Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాంకుల్లో అకౌంట్ ఉన్న ఎవరికైనా కె.వై.సి. అనే మాట చిరపరిచయమే! 'మీ ఖాతాదారును తెల్సుకోండి' అని అర్థం. అన్నిటికీ చెప్పినట్టే మోడీ సాబ్ దీనికో కొత్త నిర్వచనం, కొత్త అర్థం చెప్పాడు. మీ 'రాజ్యాంగాన్ని'' (కాన్స్టిట్యూషన్) తెలుసుకోండి అని సదరు 'సి'ని మనం అర్థం చేసుకోవాలట! గత ఆరేండ్లుగా రాజ్యాంగంతో మోడీ సర్కార్ చెలగాటమాడటం పరిశీలించిన ఎవరికైనా మొన్న ''రాజ్యాంగ దినం'' రోజు ఆయన ప్రవచనాలు ఈ ప్రభుత్వం మన రాజ్యాంగానికి ఎసరు పెట్టే రోజులు దగ్గర పడ్డాయని ఇట్టే తెల్సిపోతుంది. శాసనసభాపతుల సదస్సులో 'రాజ్యాంగంలో రాసిన భాష దేశ ప్రజలందరికీ అర్థం కావాలంటే దాన్ని ''సరళతరం'' చేయాలని మోడీ వాక్రుచ్చారు. అంటే ఆ పేరు మీద ఏదో ఉపద్రవం ముంచుకొస్తోందని అర్థం.
సంఘ్ పరివార్కు, అసలు తల్లి వేరైన ఆర్స్సెస్కు భారత రాజ్యాంగమంటే పడదు. 1949 నవంబర్ 30న, అంటే మన రాజ్యాంగం ఆమోదించుకున్న సరిగ్గా నాలుగు రోజులకు తల్లివేరు 'ఆర్గనైజర్' (ఆరెస్సెస్ పత్రిక) ఎవరికీ, ఎటువంటి సందేహాలకు తావులేకుండా ''కొత్తగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగంలో భారతీయతే లేదు'' అని స్పష్టం చేసింది. రాజకీయ కారణాల రీత్యా ఆ తర్వాత దానిపై పెద్దగా రాద్ధాంతం చేయలేదు. 2014లో సంపూర్ణ మెజార్టీతో అధికారం దఖలు పడిన తర్వాత సన్నాయి నొక్కులతో ప్రారంభించి 2019 తర్వాత రెచ్చిపోయి మాట్లాడటమే కాదు, కార్యరంగంలోకి దిగిపోయింది 'పరివారం'. కేంద్రమంత్రి అనంత కుమార్ హెగ్డే ఆ మధ్య ''తమ ప్రభుత్వమున్నదే రాజ్యాంగాన్ని మార్చడానికి'' అని బహిరంగంగానే ప్రకటించాడు. ''గత 69ఏండ్లలో ఎన్నడూ లేనంత ప్రమాదం భారత రిపబ్లిక్కు వచ్చింద''ని 2018లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ నందినీ సుందర్గారు అన్నది అందుకే.
భారత రాజ్యాంగంపై పరివార దళానికి అంత అక్కసు ఉండటానికి కీలక కారణం ''అది మనుస్మ్మతిని పరిగణనలోకి తీసుకోలేద''ట! 1949లో గోల్వల్కర్ భారత రాజ్యాంగం 'భారతత్వం' లేనిదన్నా, 90వ దశకంలో విశ్వహిందూ పరిషత్ మన రాజ్యాంగాన్ని ''హిందూత్వ లేనిదన్నా (అన్హిందూ) కారణం వర్ణాశ్రమ ధర్మాన్ని మన రాజ్యాంగం త్రోసి వేసిందనే కసే ప్రధానం. దానిలో భాగమే మొన్న చెన్నై పట్టణంలో మనుధర్మ శాస్త్రాన్ని వి.సి.కె. (విడుదలై చిరుతైగల్ కట్చి) పార్టీ పార్లమెంటు సభ్యుడు విమర్శించారని నిరసన తెల్పింది బీజేపీ. మనుధర్మ శాస్త్రానికి మద్దతుగా బహుశా బీజేపీ బహిరంగంగా నిర్వహించిన కార్యక్రమం కావచ్చని ఒక ఆంగ్లపత్రిక రాసింది. అది గుజరాత్ కాదు, యూపీ కాదు, ఏ వర్ణాశ్రామ ధర్మానికి వ్యతిరేకంగా పెరియార్ జీవిత కాలమంతా పోరాడారో ఆ చెన్నైని ఎంచుకోవడం కూడా కీలకం. ద్రవిడ పార్టీలకు, యావత్ ద్రవిడ ఉద్యమానికి ఒక సవాలు విసిరింది.
