Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ కేసులు పెరుగుతుండగానే సామాన్య ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నది. ఆదాయ మార్గాల అన్వేషణ ద్వారా టీఆర్ఎస్ సర్కార్ ప్రజల నడ్డివిరిచేందుకు సమాయత్తమవుతున్నది. ఎల్ఆర్ఎస్తో ఖజానాను నింపుకునే పనిలో తీరికలేకుండా ఉన్నది. చట్టసభలో ఉన్న మెజార్టీ కారణంగా తన రాజకీయ ప్రయోజనాల కోసం అశేష ప్రజానీకంపై ఆర్థిక భారాలు మోపేందుకు ప్రయత్నిస్తున్నది. అంతంత మాత్రంగానే ఉన్న సాధారణ ప్రజల ఆదాయ వనరుల దోపిడికి సన్నద్ధమవుతున్నది. ఇందుకు ఇటీవల చేసిన కొత్త చట్టాన్ని ఆయుధంగా చేసుకుంటున్నది. ప్రజలు, రైతులు, పేదలకు మంచిచేసే పేర సాగుతున్న పరిపాలన వ్యవహారాలు తిరోగమనంలో ఉంటున్నాయి. గత మార్చి నుంచి నేటి దాకా కరోనా కష్టాల్లోనే జనం బతుకీడుస్తున్నారు. జీవనోపాధి పోయి పూటగడవని పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అత్తెసరు బియ్యం, నామమాత్రపు సొమ్ము దేనికీ సరిపోలేదు. కరోనాను ఎదుర్కోవడంలో చేతులెత్తేసిన ప్రభుత్వం ఇప్పుడు దాని గురించి మాట్లాడటం పూర్తిగా మానేసింది. ప్రజల నుంచే పన్నులను పోగేసే పనికి శ్రీకారం చుట్టింది. రకరకాల పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు మేలు చేస్తున్నామనే భ్రమలు కల్పించి, వారి నుంచి ప్రభుత్వ అవసరాలను తీర్చుకునే వ్యూహారచనలో సర్కారు ఉంది. భూక్రమబద్దీకరణ పథకమే(ఎల్ఆర్ఎస్) ఇందుకు మచ్చుతునక. దీని అమలుకు జీఓ 131ని తెరపైకి తెచ్చింది. సాధారణ ప్రజల బలహీనతలను అవకాశంగా వాడుకుంటూ లేఔట్లు, భూమి, ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు తదితర ఆస్తుల క్రమబద్ధీకరణ పేరుతో భారాలు మోపేందుకు సిద్ధమైంది. కోవిడ్ కారణంగా ఇప్పటికే ఉపాధి దొరకక పిల్లల ఆన్లైన్ చదువులు ప్రశ్నార్థకమయ్యాయి. భారంగా కూడా మారాయి. చిరు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. రెక్కాడితేగానీ డొక్కాడని దుస్థితి. గడియ గడియ కష్టాల కొలిమిగా మారుతున్నది. ఈ దారుణ పరిస్థితుల్లో ప్రభుత్వం అణగారిన తరగతులకు అండగా నిలవాల్సింది పోయి, ప్రజలను మరింత సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నంలో ఉండటం ఆందోళనకరం. ధరణిని దసరాకు ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ ఏకంగా బహిరంగ ప్రకటనే చేశారు. అందులో సర్వేనెంబర్ల వారీగా భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచుతామని చెప్పకనే చెప్పేశారు. ఈ పరిణామం రాష్ట్ర ప్రజలను హతాషులను చేసింది. గ్రామాలు, మండలాలవారీగా ఉన్న ఛార్జీలను సవరించి సర్వే నెంబర్ల వారీగా వసూలుచేయడం అంటే మూలిగే నక్కపై తాటికాయ పడటం లాంటిదే. పక్షం రోజుల్లోనే ప్రజల ఆస్తులను ఆన్లైన్ చేయాలని అధికారులను పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం, వారి జీవనయానం గతుకుల రోడ్డులా మారిందనే సంగతిని మరిచిపోవడం ఆవేదన కలిగించేదే. యుద్ధప్రాతిపదికన ప్రత్యేక యాప్లు రూపొందించి ఆర్థిక భారాలను మోపే ప్రక్రియను ప్రగతిభవన్ వేగవంతం చేసింది. ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ చార్జీలను మూడు రెట్లు పెంచే యోచనలో ఉందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. పేదల పైసలతో ఖజానా నింపుకోబోమన్న సీఎం కేసీఆర్తోపాటు మంత్రుల మాటలు నీటిమీద రాతలే. కరోనా కాటుకు ఇప్పటివరకు బలైన 1116మంది కుటుంబాలకు నయాపైసా కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వని సర్కారు, ఎల్ఆర్ఎస్ పేరుతో అలవికాని భారాన్ని నెత్తికెత్తడం సమంజసం కాదు. పేదల మీద ప్రేమాభిమానాలు ఉంటే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. కానీ, ఆ మాట సర్కారు చెవికెక్కలేదు. అంతేగాక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కులదురహంకార హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత ఆరేండ్లకాలంలో దాదాపు 48హత్యలు చోటుచేసుకున్నట్టు అంచనా. ఇవి ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్రమైన సామాజిక సమస్యగా తయారైనాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంగానీ, ఉన్నతాధికారులుగానీ నోరుమెదపడం లేదు. వాటిని సాధారణ నేరాలుగానే పరిగణిస్తూ పరిష్కారాన్ని పక్కన పెట్టేశారు. తద్వారా ఆ తరహా ఘటనలు అధికం కావడానికి ఆస్కారమిస్తున్నారు. అధికారమంటే ఆదేశాలివ్వడమే కాదు, బాధ్యతగా వ్యవహరించడం కూడా అని గులాబీ ప్రభుత్వం గుర్తించకపోతే ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చు. ఇటీవల కురిసిన వర్షాలకు భారీస్థాయిలో పంటలు నీట మునిగాయి. ఇప్పటి దాకా ఆ లెక్కలు సర్కారు దగ్గర లేకపోవడం, నష్టపరిహారం విషయమై ఆలోచన ఆసలే రాకపోవడం అన్యాయం. ఈ సీజన్లో ఆరు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇదిలావుండగా 2014 నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో రూ. 29 వేల కోట్ల పంట నష్టం జరిగిందని రైతు సంఘాలు చెబుతున్నాయి. దీనిపై ఏనాడూ సమీక్ష చేయలేదు. లక్షల రూపాయలు అప్పులు చేసి ఆన్లైన్ క్లాసుల కోసం స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లు కొనాల్సి వచ్చింది. తిప్పులుపడి వాటిని సమకూర్చుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం, వారికి సరైనా డేటాను అందించడంలో విఫలమైంది. దీంతో ఆన్లైన్ క్లాసుల ప్రయోజనం ఆశించిన మేరకు పిల్లలకు అందడం లేదు. రాష్ట్రానికి కేంద్రం నుంచి జీఎస్టీ, ఐజీఎస్టీతో నిధులు దాదాపు రూ.8,120 కోట్లు రావాల్సి ఉంది. వీటికోసం రాజకీయ పార్టీలను కలుపుకుపోయి తెచ్చుకునే ప్రయత్నమేది చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాలుమోపే ప్రయత్నం చేయడం గమనార్హం.