Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్పీ రేటింగ్ ల కోసం అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నాయనే ఆరోపణల నేపథ్యంలో టీవీ చానళ్ల వారపు రేటింగ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు 'బార్క్' (బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్) ప్రకటించింది. రేటింగుల కోసం రిపబ్లిక్ టీవీ అక్రమాలకు పాల్పడుతోందని పోలీసులు కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. రిపబ్లిక్ టీవీతో పాటు ఫక్త్ మరాఠీ, బాక్స్ సినిమా చానళ్లు కూడా ఈ ఆరోపణలను ఎదుర్కొంటుండగా, టీవీ చానళ్లపై ప్రజల నమ్మకాన్నే ప్రశ్నార్థకం చేస్తున్న ఈ ఉదంతం ఇప్పుడు 'బార్క్' నిర్ణయంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ప్రసిద్ధింగాంచిన మీడియా ఆ విలువ కోల్పోతే, ఆ బాధ్యత విస్మరిస్తే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. నిజాయితీ, నిబద్ధతలే ప్రామాణికంగా ప్రజలకు నిజాలు వెల్లడించాల్సిన మీడియా అబద్ధాల మీదుగా ప్రజల్లో ప్రాచుర్యం పొందాలనుకోవడం దాని విశ్వసనీయతకే సవాలు. ప్రత్యేకించి నిజాయితీకి, నిర్భీతికి తానే ప్రతినిధినని నిత్యం జబ్బలు చరుచుకునే ''రిపబ్లిక్'' టీవీ నిజాయితీ ఏపాటిదో ఈ సందర్భం తేటతెల్లం చేస్తున్నది. అసలు రిపబ్లిక్ టీవీ ప్రస్థానమే అనైతికత పునాదుల మీదుగా ప్రారంభమైందన్న వాస్తవం తెలిసినవారికి.. ఇప్పుడది టీఆర్పీ రేటింగుల కోసం మోసాలకు దిగజారిందన్న వార్త పెద్ద ఆశ్చర్యమేమీ కలిగించదు. దీని నిర్వాహకుడైన అర్నబ్ గోస్వామి ''టైమ్స్ నౌ''లో పనిచేస్తూనే వారు ప్రసారానికి సిద్ధం చేసుకున్న ప్రత్యేక స్టోరీలన్నింటినీ దొంగిలించి రిపబ్లిక్ టీవీ ప్రారంభోత్సవ బ్రేకింగ్ స్టోరీలుగా వాడుకున్నారని టైమ్స్నౌ యాజమాన్యం అప్పట్లోనే ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టింది. ఈ విషయం ఎరిగిన వారికి ఈ తాజా ఉదాంతం కొత్తగా కలిగించే ప్రభావమేమీ ఉండదు. కానీ ఇన్నాళ్లుగా ఆయన అరుపులు, కేకలు, విరావేశానికి కారణం ఆయన నిజాయితీ నిబద్దతలేనని అనుకున్నవారికే ఇప్పుడదంతా భ్రమ అని తేలిపోయింది.
ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరగాల్సిన ఎలాంటి చర్చనైనా తన అరుపులు కేకలతో ఏకపక్షంగా ముగించే వివాదాస్పద జర్నలిస్టుగా అర్నబ్ గోస్వామిది ఓ ప్రత్యేకమైన గుర్తింపు. పచ్చి మితవాదాన్ని, కార్పొరేట్ అనుకూల వాదాన్ని ప్రజలకూలమైనవిగా ప్రచారం చేసే బలవంతపు ప్రయత్నాలకు ఆయనొక నమూనా! కాబట్టే ఆయన టీవీ చానళ్ల ప్రసారాలు కూడా అట్లానే ఉంటాయి. సంఫ్ు పరివార్ హిందూత్వ భావజాలాన్ని జనాలపై రుద్దడం, ద్వేషపూరిత కథనాలను ప్రసారం చేయడం, ప్రశ్నించే వ్యక్తులనూ శక్తులనూ సంఘ విద్రోహులుగా చిత్రించడమే లక్ష్యంగా ఆయన 'రిపబ్లిక్' టీవీ నడుస్తున్నదన్న సంగతి జగద్వితం! ఈ లక్ష్యసాధనలో అది ఏ అడ్డదారినెంచుకోవడానికైనా వెనుకాడదనడానికి ఈ టీఆర్పీ స్కాం ఓ చక్కటి ఉదాహరణ.
