Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్మిక సమ్మెలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి తక్షణ ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం జరిగేవి, రెండు రాజకీయ కోణంలో ప్రభుత్వ విధానాలను మార్చేందుకు జరిగేవి. ఆర్థిక పరమైన కోర్కెల సాధనకు జరిగే సమ్మెలు స్థూలంగా పరిమిత స్వభావం కలిగి ఉంటాయి. రాజకీయ లక్ష్యాలు సాధించేందుకు జరిగే సమ్మెలు విస్తృత ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ కోణం నుంచి దక్షిణ ఆఫ్రికా, ఇండోనేషియాలలో జరుగుతున్న సమ్మెలను పరిశీలించాలి.
దక్షిణాఫ్రికా, ఇండోనేషియా లలో కార్మికులు సమ్మెకు పూను కున్నారు. దక్షిణాఫ్రికాలో కాంగ్రెస్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాన్ ట్రేడ్యూని యన్ (కొసాటు) నాయకత్వం వహిస్తే, ఇండోనేషియాలో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండోనేషియన్ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ (కేయస్బీయస్ఐ) నాయకత్వం వహిస్తున్నది. ఇవి రెండు కూడా కార్మికులలో బాగా పట్టు ఉన్న కార్మిక సంఘాలు.
దక్షిణాఫ్రికా ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ (ఎన్ఏఎఫ్టీయూ) ఫెడరేషన్ ఆఫ్ యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (ఎఫ్ఈడీయూఎస్ఏ) ప్రభుత్వరంగ ఉద్యోగులు, కార్మికులు ఉండే అతిపెద్ద సంస్థలు. ఈ సంఘాలన్ని అక్టోబర్ 7న జరిగిన చారిత్రాత్మక సమ్మెలో భాగస్వాములై ఉన్నారు. ఈ ఐక్య పోరాటం ట్రేడ్ యూనియన్ల ఐక్య కార్యాచరణల అవసరాన్ని తెలియజేస్తున్నది. దక్షిణాఫ్రికాలో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, అవినీతి పెరిగిపోవడం, కోవిడ్-19 నియంత్రణలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెసు (ఏఎన్సీ) నాయకత్వంలోని ప్రభుత్వం విఫలం కావడంతో పాటు కోవిడ్-19 కాలంలో కార్మికులకు ఇవ్వాల్సిన సహాయనిధిని యజమానులు కాజేసారు. ఈ కారణాలతోనే సమ్మె జరిగింది.
దక్షిణాఫ్రికాలో అధికార పార్టీ అయిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెసు (ఏఎన్సీ)కి అక్కడ ట్రేడ్ యూనియన్ (కొసాటు) మిత్రపక్షంగా ఉన్నది. క్రమంగా ప్రభుత్వ వైఖరిలో మార్పు వస్తున్నందున ట్రేడ్ యూనియన్ కార్మికుల పక్షంలో నిలబడి సమస్యలపై స్పందించక తప్పలేదు. ఏఎన్సీ ప్రభుత్వం క్రమంగా నయా ఉదారవాద విధానాలను అమలుకు పూనుకున్నది. కార్పొరేట్ టాక్స్ను తగ్గించి పెట్టుబడి దారులకు లాభం చేకూర్చింది. అదే సమయంలో వ్యాట్ను పెంచి కార్మికులపై భారం మోపింది. ఇది పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న చర్య అని ట్రేడ్ యూనియన్ విభాగం ఏఎన్సీకి సూచించింది. అయినా ప్రభుత్వం దానిని ఉపసంహరించకపోవటంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సివచ్చింది.
అక్టోబర్ ఏడున దక్షిణ ఆఫ్రికాలోని అనేక పట్టణాలు, కార్మిక కేంద్రాలలో కార్మికులు సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఎర్ర టీషర్ట్స్పై డిమాండ్స్ రాయించుకుని నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. కొందరు విచిత్ర వేషాలు వేసుకున్నారు. సమ్మెకు ముందు రోజు దాదాపు ఆరువేల మందిని అరెస్టు చేసినా కార్మికులు బెదరకుండా సమ్మెలో పాల్గొన్నారు. వేతన ఒప్పందం ప్రకారం ఉద్యోగులకు చెల్లించాల్సిన, పెంచిన వేతనాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. దానితో సమ్మెరోజు ఉద్యోగులు జాతీయ ట్రెజరీ ఆఫీసుకు భారీ ప్రదర్శనగా వెళ్ళి అక్కడ బైఠాయించారు.
దక్షిణాఫ్రికాలో కోవిడ్-19 కాలంలో యజమానులు కార్మికుల ఉపకార వేతనాలు ఇవ్వనిపక్షంలో తాత్కాలిక ఉద్యోగుల ఉపశమన స్కీమ్ (టీఈఆర్ఎస్) నుంచి ఇవ్వాల్సి ఉన్నది. ఆ డబ్బులుకూడా యజమానులు కార్మికులకు ఇవ్వకుండా కాజేసారు. యజమానులు చేసిన ఈ కుంభకోణం గురించి కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. సహాయనిధిని కార్మికులకు పంపిణీ చేసే వ్యవస్థ లేనందున యజమానులపై నమ్మకంతో సొమ్మును ఇస్తే వారు ఆ డబ్బును 50శాతం ఇచ్చి 50శాతం కాజేసారు. ఇది పెట్టుబడిదారుల స్వభావానికి మచ్చుతునక. శ్రమదోపిడీయే కాదు, అత్యవసర పరిస్థితిలో ఇచ్చే సహాయం నుంచి కూడా యజమానులు దొంగతనం చేస్తారనేది బట్టబయలయింది.
ఇండోనేషియాలో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండోనేషియన్ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ (కేయస్బీయస్ఐ) నాయకత్వం వహిస్తున్నది. ఇండోనేషియాలో జాబ్ క్రియేషన్ చట్టం తేవాలనే ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు సమ్మెకు పూనుకున్నాయి. ఈ చట్టం ఫలితంగా కార్మికులకు ఉన్న రక్షణ, పర్యావరణ పరిరక్షణకు ఎదురు దెబ్బతగులుతుందని, ఇందులో ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటు శక్తులకు అప్పగించే ప్రయత్నం దాగి ఉన్నదనీ కార్మికులు దానిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
జింబాబ్వేలో ఉపాధ్యాయులు గత మూడువారాల నుంచి సమ్మె చేస్తున్నారు. వాళ్ళది ఒక ప్రత్యేక సమస్య. అక్కడ డబ్బు విలువ క్రమంగా పడిపోతున్నది. రెండేండ్ల క్రితం వారికి వచ్చే నెల జీతం 550 అమెరికా డాలర్లుకు సమానంగా ఉండేది. ఇప్పుడు దాని విలువ పడిపోయి కేవలం 30-35 అమెరికా డాలర్లకు సమానంగా ఉన్నది. ఒక షర్టు కూడా ఆ సొమ్ముతో రాదు. ఇక కుటుంబాలను ఎలా పోషించుకోవాలనే సమస్యతో సమ్మెకు పూనుకున్నారు. ప్రభుత్వం తీవ్ర బెదిరింపులకు దిగినా ఉపాధ్యాయులు పట్టుదలతో సమ్మెలో పాల్గొంటున్నారు.
శ్రమపై పెట్టుబడి ఆధిపత్యం పెరుగుతున్న కొద్దీ రంగాల వారీగా జరిగే సమ్మెలు నామమాత్ర ఫలితాలు మాత్రమే సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సార్వత్రిక సమ్మెలు పెరగనున్నాయి. ఈ పరిణామాన్ని మనదేశంలో కూడా చూడగలం.