Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర చట్టసభలు అర్థాంతరంగా నిరవధిక వాయిదా పడ్డాయి. తమకు అవసరమైన బిల్లులను ఆమోదింపజేసుకుని, ప్రజాసమస్యలపై పూర్తిస్థాయి చర్చచేయకుండానే అసెంబ్లీ, మండలి గేట్లను టీఆర్ఎస్ ప్రభుత్వం మూసేసింది. అనేక ఆంక్షల మధ్య ప్రారంభమైన సమావేశాలు, వాటి లక్ష్యం నెరవేరకుండానే ముగియడం తప్పుడు సంకేతాలు ఇస్తున్నాయి. ప్రజలకు మరోసారి అన్యాయం జరిగింది. మాటలు కోటలు దాటాయి కానీ, ఆచరణ గడపదాటలేదన్నట్టు ఎప్పటిలాగే గులాబీ ప్రభుత్వం తన అధికార దర్పాన్ని మరోసారి ప్రదర్శించింది. సభలు ప్రారంభం కాకముందు అన్ని రోజులు, ఇన్ని రోజులు అంటూ భారీస్థాయిలో లీకులిచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత తన మాటలనే గాలికి వదిలేసింది. చాలా సమస్యలు ఉన్నాయనీ, అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరముందని స్వయానా ముఖ్యమంత్రే ప్రగతిభవన్ సమీక్షల్లో వ్యాఖ్యానించిన సంగతి ఇంకా మరిచిపోనేలేదు. తొలుత 20రోజులపాటు అసెంబ్లీని, మండలిని నిర్వహిస్తారనే ప్రచారం చేసి, అనంతరం 18రోజులకే పరిమతమంటూ బీఏసీ ప్రకటించడం గమనార్హం. అందులోనూ నాలుగు రోజులు సెలవులే. ఇక సభలు జరిగింది ఎనిమిది రోజులే. సర్కారు షెడ్యూల్ ప్రకారం సభలను మరో నాలుగు రోజులు జరిపినా, ప్రజా ప్రయోజనాలు కొంతైనా నెరవేరి ఉండేవి. అందుకు కారు ప్రభుత్వం అవకాశమివ్వలేదు. ఇది కోవిడ్ను సాకుగా చూపి చాప చుట్టేయడమే. కరోనాతో సహజీవనం సాగించాల్సిందేనన్న గీతోపదేశాన్ని సమాజం మీదకు వదిలిన పాలకులు అదే స్ఫూర్తితో సభలను నడిపి ఉంటే, ప్రజలకు మంచి సంకేతాలు వెళ్లేవి. సత్ఫలితాలు వచ్చేవి. సభల్లో చర్చించి పరిష్కరించాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి. కోవిడ్ రోజురోజుకు పెరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వైనం సర్కారుకు తెలియనిదా ? అదేదో అధికారుల పని అన్నట్టుగా ఇటీవల ప్రభుత్వం వ్వవహరించడం ఆందోళనకరం. సభల సాక్షిగా కోవిడ్పై సమగ్రంగా చర్చించడం ద్వారా పరిష్కారాన్ని వెతకాల్సి ఉండగా, ఆపని చేయలేదు. కరోనా పేరుచెప్పి చేతులెత్తేయడంతో ప్రజా సమస్యలపై ఏలినవారి చిత్తశుద్ధి ఏపాటిదో మరోసారి నిరూపితమైంది. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగానే ఉంది. ఇప్పటికీ ఆ సమస్య తీరనేలేదు. రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. అలాగే కౌలురైతులపై టీఆర్ఎస్ ప్రభుత్వ వివక్ష ఇంకా కొనసాగుతుండటం బాధాకరం. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రవేశపెడుతున్న పథకాలు, చట్టాలపై శాసనసభ, మండలిలో సంపూర్ణ చర్చ చేయకుండానే సభలను వాయిదా వేయడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఒకవైపు కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన రూ.10 వేల కోట్ల నిధులతోపాటు జీఎస్టీ, ఐజీఎస్టీ సొమ్ము ఇవ్వడం లేదని చెబుతున్న గులాబీ సర్కారు మరింత లోతుగా చర్చకు పెట్టి ఎండగట్టాల్సిన సమయంలో చట్టసభల తలుపులు బంద్చేయడం ఆందోళకరం. బీజేపీ సర్కార్ ప్రతిపాదించిన విద్యుత్ చట్టం-2003 సవరణ మూలంగా రాష్ట్రాల హక్కులకు తూట్లు పడతాయనీ, ప్రజలకు నష్టం జరుగుతున్నదని సీఎం కేసీఆర్ చెప్పడం, ఆ అప్రజాస్వామ్య కరెంటు బిల్లు సవరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం మంచి పరిణామమే. అదే సందర్భంలో జీఎస్టీ, ఐజీఎస్టీ నిధులతోపాటు వ్యవసాయ ఆర్డినెన్స్లకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని సీపీఐ(ఎం) చేసిన సూచనను పట్టించుకోలేదు. అన్లాక్ 4 తరువాత కూడా పాఠశాలలు, కాలేజీలను తెరవడంపై స్పష్టత రాలేదు. దీనిపై కూడా సభలో చర్చిస్తే, విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయాలు ముందుకొచ్చేవి. ప్రజాసమస్యలపై చర్చ ఎటూ లేదుగానీ, ప్రజలకు కీడు చేసే ప్రయివేటు యూనివర్సిటీల బిల్లును మాత్రం ఆగమేఘాల మీద ఆమోదింపచేసుకోవడం తెలిసిందే. ప్రయివేటు విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు ఉండవనీ, సర్కారు పీజు రీయింబర్స్మెంటు వర్తించదని చెప్పేసింది. తద్వారా ఉన్నత విద్య నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దూరం చేసింది. అంతేగాక అగ్రకులాల్లోని పేదల పిల్లలకూ వాటిలోకి ప్రవేశం ఉండదు. కలిసొచ్చే రాష్ట్ర రాజకీయ పార్టీలు, ఇతర రాష్ట్రాలను కలుపుకుని మోడీ సర్కారు మెడలు వంచాల్సిన తరుణమిది. అలాంటి సమయంలో ఒక్కో సమస్యపట్ల ఒక్కో విధానాన్ని అనుసరించడం సత్ఫలితాలను ఇవ్వబోదు. రాష్ట్ర ప్రజల విస్త్రృత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అసలే జీవనోపాధి కోల్పోయి ఆర్థిక కష్టాలు, నష్టాల్లో ఉన్న సామాన్యుల జీవిక ఇప్పటికే గాల్లో దీపమైంది. దానిపై ఉలుకు, పలుకు లేకపోవడం నమ్మి ఓట్లేసి పట్టంకట్టిన ప్రజల పట్ల అలక్ష్యంగా వ్యవహరించడమే. ఒకవైపు అన్నార్తుల ఆకలికేకలు, మరోవైపు రైతులు యూరియా కోసం చేస్తున్న ఆర్తనాదాలు ప్రగతిభవన్ చెవులకు వినిపించడం లేదా? ఇప్పటికైనా కేంద్రంతో దోబూచులాట ఆపాలి. ప్రజాసమస్యలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం నికరంగా నిలబడాలి. ఉమ్మడి పోరాటాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఎజెండా అని చాటాలి.