విచిత్రమేమిటంటే ఎంతసేపటికీ గుడ్డిగా ప్రభుత్వాన్ని సమర్థించడం తప్ప, ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు ఆ చానల్లో కనీస ప్రాతినిధ్యం కనిపించదు. ఉదాహరణకు పెద్దనోట్ల రద్దు, ఆర్థికట్ 370రద్దు, పౌరసత్వ సవరణ చట్టం మొదలైనవి ఆ చానళ్ దృష్టిలో నరేంద్రమోడీ మాత్రమే చేయగలిగిన సాహసాలు. అంతేకానీ, పెద్దనోట్ల రద్దు కారణంగా అవస్థలు పడ్డ జనసామాన్యం, ఆర్టికల్ 370 రద్దు కారణంగా బహిరంగ చెరసాలగా మారిన కాశ్మీరం, పౌరసత్వ నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులు ఏమాత్రం ప్రాధాన్యతలేని విషయాలు. అంతెందుకు అత్యంత హేయమైన 'హత్రాస్'' ఘటనను, ఆ ఘటనపట్ల ప్రభుత్వ వైఖరినీ ప్రపంచ వ్యాపిత ప్రసారమాధ్యమాలన్నీ ముక్తకంఠంతో ఖండించినా.. నిందితులను, వారికనుకూలమైన ప్రభుత్వ యంత్రాంగ చర్యలను నిర్లజ్జగా సమర్థించే కథనాలను కుమ్మరించడం రిపబ్లిక్ టీవీకి, అర్నబ్ గోస్వామికి మాత్రమే చెల్లింది! ఢిల్లీ అల్లర్లకు బలైన అభాగ్యులుగానీ, ఆకస్మిక లాక్డౌన్ కారణంగా నేలకు నెత్తురద్దుతూ సాగిన వలసకార్మికుల ఆకలియాత్రలుగానీ వారి దృష్టిలో అసలు వార్తలే కాదు!
నిజాలను కప్పిపెట్టి అబద్దాలనే ప్రజాభిప్రాయాలుగా మలచాలనుకునే వారికి విలువలతో పనేముంటుంది? దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్న కార్పొరేట్లను, వాటి ప్రతినిధిగా ప్రభుత్వాన్ని నడుపుతున్న అధికార బీజేపీని అడ్డగోలుగానైనా సరే సమర్థించాలనుకునే వారికి.. ప్రజలను ఏమార్చాలనే ఆలోచనలే తప్ప, ప్రజల ఆకాంక్షల గురించి ఆలోచించాల్సిన అవసరమేముంటుంది? తమ అభిప్రాయాలనే ప్రజల అభిప్రాయాలుగా మలుచుకోవాలన్న పథకాలే తప్ప ప్రజాభిప్రాయానికి అవకాశమే ఇవ్వని వారికి ప్రమాణాల పట్ల పట్టింపు ఎందుకుంటుంది? అందుకే ఈ అడ్డదారులు..! మీడియాలో కార్పొరేట్ శక్తుల ఆధిపత్యం పెరిగేకొద్దీ లాభార్జనే ధ్యేయంగా మారుతుందనడానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడుతుందనడానికి కూడా ఈ సందర్భం ఓ ఉదాహరణ. ప్రజలకు నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిజాలను తెలియజేసే మౌలిక బాధ్యతను విస్మరించి, ఇలా మోసాలకు పాల్పడి రేటింగులు సాధించడం అలాంటి మీడియా సంస్థలకు లాభసాటిగానే ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం.