Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాళ్ళు మనుషులనే తొలగిస్తారు. మానవతను తీసేస్తారు. హక్కులను, స్వేచ్ఛను అంతమొందిస్తారు. అలాంటి వారికి విద్యా పాఠాలను తొలగించడం ఏమంత పెద్ద విషయంగా అనిపించదు. కరోనా దేశ వ్యాపితంగా విజృంభిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సమయంలో, ప్రజల బాగోగులను పట్టించుకోవాల్సిన పాలకులు, అది తప్ప ఇతర పనుల్లో ముఖ్యంగా దుష్ట ఆలోచనలను అమలు చేసే పనిలో నిమగమయ్యారు.
కరోనా మూలంగా పాఠశాలలు, కళాశాలలు తెరుచు కోనందున పాఠాలన్నీ బోధించే వీలులేదు కాబట్టి, కొన్ని పాఠ్యాంశాలను మినహాయిం చడాన్ని చేపట్టింది కేంద్రం. అందులో భాగంగా సీబీఎస్ఈ సిలబస్ చదివే విద్యార్థుల పాఠ్యాంశాలను ముప్పయిశాతం తొలగించారు. వారి గైడ్లైన్స్ ప్రకారమే మన రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి ముప్పయి శాతం తగ్గించారు. అయితే ఇక్కడ ఏఏ పాఠ్యాంశాలను తొలగించారన్నదే ముఖ్యం. ఇది మన పాలకుల ఆలోచనా విధానాలలోని భ్రష్టత్వాన్ని తెలియ జేస్తుంది.
సాక్షాత్తూ రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్ గురించిన పాఠ్యాంశాన్నే తొలగించారు. అంతే కాదు, సామాజిక ఉద్యమకారులు, సంఘ సంస్కర్తలు అయిన జ్యోతిబాఫూలే, పెరియార్ రామస్వామి, నారాయణగురు మొదలైనవారి చరిత్రను మన రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ సిలబస్ నుంచి తొలగించింది. ఇంకా బుద్దిజం, జైనిజం, కమ్యూనిజం, గాంధీయిజం గురించిన అంశాలనూ సంస్కృతి విభాగంలోంచి తొలగించారు. మహమ్మద్ ఘోరి, గజనీ, సత్యశోధక్ సమాజం, మొగల్ సామ్రాజ్యం, మీర్ ఉస్మాన్ అలీఖాన్, క్విట్ ఇండియా ఉద్యమం, గిరిజనుల తిరుగుబాటు, యూనియన్, స్టేట్, ఎన్నికల సంస్కరణలు, రీజనలిజం, సమాచార హక్కు చట్టం మొదలైన అంశాలను తీసివేసారు. అత్యంత ఆవశ్యకమైన చరిత్ర అధ్యయనం పట్ల తృణీకారధోరణికి నిదర్శనం ఈ చర్య.
దేశచరిత్రలో, స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఏమాత్రం సంబంధమూ లేని ఆలోచనా పరుల దుశ్చర్య ఇది. చరిత్రను తమకనుకూలంగా వక్రీకరించే ప్రయత్నం చేస్తూ అసత్యాలను, అబద్ధాలను ప్రచారం చేస్తున్న పాలకవర్గ విధాన ఫలితమిది. ఇప్పుడు మనదేశంలో అమలులో ఉన్న రాజ్యాంగానికీ, దాని ఉనికికీ పూర్తి వ్యతిరేక మనువాద పద్ధతులను ఆచరించాలనుకునే వారు ఫూలే, అంబేద్కర్ల ఘనమైన చరిత్రను భావితరాలకు తెలపాలని ఎందుకనుకుంటారు! దుర్నీత మనువాదానికి పూర్తి వ్యతిరేకులు వాళ్లు. ప్రజాస్వామికవాదులు వాళ్లు. భారతదేశం గురించిన లోతైన అధ్యయనం కలిగి, నూతన సమాజ నిర్మాణానికి పూనుకున్న స్వాప్నికులు పెరియార్, నారాయణ గురులు. అందుకనే వాళ్ళు తొలగిస్తారు. వీరందరూ ఈ దేశంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలు విద్యాధికులు కావాలని, సామాజిక అంతరాలు పోవాలని జీవితాన్ని అంకితం చేసినవాళ్లు. పెరియార్, నారాయణ గురులు అశేష ప్రజల చరిత్రకు ప్రతీకలు. అలాంటి వారి చరిత్రను భవిష్యత్ తరాలు చదవకుండా నిరోధించడం వక్ర చరితుల సహజ ప్రక్రియగానే అర్థం చేసుకోవాలి.
మతతత్వా విధానాలతో ముందుకు పోతున్న పాలకులు మొగల్, ఘోరి, గజనీ పాలనలను మతపరంగానే ద్వేషిస్తారు తప్ప చరిత్రగా అధ్యయనం చేయలేరు. బ్రిటిషర్స్కు అనుకూలంగా పనిచేసిన వాళ్లు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఎలా కీర్తించగలరు! సామాన్యుల పోరాటాలే గిట్టనివారు గిరిజనుల తిరుగుబాటును ఎలా బోధిస్తారు! అధికారాన్ని కేంద్రీకృతం చేసుకొనే వారు యూనియన్ స్టేట్ గురించి, సమాచార చట్టాన్ని తుంగలో తొక్కేవారు దాని అవసరాన్ని ఎత్తేయక మరేం చేయగలరు! చాలా స్పష్టమైన స్పృహతోనే ఏయే పాఠాలు ఉండకూడదో, భావితరాలకు అందకూడదో జాగ్రత్తగా ఆలోచించి ఈ పనికి పూనుకున్నారు.
విద్య మనకేమి అందిస్తుంది. మంచేదో చెడేదో, సత్యమేదో, అసత్యమేదో తెలుసుకోవడానికి ఆలోచన అనే ఆయుధాన్నిస్తుంది. విచక్షణ నేర్పుతుంది. ఇప్పటికే నూతన తరం సమాజంపట్ల ఏరకమైన బాధ్యత కనబరచని ఆలోచనలతో పెరుగుతున్నారు. దేశం పట్ల, దేశ చరిత్ర, సంస్కృతి పట్ల తప్పుడు ధోరణులు ప్రబలుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమైన వ్యక్తుల, చరిత్ర అంశాలను కరోనా పేరు చెప్పి మరుగుపరచాలనుకోవడం చాలా దుర్మార్గమైనది. పాఠ్యాంశాలను తొలగించి, మార్చి చారిత్రక సత్యాలను కప్పిపుచ్చలేరు. పాలకుల ఇష్టానుసారంగా పాఠ్యాంశాలను తిప్పిరాయాలని ఆలోచించడం మూర్ఖపు చర్యగానే చరిత్రలో మిగులుతుంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సత్యాన్ని చంపలేరు. కొంతకాలం మరుగునపడుతుంది. అంతే! ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కుట్రలను గ్రహించిందా? లేక మోడీ ప్రభుత్వం అడుగుల్లోనే నడవదల్చుకుందా? కేంద్ర ప్రభుత్వ ఈ చర్యలు దేశాన్ని మధ్యయుగాల్లోకి నడిపించేవన్న స్పృహ కేసీఆర్కు ఉండటం ఇప్పుడు అత్యంత అవశ్యం.