Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పేదరికం యాక్సిడెంట్ కాదు. బానిసత్వం లాగే, వర్ణ వివక్ష లాగే అది మానవ నిర్మితం. మానవుల చర్యల ద్వారానే దాన్ని రూపుమాపగలం'' - నెల్సన్ మండేలా.
వర్గ సమాజంలో ఆకలి విడిగా ఉండదు. పేదరికం, ఆకలి కవలలు. నేడు ప్రపంచంలో 69 కోట్లమంది రోజూ తిండి లేకుండా కడుపులో కాళ్ళు పెట్టుకుని పడుకుంటున్నారనేది వాస్తవం. ఇది భౌతికమైనదే. సమాజం వర్గాలుగా చీలిపోయిన నాటి నుంచీ ఇది వాస్తవం. బీజేపీ తాము నిర్మిస్తామని 'ఒట్టేసి' చెప్పిన రామరాజ్యమైనా, 'స్వర్ణయుగం'గా కొందరు చరిత్ర కారులు కీర్తించే గుప్తుల రాజ్యమైనా ఇదే పరిస్థితి.
అయితే, ఆకలి గురించి, పేద-ధనిక అంతరాల గురించి మనదేశంలోనూ, బయటా హఠాత్తుగా ఇంత చర్చ ఎందుకు రేగిందనేది ప్రస్తుత మన చర్చనీయాంశం. ప్రధానంగా రెండు కారణాలు కనపడుతున్నాయి. మొదటిది పేద, ధనిక అంతరాలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. ఇంకా పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం స్విట్జర్లాండులోని దావోస్లో జరిగే కార్పొరేట్లు, వారి రాజకీయ ''సేవకుల'' జాతరలో గత కొన్ని సంవత్సరాలుగా ఇదొక చర్చనీయాంశం. పెరిగే అంతరాల సునామీ తమ సామ్రాజ్య పునాదుల్నెక్కడ పెకలించి వేస్తుందోననేది వారి భయం. ఇదొక ప్రధానకారణం. రెండవది. 2020 సంవత్సరం నోబెల్ శాంతి పురస్కారం ప్రపంచంలోని అతి పెద్ద సేవా సంస్థ, ఐక్యరాజ్యసమితికి సంబంధించిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (డబ్ల్యూ.ఎఫ్.పి)కి దక్కడం!
2019లో 88 దేశాల్లో 42 లక్షల టన్నుల ఆహార పదార్థాలను అందించి పదికోట్ల మందికి పైగా అన్నార్తిని తీర్చిన సంస్థ ఇది. ఆడపిల్లల చదువుకోసం తాలిబాన్లను ఎదిరించి నిలచిన మలాలా యూసుఫ్జారులు లేనప్పుడు, వర్ణ వివక్షపై పోరాడిన నెల్సన్ మండేలా, డెస్మండ్ టుటు వంటివారు లేనప్పుడు (వీరంతా ఆయా సంవత్సరాల్లో నోబెల్ శాంతి బహుమతిగ్రహీతలే) ఈ సంస్థకివ్వడం సముచితమే కదా!
ఈ నేపథ్యదర్పణంలో మన దేశాన్ని చూద్దాం. థామస్ పికెట్టీ, లూకాస్ ఛాన్సెల్ ప్రపంచంలో అసమానతలు పెరుగుతున్న తీరును అధ్యయనం చేశారు. దాన్లో భాగంగా భారతదేశంలో ఇన్కంటాక్స్ చట్టం ఉనికిలోకి వచ్చిన 1922 నుంచి ఈ వందేండ్లలో అంతరాలు ఏవిధంగా పెరిగాయో స్పష్టీకరించారు. ప్రపంచంలోని ఏదేశం కంటే కూడా మనదేశంలో అంతరాలు పెరుగుతున్నాయనీ ధృవీకరించారు.
