Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''మన పత్రికలు కొన్ని ఘటనలను నిర్లక్ష్యం చేసి నిశ్శబ్దంతో చంపుతాయి. కుదరకపోతే బోలెడంత పబ్లిసిటి ఇచ్చి చంపుతాయి. రెండూ మన జ్ఞానాన్ని కంట్రోలు చేసేందుకే'' - ఒక ప్రముఖ కవి.
వాళ్ళు ఎవ్వరికీ అక్కెరకు రాని వాళ్ళా? అస్సలు కాదు. దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో వారికేమీ పాత్ర లేదా? లేకపోవడమేమిటి? వారు లేకుంటే ఆర్థిక వ్యవస్థ చక్రాలు కదలవు. వారిదే కీలకపాత్ర. 2019లో దేశ జీడీపీలో పారిశ్రామిక, సర్వీసు రంగాలు రెంటినీ కలిపి లెక్కిస్తే 75శాతంపైగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలే వాళ్ళు! వాళ్ళెవరో కాదు భౌతిక, మానసిక శ్రమ చేసే కార్మికులే. మరి వారికి ఏదైనా కష్టం వచ్చిందనో, నష్టం వస్తోందనో తెలిసీ కార్పొరేట్ మీడియా స్పందించలేదు సరే, మన సమాజ స్పందనేంటి?
''నెత్తురు కక్కుకుంటూ
నేలకు రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే!'' అన్న శ్రీశ్రీ మాటలు ఈ సందర్భంగా గుర్తురాక మానవు.
ఒకసారి ప్రభుత్వం కార్పొరేట్లకు లొంగిపోయిన తర్వాత, ''పాపం శమించుగాక!'' ప్రభుత్వమే వారిదైన తర్వాత నాదస్వరం ఊదేది వారు! నాట్యం చేసేది వీరు! మొదటి ఐదేండ్లూ చేసేస్తున్నానన్న మోడీ సర్కార్ కార్పొరేట్లకు విందు భోజనం సిద్ధం చేసేసింది. వంట అయిపోయింది. వడ్డనా అయిపోయింది. ఆరగించడమే మిగిలింది. ఈ సన్నద్ధతలో కీలకమైన పార్లమెంట్ సమావేశాలు మొన్న జరిపిందే అందుకు! ప్రతిపక్షాల మాటలు ఖాతరు చేయకుండా రైతాంగాన్ని, మన దేశ వ్యవసాయాన్ని సర్వనాశనం చేసే మూడు బిల్లులు ఆమోదించినట్టు ప్రకటించుకుంది ప్రభుత్వం. కాంట్రాక్టు వ్యవసాయానికి దారులు పరిచింది. ఇజ్రాయిల్ ఆయుధాలు, ఐ.పీ.ఎస్.లకు శిక్షణేకాదు, ఇజ్రాయిల్ టెక్నాలజీ, ఇజ్రాయిల్ పురుగు మందుల యాడ్లు కూడా వచ్చేశాయి.
మొన్న ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లో కొందరు అలిగి వాకౌట్ చేస్తే ''అసలైన వారిని'' సభాపతి కోర్ట్''మార్షల్'' చేశాడు. ఏదైతేనేం, యావత్ ప్రతిపక్షం సభలో లేని సమయంలో 48కోట్ల మంది సంఘటిత, అసంఘటిత కార్మికుల జీవితాల్ని ప్రభావితం చేసే, కార్మికోద్యమానికే ఉరితాళ్ళ వంటి 3 కోడ్లు 'డూడూ బసవన్న'ల సాయంతో పెద్దల సభలో అయిందనిపించేశారు. 1978లో జనతాపార్టీ కాలంలో అసాధ్యమనుకున్న ఐ.ఆర్. బిల్లుకు మరిన్ని కోరలు తొడిగి, వాజ్పారు కాలంనాటి రెండవ జాతీయ లేబర్ కమిషన్ సిఫార్సుల కంటే పకడ్బందీగా మోడీ సర్కార్ కార్మిక చట్టాల ధ్వంస రచన పరిపూర్తి చేసింది.
