Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికాలో మార్టిన్ లూథర్కింగ్ నాయకత్వంలో జరిగిన పౌరహక్కుల ఉద్యమాల తరువాత మళ్ళీ ఇప్పుడు ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికలలో శ్వేతజాతి దురహంకారాన్ని రెచ్చగొట్టి గెలవాలని ట్రంప్ పథక రచన చేసుకున్నాడు. దానితో దేశంలో నల్లజాతీయులపై దాడులు విపరీతంగా పెరిపోతున్నాయి. ఇదే సందర్భంలో ఇప్పుడు నల్లజాతీయులూ మనుషులే అనే ఉద్యమాలలో తెల్లజాతీయులూ భుజం భుజం కలిపి కదలడం ప్రత్యేకత సంతరించుకుంది.
2020 ఆగస్టు నెలలో నల్లజాతీయుడైన జాకోబ్ బ్లేక్ను తెల్లజాతి పోలీసు ఆఫీసర్ ఏడు బులెట్లు కాల్చి చంపేశాడు. మరో నగరంలో ఒక నల్లజాతీయుడికి ముసుకు తొడిగి ఊపిరి ఆడకుండా చేసి తెల్ల పోలీసు చంపేశాడు. మే 25న జార్జి ఫ్లోయడ్ గొంతును తెల్ల పోలీసు మోకాలితో తొక్కిపట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. ఇవి ఈ మధ్యకాలంలో అమెరికాలో నల్లజాతీయులపై జరిగిన తెల్లజాతి పోలీసుల దౌర్జన్యాలకు తాజా ఉదాహరణలు.
దీనికి నిరసనగా ఆగస్టు 26 నుంచి 28 వరకు అమెరికాలోని ప్రముఖ నల్లజాతి ఆటగాళ్ళు అక్కడ జరిగే వాలీబాల్, బేస్బాల్ లాంటి ఆటల పోటీలలో పాల్గొనకుండా వాయిదావేశారు. నల్లజాతీ యులూ మనుషులే అన్న నినాదంతో ఈ నిరసనలు జరుగుతున్నాయి. మనదేశంలో ప్రో కబడ్డీ ఐపీఎల్ ఎంత ప్రజాదరణ పొందాయో, అమెరికాలో వాలీబాల్, బేస్బాల్, హాకీ లాంటి ఆటలు అంత ప్రజాదరణ పొందాయి. అందులో పాల్గొనే ఆటగాళ్ళకు ప్రజాదరణ పెద్ద ఎత్తున ఉంటుంది. వాళ్ళు నిరసనలో పాల్గొనడం ఇప్పుడు అమెరికా సమాజంలో ఒక సంచలనం అయింది.
అమెరికాలోని పెరుగ్సన్ నగరంలో బ్రౌన్ అనే నల్లజాతీయుడిని తెల్లజాతి పోలీసు నడిరోడ్డుపై కాల్చిచంపిన సందర్భంలో ఆ నగరం పెద్ద ఎత్తున నిరసనలతో ఊగిపోయింది. అదే విధంగా మారటిన్ని జమ్మిరమ్యాన్ అనే పోలీసు కాల్చి చంపినా తెల్లజాతి కోర్టు జమ్మిరమ్యాన్ని నిర్దోషిగా ప్రకటించింది. ఆ సందర్భంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలకు పూను కుంటే ఆయన్ని అరెస్టు చేసి మళ్ళీ విచారణ కొనసాగించవలసి వచ్చింది.
