Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ప్రమాద ఘంటికలు మోగించాయి. ఓటర్లలో, హైదరాబాద్ ప్రజానీకంలో మత ఆధారిత పోలరైజేషన్కు బీజేపీ నాయకులు, ప్రత్యేకంగా అందుకు సిద్ధహస్తులైన నేతలు విద్వేష భావజాలాన్ని మూకుమ్మడిగా నింపితే, దానికి ఎంఐఎం నేతల స్పందన అదే స్థాయిలో ఉంది. ఈ ఎన్నికల ఫలితాలన్నింటిలో అత్యంత ప్రమాదకరమైన అంశమిది. బీజేపీ, ఎంఐఎంలు ప్రజాసమస్యలు, పౌర సమస్యలు చర్చనీయాంశం కాకుండా చూడగలిగాయి. ఇప్పుడు హంగ్ ఏర్పడింది.
దుబ్బాక విజయం తర్వాత బీజేపీ సర్వశక్తులూ 'గ్రేటర్'పై ఒడ్డింది. జీహెచ్ఎంసీ ద్వారా తెలంగాణలో పాగ వెయ్యాలనే ప్రణాళికతో రంగంలోకి దిగింది. అనేక మంది కేంద్ర మంత్రులు ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొన్నారు. యోగి ఆధిత్యనాథ్, అమిత్షాలు చివరి రెండు రోజులు మైనారిటీలపై విద్వేష జ్వాలలు చిమ్మారు. పాతనగరంపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్నారు. రొహింగ్యాలు న్నారన్నారు. బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులున్నారన్నారు. దీనికి ప్రతిగా ఎంఐఎం నేతలూ స్పందించారు. బీజేపీ, ఎంఐఎంల మధ్య గొడవ హిందూ, ముస్లిం పోలరైజేషన్కు దారితీసింది. నిరుద్యోగం, కనీస వేతనాలు, మహిళల రక్షణ మొదలైన రోజువారీ ప్రజా సమస్యలు వెనక్కి పోయి మతాల చుట్టూ ఎన్నికలు తిరిగాయి.
సరిగ్గా ఇదే బీజేపీకి కావల్సింది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దెబ్బతినే పరిశ్రమలు, ప్రయివేటీకరించబడే ప్రభుత్వరంగం, చితికిపోతున్న చిన్న పరిశ్రమలు వంటి ప్రజల దైనందిన సమస్యలు చర్చనీయాంశమైతే బీజేపీ అసలు సంగతి ప్రజలకర్థమౌతుంది. అందుకే భావోద్వేగ అంశాలపైనే బీజేపీ ఆధారపడుతుంది. గణనీయంగా ముస్లిం జనాభా ఉన్న హైదరాబాద్లో ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టడం ద్వారా హిందూ ఓట్లను వాల్చుకోవచ్చనే బీజేపీ ఆశ నెరవేరినట్టే కనపడుతోంది. ఇప్పటికే తమ సోషల్ ఇంజనీరింగ్ ద్వారా కొన్ని ప్రధాన కులాలను ఆకర్షించింది బీజేపీ.
దీనికి ప్రభుత్వంపై గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తి బీజేపీకి బాగా ఉపయోగపడింది. ''చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా!'' అనే సామెత ఊరికే రాలే! టీఆర్ఎస్ నేతల ఏకపక్ష ధోరణి, రాజకీయ అవకాశవాదమే ఈ ఫలితాలకు దారితీసింది. 2018 జూలై నుంచి పీఆర్సీ ప్రకటించలేదు. కొందరు నాయకుల్ని మచ్చిక చేసుకుంటే పబ్బంగడుపుకో వచ్చనుకున్న అధినాయకుడి ఆలోచన పోస్టల్ బ్యాలెట్స్ హౌల్సేల్గా బీజేపీకి మళ్ళడానికి తోడ్పడింది. ఆర్టీసీ కార్మికుల ఉసురు తీసిందీ ప్రభుత్వం. కనీస వేతన జీవోలు వర్తించే వాళ్లు హైదరాబాద్ చుట్టుపక్కల పారిశ్రామిక వాడల్లో లక్షల్లో ఉన్నారు. ఈ కార్మికుల అసంతృప్తి కూడా బీజేపీకి ఉపయోగపడింది. ఇదే పరిస్థితి అనేక ఇతర రంగాల్లో కూడా ఉంది. మోడీ సర్కార్ 2016లో నోట్లరద్దు ప్రకటించినప్పుడూ, 2017లో జీఎస్టీని ప్రకటించినప్పుడు కూడా అందరికంటే ముందు ఎదురేగి మద్దతిచ్చింది టీఆర్ఎస్. నేడు మన రాష్ట్రానికి ఆ జీఎస్టీ బకాయిల్ని కూడా ఇవ్వకుండా ఎగనామం పెట్టింది మోడీ సర్కార్. ప్రతి ఏటా బడ్జెట్లో ఇవ్వాల్సిన కేంద్ర నిధులకు ఇప్పటిదాకా అమల్లో ఉన్న 1971 జనాభా లెక్కల ప్రాతిపదిక కాకుండా తాజా జనాభా లెక్కలే ప్రాతిపదికని కేంద్రం చెప్పింది. దక్షిణాది రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ పద్ధతులు బాగా అమలు జరపడం వల్ల ఆ నిధుల్లో నష్టపోతారు. అందుకే దీనిపై కలిసి కేంద్రంపై పోరాడదామన్న కేరళ ప్రతిపాదనపై స్పందించలేదానాడు.
దీనికి తోడు మతాన్ని, రాజకీయాలతో కలగాపులగం చేసే పనిలో బీజేపీతో పోటీ పడింది కేసీఆర్ ప్రభుత్వం. మేధావుల అభిప్రాయాన్నీ, ప్రజాభిప్రాయాన్నీ పరిగణనలోకి తీసుకోకుండా సెక్రటేరియట్ కూల్చివేయడం, వాస్తుకోసం మార్పులు, మహాచండీయాగం చేసిన నేనే పెద్ద హిందువునని చెప్పుకోవడం వంటివి బీజేపీకి ఉపయోగపడేవే. కేంద్ర విధానాలపై నిరంతరం పోరాడకుండా, రాష్ట్రంలోని ప్రజల్లో బీజేపీ వ్యతిరేక భావాల్ని ప్రోదిచేయలేరని టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.
ఏమైనా జీహెచ్ఎంసీ ఫలితాలు రాష్ట్రానికి ప్రమాద ఘంటికలు. ప్రజలు వృత్తుల వారీగా, అంటే వర్గం ఆధారంగా కాక, మతం ఆధారంగా గానీ, కులం ఆధారంగాగానీ చీలిపోతే ప్రజాస్వామ్యానికి చీకటి రోజులే ప్రాప్తిస్తాయి. అన్ని వివరాలు అందుబాటులోకి వస్తే పరిస్థితి మరింత స్పష్టం అవుతుంది.