Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజాన్ని నిలువునా పాతరేయడమెలాగో నరేంద్ర మోడీ సర్కారును చూసి నేర్చుకోవాల్సిందే. దేశవ్యాప్తంగా పదకొండు రోజుల క్రితం 40లక్షలుగా ఉన్న కరోనా బాధితుల సంఖ్య తాజాగా 50లక్షలు దాటింది. ఏ రోజుకా రోజు నమోదవుతున్న కేసుల్లోనూ, చోటు చేసుకుంటున్న మరణాల్లోనూ కొత్త రికార్డులు నమోదవు తున్నాయి. అయినా, మోడీ సర్కారు తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. అసత్యాలు, అర్థసత్యాలతో ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తోంది. పార్లమెంటు సమావేశాల్లోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడంతో ఎం.పి ల గళాలకు ఇప్పటికే కళ్ళెం వేసింది. సభా కార్యక్రమాలను సాధ్యమైనంతగా కుదించింది. 20మందికి పైగా పార్లమెంటు సభ్యులు ఇప్పటికే సెలవుకు దరఖాస్తు చేసుకున్నట్లు, వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి, మోడీ సర్కారుతో పాటు, బీజేపీ, సంఘపరివార్లు చేస్తున్నదంతా బావుందన్న ప్రచారానికి భిన్నమైన దశ్యాలు! కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలే ఎన్నో సందేహాలను రేకిత్తిస్తున్నాయి. నిజానికి అంతా బావుంటే, సుదీర్ఘ లాక్డౌన్ తరువాత కూడా కరోనా అంత భారీగా ఎలా వ్యాప్తి చెందింది? ప్రతి రోజూ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య మన దేశంలోనే ఎందుకు ఎక్కువ ఉంది? రోజూ వారి కరోనా మతుల సంఖ్య లోనూ భారతదేశమే మొదటి స్థానంలో ఎందుకు ఉంది? అతి తక్కువ సమయంలో కేసులు రెట్టింపవుతున్న దేశాల జాబితా లోనూ అగ్రస్థానం మనకే ఎందుకుంది? నిజంగా అంతా బావుంటే జిడిపి ఎందుకు పాతాళానికి చేరుకుంది? నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను ఎందుకు దాటుతున్నాయి? లాక్డౌన్ కాలంలో ఎంత మందికి ఉద్యోగాలు ఊడాయి? ఎందరికి ఉపాధి పోయింది? వారిలో ఎందరి జీవితాలు తిరిగి గాడిన పడ్డాయి? తిండి లేక చనిపోయిందెందరు? నడవలేక ప్రాణాలు వదిలిందెందరు? సకాలంలో ఆక్సిజన్ అందక పోయిన ప్రాణాలెన్ని? వెంటిలేటర్లు లేక ఊపిరి వదిలేసిన వారెందరు? కరోనాయేతర రోగాలతో కనుమూసిన వారెందరు? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ప్రశ్నలో... సత్యాన్వేషణ సాగాలన్నా, నిజం నిగ్గు తేలాలన్నా వీటిలో అన్నింటికి కాకపోయినా, కొన్నింటికైనా జవాబులివ్వాలి కదా! కానీ, మోడీ అండ్కో తీరే వేరు! వారు నిజాలు చెప్పడానికి పెదవి విప్పరు!!
వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడంలో ఒక్క దేశమే (అమెరికా) మనకన్నా ముందు ఉందని ఒక కేంద్ర మంత్రి ఇటీవల ప్రకటించారు. రోజువారీ పరీక్షల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుంటే ఇది నిజం కావచ్చు! కానీ, ఇటీవల వివిధ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సర్వెలెన్స్ సర్వే చెబుతున్న సత్యం ఏమిటి? ప్రభుత్వం చెబుతున్న దానికన్నా కొన్ని రెట్లు ఎక్కువ మందికి వైరస్ వచ్చి పోయిందనే కదా! దీనర్ధం ఏమిటి? పరీక్షల సంఖ్య ప్రారంభంలోనే పెంచి ఉంటే, వ్యాధి బారిన పడిన వారిని తొందరగా గుర్తించడానికి, వారిని వేరు చేసి వైద్యం అందించి కరోనా వ్యాప్తి చెందకుండా అదుపు చేయడానికి వీలు కలిగేది. ఇంతకాలం నిర్లక్ష్యం చేయడం ఒక నేరం. ఇప్పుడు దాని పర్యవసనాలు ప్రజలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు కూడా వారికి వాస్తవాలు తెలియనివ్వకుండా కప్పిపుచ్చడం మరో నేరం. ఈ నిజాన్ని కేంద్ర పెద్దలు ఒప్పుకుంటారా? ఇప్పుడు వాస్తవంగా పరీక్షల సంఖ్య అవసరమైనంత మేరకు పెంచితే కొద్దిరోజుల్లోనే కేసుల సంఖ్యలో మొదటి స్థానానికి చేరుతామన్నది చేదు నిజం. బుధవారం మధ్యాహ్నానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం కరోనా కారణంగా 82,066 మంది (1.63శాతం) మరణించారు. సర్వెలెన్స్ సర్వేనే ప్రామాణికంగా తీసుకుంటే ఈ లెక్కల్లోని సత్యం కూడా ప్రశ్నార్ధకమే! చాలినంత సంఖ్యలో పరీక్షలే చేయనప్పుడు, కరోనా సోకిందని తెలియకుండానే తుది శ్వాస విడిచిన వారెందరో? కానీ, ఈ నిజాలను నిగ్గు తేల్చి వాస్తవాలను ప్రజల ముందు బట్టబయలు చేయడానికి కేంద్రం సిద్ధంగా లేదు! నిజాలను ఎల్లకాలం దాచి ఉంచలేమన్న సత్యాన్ని మోడీ సర్కారు గుర్తించాలి. నిజాయితిగా, పారదర్శకంగా, రోగ నిర్ధారణ పరీక్షలు జరిపి అవసరమైన వారికి వైద్య సహాయం అందించాలి.