Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచమంతా ఆయన జయంతిని అహింసా దినోత్సవంగా జరుపుకుంది. కానీ ఆయన ఉదయించిన నేలమీద మాత్రం ప్రతి రోజూ హింసతోనే మొదలై హింసతోనే ముగుస్తోంది. నిన్నటితో ముగిసింది ఆయన పుట్టినరోజు వేడుకలేనా..? లేక ఆయన కన్న కలలు కూడానా..? పూజ్య బాపూజీ 150వ జయంతి వేడుకల ముగింపు ముంగిట జాతిని కలవరపెడుతున్న కఠోరమైన ప్రశ్నలివి! ''ఆడపిల్ల అర్థరాత్రి ఒంటరిగా స్వేచ్ఛగా తిరగాడగలిగినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్య్రం'' అన్నాడు బాపూజీ. కానీ నేడు అర్థరాత్రి ఆడపిల్ల ఒంటరిగా చితిమంటలపై కాలిపోతున్నది. మొన్న హథ్రాస్లో జరిగిందేమిటి? నిన్న గైన్సారీలో జరిగిందేమిటి? కన్నవారికి కూడా తెలియకుండా ఆడపిల్లను అర్థరాత్రి హడావుడిగా దహనం చేయడంలోని నీతి ఏమిటి? పోలీసుల పహారాలో ఆ అర్థరాత్రి కాల్చి బూడిద చేసింది ఆ అమ్మాయి శరీరాన్నా లేక ఆమెపై ఆ మానవ మృగాలు సాగించిన అరాచకాన్నా? ఇది ఎంత అనాగరికం?!
హథ్రాస్లో అభం శుభం తెలియని ఓ 19ఏండ్ల ఆడపిల్ల నెత్తురుముద్దై న్యాయమడిగినప్పుడు వాళ్ళ గుండెలు కరుగలేదు. కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికీ చేతులు రాలేదు. గాయపడ్డ హృదయంతో, ఛిద్రమైన శరీరంతో ఆస్పత్రిలో పదిహేను రోజుల పాటు మృత్యువుతో పోరాడుతున్నప్పుడూ కనీస ఓదార్పుకు కాదుగదా సరైన వైద్య సహాయానికీ ఆమె నోచుకోలేదు. జరిగిన దారుణాన్ని ఖండించి బాధితురాలికి కనీస భరోసానివ్వడానికి కూడా పాలకులకు నోరు రాలేదు. కానీ ఆ అమ్మాయిపై అత్యాచారం జరగలేదన్న ఫోరెన్సిక్ నివేదికను వెల్లడించడానికి మాత్రం అంత ఉత్సాహం ఎందుకు? జరిగిన దారుణం గురించి ఫిర్యాదు తీసుకోవడానికే రోజుల సమయం తీసుకున్న పోలీసులు బాధితురాలికి సకాలంలో అవసరమైన పరీక్షలు చేయించారంటే ఎలా నమ్మడం? కావాల్సినంత కాలయాపన చేసి ఆ తరువాత పరీక్షలుచేసి ఫోరెన్సిక్ నివేదికలో ఏ ఆధారం దొరకలేదంటే ఎలా దొరుకుతుంది? బాధితులను గాలికొదిలి నిందితులకే వంతపాడే నీతిమాలిన పాలనలో ఆధారాలు దొరికినా దొరకలేదని చెప్పడంలో ఆశ్చర్యమేముంటుంది? చిరిగిన గుడ్డలు, విరిగిన ఎముకలు, తెగిన నాలుక, నెత్తురోడుతున్న దేహం ఇవేవీ బాధితత్వానికి రుజువులు కావా?! పోలీసులు, ప్రభుత్వమూ చెపుతున్నదే నిజమయితే ఆ అమ్మాయి తల్లిదండ్రులను నిర్భందించి అర్థరాత్రి శవదహనం చేయడంలోని ఆంతర్యమేమిటి? ఓ కలెక్టర్ స్థాయి అధికారి నేరుగా బాధితురాలి కుటుంబాన్ని బెదిరించడంలోని ఉద్దేశ్యమేమిటి? ఆవు మూత్రంలో పవిత్రతను చూడగలిగిన కండ్లకు నెత్తురోడుతున్న అమ్మాయి దేహంలో ఆమెకు జరిగిన అన్యాయం కనిపించడం లేదా?
