Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశ పురోగమనం సంగతేమోగానీ తిరోగమనం మాత్రం శరవేగంగా జరిగిపోతోంది. ఆక్స్ ఫాం తాజా నివేదిక దీనిని మరోసారి రుజువు చేస్తోంది. ఇటీవలి అనేక అంతర్జాతీయ సూచికలలో వెనుకబాటు పరంపరను కొనసాగిస్తున్న భారత్ ''సీఆర్ఐ'' (కమిట్మెంట్ టు రిడ్యూసింగ్ ఇనీక్యాలిటీ) సూచికలోనూ అట్టడుగు స్థానంలో నిలిచింది. అసమానతలు తగ్గించడంలో 158 దేశాలలో 129వ స్థానం పొందింది. కార్మిక హక్కుల పరిరక్షణలో మరింత దిగజారి 141 నుంచి 151కి పడిపోయింది. ప్రభుత్వ సేవల్లో 141వ ర్యాంక్ సాధించింది. ఇలా అనేక విభాగాల్లో 158 దేశాల పరిస్థితులను మదించి సగటు ర్యాంకులను విడుదల చేయగా భారత్కు దక్కిన స్థానం 129. ఇప్పటికే ప్రపంచ ఆకలి సూచిలో 117 దేశాలలో 102వ స్థానం పొందిన భారత్ పతన ప్రశస్తి నిరాఘాటంగా జరిగిపోతోందనడానికి ఆక్స్ఫాం నివేదిక ఒక తాజా ఉదాహరణ మాత్రమే. ఇక ఇప్పటికే జీడీపీ వృద్ధిరేటూ 24 శాతానికి పతనమైన విషయం వేరుగా చెప్పాల్సిన పనిలేదు.
ఏలినవారి పాలనా భాషలోనే చెప్పుకోవాలంటే... ప్రపంచ ఆర్థిక, రాజకీయ యవనికపై 19వ శతాబ్దిలో బ్రిటన్లా, 20వ శతాబ్దిలో అమెరికాలా, 21వ శతాబ్దిలో భారత్, చైనాలు ప్రాబల్యం వహించనున్నాయనే వాదనలు ఒకప్పుడు బలంగా వినిపించేవి. ఈ వాదనలను నిజం చేస్తూ నేటి కరోనా కాలంలోనూ చైనా పురోగతి ప్రదర్శిస్తుండగా భారత్ మాత్రం తిరోగతినే కనబరుస్తున్నదని ప్రపంచ వ్యాపితంగా పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. నేడు చైనా ప్రపంచంలోనే ఓ బలమైన ఆర్ధికశక్తిగా అమెరికాతో పోటీ పడుతుంటే... భారతదేశం మాత్రం అంతులేని అసమానతల్లో కునారిల్లుతూ మనకంటే వెనుకబడిన పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలతో పోటీపడుతోంది. నూతన ఆర్థిక విధానాల పేర కాంగ్రెస్ హయాంలో 30ఏండ్ల క్రితమే ఈ తిరోగతికి బీజాలు పడినప్పటికీ అది ఈ ఏడేండ్ల మోడీ పాలనలో శరవేగంగా జరిగిపోతున్నది. కోవిడ్కు ముందే ఆర్థిక వ్యవస్థ వార్షిక వృద్ధిరేటు 4శాతానికి పడిపోగా అది ఇప్పుడు పూర్తిగా అధోముఖంలో ఉన్నది. భారత ఆర్థిక వ్యవస్థ ఇదివరకెన్నడూ ఎరుగని రీతిలో దిగజారిపోయిందన్నది ఏలినవారి మార్గదర్శి ప్రపంచబ్యాంకే చెపుతున్న మాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ నికరంగా మైనస్ 9.6శాతానికి క్షీణించనుందని కూడా అది విశ్లేషిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశం 'వర్ధమాన దేశం'గా కాదుకదా కనీసం 'అభివృద్ధి చెందుతన్న దేశం'గానైనా ఉంటుందా లేదా అన్న సందిగ్ధం అత్యంత విచారకరమైన వాస్తవం.
ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలు కార్పొరేట్ల ప్రయోజనాలకేగానీ ప్రజల ప్రయోజనాలకు కాదని ఈ నివేదికలే కాదు, ఈ ముప్పయేండ్ల ప్రయాణమూ రుజువు చేస్తున్నది. ఈ విధానాలు సంపదతో పాటే దేశంలో అంతులేని అసమానతలను సృష్టించాయే తప్ప అసంఖ్యాకమైన భారత ప్రజలను అభివృద్ధి పరచిందేమీలేదు. ఇది ఈ నివేదికలు వెల్లడిస్తున్న గణాంకాలే కాదు, కండ్లముందరి జీవితాలూ తెలియజేస్తున్న నిజం. అంబానీ ఆదాయం గంటకు 90కోట్లు కాగా, దేశంలో 75శాతం ఉన్న గ్రామీణ పేదల ఆదాయం నెలకు 5వేలకు మించట్లేదంటే ఈ అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో, ఈ అభివృద్ధి ఎవరికోసమో అర్థం చేసుకోవచ్చు. ఈ కరోనా కాలంలోనూ ఓవైపు భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతున్నా.. దేశంలోని కుబేరుల సంపద మాత్రం హద్దులు లేకుండా పెరిగిందన్నది తాజా ఫోర్భ్స్ నివేదిక సారాంశం. కరోనా ప్రభావంతో ఉద్యోగాలూ ఉపాధీ కోల్పోయిన సాధారణ ప్రజల ఆదాయాలు అమాంతం పడిపోగా, వీరి ఆదాయాలు మాత్రం గతేడాదితో పోలిస్తే 14శాతం పెరిగిపోవడం ఈ విధానాలు ఎవరికోసమో, ఈ ప్రభుత్వాలు ఎవరి పక్షమో చెప్పకనే చెపుతున్నాయి. దేశమంటే పిడికెడు మంది సంపన్నులే అని భావించే వారికి ఇది ముమ్మాటికీ అభివృద్ధి చెందుతున్న దేశమే! కానీ దేశమంటే ఈ నేల మీద పుట్టిన మనుషులందరూ అని భావించే వాళ్ళు ఇది ''అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామిక దేశం'' అని అనగలరా?
మరో కఠోరమైన నిజమేమిటంటే... ''అభివృద్ధి చెందుతున్న దేశం'' అనే మాట అటుంచితే ''ప్రజాస్వామిక దేశం'' అనే మాట కూడా అంతకంతకూ సందేహాస్పదంగా మారిపోతోంది! 2014 నుంచీ మన ప్రజాస్వామ్య విలువలకూ, రాజ్యాంగ వ్యవస్థలకూ, భారతీయ సమాజాన్ని సమున్నతంగా నిలిపిన బహుళత్వానికి ఎనలేని ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రతి వైఫల్యానికీ కరోనాను ఒక కారణంగా చూపుతున్నారు గానీ కోవిడ్ మహమ్మారి మనపై విరుచుకుపడకముందే మన ఆర్థిక వ్యవస్థ పతనం ప్రారంభమయిందన్నది గమనార్హం. కాకపోతే మహమ్మారి ఈ దుస్థిని మరింత తీవ్రమూ, సంక్లిష్టమూ చేసిన మాట నిజమేగానీ, అందులోనూ ప్రభుత్వ వైఫల్యమే ఎక్కువ.ఈ వైఫల్యాలకు తోడు, జాతీయతకు కొలమానంగామారిన మత భావనలు పెచ్చరిల్లడం దేశ అభివృద్ధినీ, ఆలోచనలను మరింత సంకుచిత పరుస్తున్నాయి. ఫలితంగా ఆర్థికవ్యవస్థ మునుపెన్నడూ ఎరుగని స్థాయిలో మందగించడమే కాదు, రాజ్యాంగ వ్యవస్థలూ ప్రజాస్వామిక సంస్థలూ బలహీనపడుతున్నాయి. ఇప్పటికే జరిగిన నష్టం చాలా పెద్దది. దీని నుంచి ఎప్పటికి కోలుకుంటామన్న ప్రశ్నకు ప్రజా చైతన్యమే సమాధానం చెప్పగలదు.