అమెరికా సమాజంలో నల్లజాతీయులపై దౌర్జన్యాలు ప్రతిరోజూ జరుగుతుంటాయి. తెల్లజాతీయులు దాన్ని వారి హక్కుగా భావిస్తున్నట్టు ఉంటుంది. ఇందుకు వ్యతిరేకంగా అమెరికా చరిత్రలో గతంలో అనేక నిరసనలు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నాయి. ఇప్పటి ఉద్యమాలు నల్లజాతీయులూ మనుషులే అన్న నినాదం చుట్టూజరుగుతున్నాయి. ఇప్పుడు నల్లజాతీయులతో తెల్లజాతి యువకులు కూడా భుజం భుజం కలిపి పాల్గొనడం ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. ఈ ఉద్యమం ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తున్నది. ఈ నిరసనలలో నల్లజాతి మహిళా క్రీడాకారులు కూడా పాల్గొంటున్నారు. బ్లేక్ను ఏడు బులెట్లతో కాల్చినందుకు నిరసనగా వారి టీషర్టులకు ఏడు కన్నాలు పెట్టుకొని పాల్గొంటున్నారు. ఇలా వినూత్న పద్ధతులతో తమ నిరసన తెలుపుతున్నారు. అంతర్జాతీయ, జాతీయ క్రీడల ప్రారంభంలో జాతీయగీతం ఆలపిస్తున్నప్పుడు క్రీడాకారులు మోకాలిపై కూర్చుని తమ నిరసనను తెలియచేస్తున్నారు. ఇది ఒక ఒరవడిగా మారుతున్నది. క్రికెట్లో దక్షిణాఫ్రికా క్రీడాకారులు కూడా ఈ నిరసన పద్ధతిని పాటించారు.
అమెరికాలో నల్లజాతీయుల జీవితంలోని చీకటి కోణాన్ని గమనిస్తే జైళ్ళలో 10లక్షల మంది ఉన్నారు. 2008 సంక్షోభ సమయంలో వీరి ఆస్తులు 50శాతం వరకు ఆవిరై నిలవనీడలేకుండా నిలిచారు. న్యూఓరేల్స్లో తుఫాను సమయంలో వీరికి దాదాపు నెలరోజుల పాటు సహాయ చర్యలు అందలేదు. నల్లజాతీయులకు జీతాలు కూడా తక్కువ ఇస్తారు. తెల్లజాతీయులతో సమానంగా ఇవ్వరు. వాల్మార్ట్ లాంటి పెద్ద సంస్థలు నల్లజాతి కార్మికులకు తక్కువ వేతనాలు ఇచ్చి దోపిడీచేసి విపరీతమైన లాభాలను దండుకుంటున్నారు. మొత్తం కార్మికులలో వీరు 20శాతం వరకు ఉంటారు. నల్లజాతీయులు పరిపాలిస్తున్న కొన్ని నగరాలలో కూడా నల్లజాతీయులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఒబామా దేశాధ్యక్షుడు అయిన కాలంలో కూడా పరిస్థితిలో పెద్ద మార్పు కనపడలేదు. నల్లజాతి ప్రజల బాధ్యతా రాహిత్యమే వారి పరిస్థితికి కారణం అని తెల్లజాతీయులతో పాటు అధికారంలోకి వచ్చిన నల్లజాతీయులు వల్లించడం వారు ఎంతగా తెల్లవాళ్ళకు లొంగుబాటు వహిస్తున్నారో అద్దం పడుతున్నది.
నల్లజాతీయులు చైతన్యంతో అనేక ఉద్యమాలను బలపర్చిన ఉదాహరణలు అమెరికా చరిత్రలో ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత బాక్స్ర్ మహమద్ అలీ అమెరికా వియత్నాంపై యుద్ధం చేస్తున్నప్పుడు సైన్యంలో చేరకుండా తన నిరసనను ప్రకటించాడు. ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు గల ఆటగాళ్ళు ఆటలను వాయిదావేసి తమ నిరసనను ప్రకటిస్తున్నారు. ట్రంప్ నిప్పులు కక్కుతూ వాళ్ళని క్రీడల నుంచి తొలగించండని హెచ్చ రించినా ఏ టీం యాజమాన్యం అందుకు అంగీకరించలేదు.
నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో నల్లజాతీయులూ మనుషులే అనే నినాదాన్ని అనుసరించేవారు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థులు జియోబీడన్, కమల హరీస్లను బలపర్చడం ఎన్నికల ఫలితాలపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉన్నది.
అమెరికా సమాజం సమస్యల వలయంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నది. నల్లజాతీయుల సమస్యలు అందులో అంతర్భాగం తప్ప వేరుకాదు. అందుకని నల్లజాతీయులు విడిగా పోరాడి వారి సమస్యలు పరిష్కరించుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని సమాజంలోని కష్టజీవులతో కలసి పోరాటాలలో పాలుపంచుకోవడమే ఏకైక మార్గం.