Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధికార ఎన్డీయే నుంచి అకాలీదళ్ నిష్క్రమించింది. మరోవైపు దేశవ్యాపితంగా కరోనాను సైతం లెక్కచేయక కర్షకలోకం ఆందోళనలతో కదం తొక్కింది. దేశ రాజకీయాలలో కీలకమైన ఈ రెండు పరిణామాలకూ నేపథ్యం ఒక్కటే. వారం రోజుల క్రితం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అత్యంత అప్రజాస్వామికంగా, అనైతికంగా ఆమోదింపజేసుకున్న వ్యవసాయ బిల్లులకు నిరసనగానే ఈ పరిణామాలుచోటు చేసుకున్నాయి. పార్లమెంటులో ఈ బిల్లులు ప్రవేశపెట్టిననాడే అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్కౌర్ మోడీ క్యాబినెట్ నుంచి తప్పుకోగా, దాని కొనసాగింపుగా తాము ఎన్డీయే నుంచి కూడా వైదొలుగుతున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్సింగ్ బాదల్ శనివారం ప్రకటించారు. నిజానికి ఎప్పటి నుంచో వదిలిపోవాలనీ, వదిలించుకోవాలనీ భావిస్తున్న అకాలీదళ్, బీజేపీలకు ఇందుకు ఎవరి కారణాలు వారికున్నాయి. అందుకు ఈ సందర్భం ఇరువురికీ ఓ అందివచ్చిన అవకాశమేనన్నది అందరికీ తెలిసిన రహస్యమే.
పంజాబ్లోని సిక్కులు, వ్యవసాయ వర్గాలే పునాదిగా ఏర్పడిన పార్టీ అకాలీదళ్. దేశాన్ని ఏకశిలా సదృశంగా మార్చాలన్న సంఫ్ుపరివార్ సిద్ధాంతానికి రాజకీయ ప్రతినిధి బీజేపీ. ప్రాంతీయ అస్థిత్వంపై ఆధారపడి మనుగడ సాగించాలన్న తాపత్రయం అకాలీదళ్ది. తన మనుగడ కోసం మిత్రపక్షం, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా అన్ని పార్టీలనూ మింగేయాలన్న కుటిలత్వం బీజేపీది. ఆ పన్నాగాలలో భాగంగానే అకాలీదళ్లో విభేదాలను ఉపయోగించుకుని, ఆ పార్టీలో చీలకలు తెచ్చి తాను బలమైన శక్తిగా పంజాబ్లో పాగావేసేందుకు ప్రయత్నిస్తున్నది బీజేపీ. రెండు దశాబ్దాల క్రితం ''సిక్కులూ హిందూ మతంలో భాగమే'' అంటూ అరెస్సెస్ ప్రకటించినప్పుడే అకాలీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆనాడు ఎన్డీయేకు స్వంతంగా తగిన బలం లేకపోవడం, మిత్రపక్షాల అవసరం అనివార్యం కావడంతో బీజేపీ కొంచెం వెనక్కు తగ్గినట్టు కనిపించినా, అరెస్సెస్ మాత్రం ''రాష్ట్రీయ సిఖ్ సంగత్'' స్థాపనతో సిక్కు సమాజాన్ని వశపరుచుకునే ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నది. అప్పటి నుంచి గుర్రుగా ఉన్న అకాలీదళ్కు తామున్నది ధృతరాష్ట్ర కౌగిలిలో అన్న విషయం ఎప్పుడో బోధపడినా, తప్పనిసరి పరిస్థితుల్లో అసంతృప్తితోనే బీజేపీతో అంటకాగుతోంది. ఇప్పుడు మిత్రపక్షాల అవసరమేలేని మెజారిటీ సాధించిన బీజేపీ తన కౌగిలి బిగించడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న అకాలీలను, బీజేపీ తెచ్చిన తాజా వ్యవసాయ బిల్లులు పంజాబులో ప్రకంపనలు సృష్టిస్తుండటం మరింత ఆందోళనకు గురిచేసింది. దేశంలో వ్యవసాయానికి అగ్రగామి పంజాబ్. అలాంటి చోట పెల్లుబుకుతున్న అన్నదాతల ఆగ్రహ జ్వాలలు తమ ఉనికినే దహిస్తాయని గ్రహించిన అకాలీలకు ఇదో అవకాశంగా కూడా కలసిరావడంతో ఎన్డీయే నుంచి వైదొలగక తప్పలేదు. అందుకే ఎన్డీయేతో తమ సుదీర్ఘమైత్రికి వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత పేరుతో చెల్లుచీటి పాడింది.
