Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక వ్యక్తిగానీ, ఒక పార్టీగానీ ఎన్నికల ముందు తన, తమ లక్ష్యాలు, విధానాలను ప్రజలకు ఒక ప్రకటన ద్వారా తెలియజేయడాన్నే మ్యానిఫెస్టో అంటారు. దాదాపు కోటి జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో ఈ మ్యానిఫెస్టోల కొలాహలం కనిపిస్తున్నది. టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ, టీడీపీ ఇప్పటికే మ్యానిఫెస్టోలను విడుదల చేశాయి. ఒక్క వామపక్షాలు మినహా మిగతా అన్ని పార్టీల మ్యానిఫెస్టోలూ ఓట్లు, సీట్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించినవే కావడం గమనార్హం. వామపక్షాల ఉమ్మడి ప్రణాళిక దీర్ఘకాలికమైనది. ప్రణాళికబద్ధమైనది. నగరంలోని మౌలిక సమస్యలను ప్రస్తావించింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మ్యానిఫెస్టోలు రాయితీలను గుప్పించాయి. అవి ఆచరణ సాధ్యమయ్యే అవకాశాలు తక్కువే. ఢిల్లీ తరహాలో ఉచితంగా తాగునీళ్లను అందిస్తామన్న టీఆర్ఎస్ మ్యానిఫెస్టో హామీని ఆహ్వానించదగ్గదే. కాగా కేవలం భావోద్వేగ రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నది బీజేపీ. స్మార్ట్సిటీ హామీ విస్మరించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, గత ఆరేండ్ల నుంచి హైదరాబాద్కు చేసిందేమీ లేకపోగా, మతకలహాలను రెచ్చగొట్టేపనిలో నిమగమైంది. రాజధానితోపాటు శివార్లలో లక్షలాది మంది వలస కార్మికులు నివసిస్తున్నారు . వారి గురించి మాటమాత్రం కూడా మ్యానిఫెస్టోల్లో చెప్పలేదు. 400 ఏండ్ల చరిత్ర కలిగిన నగరం నిర్లక్ష్యానికి గురైంది. జనం సమస్యల సుడిగుండంలో ఉన్నారు. విశ్వనగరమని పాలకులు మురిపిస్తున్నారు. కానీ, వరద నగరమని ఇటీవలి భారీ వర్షాలు రుజువుచేశాయి. నగరంలో మౌలిక సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేవు. రోడ్లు, రక్షిత మంచినీరు అంతంతే. బస్తీదవాఖానాల్లో డాక్టర్లు లేరు. మందులూ ఉండవు. ఇకపోతే హైదరాబాద్ అమ్మాయిల అపహరణ కేంద్రంగా తయారైంది. ప్రతియేటా మూడు వేల మంది బాలికలు కిడ్నాప్కు గురవుతున్న నగసత్యాన్నీ ఆయా పార్టీలు విస్మరించాయి. స్వాతంత్య్రానంతరం రాష్ట్రాన్నీ, మహానగరాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీ. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఎప్పుడూ మాటల గారడీనే. ఆచరణ అంతంతే. పాత బస్తీలో ఎంఐఎం పట్టు కలిగి ఉండగా, నగరంలో ఒక ఎంపీ స్థానం, రెండు శాసనసభా స్థానాలు కలిగి ఉన్నది బీజేపీ. కానీ, ఈ రెండు పార్టీలూ ప్రజల సమస్యలను పట్టించుకోలేదు. స్వార్థ మతోన్మాద రాజకీయాలే తప్ప, జనం కష్టాలపై ఏనాడూ నిజాయితీగా దృష్టిపెట్టలేదు. ప్రజల బలహీనతల, భావోద్వేగాలను వాడుకుంటున్నాయి. తెలంగాణ వస్తే అన్నీ పరిష్కారమవుతాయన్న టీఆర్ఎస్, గత ఆరున్నరేండ్లుగా చేసిందేమీటన్నది కూడా ప్రశ్నార్థకమే. చిన్న వానోస్తే డ్రైనేజీ పొంగుతున్నది. చెరువులు, కుంటలు సహజ వరద మార్గాలను కబ్జాపెట్టడంతో నగరం వరదల పాలై గొదావరి జిల్లాలను తలపిస్తున్నది. తాగునీరు కలుషితమవుతున్నది. గతుకుల రోడ్లతో మనుషుల నడుములు విరిగే దారుణ దుస్థితి. ట్రాఫిక్ నిత్యం నరకంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. నగరంలోని మురికివాడలు 1700 కాగా, వీటిలోని సమస్యలు ఎక్కడా పరిష్కారానికి నోచుకోలేదు. నగరాలు, పట్టణాలకు కూడా ఉపాధి హామీ చట్టాన్ని విస్తరించాలన్న వామపక్షాల డిమాండ్ సహేతుకమే. విద్య, వైద్యం ప్రయివేటుపరం కావడంతో కార్పొరేట్ సంస్థలు పట్టుబిగించాయి. పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ సమస్యను కదిలించినా నిధులే ఆటంకం. ఇటు జీహెచ్ఎంసీ బడ్జెట్ ఏమాత్రం సరిపోదు. అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి నిధులు ఇవ్వవు. అంతేగాక అక్కడ అవినీతిదే రాజ్యం. 21వ శతాబ్ధంలో కూడా హైదరాబాద్లో కుల వివక్ష కొనసాగుతున్నది. నగర ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే, బీజేపీ ఆ మాత్రం సమస్యలను పక్కనబెట్టి ఓట్ల కోసం మతాన్ని ముందుకు తెస్తున్నది. మత ఘర్షణలతో అశాంతి పాలైనా, గతం గాయాలను జనం మరిచిపోయినా, ఓట్లు, సీట్లకోసం బీజేపీ మళ్లీ కెలికే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. నగర ప్రజలకు శాంతి, మత సామరస్యం కావాలి. సమస్యలూ పరిష్కరించబడాలి. ఈ మూడింటి కోసం కుల, మత బేధాలు పక్కనబెట్టి ప్రజలు ఐక్యంగా స్పందించాలి. ప్రజా సమస్యలపై మ్యానిఫెస్టోల్లో అర్థవంతమైన చర్చ చేయకుండా, ఒకరిపై మరోకరు తిట్ల దండకం చదువుతున్నారు. చర్చను పక్కదారి పట్టిస్తున్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో వామపక్షాలకు ప్రాతినిథ్యం లేదు. అధికారులు, కార్పొరేటర్లు కుమ్మక్కయి నిధులు కాజేయడమే పనిగా ఆ వ్యవస్థ నడుస్తున్నది. వామపక్షాలు లేని తొలి శాసనసభ పనితీరు ఇప్పుడు ఎలా ఉందో ఇప్పటికే జనం గమనించారు. అందులో ప్రజాసమస్యలపై చర్చ ఏపాటిదో తెలుసుకున్నారు. గ్రేటర్లో అదే పరిస్థితి రాకూడదు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సైతం అందుకు భిన్నంగా ఏమీ లేదు. అది గతంలో ఎన్నిసార్లు సమావేశమైంది, ఏ ఏ సమస్యలను చర్చించింది, ఏ మేరకు పరిష్కారాలను కనుగొన్నదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక ఎజెండాతో ముందుకొచ్చిన వామపక్ష అభ్యర్థులను తాజా ఎన్నికల్లో ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.