Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముందుగా ఈతరానికి ఆలోచించడం నేర్పాలి అంటారు ప్రముఖ రచయిత్రి జలంధర 'పున్నాగపూలు' నవలలో. సరైనవిధంగా ఆలోచించడమెలానో చెబుతారామె. ఎట్లా ఆలోచించాలో తెలియకపోతే మన చుట్టూ ఉన్న విషయాల్ని అర్థం చేసుకోవడం కష్టం. మార్కెట్లు, మీడియా మన మనసుల్ని, ఆలోచనల్ని, భావాల్ని నియంత్రించే సంక్లిష్టమైన కాలమిది. ఎవరో చెప్పిన మాటల్ని శిరోధార్యంగా భావిస్తే తప్పుడు భావాల వలలో చిక్కుపడతారు. మీడియా మాయాజాలంలో తప్పిపోతారు. మంచీచెడూ కలగాపులగమైపోయిన చోట మంచి ఏదో, మంచి మాటల వెనుక ఉన్న కుటిలబుద్ధి ఏమిటో గ్రహించాలంటే సవ్యమైన ఆలోచన తప్పనిసరి.
అధికారం చెలాయించే వారి మాటల్నీ, చేతల్నీ నమ్మడం మొదలుపెడితే సత్యం బోధపడదు. 'మంచి' అనుకునే మాటల వెనక వుండే అసలు రంగు అర్థం కాదు. భావాల నియంత్రణ ద్వారా పెత్తనం చెలాయించడం గద్దెలెక్కిన వారి స్వభావం. మరీ ముఖ్యంగా కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు తమ మాటలు నమ్మి ప్రచారం చేసే వాహకులుగా ఉండాలని అనుకుంటారు. తద్వారా తమ విధి విధానాలకు ఆమోదముద్రని పొందాలని చూస్తారు. ఆలోచనాశీలురయిన వారి మద్దతుతో జనాల సమ్మతిని ఆశిస్తారు. ఇందుకోసం మీడియానీ, సోషల్ మీడియానీ సాధనాలుగా చేసుకుంటారు.
ఈ వ్యూహ ప్రతివ్యూహాల చెరలాటని గ్రహించకపోతే 'స్వేచ్ఛా చింతనాపరులు' అని భావించే కవులు, రచయితలు సైతం పాలకుల ఆలోచనలకు వంతపాడే వారిగా మిగిలిపోతారు. భిన్నంగా ఆలోచించడం, సరైనవిధంగా ఆలోచించడం తెలియని దుస్థితికి ఇది సంకేతం. ఇవి సంకేతాలుగానే కాదు ధోరణులుగా ప్రబలడం తెలుగునాట నెలకొన్న వాస్తవం. పీ.వీ.నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని, ఆయనని సంస్కరణల పితామహుడు అని పాలకులు అంటే అది వారి వర్గస్వభావంగా అర్థం చేసుకోవచ్చు. కానీ పీ.వీ. గురించి వేనోళ్ళ పొగుడుతూ కవితలు, వ్యాసాలు పరంపరగా రాయడం ఓ సాహిత్య దౌర్బల్యం. పీ.వీ. ఆలోచన, ఆచరణకు గల స్వభావం, దాని మూలాలు తెలుసుకోలేని ఆలోచనారాహిత్య దుష్ఫలితమే ఈ రాతల పరంపర. ఈ కవితలల్లేవారికి పీ.వీ. ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు, వాట పర్యవసానాలు ఏమిటో బొత్తిగా తెలియదు. వాటిని తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. అలాగే పీ.వీ.ని లౌకికవాది అని కొందరంటారు. బాబ్రీమసీదు కూల్చివేత సమయాన ప్రధాని పీఠం మీద వుండి మౌనముద్ర దాల్చారు. 'లౌకికవాది' అనే మాటకు ఏవిధంగా అర్హుడవుతారో యోచించాలి.
