Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరు ఎవరితో జత కట్టాలన్నది ఆయా వ్యక్తుల అభీష్టం. వారి ఇష్టాల్ని తల్లిదండ్రులు, కులాలు, వ్యవస్థలు శాసించడం అమానుషం. తమకు ఇష్టం లేదని పెళ్ళాడిన వ్యక్తులని హతమార్చడం పాశవికం. సహజీవనం కూడా ఆమోదయోగ్యమని సర్వోన్నత న్యాయస్థానమే తీర్పు చెప్పాక వ్యక్తులు అభ్యంతరం చెప్పడం అనంగీకారం. తమకు ఇష్టం లేని పెళ్ళి అంటూ అపుడు ప్రణరునీ, ఇపుడు హేమంత్నీ హత్య చేయించడం అత్యంత దుర్మార్గం. ఇది ఏదో ఒక కులానికి సంబంధించిన వ్యవహారం కాదు, మొత్తం సమాజాన్ని పీడిస్తున్న హేయమైన ఘట్టం. ప్రణరు, హేమంత్లే కాదు, ఈమధ్య కాలంలో కేవలం మరో కులం అయినందున చాలామంది మీద దాడులు చేశారు, చంపేశారు. ఈ ఉదంతాలు వింటున్నాం, చూస్తున్నాం, కొన్నాళ్ళకు విస్మరిస్తున్నాం.
స్త్రీ పురుషుల వివాహానికి సంబంధించి చట్టాలు, సామాజిక సూత్రాలు, రాజ్యాంగం చెప్పిన అంశాల్ని పెడచెవిన పెట్టే ధోరణి అంతటా కనిపిస్తున్నది. కులాంతర, మతాంతర, దేశాంతర వివాహాలు అతి సాధారణమైన ధోరణి ఒకవైపున చూస్తున్నాం. మరోవైపున ఈవిధమైన అప్రజాస్వామిక, అమానవీయ ఉదంతాలు తరచుగా వినిపిస్తున్నాయి. 'పరువు హత్య' అనే పేరుతో వీటిని చెబుతూ వచ్చారు, గానీ ఇవి కుల దురంహకార హత్యలన్నది స్పష్టం. నిచ్చెనమెట్ల సమాజపు పెత్తందారీ ధోరణికి బలయ్యేవారు ఏవో కొన్ని కులాలకు పరిమితమై ఉండరని ఈ ఘటనలు చెబుతున్నాయి. బడుగు బలహీన వర్గాలే కాదు, ఇతరులు కూడా ఇలాంటి దుర్మార్గపు దాడులకీ, హత్యలకీ గురవుతున్న సన్నివేశాల్ని చూస్తున్నాం. వీటికి మూలాలు నిచ్చెనమెట్ల సమాజంలో ఉన్నాయి. కనుక నిచ్చెనలు కూల్చకుండా వ్యక్తుల దుర్మార్గం గురించి ఎంత మాట్లాడినా ఏం ఫాయిదా?
స్త్రీ, పురుష సంబంధాల అంశంలోనూ మనవాళ్ళకు స్పష్టత లేదు. ప్రజాస్వామిక దృక్పథంతో వ్యవహరించే సంస్కారం అబ్బలేదు. అమ్మాయిలు చదువుకోడం, ఉద్యోగాలు చేయడం ఇవాళ అందరికీ ఆమోదయోగ్యమైన అంశాలే. కానీ వివాహం దగ్గరికి వచ్చేసరికి ఆమె ఎంపిక ప్రశ్నార్థకమవుతుంది. ఆమె ఎవరిని పెళ్ళాడాలో తల్లిదండ్రులు నిర్ణయిస్తున్నారు. అమ్మాయిల అభీష్టానికి విరుద్ధంగా వ్యవహరించే పితృస్వామిక భావజాలం కుటంబంలో బలంగా వుంది. తమ కులం కాని వ్యక్తిని పెళ్ళాడటాన్ని సహించలేకపోతున్నారు. ఈ పురుషాహంకారం, కుల దురంహకారం కలగలసినందున పాశవిక హత్యలకు పాల్పడుతున్నారు.