ఇంగ్లండులో కాంబినేషన్ చట్టాల కాలం నుంచి (అంటే ఇద్దరు కార్మికులు కల్సి యజమానికి తమ బాధలు వెళ్ళబోసుకోవడం కూడా శిక్షార్హమైన నేరమే) ఏ రోజూ పెట్టుబడిదారులు కార్మిక సంఘాల ఉనికిని జీర్ణం చేసుకోలేదు. కార్మికులు పోరాడి హక్కులు, చట్టాలు సాధించుకున్నారు. మనదేశంలో సుమారు 1860 నుంచి వివిధ రూపాల్లో పోరాడి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుంచి 1926లో ట్రేడ్ యూనియన్ చట్టం సాధించింది మన కార్మికవర్గం. స్వాతంత్య్రానంతరం మన రాజ్యాంగంలో దాన్నే 19(1)(సి)గా సంఘం పెట్టుకునే హక్కును ఏర్పాటు చేసుకున్నాం. 1800-1920ల మధ్య ప్లాంటేషన్ కార్మికుల్ని కట్టేసి, కొట్టేసి చాకిరీ చేయించే వాళ్ళు. అనేక పోరాటాల తర్వాత వారిని మనుషులుగా పరిగణించే చట్టాలొచ్చాయి. ఆ రోజుల్ని పునరావృతం చేసేలా మొన్న బిల్డర్ల ప్రమేయంతో వలస కార్మికులు బెంగళూరు నుంచి కదలకుండా 'వందేభారత్' రైళ్ళను యడ్యూరప్ప ప్రభుత్వం రద్దు చేసింది. దేశవ్యాపితంగా విమర్శలెదుర్కొన్న తర్వాతనే మళ్ళీ రైళ్ళు కదిలినాయి. గుజరాత్ నుంచి వారి వారి రాష్ట్రాలకు వెళ్ళిపోయిన కార్మికులు వారం రోజుల్లో తిరిగి రాకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజరురూపాని పరిశ్రమల యజమానులను ఆదేశించాడు. ప్రాథమిక హక్కులకే భంగమీ చర్యలు. రానున్న పరిణామాలకివి సంకేతాలు.
2014 తర్వాత మన ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డచందంగా ఉంది. అయినా ఈ ప్రభుత్వం మనగలగడానికి కారణం.. ముఖ్యంగా కార్మిక, కర్షకులు తిరగబడకుండా మత, కుల, జాతీయోన్మాదాలన్నింటిని రెచ్చగొట్టి, ప్రజల్ని సామాజికం గా చీల్చి తన పబ్బం గడుపుకుంటోంది బీజేపీ. వర్గపోరాటాలను పదునుదేల్చడమే ప్రజల మధ్య ఐక్యతకు బాటలు వేస్తుంది.
ఈ పరిస్థితుల్లో కార్మికోద్యమ, మరీ ముఖ్యంగా వర్గ చైతన్యమున్న కార్మికోద్యమ బాధ్యత ఎన్నోరెట్లు పెరిగింది. వస్తుగత (ఆబ్జెక్టివ్) పరిస్థితులకు తగ్గరీతిలో బౌద్ధిక (సబ్జెక్టివ్) అంశాలను పదును దేల్చుకునేందుకు కార్మిక సంఘాల సన్నద్ధత కీలకం. విస్తృత కార్మిక జనబాహుళ్యంలోకి పోయేందుకు ఐక్య ఉద్యమాలు సాగిస్తూనే వర్గ స్పృహ వున్న సంఘాలు తన శ్రేణుల్ని సర్వదా సన్నద్ధం చేసుకోవడం ముఖ్యం. కార్మిక చట్టాల సవరణ వల్ల సంప్రాప్తించే విషయాలు, కార్మికోద్యమానికి రానున్న సవాళ్ళు కార్మికవర్గంలో ఏమేరకు ప్రచారం చేయగలిగామనే దాన్ని బట్టి కార్మిక ప్రతిఘటన ఉంటుంది. బహుశా వర్గ చైతన్యమున్న సంఘాల శక్తి పరిమితం. పెట్టుబడి కాపలాకు దశాబ్దాలుగా అలవాటు పడ్డ సంఘాలకు వారి సభ్యులందర్నీ చైతన్య పరుచుకోవాలన్న స్పృహ తక్కువ. సర్కారీ సంఘం యథాశక్తి పెట్టుబడి సేవకే కట్టుబడి పునీతమవుతోంది. ఈ దశలో సంఘాలకతీతంగా, విస్తృత కార్మిక వర్గాన్ని కదిలించడం వర్గ చైతన్యమున్న సంఘాల విద్యుక్త ధర్మం.