Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనేక సంక్షోభాలను ఎదుర్కొంటూ నాగరికతలో ఈ దశకు చేరుకున్నాం. ఇప్పుడు కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. వర్తమాన చరిత్రను కోవిడ్ ముందు కోవిడ్ తరువాత కాలంగా పేర్కోవాల్సి ఉంటుంది. 400 సంవత్సరాల పెట్టుబడిదారీ సమాజంలో కోవిడ్ విశ్వ ప్రమాదంగా మారింది. దీని నివారణకు పెట్టుబడిదారీ దేశాలు, సోషలిస్టు దేశాలు భిన్న దృక్పథాలు ప్రదర్శిస్తున్నాయి.
వాషింగ్టన్ పోస్టు పాత్రి కేయుడు ఈ మధ్యలో క్రోధం అనే పుస్తకాన్ని విడుదల చేశాడు. అందు లో డోనాల్డ్ ట్రంప్ను ఫిబ్రవరి, మార్చినెలలో చేసిన ఇంటర్వ్యూల గురించి ప్రస్తావిస్తూ ట్రంప్ కరోనా మహమ్మారి తీవ్రమైనదని అంగీకరిస్తూనే తను ఈ ప్రమాదాన్ని తక్కువ చేసి చూసాడని, ప్రజలు ఆందోళన పడవద్దనేది తన ఉద్దేశం అని సెలవిచ్చారు. చైనా ఎన్ని హెచ్చరికలు చేసినా అమెరికా అప్రమత్తం కాలేదనీ, అందుకనే అమెరికాలో కరోనా సోకినవారు 68,29,951మంది కాగా, చనిపోయినవారు 2,01,403మంది అని లెక్కలు చెపుతున్నాయి.
వుహాన్లో కరోనా బయటపడటంతో, చైనా దాన్ని అక్కడే కట్టడి చేసింది. వెంటనే ప్రజలందరికి పరీక్షలు నిర్వహించి లాక్డౌన్ కఠినంగా అమలు జరిపింది. కరోనా వ్యాప్తి గొలుసును తెగ్గొట్టింది. ప్రజల ప్రాణాలను కాపాడుకున్నది. వైరస్ హ్యబీ ప్రాంతాన్ని దాటి ఇతర చైనా నగరాలకు సోకకుండా నిరోధించింది.
ట్రంప్ నిజాన్ని ప్రజలకు చెప్పకుండా దాచిపెట్టాడు. చైనా అధ్యక్షుడు తమకు ప్రజలే ముఖ్యం అని ప్రకటించి ఆర్థిక వ్యవస్థ కంటే ప్రజల ప్రాణాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. చైనా శాస్త్ర పరిజ్ఞానం ఆధారంగా వైరస్ కట్టడికి పూనుకున్నది. అందుకే చైనాలో 85,194 మందికి వైరస్ సోకగా, 4,634 మంది మాత్రమే చనిపోయారు. భారతదేశంలో 51,15,893మందికి వైరస్ సోకగా, 83,220 మంది చనిపోయారు.
ఆర్థిక వ్యవస్థల గమనాన్ని పరిశీలిస్తే చైనాలో 2020 మొదటి త్రైమాసికంలో గత ఏడాదితో పోలిస్తే జీడీపీ 6.8శాతం తగ్గింది. రెండవ త్రైమాసికానికి 3.2శాతానికి పెరుగుదల నమోదయింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కూడా చైనాలోనే జీడీపీ పెరుగుదల ఉంటుందని ప్రకటించింది. చైనా త్వరగా పుంజుకోవడానికి కారణం అక్కడ అమలవుతున్న సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ. గతేడాది కంటే 3.8శాతం పెట్టుబడులు పెంచి ఆర్థిక వ్యవస్థలో కదలిక తెచ్చింది. పటిష్టమైన ప్రభుత్వ రంగ వ్యవస్థ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను బయటికి లాగింది. లీ జిన్పింగ్ చైనా ఆర్థిక వ్యవస్థ పునాది మార్క్సిస్టు అర్థశాస్త్రంలో ఉన్నదనీ దానికి మూలం ప్రజలను కేంద్ర బిందువుగా ఉంచి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడమేనని ప్రకటించారు. ఈ విధానాలకు భిన్నంగా ట్రంప్ లాక్డౌన్ విధించడానికి సుముఖంగా లేరు. ప్రజల ప్రాణాలకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థకూ, మార్కెట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మార్చిలోనే అమెరికాలో వ్యాపార లావాదేవీలు అతిత్వరగా ప్రారంభమవుతాయని ప్రకటించారు. అక్కడ కనీసం పాటించాల్సిన మాస్కులు ధరించడం, చేతులు తరచుగా, శుభ్రంగా కడుగుకోవడం కూడా సక్రమంగా జరగడం లేదు.
అమెరికా ఆర్థిక వ్యవస్థ రెండో త్రైమాసికంలో 9.5శాతం గత సంవత్సరం కంటే తగ్గింది. త్వరలో పునరుద్ధరణ జరుగుతుందనే సంకేతాలు కనుచూపు మేరలో కనపడటం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.6శాతం కుంచించుకుపోవచ్చు. రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకర పరిస్థితులే కనబడుతున్నాయి అని ఐఎంఎఫ్ చెప్పింది. అమెరికా ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోతాయనీ, ప్రజలు కొన్ని సంవత్సరాల పాటు కఠినమైన ఆర్థిక పరిస్థితులలో బతకాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం రెండు భిన్న వ్యవస్థలు కనబడుతున్నాయి. ఒకటి ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశం లేని సామ్రాజ్యవాద అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ. అమెరికా తదితర దేశాలు అమలు చేస్తున్న విధానమిది. రెండవది ప్రజల ప్రాణాలే పరమావధిగా ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తున్న సోషలిస్టు వ్యవస్థ. చైనా, క్యూబా తదితర సోషలిస్టు దేశాలు అమలు చేస్తున్న విధానం.
ట్రంప్కు నవంబర్లో జరిగే ఎన్నికలలో గెలవడం అత్యంత కీలకమైనది. అందుకని ట్రంప్ తమ దేశ ప్రజల దృష్టి మరలించేందుకు చైనా వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు. తద్వారా అమెరికా ఓటర్ల మనస్సు గెలుచుకోవచ్చని ఆయన ఉద్దేశం. రెండో వైపున చైనా రెండు అంశాలను అమలు జరుపుతున్నది. ఒకటి స్వదేశంలో ప్రజల జీవన ప్రమాణాలను పెంచే కృషి. రెండు వన్రోడ్ - వన్బెల్ట్ పథకం ద్వారా పొరుగు దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంచుకుంటున్నది. ఈ రెండిట్లో విజయవంతమైతే చైనా అమెరికాపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు.
కోవిడ్ అరికట్టడానికి కీలకం నియంత్రణ, నివారణ అనే రెండు అంశాలు. వాటిపట్ల అమెరికా, చైనా దృక్పథాలు భిన్నంగా ఉన్నాయి. అందుకే రెండు వ్యవస్థల మధ్య ఎడం పెరుగుతున్నది. చైనా వైఖరి మంచి భవిష్యత్ కోసం ముందుకు సాగుతుంటే, అమెరికా వైఖరి వినాశనం వైపుకు అడుగులు వేస్తున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ బడా బాబుల లాభాలు పెంచు తున్నది. సోషలిస్టు వ్యవస్థ శ్రామికుల ప్రయోజనాలు కాపాడుతున్నది.