Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ద్వేషం చిమ్మడం ఎరుగని నేల హైదరాబాద్. ప్రేమని పంచడమే దాని స్వభావం. ఈ రాజ్యానికి పునాదులేసిన కుతుబ్షాలు సైతం మతభేదం ఎరుగరు. మంచీచెడులకు మతం ప్రాతిపదిక కాదని నమ్మిన పాలకులు వారు. వారి సైన్యంలో హిందువులు, ముస్లింలు విభిన్న తెగలకు చెందినవారు ఉండటమే దీనికి సాక్ష్యం. కలుపుకుపోవడమే తప్ప విడదీయడం తెలియని చరిత్ర ఈ నేలది, ఇక్కడి ప్రజలది. ఎవరినీ కాదనలేదు, ఎవరినీ పొమ్మనలేదు. ఎక్కడెక్కడినుంచో వచ్చినవారిని అక్కున చేర్చుకుందీ నగరం. తనలో అంతర్భాగం చేసుకుంది. జనులతో విస్తరించి విలసిల్లాలన్న ఆకాంక్షకు అనుగుణంగా తనని తాను విస్తరించుకున్న హృదయ వైశాల్యం ఈ నగర ప్రత్యేకత.
ఉర్దూని సమాదరించిన కుతుబ్షాహీలు తెలుగుకు సైతం సమున్నతంగా పట్టం కట్టారు. స్వయంగా కవిత్వాన్ని సృజించారు. సాహిత్యం, కళలు వర్థిల్లేందుకు చేయూతనిచ్చారు. శిల్పానికీ, వాస్తు కళా వైభవానికీ హారతి పట్టారు. శతాబ్దాలు గడిచినా చెక్కు చెదరని కట్టడాలతో చరిత్ర ఉన్నతికి సమున్నత మినార్లు పాదుకొల్పారు. ఈ నేల మీద ఊపిరిలూదడమే అపూర్వమనే అనుభూతినీ, జీవనోత్సాహాన్నీ ప్రోది చేశారు.
భిన్న మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తూనే కలివిడిగా తిరిగిన మనుషులతో అలరారే ఈ నగరంలో ద్వేషానికి స్థానం లేదు. వైవిధ్యమే తప్ప వైరుధ్యాలకు తావు లేదు. ముషాయిరాలతో రాత్రులు పరిమళించాయి. రకరకాల పూలతో తోటలు పరవశించాయి. వేయి ఆలోచనలతో విద్యాలయాలు వికసించాయి. మఖ్దూం గీతాలు, రాజబహద్దుర్ గౌర్ యోచనలు కొత్త చైతన్యాన్ని పాదుకొల్పాయి. నూరుపూలు వికసించడం, వేయి ఆలోచనలు సంఘర్షించడం, అంతిమంగా శాంతి, సామరస్యాలతో వర్థిల్లడం నగర జీవనాడిలోని మేలిమి అంశం.
నెల్లూరి కేశవస్వామి కథల్లో, జీలానిబానో రచనల్లో, పిటిరెడ్డి పెయింటింగ్స్లో, చిత్తప్రసాద్ బొమ్మల్లో నగర జీవన పార్శ్వాలెన్నో దృశ్యమానమయ్యాయి. ఆరు దశాబ్దాల కిందటనే దేవరకొండ బాలగంగాధర తిలక్ పట్టరాని మోహపరవశంతో నగరం మీద ప్రేమ గీతాన్ని సృజించారు. కవిత్వం కోసమే నగరానికి వచ్చిన శివారెడ్డి లాంటి కవులని తనలో లీనం చేసుకుందీ నగరం. నగరంలో ఉన్న, నగరానికి వచ్చిన కవులు, కథకులు తమ అక్షరాలతో హైదరాబాద్ని సత్కరించారు. ఎన్నో కథలకు, నవలలకు జవజీవాలిచ్చాయి హుస్సేన్సాగర్, టాంక్బండ్.