ఇది బీజేపీ స్నేహం ధృతరాష్ట్ర కౌగిలివంటిదని మిగిలిన ఎన్డీయే పక్షాలకూ బోధపరిచే పరిణామం. ఎంతటి సుదీర్ఘ చరిత్రగల రాజకీయులైనా ప్రజాభీష్టానికి తలవంచక తప్పదని కూడా తెలియజేసే పరిణామం. అంతేకాదు, పార్లమెంట్లో ఈ బిల్లులను ఆమోదిస్తూ ఏలినవారి అభీష్టానికి తలలూపిన డూడూ బసవన్నలందరికీ ఓ హెచ్చరికలాంటి పరిణామం. తమ మందబలంతో, అధికారమదంతో పార్లమెంటులో మోదం పొందిన ఏలికలకు ప్రజాక్షేత్రంలో ఖేదం తప్పదని నిరూపిస్తున్న పరిణామం. ఇందుకు నేడు దేశమంతటా ఎగసిపడుతున్న నిరసన జ్వాలలే నిదర్శనం.
ప్రజావ్యతిరేకమైన, అప్రజాస్వామికమైన ఈ బిల్లులను తిరస్కరించండి అన్న ప్రజల, ప్రతిపక్షాల విన్నపాలను ఖాతరు చేయకుండా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ చట్టాలపై సంతకం చేయడమే ఆలస్యం... భారత రైతాంగం భగ్గుమనడం గమనార్హం. ఈ ప్రజాగ్రహాన్ని ముందే పసిగట్టి ''ఈ చట్టాలపై ప్రతిపక్షాల మాటలు నమ్మకండి. ఈ చట్టాల వల్ల ఇకపై ప్రభుత్వ కొనుగోళ్ళు ఉండవనీ, కనీస మద్దతు ధర లభించదనీ జరుగుతున్నదంతా అబద్ధపు ప్రచారం'' అని ట్విట్టర్లో స్పందిస్తున్న ప్రధాని దగ్గర.. ''అదే మాట చట్టంలో ఎందుకు పొందుపరచలేదు?'' అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. ఈ చట్టాలు ఎవరి ప్రయోజనాల కోసమో అర్థం చేసుకోవడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? వ్యవసాయానికి స్వేచ్ఛ అంటున్న బీజేపీది కపటనాటకం. ఇక్కడ స్వేచ్ఛ కార్పొరేట్లకే తప్ప రైతులకు కాదు. ఇది ముమ్మాటికీ రైతును వ్యవసాయానికి దూరం చేసి, కార్పొరేటు కంపెనీలకు కట్టు బానిసలను చేసే కుట్ర! ఇప్పటిదాకా ప్రతిపక్షాలూ, వ్యవసాయ రంగనిపుణులు చెప్పిందీ, ఇప్పుడు ఈ అకాలీదళ్ ఉదంతమూ చెపుతున్నది ఒక్కటే.. ప్రజలకైనా, పార్టీలకైనా బీజేపీతో చెలిమి ధృతరాష్ట్ర కౌగిలి! ఇది గ్రహించిన రైతాంగం రాజధాని ఢిల్లీ మొదలు మారుమూల పల్లె వరకు భగ్గుమంటోంది. ఇక గ్రహించాల్సింది ఎన్డీయే మిత్రపక్షాలే. లేదంటే అధికార బీజేపీయే కాదు, దానితో అంటకాగుతున్న వారూ మూల్యం చెల్లించక తప్పదు...