Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొడ్తే మాత్రం మన కోర్టులు గట్టిగానే మొడ్తున్నాయి. అదీ ఉంగరాల వేళ్ళతో! కానీ దేశంపై ముసురేసిన సరళీకృత ఆర్థిక విధానాలు అన్ని రాష్ట్రాల పాలకులకూ హెల్మెట్లు తొడిగేసినాయనీ, దాంతో మొట్టికాయలేం ఖర్మ, కట్టె దెబ్బల్ని సైతం ఆ హెల్మెట్లు కాసుకుంటున్నాయని సదరు న్యాయమూర్తుల గమనంలో ఉందో లేదో! అందుకే, కార్మికులు సంబరపడ్డంతసేపు పట్టట్లేదు ఆ తీర్పులు గాల్లో కల్సిపోవడానికి! కాకతాళీయమే అయినా సెప్టెంబర్నెల్లో మన రాష్ట్ర హైకోర్టు కేసీఆర్ ప్రభుత్వంపై ఇటొక మొట్టికాయ విసిరితే, సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వంపై అటొకటి విసిరింది. చివరికి ఫలితమెలా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది.
పెట్టుబడి సేవలో తడిసి పునీతమవుతున్నది గుజరాత్ ప్రభుత్వం. కోవిడ్ వల్ల ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు జబ్బుచేసిందట! ఈ సమస్య ఆ ఒక్క రాష్ట్రానికే వచ్చినట్టు ఫ్యాక్టరీ చట్టంలోని సెక్షన్ 5 కింద ''పబ్లిక్ ఎమర్జెన్సీ'' ప్రకటించింది. ఏప్రిల్ 20 నుంచి జులై 19 మధ్య పెంచిన 4 గంటలకు (8గంటల నుంచి 12 గంటల పనిదినం చేశారు) ఓ.టీ చెల్లించకుండా ఆర్డర్స్ ఇస్తే సుప్రీం దాన్ని సుప్రీంలాగానే రద్దు చేసింది. బయట్నించి శత్రువుల దాడి, ఆంతరంగిక కల్లోలం (అంటే సాయుధ తిరుగుబాటు అని 44వ రాజ్యాంగ సవరణ పేర్కొన్న విషయాన్ని కూడా జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు) ఉంటే తప్ప పబ్లిక్ ఎమర్జెన్సీ క్లాజును ఉపయోగించరాదని అంకుశం విసిరింది సుప్రీం బెంచ్. పైగా ''సంక్షేమ రాజ్యంలో కార్మికుల దోపిడీ ఏవిధంగా చేస్తారని ప్రశ్నించింది. ఇక మన హైకోర్టు బెంచ్ జీహెచ్ఎంసీలో శాశ్వతపనుల్లో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులతో ఏవిధంగా పని చేయిస్తారని ప్రశ్నించింది. విద్యుత్, సింగరేణి, ఆర్టీసీ వంటి ప్రభుత్వ సంస్థల్లోగానీ, రాష్ట్రంలోని కొన్ని వేల ప్రయివేటు పరిశ్రమల్లోగాని అన్ని రకాల శాశ్వతపనులూ కాంట్రాక్టు కార్మికులే చేస్తున్నారని న్యాయదేవతకు ఎవరు నివేదించాలి?
మోడీ నుంచి కేసీఆర్ వరకు 'సులభతర వ్యాపారం' అత్యంత ప్రీతిపాత్రమైంది. సులభతర వ్యాపారంలో రాష్ట్రాల ర్యాంకులు కార్మికచట్టాల అమలుకు విలోమానుపాతంలో, అంటే కార్మికచట్టాలకు ఎంతగా మంగళం పాడితే సులభతర వ్యాపారంలో అంతగా ముందుంటారన్న మాట! విడిగా మరో కేసులో మహబూబ్నగర్, నిర్మల్ జిల్లాల కాంట్రాక్టు వైద్య ఆరోగ్య సిబ్బందికి సమానపనికి సమాన వేతనం చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఇవన్నీ ఆహ్వానించతగ్గ తీర్పులు. అయితే అల్ప సంతోషంతో ఆనందించాల్సినవి కావు. పట్టుదలగా ఆందోళనలు చేయకపోతే కోర్టు తీర్పులు ఉట్టికెక్కుతాయి తప్ప చేతికందవు. ''సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని'' 2016లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా ఇప్పటిదాకా అమల్లోకి రాలేదన్న వాస్తవం మనముందున్నది. పైగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పు 1971నాటి కాంట్రాక్టు లేబర్ రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ చట్టానికి సంబంధించిన రూల్స్ 25(2)(బి) లోనివే.
స్వాతంత్య్రానంతరం మనదేశంలో నిర్మించబడింది ఫక్తు పెట్టుబడిదారీ విధానమే అయినా భారత పాలక వర్గాలకు శ్రమ జీవుల అవసరమున్న కాలమది. బ్యాక్వేజెస్తో పునర్నియామకం చేసేవి ఆనాడు కోర్టులు. అనేక తీర్పుల్లో ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యతనిచ్చాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముందు అమెరికాలో ''న్యూడీల్'', యుద్ధానంతరం కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థలను పునరుజ్జీవింప చేసేందుకు ముందుకొచ్చిన కీన్స్ సిద్ధాంతాల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ మీదా ఉండింది ఆనాడు. కానీ నేడు ప్రపంచీకరణ దశలో ఉన్నాం. దేశ విదేశీ పెట్టుబడిదార్ల లాభాలే నేడు పరమావధి. ''ప్రపంచీకరణ శకంలో 'రాజ్యం' బలహీనపడిపోయిందన్నది కట్టుకథ. సమకాలీన రాజ్యాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రపంచీకరణని కాదు. పెట్టుబడి కార్మిక సంబంధాల గురించి తెల్సుకోవాలి'' అంటారు ఐజాజ్ అహ్మద్. ''పెట్టుబడికి సంబంధించి బలహీనంగానూ, కార్మికులకు సంబంధించి క్రూరమైనదిగాను రాజ్యముండాలని నయా ఉదారవాదం అభిప్రాయం'' అని ఎన్. రామ్ ఇటీవల ఒక వెబినార్లో అన్నారు. అందుకే సాధారణ కార్మికులు ఏ భ్రమల్లో ఉన్నా వర్గ చైతన్యమున్నవారైనా ఒక విషయం గమనించాలి. 1844లో ఏంగెల్స్ రాసిన ప్రామాణిక గ్రంథం ''ఇంగ్లండులో కార్మికుల స్థితిగతులు''లో కార్మికవర్గమే తమకు ప్రధాన శత్రువనీ, దాన్ని ఓడించడమే తమ కర్తవ్యమన్న దృష్టితో న్యాయమూర్తులు చట్టాన్ని అమలు చేస్తారని రాసిన విషయం గమనార్హం. అంటే 176సంవత్సరాల క్రితమే కార్మికవర్గ బాధలకు కోర్టులు పరిష్కారం చూపవన్న సత్యాన్ని శోధించి, మధించి అందించిన విషయాన్ని, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యమనేది పెట్టుబడిదారీ విధానానికి పైనుండే పెంకు (షెల్) వంటిదని లెనిన్ చెప్పిన విషయాన్ని గమనంలో పెట్టుకోవాలి. పోరాడి సాధించుకోవడంపై దృష్టి కేంద్రీకరించాలి.