నగరవాసులకు, తెలంగాణ వాసులకు ఈ నేల, ఈ నగరం గర్వకారణం. తనదైన నిసర్గ తేజస్సుతో దేశదేశాలవారిని ఇక్కడికి రప్పించే సమున్నత సౌందర్యధామం హైదరాబాద్. అడుగడుగునా దాగి వున్న చరిత్రలెన్నో. వాటిని వెలికితీసి లోకానికి చాటాలన్న తపన గల సృజనశీలురెందరో. అందుకే ఎక్కడో వున్న విలియం డార్లింపుల్ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడి చరిత్రనీ, చరిత్ర మాటున దాగిన ప్రేమగాథల్ని శోధించారు. 'వైట్ మొగల్స్' అనే విలక్షణమైన పుస్తకాన్ని రచించారు.
పగలు, రేయి జనాల సందడితో పరవళ్ళు తొక్కడం హైదరాబాద్ జీవలక్షణం. మాన్యులకీ, సామాన్యులకీ కొలువైన జీవనక్షేత్రం. కాఫీడేలతోపాటు ఇరానీచారులుంటాయి. రకరకాల మెస్లతోపాటు ఘుమఘుమలాడే బిర్యానీలు రారమ్మని పిలుస్తుంటాయి. దమ్కి బిర్యానీ రుచి చూడకుండా, ఇరానీ చారు తాగకుండా హైదరాబాద్ని విడిచివెళ్ళడం సాధ్యం కాదు. చార్మినార్, గోల్కొండ, కుతుబ్షాహీ టూంబ్లు సందర్శించకపోతే సిటీ టూర్ పూర్తి కాదు. మాల్స్, మల్టీప్లెక్స్లు ఎన్ని వచ్చినా చౌమహల్లా ప్యాలెస్, ఫలక్నుమా వైభవం, ఆర్ట్స్కాలేజీ యవనవ్వనం, టాంక్బండ్ హౌయలు నిత్య ఆకర్షణలు.
నిద్ర అన్నది ఎరుగని దీపశిఖ హైదరాబాద్, అలసటే ఎరుగని నర్తనం నగర జీవన సంవిధానం. పర్యాటకులకు మరల మరల రావాలనిపించే మహత్తు ఏదో మరపురాని జ్ఞాపకాల్ని అందిస్తుంది. ఓ నాలుగురోజులు పనిచేసి వెళ్ళిపోదామనుకునేవారిని పట్టి నిలుపుతుంది. ఆకలితో చంపదు, అన్నం పెడుతుంది. చారు, బిర్యానీలతో మోహపెడుతుంది. బతుకు మీద ఆశని ఇనుమడింపజేస్తుంది. అందుకే నానాటికీ హైదరాబాద్ జనాభా విస్తరిస్తున్నది. బతకవచ్చేవారికి ఆదరవుగా నిలుస్తున్నది. ఇంతటి సౌశీల్యం, సమరస్యం ఈ నగర జీవన తాత్విక ప్రతీకలు. ఆదరించడమే తప్ప బెదరగొట్టడం తెలియని నేల ఇది. ఆశ్రయం కోరి వచ్చినవారిని వెళ్ళగొట్టదు. ఆపదలో వున్నవారికి నీడనిస్తుంది. అందరిలో కలిసిపోయి బతకడం నేర్పుతుంది.
ఈ కలివిడితనం మీద ద్వేషం చెలరేగిన సందర్భంలో ప్రేమని ప్రకటించకతప్పదు. తమ లోపలి అవ్యాజానురాగాన్ని ప్రకటించడం అనివార్యం. తన పుట్టుకలోనే మత వైమనస్యం ఎరుగని నేల మీద విద్వేషభావాలకు చోటు లేదని చెప్పితీరాల్సిన సందర్భమిది. హిందువులు, ముస్లింలు, సిక్కులు, పార్సీలు, జైనులు, బౌద్ధులు, మరాఠీలు, అయ్యంగార్లు, మలయాళీలు, బెంగాలీలు, కన్నడిగులు, గుజరాతీలు... భాష ఏదైనా, మతమేదైనా అన్నదమ్ముల్లా కలిసి బతకడం నేర్చిన గొప్ప మనుషులు నడయాడే నేల ఇది. ఈ వైవిధ్యం, సహనం, సామరస్యం ఈ నేలకు జన్మతో వచ్చిన ఆభరణాలు. వాటిని చెదరగొట్టే వ్యూహాల్ని ప్రతిఘటించడం మనందరి కర్తవ్యం. మనిషికీ, మమతకీ మించిన భావోద్వేగాలు మరేవీ లేవని చాటాల్సిన సమయమిది.