ప్రపంచ ఆకలి సూచి (గ్లోబల్ హంగర్ ఇండెక్స్)లో 2015-19 మధ్య పరిస్థితి దారుణంగా మారింది. ఐదేండ్ల లోపు పిల్లలు పొడుగుకు తగ్గ శరీర బరువు లేనివారు (దీన్నే చైల్డ్ వేస్టింగ్ అంటారు), వయసుకు తగ్గపొడుగు లేనివారు మన దేశంలో వున్నంత ఘోరంగా మరే అభివృద్ధి చెందుతున్న దేశంలోనూ లేరు. ఈ రెండు కలిసి భారతదేశ ర్యాంకును 107 దేశాల్లోనూ 94 దగ్గరికి చేర్చాయి. ఈ ''ఆకలి సూచి''లో మనం బంగ్లాదేశ్, పాకిస్థాన్, చివరికి నేపాల్ కంటే కింద అఘోరించడం మన పాలకుల నీతిని, రీతిని ప్రశ్నించేవే! ''ఈ ఆకలి సూచిలో మన దేశ ర్యాంకు ఎలా ఉన్నా మనం నడుస్తున్న మార్గం సరైందేన''ని నిటిఆయోగ్ ప్రకటించడం 'నవ్విపోదురుగాక, నాకేటి సిగ్గు' అన్నతీరుగా లేదా? 2014లో 76 దేశాల్లోనూ మనది 55వ ర్యాంకు. 2019లో 117దేశాల్లోనూ 102కి, 2020లో 107లోను 94కి దిగజారటం కూడ ''సరైన మార్గ''మనే నిటిఆయోగ్ భావిండం మన ప్రారబ్దంకాదా!
దేశంలో ప్రజలు ఎన్ని క్యాలరీల ఆహార పదార్థాలు తీసుకోగలగుతున్నారో ఎన్ఎస్ఎస్ఓ డేటా 2011-12లోదే చివరిది. చాలా వాటిని ధ్వంసం చేస్తున్నట్టు మోడీ అండ్ కంపెనీ ప్రతిష్టాత్మకమైన నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్నే దెబ్బతీసింది. ప్రస్తుతం ఈ ప్రభుత్వం సరఫరా చేసే లెక్కలు నాగపూర్లో వండి వార్చినవా? లేదా నిటిఆయోగ్ వారి లెక్కలో ఆ లెక్కలకున్న ప్రామాణికత ఏమిటో దేశ ప్రజలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
కరోనా కంటే ముందే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం మొదలైంది. కరోనా ఆర్థిక వ్యవస్థను పతనావస్థకు చేర్చింది. ప్రపంచ బ్యాంకు, ఐ.ఎం.ఎఫ్.తో సహా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మైనస్ పదిశాతానికి మనదేశ వృద్ధిరేటు పడిపోవచ్చని తేల్చి చెపుతున్నాయి. పాలక బీజేపీ నేతలు మాత్రం ''అత్యంత వేగంగా అభివృద్ధి అవుతున్న దేశమనీ, ఎకనామిక్ సూపర్పవర్ అనీ, చైనాని మించిపోతున్నామనీ చెప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నయా ఉదారవాదం మన దేశాన్ని ఈ స్థాయికి చేర్చింది. పెట్టుబడిదారీ విధానం ఒకవైపు లాభాల పంటపండిస్తూ రెండవ వైపున పేదరికం గుట్టలు పడేలా చేస్తుందని మన అనుభవం. కాని పేదల కష్టాల యెడల రాను రాను రాటుదేలుతున్న పాలకుల కాఠిణ్యాన్ని అర్థం చేసుకోవాలంటే భారతదేశ ప్రత్యేకత కూడ మన గమనంలో ఉండాలి. దేశంలోని అసంఘటిత కార్మికుల్లో అత్యధికులు దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వెనుకబడిన తరగతులవారు. వారిని అగ్రకులాలతో కనీసం సమానమైన వారిగా చూడదు నేటి బీజేపీ పాలకుల్లో ఘనీభవిస్తున్న ఆధిపత్య భావజాలం. అసంఘటిత కార్మికులే కాదు, మొన్నటి వలస కార్మికుల ప్రస్థానంలోనూ, చిన్న సన్న కారు రైతాంగంలోనూ, కోట్లలో ఉన్న కౌలుదార్లలోనూ పైన చెప్పిన ''సన్న'' జనమే ప్రధానం. ఈ దోపిడీకి వ్యతిరేకంగా చేసే పోరాటమే నేటి పాలకుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలదు.