Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్యం మారదు, మార్చాలని ప్రయత్నించినా మార్చలేరు. భూమి గుండ్రంగా ఉందనే మాట అబద్ధం కాదు. నిరూపిత సత్యం. మొదట్లో భూమి గుండ్రంగా ఉందనే మాట కొందరికి నచ్చలేదు. అధికారంలో ఉన్నవారు అంగీకరించలేదు. అయినా కాలక్రమేణా గుర్తించక తప్పని వాస్తవంగా నిలిచింది. అందుకే కాలాలు మారినా కొన్ని సత్యాలు మారవు. సత్యాన్ని త్రికరణశుద్ధిగా నమ్మినవారు సత్యమార్గాన్నే అనుసరించాలి. దానికి సంఖ్యాబలంతో నిమిత్తం లేదు. ఇతరులకు నచ్చనంత మాత్రాన సత్యం మారదు. మరీ ముఖ్యంగా నిరూపిత సత్యాలు, చారిత్రక వాస్తవాలు ఎవరికోసమూ మారవు. మనుషుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా నిజాలు ఉనికిలో ఉంటాయి.
మతం గురించి కారల్ మార్క్స్ మాటలు సత్యదూరం కాదు. అవి కాలం గడుస్త్తున్న కొద్దీ మరింతగా రుజువవుతున్నాయి. మతం కేంద్రంగా పెత్తనం చేసే ధోరణి పెచ్చరిల్లింది. మతం వ్యక్తిగతానికే పరిమితమయితే పరవాలేదనే సర్దుబాటునిచ్చారు. కానీ అది వ్యక్తుల, వారి విశ్వాసాల పరిధిలోనే నిలిచిపోలేదు. సకల జీవనరంగాల్లోకి చొరబడుతూ సృష్టిస్తున్న కల్లోలం అనూహ్యం. పౌరసత్వ సవరణ చట్టంలో మతం కీలకాంశం కావడం వల్లనే పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. రాజ్యాంగంలో లౌకికవాదమనే మాట ఉన్నప్పటికీ మతం ప్రాతిపదికన పౌరసత్వం ఇస్తామనే మాట దుర్మార్గం.
నిజాలు మాట్లాడినందుకు, రాసినందుకు సంకెళ్ళు వేయడం నేటి పాలకుల రివాజు. సంకెళ్ళతో వ్యక్తుల్ని నిర్బంధిస్తారేమోగానీ సత్యాన్ని కాలరాయలేరు. అసత్యాలతో సత్యాల్ని ఏమార్చలేరు. మందబలంతో అబద్ధాల్ని ప్రచారం చేయగలరు కానీ సత్యం ఉనికిని పరిహరించలేరు. కొందరికి నిజాలు రుచించకపోవచ్చు. నిజాలకు మసిపూసి తప్పుడు ప్రచారం చేయవచ్చు. అంతమాత్రాన నిజం మాసిపోదు. ఈ విషయం పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నవారు తాము విశ్వసించే మార్గాన్ని వదులుకోకూడదు. సత్యమన్నది ఓట్ల వ్యవహారం కాదు. మెజారిటీ అంగీకారం సత్యానికి ప్రాతిపదిక కాదు. అజ్ఞానంతోనో, ఇతరేతర ప్రభావాల కారణంగానో నిజాల్ని ఎక్కువమంది విశ్వసించకపోవచ్చు. అంతమాత్రాన నిజం నిజం కాకుండా పోదు.
ఈ సూత్రం వ్యక్తులకీ, సంస్థలకీ, ఉద్యమాలకీ వర్తిస్తుంది. ప్రజా చైతన్యం పేరుతో ప్రజలకు హాని చేసే నినాదాల్ని తలకు ఎత్తుకోరాదు. విభజించి పాలించే కుటిల భావాల పంచన చేరకూడదు. ఎక్కువమంది ప్రజలకు ఆమోదయోగ్యమైందనే పేరిట తమది కాని ఎజెండాని ఎత్తుకోడం అనుచితం. తాత్కాలికంగా జనం మద్దతు లభిస్తుందనే పేరిట ఎవరి ఎజెండానో తమ ఎజెండాగా చేసుకుంటే చివరకు తామే నష్టపోతారు. ఈ వివేచన కొరవడిన ఫలితం కొన్ని దశాబ్దాల పాటు వెంటాడుతుంది. ఫలితంగా నిజం తనని తాను నిజమని నిరూపించుకోవాల్సిన దుస్థితికి నెట్టబడుతుంది.
ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయాన్ని మార్క్సిజం చూపింది. కానీ సోవియట్ పతనాన్ని, కొన్ని సోషలిస్టు రాజ్యాల పతనాన్ని చూపి మార్క్సిజాన్ని విఫలప్రయోగం అన్నారు. నిజానికి సోవియట్ పతనం కమ్యూనిస్టు రాజ్య పతనం కాదు. అక్కడ జరిగింది ఒక సోషలిస్టు ప్రయోగం. అది కూడా అనేక కారణాలతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇపుడున్న పెట్టుబడిదారీ సమాజానికి ప్రత్యామ్నాయం మార్క్సిజం ప్రవచించిన సమాజ ఆవిర్భావం తప్ప మరో మార్గం లేదు. ఈ మార్గాన్ని త్రికరణశుద్ధిగా విశ్వసించిన వారు తమదయిన మార్గంలో ప్రయాణించాలి.
ఈ ప్రయాణంలో గమ్యం, గమనం రెండూ ముఖ్యం. అందుకే సకల రంగాల్లో మార్క్సిస్టు సిద్ధాంతపు వెలుగు ప్రాతిపదికగా మార్పుల కోసం శ్రమించాలి. ఈ కారణంగానే 'సాంస్కృతిక మార్క్సిజం' అనే భావన పాదుకుంది. విశ్వవిద్యాలయాల్లో, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో ఈ దిశగా చర్చలు జరగాలి. కానీ గత ముప్పయ్యేండ్లుగా కమ్యూనిస్టు ప్రణాళిక పఠనమే కొరవడింది. అధ్యయన రాహిత్యం, చర్చారాహిత్యం అతి పెద్ద సమస్యగా పరిణమించింది. మూడు దశాబ్దాల తెలుగు సమాజ చలనాన్ని గమనిస్తే ఈ అధ్యయన రాహిత్యం అనేక పెడధోరణులకు దారితీసిన వైనం తెలుస్తుంది.
సమాజంలో మతపరమైన అసహనం పెచ్చరిల్లడం, కులవివక్ష వెర్రితలలు వేయడానికి గల మూలాలు గుర్తించవల్సిన సమయంలో అస్తిత్వ భావాలు కమ్ముకు వచ్చాయి. ఉద్యమాలు బలంగా లేకున్నా వాటి భావాల స్ఫూర్తి నిలబడాలంటే నిరంతర అధ్యయనం, సంవాదం అవసరం. వీటికి కేంద్రాలుగా విలసిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు నిస్తేజమయ్యాయి. సాహిత్య, సాంస్కృతిక సంస్థల్లో, ఉద్యమాల్లో సైద్ధాంతిక అధ్యయనం, చర్చలు లోపించాయి. ఈ పరిణామాలు మొత్తం సమాజాన్ని, ప్రజాశ్రేణులని గందరగోళంలోకి నెట్టివేసాయి.
తమ మార్గం నికార్సయినదని నమ్మిన ప్రజానుకూల వ్యక్తులు, శక్తులు పరిశీలించాల్సిన విషయమిది. స్వప్రయోజనాలతో కూడిన వ్యక్తుల, సంస్థల ఎజెండాను అనుసరించడం సత్యాన్ని నమ్మేవారు చేయదగిన పని కాదు. ఎందుకంటే చివరకు సత్యమే గెలుస్తుంది. సత్యమే నిలబడుతుంది. రక్తమోడినా, ప్రాణాలొడ్డాల్సి వచ్చినా సత్యానికి పహారాగా ఉండటం నిజాల మీద నిలబడినవారి ఆత్మవిశ్వాసానికి సంకేతం. ఈ సంకేతమే అంతిమంగా జన హృదయాల్ని గెలుచుకోడానికి సోపానం.