Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత రెండు మూడు రోజులుగా పార్లమెంటు వేదికగా సాగిన ప్రహాసనం యావత్ భారత రైతాంగాన్నీ, ప్రజాస్వామ్యవాదులనూ తీవ్రంగా కలచివేస్తోంది. వ్యవసాయానికి సంబంధించిన బిల్లులతో కొద్దిమంది కార్పొరేట్ల కోసం కోట్లాదిమంది రైతుల కడుపుకొట్టేందుకు సిద్దమైన ఏలినవారి వైఖరి ఇందుకు ఓ కారణం కాగా, తమ పంతానికి ప్రజాస్వామ్య నియమాలనూ, రాజ్యాంగ సూత్రాలను బలిపెట్టిన తీరు మరో కారణం. రైతులు, ప్రతిపక్షాలే గాక పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ బిల్లుపై అనేక అనుమానాలు, ఆందోళనలు వెలిబుచ్చుతున్నా... కనీస చర్చకు అవకాశమివ్వకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే సవాలు విసురుతోంది.
ఈ బిల్లులు భారత రైతాంగానికి మరణశాసనం వంటివని ప్రతిపక్షాలే కాదు, వ్యవసాయరంగ నిపుణులూ విశ్లేషిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంపై ఇప్పటి వరకూ ఉన్న నియంత్రణలన్నిటినీ ఎత్తేసి స్వేచ్ఛా వ్యాపారానికి తలుపులు తెరిచామని గొప్పలు చెప్పుకుంటున్నది. నిజమే. కానీ ఎవరికి స్వేచ్ఛ? రైతులకా, కార్పొరేట్లకా? ప్రభుత్వం చెపుతున్న ''వ్యవసాయ రంగంలో స్వేచ్ఛా వాణిజ్యం'' అనే మాట వినడానికి బాగానే ఉంది. కానీ ఆచరణ మాటేమిటి? స్వేచ్ఛ పేరుతో బలహీనులకున్న కనీస రక్షణలను కూడా ఎత్తేసి బలవంతులతో పోటీ పెడితే నెగ్గేది ఎవరు? ప్రభుత్వ బిల్లులు నిజంగా రైతుల పక్షమే అయినప్పుడు ఈ అనుమానా లన్నిటినీ నివృత్తి చేయడానికి వారికి అభ్యంతరం ఎందుకు?
పార్లమెంటు ఉన్నది కేవలం శాసనాలు చేయడానికి మాత్రమే కాదు కదా... ఆ శాసనాలను ప్రజాస్వామ్య యుతమైన చర్చతో, ప్రజల ఆకాంక్షలకు లోబడి చేయాలి కదా! కానీ నేడు జరుగుతున్నదేమిటి? ప్రత్యేకించి ఈ బిల్లులపై ఎగువ సభలో జరిగిందేమిటి? దేశంలో సగానికి పైగా జనజీవితాన్ని ప్రభావితం చేసే బిల్లులపైన సమగ్ర చర్చకు అవకాశమివ్వాలని ప్రతిపక్షాలు కోరాయి. బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి నివేదించి, తప్పొప్పులను లోతుగా అధ్యయనం చేసి ఆ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని సూచించాయి. ప్రభుత్వం ఇందుకు ఏ అవకాశమూ ఇవ్వకపోవడంతో ఓటింగ్కు పట్టుబట్టాయి. కానీ ఈ ప్రజాస్వామ్య పద్ధతులన్నిటినీ తుంగలో తొక్కి, సభా సాంప్రదాయాలను మంటగలిపి మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్టుగా సభాపతి స్థానంలో ఉన్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ రఘువంశ్ ప్రకటించారు. విచిత్రమేమిటంటే రాజ్యసభలో పాలకపక్షానికి మెజారిటీయే లేదు. ప్రతిపక్షాలన్నీ బిల్లుకు వ్యతిరేకంగా గిరిగీసినట్టుగా