అమానవీయమైన ఈ దారుణ ఘటనపైనా, దోషులను రక్షించే ప్రభుత్వ చర్యలపైనా దేశమంతా నిరసనలు వెలువడుతుండగానే బలరాంపూర్ జిల్లా గైన్సారీలో మరో ఘోరం వెలుగుచూసింది. బీకామ్ రెండో సంవత్సరం చదువుతున్న ఆ అమ్మాయి కాలేజీకి వెళ్లి ఫీజు చెల్లించి వస్తుండగా అపహరించిన దుండగులు ఆమెకు ఇంజక్షన్ చేసి, వెన్నుముక, కాళ్ళు విరగ్గొట్టి లైంగికదాడికి పాల్పడ్డారు. రిక్షాలో అపస్మారక స్థితిలో ఇంటికి చేరిన ఆ అమ్మాయి ఆస్పత్రికి తరలిస్తుండగానే అసువులు బాసింది. ఇక్కడా పోలీసులది అదే తంతు. బాధితులకు న్యాయం చేయడంలో కనిపించని ఉత్సాహం, వారిని మరణించిన రెండు గంటల్లోనే దహనం చేయడంలో మాత్రం ఉరకలు వేస్తోంది..! రాత్రి 8.30కి చనిపోయిన అమ్మాయికి 10.30లోపే అంత్యక్రియలు పూర్తిచేశారు!! ఓ ఆవు చనిపోతే విచారణకు కమిషన్ వేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడపిల్ల చనిపోతే నోరు మెదపడంలేదు! కేరళలో ఓ ఏనుగు చనిపోతే భరింలేకపోయిన కేంద్ర హౌంమంత్రి ఉత్తరప్రదేశ్లో ఈ అఘాయిత్యాలకు ఆడపిల్లలు నేలరాలుతున్నా నిబ్బరంగానే ఉన్నారు!! అందుకేనేమో ఇదిలా ఉండగానే అదే రాష్ట్రంలోని బులంద్ షహర్, ఆజంగఢ్ లలోనూ ఇలాంటివే మరో రెండు దారుణాలు చోటుచేసు కున్నాయి. ఏం జరుగుతోంది ఉత్తరప్రదేశ్లో? ఏం చేస్తున్నారు పోలీసులు?
అయినా పాలించే ఏలికలూ, పాలనా అధికారులు అందరూ దోషుల పక్షమే అయినప్పుడు పోలీసులు మాత్రం ఏం చేస్తారు? అందుకే ఏలినవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఎనలేని ఉత్సాహం చూపిస్తున్నారు. బాధితుల పక్షాన ఎవరు స్పందించినా, వారు ఎంతటి వారైనా ''పోలీస్ జులుం'' ప్రదర్శిస్తున్నారు. లేదంటే బాధితుల పరామర్శకు బయలుదేరిన రాహుల్, ప్రియాంకల పట్ల పోలీసుల ప్రవర్తన చెబుతున్నదేమిటి? నేరాల్ని ప్రశ్నించే వారిపై ఎంతకైనా వెనుకాడని ఈ కాఠిన్యం నేరస్థుల్ని శిక్షించేందుకు ఎందుకు వెనుకాడుతోంది..!? ఈ దేశంలో ఇదే న్యాయమైతే ఇక అసంఖ్యాకులైన బడుగు బలహీనులకు భద్రత ఏముంటుంది? ఆడపిల్లలపై అఘాయిత్యాలు అత్యంత సహజాతాలుగా వ్యవస్థీకృతమైనాక ఆ అహింసామూర్తి కన్న కలలకు అవకాశమేముంటుందీ, ఈ అనాగరిక చర్యలకు అడ్డమేముంటుంది..? తాను కలలుగన్న స్వతంత్ర భారతం ఇలా ఉంటుందని గాంధీజీ కలలో కూడా ఊహించి ఉండరు. అయినా గాంధీ హంతకులే తమకు గౌరవనీయులంటున్న ఏలికల కాలంలో ఆయన కలలకూ, విలువలకూ ఆస్కారముంటుందా..!?