Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర ప్రభుత్వం భూరికార్డుల నిర్వహణలో మరింత పారదర్శకత తేవడం కోసమే ధరణి ఆన్లైన్ పోర్టల్ తెస్తున్నామంటూ హడావుడి చేస్తున్నది. ఈసేవ, మీసేవలో పౌరసేవలు కొనసాగతుండగా, భూభారతి, మాభూమి తదితర పోర్టళ్లను ప్రస్తుతం భూరికార్డుల నిర్వహణకోసం వినియోగిస్తున్నారు కాగా ధరణిలో ఇప్పటికే నమోదు చేసిన భూరికార్డుల్లో దాదాపు 11 లక్షల మేర తప్పులున్నాయనీ, వాటిని సరిచేయాల్సి ఉందని సర్కారే చెబుతున్నది. వీటిని సవరించకుండానే ధరణికి శ్రీకారం చుడితే ప్రయోజనం ఉంటుందా ? అనే సందేహాలు ఇటు రైతు సంఘాలు, అటు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. వచ్చే 15 రోజుల్లో ప్రజల ఆస్తులను ఆన్లైన్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడం తెలిసిందే. భూరికార్డుల విషయంలో అప్రమత్తత, పారదర్శకత అవసరమే. దీనిని ఎవరూ కాదనరు. ధరణిని పరిపుష్టం చేయాలంటే సమగ్ర ప్రణాళిక తప్పనిసరి. రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, న్యాయవాదులు, మేథావులు, రెవెన్యూ సంఘాలతో సంప్రదింపులు చేయాలి. నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక అంటూ ఏమీ లేకుండానే గుడ్డిగా ముందుకుపోవడం ఆశ్చర్యం, ఆందోళన కలిగిస్తున్నది. వ్యవసాయంతోపాటు వ్యవసాయేతర భూరికార్డులను ఆన్లైన్లో భద్రపరుస్తామని సీఎం చెబుతున్నారు. వ్యవసాయేతర ఆస్థులకు 'మెరూన్' రంగు పాసుబుక్కులులిస్తామని స్వయంగా ముఖ్యమంత్రే అసెంబ్లీలో సెలవిచ్చారు. ఆస్థులను ఆన్లైన్ చేయడం మంచిదే. రెవెన్యూ శాఖలో అవినీతి పేరుకుపోయిందంటూ వీఆర్వో వ్యవస్థను రద్దుచేశారు. ఇది ప్రభుత్వ పరిపాలనలో వేగం, పారదర్శకత కోసమేనని సర్కారు చెబుతున్నది. కాగా నాణేనికి ఇది ఒక పార్శ్యమే. మరో వైపు అసలు సంగతులు దాగున్నాయి. ప్రజల ఆస్థులను ఆన్లైన్ పోర్టల్లోకి ఎక్కించడం ద్వారా వాటిని అధికారికంగా గుర్తించడంతోపాటు పన్నులేసే అవకాశాలూ లేకపోలేదు. ప్రజల ఆస్థులకు సంబంధించి క్రయవిక్రయాలు చేసే క్రమంలో కార్పొరేట్లకు 'క్లియర్ టైటిల్' అవసరం. వారి కోసమే సర్కారు ఇంత హడావుడిగా ధరణి కార్యక్రమాన్ని చేపడుతున్నదన్ననే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ప్రకటించింది. అంతకుముందు బీఆర్ఎస్నూ అమలుచేసింది. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనాలను బీఆర్ఎస్ కింద, భూములు, ప్లాట్లు, ఫ్లాట్లను ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణకు పూనుకుంది. తద్వారా తన ఖజానాను నింపుకుంది. కానీ, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ల అవసరాలకే ఇలాంటి పథకాలు గానీ, పోర్టళ్లు గానీ ఎక్కువగా ఉపయోగపడతాయంటూ రైతు సంఘాలు చెబుతున్నాయి. గతేడాది భూరికార్డులు ప్రక్షాళన చేపట్టి ధరణిలో భూవివరాలను ఎక్కించింది. కొత్త పాసుపుస్తకాలనూ ఇచ్చింది. ఇదిలావుండగా, ఇంకా ఆపోర్టల్లో అప్లోడ్ చేయని భూములు లక్షల ఎకరాల్లో ఉన్నాయి. అయితే, ఇప్పటికే ఆ పోర్టల్ను రాష్ట్ర ప్రభుత్వం లాక్చేసింది. వీటిపై సర్కారు ఎలాంటి విధాన నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో స్పష్టత లేదు. ఆదిశగా ఆలోచన చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. సమగ్ర భూసర్వే చేసిన తరువాతే ధరణిని అమలుచేస్తే బాగుంటుందని రైతు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. సర్వేతోనే భూసమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భావించలేం. కచ్చితమైన ప్రణాళికతో ముందుకెళ్లాలి. లేనిపక్షంలో గతంలోని ఇబ్బందులే భవిష్యత్లోనూ కొనసాగే అవకాశాలు లేకపోలేదు. ప్రయివేటుకు అప్పగిస్తే తప్పులు దొర్లే ఆస్కారమే ఎక్కువ. 2017లో భూరికార్డుల పరిశీలన (ఎల్ఆర్యూపీ) కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామస్థాయిలో సభలు ఏర్పాటుచేసి 1బి నకళ్లను రైతులకు ఇచ్చి రికార్డులను సవరించడం ద్వారా తాజాపర్చింది. సమయాభావం మూలంగా ఎల్ఆర్యూపీ సమాచారంతోపాటు అప్పటివరకు అంటే 2011 నుంచి 2014 వరకు అందుబాటులో ఉండి అమల్లో ఉన్న సమాచారాన్ని ధరణి పోర్టల్లోకి ఎక్కించారు. రాష్ట్రంలో 1936లో జరిగిన సర్వే ఆధారంగా 2014 ముందు వరకు పహాణీలు, రికార్డులు చేతిరాతతోనే చేపట్టారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి సిబ్బంది ఎవరికితోచినట్టు వారు విస్తీర్ణాలు, సర్వే నెంబర్లు వేయడమే ఇప్పుడు సమస్యలకు కారణమైంది. తరాలు మారడంతో యజమానులు మారారు. సర్వే నెంబర్ల పక్కన బై నెంబర్లు వేసుకుంటూ వచ్చారు. సమాచారం అప్లోడ్ చేసే సమయంలో పోర్టల్ అనుమతించని కారణంగా, సిబ్బంది చాలా సర్వే నెంబర్లు, ఖాతాలను తొలగించారు. రికార్డులు స్పష్టంగా ఉంటే క్షేత్రస్థాయిలో భూపరిశీలన లేకుండానే తక్షణమే రిజిస్ట్రేషన్, భూయాజమాన్య హక్కు మార్పిడికి కొత్త చట్టం వీలు కల్పిస్తున్నది. అంతేగాక ధరణిలోని డిజిటల్ సమాచారానికి చట్టబద్దత కల్పించింది. చేతిరాతతో కొనసాగిన భూరికార్డులు అనేక మార్పులకు గురైన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే హక్కులిస్తే కొత్త సమస్యలు వస్తాయని రెవెన్యూ శాఖలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమగ్ర భూసర్వే చేపట్టి కచ్చితమైన భూసమచారంతో రికార్డులు తయారుచేస్తేనే సర్కారు ధరణీ ప్రయత్నానికి సార్థకత. అప్పుడే భూసమస్యలకు చరమగీతం పాడగలం.