ఆలోచించడం, మరీ ముఖ్యంగా సరైనరీతిన ఆలోచించడం రాకపోతే కవులుగా, రచయితలుగా చెలామణి కావడం వ్యర్థం. పీ.వీ.ని ప్రశంసిస్తూ రాయడమంటే ఆర్థిక సంస్కరణలని ఆమోదించడం. ఉదారవాద ఆర్థిక విధానాలే ఇవాళ నెలకొన్న సంక్షోభానికి మూలం. అయినా పీ.వీ.ని సమర్థిస్తున్నారంటే తాము కూర్చున్న కొమ్మని తామే నరుక్కోవడం. కవులు సదా ప్రజల పక్షమని చెబుతారు. కానీ ఆ ప్రజలు పేదరికంతో, నిరుద్యోగంతో అలమటిస్తుంటే వారి దుస్థితికి కారణమైన నేతకు భారతరత్న ఇవ్వాలని కవులు తలపోయడం విదూషకత్వం. చిత్రమేమంటే పీ.వీ.ని పొగిడిన కవులే కాళోజీకి హారతి పడతారు. ''ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాణంతోనే పాతర వేద్దాం'' అన్న కవి కాళోజీని పొగిడే కలమే, జన ప్రయోజనాలకు విరుద్ధమైన విధానాలని అవలంబించిన నేతలని ప్రశంసించే రాతలు రాయడం వైచిత్రి. కాళోజీ, పీ.వీ. రెండు విరుద్ధ ధ్రువాలు. అయినా ఇద్దరికీ కవితాక్షరాల గొడుగు పడతామనే ధోరణి సృజనశీలుర భావదారిద్య్రాన్ని సూచిస్తున్నది.
వ్యక్తుల మంచితనం కాదు, వారి విధానాలు, వ్యవహారసరళి ఏమిటన్నదే ప్రమాణం. కవిగా, రచయితగా, బహు భాషల ప్రవీణునిగా ఒక వ్యక్తిని మెచ్చడం అభ్యంతరం కాకపోవచ్చు కొందరికి. కానీ వారి పాండిత్యమంతా చివరకు ఎవరి ప్రయోజనాలకు ఉపకరించిందన్నదే గీటురాయి. సృజనశీలిగానే గాక విశేషాధికారం ఉన్న నేతగా అనుసరించిన విధానాలు ఎవరికి మేలు చేకూర్చాయన్నదే ప్రధానం. ఈవిధంగా ఆలోచించడం అవసరం. ప్రపంచాన్ని గడగడలాడించిన యుద్ధపిపాసి హిట్లర్లో మంచి ప్రేమికుడు ఉన్నాడంటారు కొందరు. కానీ దారుణ మానవ హననానికి పాల్పడిన హిట్లర్ని ప్రేమికుడు అనగలమా? వ్యక్తుల జీవితాలు, మంచితనం కాదు, అంతిమంగా వారి చర్యలు, విధానాలు మేలు చేశాయా, కీడు చేశాయా అన్నదే కీలకం.
తెలుగునాట కవులు, రచయితల్లో ప్రశ్నించే ధోరణి నిలిచిపోయి, సర్కారువారి మాటలకు బాకాలుగా పరిణమించే ధోరణి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నకాలం నుంచి మొదలయింది. వైఎస్ మరణానంతరం ప్రజాబాంధవుడంటూ వేలాది నివాళి కవితలువచ్చాయి. ఇటీవలి సంవత్సరాలలో తెలంగాణ సర్కారుకు అక్షరమాలలు సమర్పించేందుకు కవులు, కథకులు, జర్నలిస్టులు, కళాకారులు పోటీపడుతున్నారు. వీరిలో అనేకులకు సర్కారు నుంచి ఎలాంటి నజరానాలందవు. అయినప్పటికీ ఆలోచనాలేమి, అధ్యయన లేమి ఫలితంగా సర్కారు వారి సమర్థకులుగా మిగిలిపోతున్నారు. ప్రశ్నించడం చేతకాని అక్షరానికి ఏపాటి విలువ వుంటుందో గ్రహించడం లేదు. ఈ ధోరణి సాహిత్య, కళారంగాల ఉన్నతికి విఘాతం.
సృజనాత్మక రంగాల్లో పనిచేసేవారికి కేవలం అక్షరజ్ఞానం మాత్రమే సరిపోదు, సామాజిక, రాజకీయ, ఆర్థిక విధానాల అధ్యయనం తప్పనిసరి. శాస్త్రీయత, నిజానిజాల అవలోకనం, నిజాల వెనుక దాగిన అసలు సత్యాలు గ్రహించాలి. సరైన ఆలోచనాసరళి, అధ్యయనం ద్వారానే ఇవి చేకూరుతాయి. అపుడే వారి అక్షరాల గురి ఎటువైపు ఉండాలో తెలుస్తుంది. వారి రచనల లక్ష్యం నెరవేరుతుంది.