కుటుంబాల్లో ప్రజాస్వామిక సంబంధాలు నెలకొనాలంటే కులమతాల పట్టింపులు అంతరించాలి. కులరహిత సమాజం కోసం పోరాడే క్రమాన మాత్రమే కులాలు అంతరిస్తాయి. అందుకు అవసరమైన చైతన్యం ప్రోది చేయడం ప్రజాస్వామిక ఉద్యమాల్లో పనిచేసే వారి కర్తవ్యం. అంతేగాక రాజ్యాంగంలోని స్వేచ్ఛ, సమానత్వం అనే భావనల్లోని విశాలత్వాన్ని బోధపరచడానికి సిలబస్లో వాటిని పొందుపరచాలి. కులరహిత, మతరహిత మానవ సంబంధాల పరికల్పనకు అనువైన కార్యక్రమాలు చేపట్టాలి. కానీ అధికారాన్ని చెలాయించే పెత్తందారీ కులాల్నించి ఇందుకు సానుకూలత వ్యక్తం కాదు. అందుకని స్త్రీ పురుషుల స్వేచ్ఛ, సమానత్వాన్ని కోరే వ్యక్తులు, సంస్థలు నిరంతరం క్రియాశీలకంగా ఉండాలి. కుల, మత దురంహకారాలని నిరసించే సాహిత్యం, సంస్కృతి, కళలు నిత్యమూ, నిరంతరమూ జనబాహుళ్యంలోకి పరివ్యాప్తం కావాలి.
''మతములన్నియు మాసిపోవును, మంచి ఒక్కటి నిల్చి వెలుగును'' అని వందేళ్ళ కిందటనే గురజాడ అన్నప్పటికీ మతాలు, కులాలు మరింత స్థిరీకరణ పొందుతూ మనుగడలో ఉండటం గమనార్హం. కులనిర్మూలనా పోరాటాలు బలోపేతం కావాల్సిన అవసరాన్ని గుర్తించాలి. అణచివేతకీ, వివక్షకీ వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలు కులాల స్థిరీకరణకు గాక, వాటి నిర్మూలనకు దారి తీయాలి. సకల పీడనలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తుల, సంస్థల క్రియాశీలత కులనిర్మూలన చైతన్యం బలపడటానికి దోహదం చేయాలి. మన సమాజంలో కులం ఒక వాస్తవం. దాని నిర్మూలన అంత సులభం కాదు. కానీ అసాధ్యం మాత్రం కాదు.
పనిప్రదేశాల్లో, స్నేహసంబంధాల్లో, చివరకు పార్కుల్లో నడిచేవారిలోనూ ఒకే కులానికి చెందినవారు ఓ చోట పోగుపడి వుండటం గమనార్హం. ఆలోచనాపరులనుకున్న ఆంతరంగిక బృందాల్లోనూ ఒకే కులానికి చెందినవారు దగ్గరగా ఉండటం గమనార్హం. వీటిని సన్నిహితంగా గమనించాలి, విశ్లేషించాలి. ఆధిపత్య కులాల పెత్తనాల్ని నిరసించే పోరాటాల గమనాన్ని నిర్థారించుకోవాలి. పీడనకీ, అణచివేతకీ జరిగే ఉద్యమాలు పీడితుల కులాల మధ్య వైరుధ్యాలకు తావివ్వకూడదు. ఆ వైరుధ్యాల్ని పరిష్కరించుకుంటూ అంతిమంగా కులనిర్మూలనకు దోహదపడే చైతన్యం బలోపేతం కావాలి.
కులనిర్మూలనకు సంబంధించి అంబేద్కర్ ఆలోచనల సారం ఆచరణలో ప్రతిఫలించాలంటే ఏం చేయాలో యోచించాలి. అంతేగాక గురజాడ, జాషువా, సి.వి. వంటి వారి రచనల్ని అధ్యయనం చేస్తూ కుల నిర్మూలన పోరాటాల గమ్యం, గమనం ఆకళింపు చేసుకోవాలి. చలం చెప్పి నట్టు స్త్రీల స్వేచ్ఛని గౌరవించే హృదయసంస్కారం సకల జనుల్లో పాదు కోవాలి. తమ ఆత్మసఖుని ఎంచుకునే స్వేచ్ఛ మహిళకు ఉంటుందనే వాస్త వాన్ని తల్లిదండ్రులు, కుటుంబాలు గుర్తించాలి. ఇందుకు అనువైన చైతన్యం పాదుకోవడం ద్వారానే కుల దురహంకార హత్యల్ని ఆపడం సాధ్యం.