. కరోనాను నియంత్రించి, ప్రజల ఉపాధిని కాపాడితే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది తప్ప కార్పొరేట్లను కాపాడటం వలన కాదు అని. ప్రజల ఆరోగ్యాల్నీ, ఆర్థిక అవసరాల్నీ గాలికొదిలేసిన చోట ఆర్థిక వ్యవస్థ పుంజుకోలేదు సరికదా మరింత క్షీణిస్తోందని ఈ అనుభవాలు చెపుతున్నా తీరు మారని ఏలికలు ఇవేవీ తెలియక చేస్తున్నారని అనుకోలేం. వారు అనుసరిస్తున్న విధానాలు ఏ ఫలితాలనిస్తాయో, ఎవరికి లభ్ది చేకురుస్తాయో వారికి స్పష్టంగా తెలుసు. వారి ప్రాధాన్యత ప్రయివేటు పెట్టుబడికి ఊడిగం చేయడమే తప్ప ప్రజలను ఉద్ధరించడం ఎంతమాత్రమూ కాదని కూడా వారికి బాగా తెలుసు. తెలుసుకోవాల్సింది ప్రజలే...