నిలబడ్డాయి. స్వపక్షంలోనూ పలు అసమ్మతులకు తోడు, ప్రభుత్వ భాగస్వామి అయిన అకాళీదళ్ సభ్యురాలు హర్సిమ్రత్ కౌర్ ఈ బిల్లుకు వ్యతిరేకంగా మంత్రి పదవికే రాజీనామా చేశారు. అయినప్పటికీ మూజువాణి ఓటు ద్వారా బిల్లు ఆమోదం పొందిందని స్పీకర్ ప్రకటించారు. అటువంటప్పుడు ఇక మెజారిటీకీ, మైనారిటీకీ అర్థమేముంటుంది? పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు విశ్వాసమేముంటుంది? స్పీకర్ అధికారపార్టీ ప్రభావానికి లోనయ్యారని టీఆర్ఎస్ నేత కుండబద్దలు కొట్టిన విషయం ఇక్కడ గమనార్హం. అందుకే ఆయనపై 40మంది పార్లమెంటు సభ్యులు సంతకాలు చేస్తూ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. కానీ దానిని కూడా అంగీకరించేది లేదంటూ కొట్టిపారేయడం ఆయన మీద ప్రభుత్వ ప్రభావాన్నీ, రాజ్యాంగ నియమాల పట్ల ఆయన నిబద్దతనూ ఎత్తిచూపుతోంది.
అధికారపార్టీ మందబలంతో లోక్సభలో బిల్లు సులువుగానే గట్టెక్కినా, అది రాజ్యసభలో అంత సులువుకాదనీ, ఓటింగ్కు పెడితే బిల్లు వీగిపోతుందని గ్రహించిన వెంటనే డిప్యూటీ స్పీకర్ను ప్రభావితం చేసి అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకున్న ప్రభుత్వ తీరు సుస్పష్టం. ఈ పోకడలపై నిలదీస్తున్న పార్లమెంటు సభ్యులపై అంతపెద్ద సంఖ్యలో మార్షల్స్ను ప్రయోగించి బలవంతంగా సభ నుంచి గెంటేయడం పార్లమెంటు చరిత్రలోనే మొదటిసారి చూశాం. మరి దిగువ సభలో పాలకపక్షం కేవలం తనరాజకీయ ప్రయోజనాల కోసం ఏకపక్షంగా చేసే శాసనాల్ని నిశితంగా పరిశీలించవల్సిన ఎగువసభ ప్రాధాన్యత ఏమైపోయినట్టు? పార్లమెంటరీ ప్రమాణాలకు నిలయమైన ఈ అత్యున్నత శాసన నిర్మాణ వేదికపై సభా విలువల్ని సమాధి చేసిన ఈ పరిణామం దేనికి సూచిక! ఈ పరిణామాల పట్ల అమితవేదన వెలిబుచ్చిన సభాపతి వెంకయ్యనాయుడు చివరికి ప్రశ్నించిన నేతలపైనే వేటు వేయడం వైచిత్రి..! ఇప్పటికే అప్పులు, ఆత్మహత్యలతో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతలకు ఈ బిల్లులు అశనిపాతాలు. వీటిని ఆమోదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాలు జరిగిన రోజులు ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు. అందుకే ఇప్పుడు అందరి చూపులు రాష్ట్రపతి భవన్ వైపు మళ్లాయి. సాధారణ పరిస్థితుల్లో ఆయన పాత్ర అంత ప్రాధాన్యత కలిగినది కాకపోవచ్చు. కానీ నేడు రాజ్యాంగ స్ఫూర్తికే ప్రమాద ఘంటికలు మోగుతున్నప్పుడు రాజ్యాంగాధినేతగా ఆయనది కీలకపాత్ర. కాబట్టే ప్రతిపక్షాలన్నీ బిల్లులను పునఃపరిశీలనకు తిప్పి పంపాలని ఇప్పటికే ఆయనను కోరాయి. ఆయన పూర్వాశ్రమంలో బీజేపీ నేతగా వ్యవహరిస్తారా? లేక రాజ్యాంగ అధిపతిగా స్వయం నిర్ణయం తీసుకుంటారా? వేచి చూడాలి...