1992లో జరిగిన ధర్మ సంసద్లో భారత రాజ్యంగం ''హిందూ వ్యతిరేక''మైందిగా తీర్మానించారు. అదే సంవత్సరం మదురైలో జరిగిన హిందూ లాయర్ల మహాసభలో ప్రధానోపన్యాసం చేసిన ఆనాటి యూపీ అడ్వకేట్ జనరల్ వి.కె.ఎస్ చౌదరి మనుస్మృతి దేశంలో అందరికీ సమన్యాయం చేస్తుందని నొక్కి వక్కాణించాడు. మనుస్మృతి మానవాళికి అన్ని కాలాల్లో ఉపయోగపడేదని కూడా ఆయన చెప్పాడు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి కోట్ చేసిన ఒక విషయం గమనార్హం. 1920లో ఆరెస్సెస్ ఏర్పడే ముందు మహారాష్ట్రలో ముస్లిం జనాభా తక్కువ. 1925లో ఆరెస్సెస్ ఏర్పడటానికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలో జరిగిన బలమైన బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు. 1870లో జ్యోతిబాఫూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్. జ్యోతిబా నాయకత్వంలో వెనకబడ్డ కులాలు తమ హక్కులకై బ్రాహ్మణాధిక్యతను సవాలు చేశారు. అంటరానితనాన్ని ప్రశ్నింంచారు. స్త్రీ విద్య అవసరమన్నారు. ఆ వెంటనే 1920ల్లో దళితులు అంబేద్కర్ నాయకత్వంలో తమ హక్కులకై నిలదొక్కుకున్న ఉద్యమాలు వచ్చాయి. ''1990-91లాగే 1925లో కూడ 'హిందూత్వ ప్రధానంగా జారిపోతున్న అగ్రకులాల ఆధిపత్యాన్ని, పట్టును నిలబెట్టుకునేందుకే''నని రాశారు. భారత రాజ్యాంగంపై మోడీ అండ్ కంపెనీకి ద్వేషమెందుకు కంటే అది సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అదరికీ అందిస్తానని వాగ్దానం చేసింది. ఆలోచనలోను, వ్యక్తీకరణలోను, విశ్వాసాల్లోను, మతపరమైన స్వేచ్ఛను అందిస్తానని వాగ్దానం చేసింది. అవకాశాల్లోను, కుల, మత, లింగ విబేధాలు లేకుండా సమానత్వాన్ని అది వాగ్దానం చేసింది. దేశ ప్రజలందరి మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంచుతానని, వారి గౌరవాన్ని పెంచేలా, తద్వారా దేశ ఐక్యతకు సమగ్రతకు భంగం వాటిల్లకుండా చూస్తానని వాగ్దానం చేసింది. ఇవన్నీ మన రాజ్యాంగ పీఠికలోనివి. ఈ రాజ్యాంగం అమలైతే సంఫ్ుపరివార్ పప్పులుడకవు కదా! అందుకే దానిపైనే దాడి ఎక్కుపెట్టారు. మనం అప్రమత్తులమై రాజ్యాంగ విలువల్ని పరిరక్షించుకుందాం.